నా గురువు.. సర్వస్వం: టీమిండియా మాజీ క్రికెటర్‌ వల్లే ‘హీరో’గా! | Sakshi
Sakshi News home page

నా సర్వస్వం: కేకేఆర్‌ యువ సంచలనం మెరుపులకు కారణం ఒకరకంగా ‘మనోడే’!

Published Thu, Apr 4 2024 12:35 PM

He Is My Guru Everything KKR Angkrish Raghuvanshi On Abhishek Nayar - Sakshi

‘ప్రతీ విషయంలోనూ ఆయన నాకు సహాయం అందించారు. మ్యాచ్‌ ఆడేటపుడు నేను ఆలోచించే విధానంపై ఆయన ప్రభావం ఉంటుంది. గేమ్‌లో ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంపై ఆయన వల్లే నాకు స్పష్టత వచ్చింది.

అంతేకాదు.. ఎలాంటి ఫుడ్‌ తినాలి? ఎలాంటి శిక్షణ తీసుకోవాలి? అన్నవి కూడా ఆయన నిర్ణయాలకు అనుగుణంగానే సాగుతాయి. ఆయన నా గురువు. నా సర్వస్వం. ఆయనతో నాకున్న అనుబంధం ఇదే’’ అంటూ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ యువ సంచలనం అంగ్‌క్రిష్‌ రఘువంశీ ఉద్వేగానికి లోనయ్యాడు.

తనను క్రికెటర్‌గా తీర్చిదిద్దిన కోచ్‌ పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. కాగా ఐపీఎల్‌-2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌ సందర్భంగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో తన తొలి ఇన్నింగ్స్‌ ఆడాడు అంగ్‌క్రిష్‌. 

మెరుపు అర్ధ శతకంతో
కేకేఆర్‌ తరఫున వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. మెరుపు అర్ధ శతకం(27 బంతుల్లో 54)తో అలరించాడు. ఆడిన తొలి ఇన్నింగ్స్‌లోనే తనదైన ముద్ర వేసి ‘హీరో’ అనిపించుకున్నాడు. ఢిల్లీపై కేకేఆర్‌ 106 పరుగుల తేడాతో భారీ విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు.

ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం 18 ఏళ్ల అంగ్‌క్రిష్‌ రఘువంశీ మాట్లాడుతూ.. తన ఆట తీరు పట్ల హర్షం వ్యక్తం చేశాడు. గత కొన్ని వారాలుగా తాను కఠినంగా ప్రాక్టీస్‌ చేస్తున్నానన్న అతడు.. ఢిల్లీతో మ్యాచ్‌లో తనకు అదే ఉపకరించిందని పేర్కొన్నాడు.

ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నా
ఇక తన కోచ్‌ గురించి ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురైన అంగ్‌క్రిష్‌.. ఆయనే తన సర్వస్వం అని పేర్కొన్నాడు. చిన్నానాటి నుంచి తన దగ్గర నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపాడు. ఇంతకీ అంగ్‌క్రిష్‌ గురువు ఎవరంటే...?! అభిషేక్‌ నాయర్‌.

ఈ మెరుపులకు ఒక రకంగా మనోడే కారణం
హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌లో జన్మించిన అభిషేక్‌ దేశవాళీ క్రికెట్‌లో ముంబైకి ప్రాతినిథ్యం వహించాడు. 2009, జూలైలో వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్‌ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అయితే, మీడియం పేస్‌ ఆల్‌రౌండర్‌ టీమిండియాలో నిలదొక్కుకోలేకపోయాడు.

అదే ఏడాది సెప్టెంబరులో తన చివరి ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ ఆడాడు. భారత్‌ తరఫున మొత్తం మూడు వన్డేలు ఆడి ఒక్క పరుగు కూడా చేయలేకపోయిన ఈ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌.. ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. 

కాగా అంగ్‌క్రిష్‌ రఘువంశీ ఢిల్లీలో జన్మించాడు. అయితే, పదకొండేళ్ల వయసులోనే ముంబైకి వెళ్లగా.. అక్కడ అభిషేక్‌ నాయర్‌ శిక్షణలో క్రికెటర్‌గా ఓనమాలు దిద్ది.. ఈస్థాయికి చేరాడు. ఇక అంగ్‌క్రిష్‌ దేశవాళీ క్రికెట్‌లో ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

చదవండి: IPL 2024: వాళ్లకు రిషభ్‌ పంత్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌.. ఇకపై

Advertisement
Advertisement