అప్పటికప్పుడు ఫలితం తారుమారు.. అంపైర్‌తో గొడవపడ్డ గిల్‌ | Sakshi
Sakshi News home page

#ShubmanGill: కొరకరాని కొయ్యలా సంజూ.. అంపైర్‌తో గొడవపడ్డ గిల్‌

Published Thu, Apr 11 2024 9:34 AM

IPL 2024 RR vs GT Shubman Absolutely Miffed With Umpire Decision Viral - Sakshi

రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. థర్డ్‌ అంపైర్‌ వ్యవహరించిన తీరుపై విస్మయం వ్యక్తం చేశాడు. తమ విషయంలో ఎందుకిలా జరిగిందంటూ ఫీల్డ్‌ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు.

ఐపీఎల్‌-2024లో భాగంగా జైపూర్‌ వేదికగా రాజస్తాన్‌- గుజరాత్‌ జట్లు బుధవారం తలపడ్డాయి. టాస్‌ గెలిచిన గుజరాత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుని.. రాజస్తాన్‌ ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌(24), జోస్‌ బట్లర్‌(8)లను తక్కువ స్కోరుకే కట్టడి చేసింది.

అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ సంజూ శాంసన్‌(68- నాటౌట్‌), రియాన్‌ పరాగ్‌(76)తో కలిసి రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. గుజరాత్‌ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.

నిర్ణయం మార్చుకున్న థర్డ్‌ అంపైర్‌
ఇదిలా ఉంటే.. రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌లో గుజరాత్‌ బౌలర్‌ మోహిత్‌ శర్మ పదిహేడో ఓవర్‌ వేశాడు. ఐదో బంతిని అవుట్‌ సైడ్‌ ఆఫ్‌ దిశగా సంధించగా సంజూ షాట్‌ ఆడబోయి విఫలమయ్యాడు. ఈ క్రమంలో అంపైర్‌ ఆ బంతిని వైడ్‌గా ప్రకటించాడు.

దీంతో కోపోద్రిక్తుడైన గుజరాత్‌ సారథి శుబ్‌మన్‌ గిల్‌ రివ్యూకు వెళ్లాడు. అయితే, తొలుత అది ఫెయిర్‌ డెలివరీ అని చెప్పిన థర్డ్‌ అంపైర్‌.. తర్వాత వైడ్‌గా ప్రకటించాడు. ఫలితంగా రాజస్తాన్‌ ఖాతాలో అదనపు పరుగు చేరింది.

అప్పటికే బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చుకోవడంతో ఆగ్రహంగా ఉన్న గిల్‌.. ఈ వైడ్‌ విషయాన్ని తేలిగ్గా తీసుకోలేకపోయాడు. థర్డ్‌ అంపైర్‌ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూ ఫీల్డ్‌ అంపైర్‌ వినోద్‌ శేషన్‌తో గొడవకు దిగాడు. వైడ్‌ గురించి చాలా సేపు అతడితో వాదించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.

గుజరాత్‌దే పైచేయి.. రాజస్తాన్‌ జైత్రయాత్రకు బ్రేక్‌ 
ఇదిలా ఉంటే.. రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. గిల్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌(72), ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ రషీద్‌ ఖాన్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌(11 బంతుల్లో 24 నాటౌట్‌) కారణంగా గుజరాత్‌.. రాజస్తాన్‌ విధించిన లక్ష్యాన్ని ఛేదించింది. ఆఖరి బంతికి రషీద్‌ ఖాన్‌ ఫోర్‌ బాదడంతో.. మూడు వికెట్ల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌ గెలుపు నమోదు చేసింది.

చదవండి: #Sanju: మాట్లాడలేకపోతున్నా.. అతడి వల్లే ఓటమి.. ఆ ఒక్క బంతి..!

Advertisement
Advertisement