#GT: ఓటమి బాధలో ఉన్న శుబ్‌మన్‌ గిల్‌కు భారీ షాక్‌ | Sakshi
Sakshi News home page

#CSKvsGT: శుబ్‌మన్‌ గిల్‌కు భారీ జరిమానా.. కారణం ఇదే

Published Wed, Mar 27 2024 12:11 PM

IPL 2024 Shubman fined Rs 12 lakh As GT Found Guilty of Code of Conduct Breach - Sakshi

ఓటమి బాధలో ఉన్న గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌కు భారీ షాక్‌ తగిలింది. ఐపీఎల్‌ నిర్వాహకులు రూ. 12 లక్షల మేర అతడికి భారీ జరిమానా విధించారు.  కాగా ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్‌పై గెలిచి శుభారంభం చేసిన టైటాన్స్‌.. మంగళవారం నాటి మ్యాచ్‌లో మాత్రం ఓటమిని మూటగట్టుకుంది.

చెపాక్‌ స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఏకంగా 63 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. సమిష్ట వైఫల్యంతో పరాభవం చవిచూసింది. అయితే, ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయని కారణంగా కెప్టెన్‌ శుబ్‌మన్‌కు ఫైన్‌ పడింది.

ఈ మేరకు.. ‘‘ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024లో భాగంగా ఎంఏ చిదంబరం స్టేడియంలో.. మార్చి 26న చెన్నై సూపర్‌ కింగ్స్‌లో మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేసిన కారణంగా.. గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌కు జరిమానా విధిస్తున్నాం.

ఈ సీజన్‌లో ఇది గుజరాత్‌ టైటాన్స్‌ తొలి తప్పిదం కాబట్టి.. ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిలోని నిబంధనల ప్రకారం గిల్‌కు రూ. 12 లక్షల ఫైన్‌ వేస్తున్నాం’’ అని ఐపీఎల్‌ నిర్వాహకులు అధికారిక ప్రకటన విడుదల చేశారు.

కాగా చెన్నైతో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన గుజరాత్‌ టైటాన్స్‌ తొలుత బౌలింగ్‌ చేసింది. అయితే, ఓపెనర్లు రచిన్‌ రవీంద్ర(46), కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(46), ఆల్‌రౌండర్‌ శివం దూబే(23 బంతుల్లో 51) అద్భుత ఇన్నింగ్స్‌ కారణంగా చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 206 పరుగులు చేసింది.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్‌, ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఈ మ్యాచ్‌లో 5 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్‌ సాయంతో కేవలం ఎనిమిది పరుగులు చేయగలిగాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌(37) గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.  

ఇక ఈ సీజన్‌లో తదుపరి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది. కాగా ఐపీఎల్‌-2022 సందర్భంగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అడుగుపెట్టినగుజరాత్‌ టైటాన్స్‌ అరంగేట్రంలోనే చాంపియన్‌గా నిలిచింది. గతేడాది రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

ఈ రెండు సందర్భాల్లో గుజరాత్‌కు హార్దిక్‌ పాండ్యా కెప్టెన్‌కాగా.. ఐపీఎల్‌-2024కు ముందు ముంబై ఇండియన్స్‌ గూటికి చేరాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో శుబ్‌మన్‌ గిల్‌ టైటాన్స్‌ పగ్గాలు చేపట్టాడు. ఆరంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గుజరాత్‌ను గెలిపించాడు.

చదవండి: #MSDhoni: ఆదేశాల కోసం ఎవరిని చూడాలో అర్థం కావడం లేదు: CSK స్టార్‌

Advertisement
Advertisement