Special Story On India A Cricketer K Nitish Kumar Reddy From Vizag - Sakshi
Sakshi News home page

తండ్రి కష్టం ఊరికే పోలేదు.. టీమిండియాకు ఎంపికైన తెలుగు కుర్రాడు

Published Thu, Jul 6 2023 9:58 AM

Special Story On India A Cricketer, Vizag Player K Nitish Kumar Reddy - Sakshi

విశాఖ స్పోర్ట్స్‌: ఐదేళ్ల ప్రాయంలో ప్లాస్టిక్‌ బ్యాట్‌తో సరదాగా బంతితో ఆడటం మొదలుపెట్టిన కె.నితీశ్‌కుమార్‌ రెడ్డి.. నేడు ఎమర్జింగ్‌ ఆసియా కప్‌ వన్డే టోర్నీలో ఆడేందుకు భారత్‌–ఏ జట్టుకు ఎంపికయ్యాడు. చిరుప్రాయం నుంచే విశాఖ డివిజన్‌ క్లబ్‌ లీగ్స్‌లో సీనియర్ల ఆటను చూస్తూ వారి లాగే ఆడాలంటూ కలగనే వాడు నితీశ్‌. తండ్రి ముత్యాలరెడ్డి ఉద్యోగం సైతం విడిచి పెట్టి.. కుమారుడి క్రికెట్‌ కెరీర్‌కే ప్రాధాన్యమిచ్చి ప్రోత్సహించారు.

కోచ్‌ల శిక్షణలో నితీశ్‌ అంచెలంచెలుగా జిల్లా స్థాయి నుంచి రంజీ స్థాయికి ఎదిగాడు. కుడిచేతి వాటం బ్యాటింగ్‌తో పాటు మీడియం పేస్‌తో ప్రత్యర్థులను బెంబేలెత్తించి రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఆంధ్రా జట్టుకు ఆల్‌రౌండర్‌గా మారాడు.  

ఏసీఏ అకాడమీ వైపు అడుగులు..  
నితీశ్‌కుమార్‌ వీడీసీఏ శిబిరాల నుంచి అండర్‌–12, 14 గ్రూపుల్లో జిల్లాకు ఆడటం మొదలుపెట్టాడు. నార్త్‌జోన్‌కు ఆడే సమయంలో అప్పటి జాతీయ జట్టు సెలక్టర్‌ ఎం.ఎస్‌.కె.ప్రసాద్‌ నితీశ్‌ ప్రతిభను గుర్తించారు. ఆయన ప్రోత్సాహంతో కడపలోని ఏసీఏ అకాడమీలో శిక్షణకు అవకాశం లభించింది.  

విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీలో రికార్డు 
ఆంధ్రా తరఫున ఆడుతున్న నితీశ్‌ నాగాలాండ్‌తో జరిగిన పోటీలో ఏకంగా 345 బంతుల్లోనే 441 పరుగులు సాధించడం విశేషం. విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీలో ఏకంగా 26 వికెట్లు తీయడమే కాకుండా 176.41 సగటుతో 1,237 పరుగులు చేసి టోరీ్నలో రికార్డును నమోదు చేశాడు. ఇదే నితీశ్‌కు 2017–18 సీజన్‌లో బీసీసీఐ అండర్‌–16 ఉత్తమ క్రికెటర్‌గా జగన్మోహన్‌ దాలి్మయా అవార్డును సాధించిపెట్టింది. ఏసీఏ నుంచి బీసీసీఐ అవార్డు పొందిన తొలి క్రికెటర్‌ నితీశ్‌ కావడం.. విశాఖ క్రీడాకారులకు నూతనోత్తేజం ఇచ్చింది.  

అరంగేట్రం ఇలా.. 
నితీశ్‌ రంజీ ట్రోఫీలో ఆంధ్రా తరఫున తొలిసారిగా 2020లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ మొదలెట్టాడు. విజయ్‌ హాజారే ట్రోఫీలో ఆంధ్రా తరఫున 2021లో ఆడాడు. అదే ఏడాది సీజన్‌లోనే సయ్యద్‌ ముస్తక్‌ ఆలీ ట్రోఫీలో పొట్టి ఫార్మాట్‌లో ఆడాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లోనూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున అరంగేట్రం చేశాడు. శ్రీలంకలో జూలై 13 నుంచి ప్రారంభం కానున్న ఈ టోరీ్నలో ఐదు దేశాల ఏ జట్లతో పాటు నేపాల్, ఒమన్, యూఏఈ సీనియర్‌ జట్లు ఆడనున్నాయి.

ఐపీఎల్‌ అరంగేట్రం.. 
నితీశ్‌ కుమార్‌ 2023 సీజన్‌లో ఐపీఎల్‌ అరంగ్రేటం చేశాడు. 20 లక్షలకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నితీశ్‌ను సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో నితీశ్‌ 2 మ్యాచ్‌లు ఆడాడు. బ్యాటింగ్‌ చేసే అవకాశం దక్కని నితీశ్‌.. 5 ఓవర్లు బౌలింగ్‌ చేశాడు.

చాలా ఆనందంగా ఉంది 
అప్పుడు నా వయసు పన్నెండేళ్లు. అండర్‌–12లో టోర్నీలు ఆడే స్థాయికి చేరుకున్నాను. ఆ సమయంలోనే నాన్నకు విశాఖ నుంచి బదిలీ అయింది. నాన్న ఉదయపూర్‌ వెళ్లినా నా క్రికెట్‌ కెరీర్‌ గురించే ఆలోచించేవారు. ఈ క్రమంలో ఉద్యోగం మానేసి ఇక్కడకు వచ్చేశారు. అప్పుడు మా వాళ్లు కొందరు నాన్న ఏంటి ఇలా చేశారు అన్నారు. అయినా వారి మాటలను పట్టించుకోకుండా నన్ను ప్రోత్సహించారు.

ఏసీఏ తరఫున తొలి క్రికెటర్‌గా బీసీసీఐ ఉత్తమ క్రికెటర్‌ అవార్డు అందుకోవడంతో నాలో ఆత్మ విశ్వాసం పెంచింది. అన్ని ఫార్మాట్లలో మేటి టోర్నీలో ఆడటంతో పాటు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ తరఫున క్రీజ్‌లోకి వచ్చి బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు నాన్న చాలా సంతోíÙంచారు. భారత్‌–ఏ తరఫున ఎమర్జింగ్‌ ఆసియా కప్‌కు ఎంపిక చేసిన 15 మంది జట్టులో స్థానం సాధించడం ఆనందంగా ఉంది. జాతీయ జట్టులో స్థానమే లక్ష్యంగా మరింత సాధన చేస్తా. – నితీశ్‌కుమార్‌ రెడ్డి


 

Advertisement
Advertisement