-
జగదభిరాముడి కల్యాణం.. జగమంతా ఆనందం
వనపర్తి జిల్లాలో..సిర్సనగండ్లలో మాంగళ్యధారణ ఘట్టం నిర్వహిస్తున్న అర్చకులు చారకొండ: అపర భద్రాద్రిగా విరాజిల్లుతున్న సిర్సనగండ్ల క్షేత్రంలో జగదానంద కారకుడు, జగదాభిరాముడు కల్యాణ వేడుక...బుధవారం కనులపండువగా సాగింది. దేవదేవుడి కల్యాణవైభోగాన్ని.. కనులారా వీక్షించి భక్తజనం పులకించారు. ఉదయం 10 గంటలకు వేదమంత్రోచ్ఛారణలు, మేళతాళాలు, భక్తుల జయజయ ద్వానాల మధ్య కల్యాణమూర్తులను ఊరేగింపుగా కల్యాణవేదిక వద్దకు తీసుకురాగా.. ఆలయ చైర్మన్ డేరం రామశర్మ పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకు జిలకర్ర బెల్లం, మాంగళ్యధారణ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. లోకమంతా వేయికళ్లతో ఎదురుచూసిన అభిజిత్ లగ్నంలో సీతమ్మ మెడలో రామయ్య మాంగళ్యధారణ చేశారు. వేలాది భక్తుల రామనామస్మరణ మధ్య ఆ జగదభిరాముడు జానకమ్మను మనువాడాడు. రాముడు దోసిట తలంబ్రాలు నీలపురాసులుగా జానకి దోసిట తలంబ్రాలు మణిమాణిక్యాలై సాక్ష్యాత్కరించిన వేళ.. సిర్సనగండ్ల క్షేత్రం భక్తి పారవశ్యంతో ఓలలాడింది. ఈ సందర్భంగా జైశ్రీరాం నినాదాలు మార్మోగాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. వీఐపీ తాకిడితో పాటు ఎండలు ఎక్కువగా ఉండడంతో భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు. కల్యాణోత్సవానికి దాదాపు 30 వేల మందికి పైగా భక్తులు హాజరైనట్లు దేవస్థాన చైర్మన్, ఈఓ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. వనపర్తిటౌన్: జిల్లావ్యాప్తంగా బుధవారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. పలు ఆలయాల ఎదుట పచ్చటి పందిళ్లు వేసి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు, సన్నాయి, డప్పు వాయిద్యాల నడుమ సీతారాముల కల్యాణం శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు భారీగా ఆలయాలకు తరలివచ్చారు. జిల్లాకేంద్రంలోని రామాలయం, వేంకటేశ్వర దేవాలయం, రాంనగర్, బండారునగర్లోని రామాలయాలు, పీర్లగుట్టలోని అభయాంజనేయస్వామి, నాగవరంలోని కోదండరామస్వామి, మర్రికుంటలోని ఆంజనేయస్వామి ఆలయాల్లో కల్యాణ క్రతువు జరిపించారు. రామాలయంలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి, జెడ్పీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, వేంకటేశ్వరస్వామి ఆలయంలో జిల్లా న్యాయమూర్తులు సునీత, రవికుమార్ పాల్గొన్నారు. ఆలయాల్లో భక్తులకు అన్నదానం చేశారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి.. వీపనగండ్ల: శ్రీరామచంద్రుడి దయతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బుధవారం మండలంలోని గోవర్ధనగిరి, వల్లాభాపురంలో జరిగిన సీతారాముల కల్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామస్తులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. గోవర్ధనగిరిలో మంత్రి జూపల్లి కృష్ణారావు నయనానందంగా సాగిన రాములోరి కల్యాణం జనసంద్రంగా మారిన సిర్సనగండ్ల క్షేత్రం మార్మోగిన జైశ్రీరామ్ నినాదాలు -
కోదండరామస్వామి రథోత్సవం
పెబ్బేరు రూరల్: శ్రీరామనవమిని పురస్కరించుకొని వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో బుధవారం రాత్రి కోదండరామస్వామి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అర్చకులు సీతాసమేతుడైన శ్రీరాముడి ఉత్సవ మూర్తులను పట్టువస్త్రాలు, ఆభరణాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ సీతారాములు రథంపై కొలువుదీరగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి రథోత్సవాన్ని ప్రారంభించారు. రథశాల నుంచి ఆంజనేయస్వామి ఆలయం వరకు తీసుకెళ్లి తిరిగి ఆలయ ఆవరణకు చేర్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం జై శ్రీరాం నామస్మరణతో మార్మోగింది. -
1996లో రాజకీయాల్లోకి ఆరంగేట్రం..
మాజీ ఎంపీ మందా జగన్నాథం 1996లో రాజకీయ ఆరంగేట్రం చేశారు. వైద్య వృత్తిలో కొనసాగిన ఆయన.. ఆ తర్వాత అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి 4 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 1996, 1999, 2004 ఎన్నికల్లో టీడీపీ తరఫున, 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి 4వ సారి లోక్సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ● బీఎస్పీలో చేరిన మందా జగన్నాథం నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలో నిలవనున్నారు. 2014లో బీఆర్ఎస్ నుంచి ఇదే స్థానం నుంచి పోటీచేసి ఓటమి చెందారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో పోటీచేసే అవకాశం దక్కలేదు. 2023 అక్టోబర్ వరకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి పనిచేసిన ఆయన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. కాగా.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో బీఎస్పీ గూటికి చేరారు. కాగా, అలంపూర్ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నేతలు ఈ సారి నాగర్కర్నూల్ స్థానం నుంచి పోటీపడుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్ధిగా అలంపూర్కు చెందిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బరిలో ఉండగా.. కొండేరుకు చెందిన మందా జగన్నాథం బీఎస్పీ నుంచి బరిలో నిలుస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బీఎస్పీని వీడి బీఆర్ఎస్ నుంచి బరిలో నిలవగా.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, అక్కడి నుంచి బీఎస్పీలో చేరిన మందా జగన్నాథం పోటీలో ఉండనుండటం కొసమెరుపు. చతుర్ముఖ పోటీ.. మాజీ ఎంపీ మందా జగన్నాథం బీఎస్పీలో చేరడం.. నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయనుండడంతో పరిణామాలు రసవత్తరంగా మారాయి. మందా జగన్నాథం అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరగా.. తాజాగా హస్తం వదిలి బీఎస్పీలోకి చేరారు. దీంతో అన్ని పార్టీలు బలమైన అభ్యర్థులను బరిలో దించగా.. చత్రుముఖ పోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లురవి, బీజేపీ నుంచి ఎంపీ రాముడు కుమారుడు భరత్ప్రసాద్, బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, తాజాగా బీఎస్పీ నుంచి మందా జగన్నాథం పోటీ పడనున్నారు. నలుగురు అభ్యర్థుల్లో ఇద్దరు అలంపూర్ నియోజకవర్గానికి చెందినవారు కాగా మరో ఇద్దరు పార్లమెంట్ సెగ్మెంట్కు చెందినవారు కావడం విశేషం. -
బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే అబ్రహం..?
అలంపూర్: మాజీ ఎమ్మెల్యే అబ్రహం బీజేపీలో చేరుతున్నారనే పోస్టులు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈమేరకు బీజేపీ రాష్ట్ర పెద్దలు ఆయనకు ఫోన్ చేసి సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనను కాదని మరొకరికి టికెట్ కేటాయించడంతో అసంతృప్తికి గురైన ఆయన అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి అందరికి అశ్చర్యానికి గురి చేశారు. తాజాగా బీజేపీలో చేరుతున్నారనే వార్తలకుతోడు ఎంపీ పోతుగంటి రాములుతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయమై ఆయన సన్నిహితులను ఆరా తీయగా.. పార్టీ మార్పు వార్తల్లో నిజం లేదని, కావాలని కొందరు పాత ఫోటోలను పోస్టు చేస్తున్నారని తెలిపారు. నోటిఫికేషన్ వెలువడనున్న ఈ తరుణంలో పార్టీల మార్పు అంశం ఏ మేరకు ఉంటుందో వేచి చూడాలి. -
No Headline
సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవంలో ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, సీఎం రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దంపతులతో పాటు మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థులు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, భరత్ప్రసాద్, బీజేపీ నేత ఆచారి తదితర ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సీఐ విష్ణువర్ధన్రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్తో పాటు పలువురు ఎస్ఐలు పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు. సిర్సనగండ్లకు చెందిన రాచమళ్ల నర్సింహ కుటుంబసభ్యులు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం, రాంపురం గ్రామానికి చెందిన చిలుకాని బాల్రెడ్డి, వెంకటమ్మ జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. భారతిసిమెంట్, ఇతర సేవా సంస్థల ద్వారా తాగునీటి వసతి, మజ్జిగ అందజేశారు. కాగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల ప్రజాప్రతినిధులు, ఎంపీ అభ్యర్థులు, నాయకులు ఒకే వేదికపై కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. -
ముందస్తు చెల్లింపుపై రాయితీ
సద్వినియోగం చేసుకోవాలి.. ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపుపై 5 శాతం రాయితీని పుర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఈ నెలాఖరు వరకే అవకాశం ఉంది. ప్రస్తుతం రూ.10 వేలకు రూ.500 ఆదా అవుతుంది. ముందస్తు చెల్లింపులతో కలిగే లాభాలను వివరిస్తూ ప్రత్యేక చార్ట్ను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నాం. – ఎం.పూర్ణచందర్, పుర కమిషనర్, వనపర్తి 2024–25 ఆర్థిఽక సంవత్సరానికి వర్తింపు ● పుర ప్రజలను ప్రోత్సహించేందుకు అధికారుల యత్నం ● జిల్లాలో 5 శాతం రిబేట్తో రూ.33 లక్షల వరకు ఆదా ●వనపర్తి టౌన్: పురపాలికల్లో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముందస్తు పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం 5 శాతం రాయితీ ప్రకటిస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఉన్న ప్రజలకు మొత్తంగా రూ.33 లక్షల వరకు ఆదా కానుంది. ఎలాంటి పాత బకాయిలు లేకుండా ఈ ఏడాది పన్ను చెల్లించే వారికి మాత్రమే రాయితీ వర్తించనుంది. గతేడాది ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యం చేరకపోవడంతో ప్రభుత్వం ప్రకటించిన రాయితీ ప్రజలు, పురపాలక సంఘానికి కలిసి రా నుందని చెప్పవచ్చు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో పన్ను బకాయిల వడ్డీపై 90 శాతం ఇవ్వడం.. పుర అధికారులు మార్చిలో బృందాలుగా ఏర్పడి బకాయిల వసూళ్లకు తిరగడంతో కొంత మేర లాభం చేకూరింది. ముందస్తు పన్ను చెల్లింపుదారులకు ఈ నెల 30 వరకు అవకాశం ఇవ్వడంతో పురపాలికలకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ¢ జిల్లాకేంద్రంలో మొత్తం 17,649 అసెస్మెంట్లు ఉండగా.. 9,126 మంది యజమానులు 5 శాతం రిబేట్కు అర్హత సాధించారు. రూ.3.21 కోట్ల డిమాండ్ ఉండగా.. రూ.15.91 లక్షలు ఆదా కానుంది. పుర అధికారులు ఇప్పటి వరకు రూ.32 లక్షలు వసూలు చేశారు. ¢ అమరచింతలో 5 శాతం రిబేట్కు 1,726 అసైస్మెంట్లు అర్హత ఉండగా.. రూ.28.32 లక్షలు వసూలు చేయాల్సి ఉంది. పుర ప్రజలకు రూ.1.41 లక్షల వరకు ఆదా కానుంది, రాయితీతో ఇప్పటి వరకు రూ.1.05 లక్షలు వసూలు చేశారు. ¢ ఆత్మకూర్ మున్సిపాలిటీలో 5,428 అసైస్మెంట్లు ఉన్నాయి. రూ.1.90 కోట్లు లక్ష్యం కాగా.. 5 శాతం రాయితీతో రూ.9.50 లక్షలు ఆదా కానున్నాయి. ఇప్పటి వరకు రూ.17 లక్షలు వసూలు చేశారు. మిగిలిన కొత్తకోట, పెబ్బేర్ మున్సిపాలిటీల్లోనూ పుర అధికారులు పన్ను వసూళ్లు చేపడుతున్నారు. ప్రచారం అంతంతే.. ముందస్తు చెల్లింపు రాయితీపై పుర ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో 14 రోజులే అవకాశం ఉండటంతో లక్ష్యం చేరుకుంటారా? లేదా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు వసూలు చేసింది 10 శాతంలోపే కావడం గమనార్హం. -
నేటి నుంచి లోక్సభ ఎన్నికల నామినేషన్ల పర్వం
సాక్షి, నాగర్కర్నూల్: లోక్సభ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. గురువారం నుంచే అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించనున్నారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో లోక్సభ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ నెల 25 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించనుండగా.. ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండనుంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు తాము నామినేషన్ వేసేందుకు ముహూర్తాలను ఖరారు చేసుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు తమ అభ్యర్థుల నామినేషన్ సందర్భంగా జాతీయ, రాష్ట్ర స్థాయి ముఖ్య నేతల హాజరు, భారీ ర్యాలీలతో నామినేషన్ వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. బడా నేతలు హాజరు.. ముహూర్త బలం దృష్టిలో ఉంచుకుని ప్రధాన పా ర్టీల అభ్యర్థులు ఈ నెల 19, 23, 24, 25 తేదీల్లో నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నాగర్కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఈ నెల 19న మొదటి సెట్టు నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి నిరంజన్రెడ్డి హాజరవుతారని తెలుస్తోంది. అలాగే ఈ నెల 24న పార్టీ శ్రేణులో కలిసి భారీ ర్యాలీతో మరోసారి నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఆ రోజున బీఆర్ఎస్ ముఖ్య నేతలు హరీశ్రావు హాజరవుతారని సమాచారం. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి ఈ నెల 23న నామినేషన్ వేసేందుకు సిద్ధం అవుతున్నారు. నామినేషన్ రోజున పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని పార్టీ నేతలు భావిస్తున్నారు. బీజేపీ తమ అభ్యర్థుల నామినేషన్ల ఘట్టానికి జాతీయ స్థాయి నేతలు, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను రంగంలోకి దింపనుంది. ఈ నెల 25న బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ప్రసాద్ నామినేషన్ పత్రాలను దాఖలు చేయనుండగా.. నామినేషన్ కార్యక్రమానికి గుజరాత్ సీఎం భూపేంద్రపటేల్ హాజరుకానున్నారని సమాచారం. ఈ మేరకు భారీ ర్యాలీలు, అనంతరం ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమావేశాలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఉపసంహరణకు చివరి తేది ఏప్రిల్ 29 నామినేషన్ల స్వీకరణకు చివరి తేది ఏప్రిల్ 25 పోలింగ్ తేది : మే 13ఎన్నికల ఫలితాలు: జూన్ 4 -
లౌకిక శక్తులను గెలిపించాలి : సీపీఎం
పెబ్బేరు రూరల్: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించి వామక్ష లౌకిక శక్తులను గెలిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జాన్వెస్లీ కోరారు. బుధవారం జిల్లాకేంద్రంలోని యాదవభవన్లో జరిగిన వామపక్షాల జిల్లా సదస్సుకు ఆయనతో పాటు సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర నాయకుడు కృష్ణారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానంటాయనిఽ, అదుపు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్, పుట్టా ఆంజనేయులు, జీఎస్ గోపి, బాల్రెడ్డి, లక్ష్మి, మేకల ఆంజనేయులు, ప్రసాద్, రాజన్న, గణేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. రామన్పాడులో నీటిమట్టం తగ్గుముఖం మదనాపురం: రామన్పాడు జలాశయంలో నీటిమట్టం రోజురోజుకు తగ్గుతోంది. బుధవారం 1,011 అడుగులు ఉండగా.. జూరాల ఎడమ, సమాంతర కాల్వ నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. తాగునీటి అవసరాలకు 20 క్కూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని ఏఈ సింగిరెడ్డి రనీల్రెడ్డి వివరించారు. సివిల్స్ ర్యాంకర్ అనన్యరెడ్డికి సన్మానం అడ్డాకుల: యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయస్థాయి మూడవ ర్యాంక్ సాధించిన పొన్నకల్ గ్రామవాసి దోనూరు అనన్యరెడ్డిని బుధవారం హైదరాబాద్లో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి శాలువాతో సత్కరించి అభినందించారు. జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించి, పాలమూరు జిల్లాకే కాకుండా రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యుడు మహిమూద్, విజయకుమార్రెడ్డి, కృష్ణ, నర్సింహారెడ్డి, ప్రభాకర్రెడ్డి, ప్రతాప్రెడ్డి, జాజాల రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. -
బీఎస్పీ గూటికి మందా
అలంపూర్: లోక్సభ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. పోటీయే ప్రధానం అన్నట్టుగా కొందరు ఉన్న పార్టీని వదిలి.. మరో పార్టీ కండువా కప్పుకొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘కారు’ దిగిన మాజీ ఎంపీ మందా జగన్నాథం.. ఆ తర్వాత ‘చెయ్యి’ అందుకున్నారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానానికి పోటీచేసే అవకాశం కల్పిస్తారని ఆశించగా, పార్టీ అధిష్టానం మరొకరికి టికెట్ కేటాయించింది. ఈనేపథ్యంలో మందా జగన్నాథం కాంగ్రెస్ పార్టీని వీడుతారనే ప్రచారం జోరుగా సాగింది. ఎట్టకేలకు ఆయన కాంగ్రెస్ను వీడి ఏనుగెక్కారు. బుధవారం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మందా ప్రభాకర్ ఆధ్వర్యంలో పార్టీ అధినేత్రి మాయావతిని రాజస్థాన్లో కలిసి, పార్టీ కండువా కప్పుకొన్నారు. మాయవతి సమక్షంలో ఏనుగు పార్టీలో చేరిన మాజీ ఎంపీ జగన్నాథం నాగర్కర్నూల్ పార్లమెంట్ బరిలో నిలిచే అవకాశం -
అనన్య.. ప్రతిభ
సివిల్స్లో ఆలిండియా 3వ ర్యాంకు సాధించిన పాలమూరు బిడ్డ వివరాలు IIలో u● తాత దిశానిర్దేశంతోసివిల్స్ వైపు అడుగులు ● సొంతంగా ప్రిపరేషన్..మొదటి ప్రయత్నంలోనే విజయం ● సొంతూరు పొన్నకల్..బాల్యమంతా మహబూబ్నగర్లోనే.. మహబూబ్నగర్ ఎడ్యుకేషన్/ అడ్డాకుల: యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో పాలమూరు బిడ్డ సత్తాచాటింది. సివిల్స్– 2023 ఫలితాల్లో జిల్లాకేంద్రానికి చెందిన దోనూరు అనన్యరెడ్డి జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. ఆమె ఒక సాధారణ కుటుంబంలో జన్మించి సివిల్స్లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చడం పట్ల కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఐఏఎస్ కావాలన్న ఆశయం ఉన్న ఆమె బాల్యమంతా మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోనే గడిచింది. ఆమె ఐఏఎస్ కావాలన్న కలలకు స్ఫూర్తినిచ్చింది తాత కృష్ణారెడ్డి ఆయన సలహాలు, సూచనలతో చిన్నప్పటి నుంచి సివిల్సే లక్ష్యంగా చదువుకున్నట్లు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఎలాంటి శిక్షణ లేకుండా.. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ జాతీయస్థాయిలో మూడో ర్యాంకు సాధించింది. ఇంటర్ ప్రారంభం నుంచే.. అనన్య ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు మహబూబ్నగర్లోని గీతం పాఠశాలలో చదివారు. ఎస్సెస్సీలో మంచి గ్రేడింగ్తో ఉత్తీర్ణత సాధించింది. ఇంటర్ ప్రారంభం నుంచి ఐఏఎస్ వైపు అడుగులు పడ్డాయి. దీంతో ఆమెను హైదరాబాద్లోని నారాయణ ఐఏఎస్ అకాడమీలో చేర్చారు. ఇంటర్ పూర్తయ్యాక ఢిలీల్లోని మిరిండా హౌస్ కళాశాలలో ఏబీ (బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్)లో చేరారు. డిగ్రీ పూర్తయ్యాక 2020 నుంచి పూర్తిస్థాయిలో సివిల్స్ ప్రిపరేషన్పై దృష్టిపెట్టారు. ఢిల్లీలోనే పీజీ చదువుతూ సివిల్స్ పరీక్షలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సివిల్స్లో ఆప్షనల్ సబ్జెక్టులుగా ఆంత్రపాలజీని ఎంపిక చేసుకున్నారు. ఈ ఒక్క ఆంత్రపాలజీ కోసం ఆన్లైన్లోనే శిక్షణ తీసుకున్నారు. దీంతో మిగతా సబ్జెక్టులు అన్ని కూడా సొంత ప్రిపరేషన్తో ముందుకు సాగారు. ప్రతిరోజు 12 నుంచి 14 గంటల పాటు సిద్ధమయ్యాయని చెప్పారు. సొంత ప్రిపరేషన్ సివిల్స్కు సిద్ధమయ్యే క్ర మంలో అనన్యరెడ్డి సొంత ప్రిపరేషన్పైనే ఎక్కు వగా దృష్టిపెట్టారు. ప్రతి రోజు 12 గంటల నుంచి 14 గంటలపాటు చదువుకునేవారు. సబ్జెక్టులో ప్రతి అంశాన్ని నోట్గా రాసుకునే అలవాటు ఉండటంతో శిక్షణ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. చాలా సులువుగా లక్ష్యాన్ని చేరు కుని ప్రణాళిక ప్రకారం నిర్దేశిత సమయంలో సిలబస్ను పూర్తిచేసే విధంగా ఆమె ప్రిపరేషన్ కొనసాగించారు. సివిల్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలకు హాజరయ్యే క్రమంలో సీనియర్ల సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడినట్లు అనన్యరెడ్డి చెప్పారు. పొన్నకల్లో సంబరాలు అనన్యరెడ్డి యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. పొన్నకల్వాసికి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు రావడంతో కుటుంబసభ్యులు, బంధువులు అనన్యరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అనన్యరెడ్డి తండ్రి సురేష్రెడ్డి గ్రామంలో కొన్నాళ్లపాటు వ్యవసాయం చేశారు. 20 ఏళ్ల కిందట ఇద్దరు కుమార్తెల చదువుల కోసం మహబూబ్నగర్ వెళ్లి స్థిరపడ్డాడు. అక్కడే వ్యాపారాలు చేస్తూ కుమార్తెలను చదివించారు. -
రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ
వనపర్తిటౌన్: పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు గురువారం నుంచి తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ పవార్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాగర్కర్నూల్ రిటర్నింగ్ అధికారి ద్వారా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని.. వనపర్తిలో ఉండే అభ్యర్థులు సైతం నాగర్కర్నూల్లోనే నామినేషన్ వేయాలని సూచించారు. 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని, ఆన్లైన్లో నామినేషన్ దాఖలు చేసేవారు హార్డ్ కాపీలను రిటర్నింగ్ అధికారికి నేరుగా సమర్పించాలన్నారు. అప్డెవిట్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ఎన్నికల ప్రచారానికి సమాన అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రచార అనుమతులను సహాయ రిటర్నింగ్ అధికారి నుంచి పొందాలని, ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. సమావేశంలో జిల్లా సహాయ రిటర్నింగ్ అధికారి ఎం.నగేష్, ఆర్డీఓ పద్మావతి పాల్గొన్నారు. పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ.. పార్లమెంట్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు నోడల్ అధికారులు పూర్తిస్థాయిలో సంసిద్ధులుగా ఉండాలని ఎన్నికల అధికారి తేజస్ పవార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపై అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ఎం.నగేష్తో కలిసి నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఓటరు నమోదు దరఖాస్తులను పరిశీలించి జాబితా సిద్ధం చేయాలని, ఓటరు జాబితాను పోలింగ్ కేంద్రాల వారీగా విడుదల చేయాలన్నారు. ఈసీ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని.. విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మే 3 నుంచి 8 వరకు కొనసాగే పోస్టల్ బ్యాలెట్ సెంటర్లు, హోం ఓటింగ్కు రూట్ మ్యాప్, భద్రత, పోలింగ్ సిబ్బంది, రవాణా ఏర్పాట్లు పక్కాగా చేసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన వసతులు కల్పించాలని, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్డీఓ పద్మావతి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, నోడల్ అధికారులు, నోడల్ సి–సెక్షన్ అధికారులు పాల్గొన్నారు. సకాలంలో డబ్బులు చెల్లించాలి.. వరి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోపు ఆన్లైన్లో వివరాలు అప్లోడ్ చేసి రైతులకు సకాలంలో డబ్బులు అందేలా చూడాలని కలెక్టర్ తేజస్ పవార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వరి ధాన్యం కొనుగోలుపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని, పంట విక్రయించిన 48 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 242 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, మిల్లుల నుంచి రావాల్సిన సీఎంఆర్ సకాలంలో అందించే విధంగా డిప్యూటీ తహసీల్దార్లు పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. మూడు సీజన్లకు సంబంధించి మిల్లర్లు కార్పొరేషన్కు అందించాల్సిన 18 వేల మెట్రిక్ టన్నుల పెండింగ్ ధాన్యాన్ని ఏప్రిల్ 30లోపు పూర్తి చేయాలన్నారు. గతంలో నాసిరకం బియ్యం ఇచ్చిన మిల్లర్లకు నోటీసులు జారీచేసి నాణ్యమైన బియ్యాన్ని సేకరించాలని కోరారు. సమావేశంలో డీఎస్ఓ శ్రీనివాసులు, డీఎం ప్రవీణ్, మార్కెటింగ్ అధికారి స్వరణ్సింగ్, డీఆర్డీఓ, డీటీలు పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ పవార్ -
పార్లమెంట్లో ప్రజావాణి వినిపిస్తా
వనపర్తిటౌన్/ఖిల్లాఘనపురం/నాగర్కర్నూల్/ నాగర్కర్నూల్ రూరల్: తనను ఆశీర్వదించి ఎంపీగా గెలిపిస్తే.. ఢిల్లీలో ఈప్రాంత ప్రజల వాణి వినిపిస్తానని నాగర్కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. మంగళవారం నాగర్కర్నూల్ జెడ్పీ మైదానంలో మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్, అంబేడ్కర్ చౌరస్తాలలో హమాలీ సంఘం నాయకులను కలిసి ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం రాజకీయ ఐక్యవేదిక సదస్సులో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజుతో కలిసి ఆయన పాల్గొన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని దళితవాడ, రాజీవ్చౌక్, కాశీంనగర్లో మాజీ మంత్రి నిరంజన్రెడ్డితో కలిసి కార్నర్ మీటింగ్, ఖిల్లాఘనపురంలో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆయా సమావేశాల్లో ఆర్ఎస్పీ మాట్లాడుతూ మహనీయుల ఆశయసాధన, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన ఏడేళ్ల సర్వీస్కు ఫుల్స్టాప్ పెట్టి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ప్రభుత్వంతో కొట్లాడి ఎర్ర బస్సు నుంచి ఎయిర్ బస్సు సౌకర్యం కల్పిస్తానని చెప్పారు. విద్యార్థుల కోసం కొత్త పథకాలు తీసుకురావడమే కాకుండా, వారిలో నైపుణ్యాలు పెంపొందించేందుకు కృషి చేస్తానన్నారు. గతంలో ఇక్కడ ఎంపీలుగా గెలిచిన నాయకులు ఎలాంటి సేవలు అందించారో ప్రజలందరికీ తెలుసన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరిగిన 223 రోజుల్లో కేవలం 6 నిమిషాలు మాత్రమే మాట్లాడిన ఎంపీ కొడుకు బీజేపీ అభ్యర్థి అని ఎద్దేవా చేశారు. గతంలో రెండు సార్లు ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి ఈప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు. నాగర్కర్నూల్ ఎంపీగా తనను గెలిపిస్తే, ఈ ప్రాంతాన్ని ప్రపంచ పటంలో నిలుపుతానని హామీ ఇచ్చారు. ● కొనుగోలు కేంద్రాలకు కనీసం గన్నీబ్యాగులు అందించలేని పాలన రాష్ట్రంలో కొనసాగుతోందని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందన్నారు. మాయమాటలు చెప్పి, ఓట్లు దండుకోవడం కాంగ్రెస్కు వెన్నెతో పెట్టిన విద్య అని అన్నారు. కేసీఆర్ హయాంలో ఖిల్లాఘనపురం మండలానికి సాగునీరందించే పనులను ఒక్క ఏడాదిలోనే పూర్తిచేసినట్లు వివరించారు. విద్యావేత్త ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను ఎంపీగా గెలిపించుకోవడం బాధ్యతగా భావించాలని కోరారు. సమావేశాల్లో అభిలాష్రావు, ప్రత్యూష, ఎంపీపీ కృష్ణానాయక్, జెడ్పీటీసీ సామ్యానాయక్, గ్రంథాలయ చైర్మన్ లక్ష్మయ్య, గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి, లక్ష్మారెడ్డి, కృష్ణయ్య, మంగి విజయ్, ప్రదీప్, ఐతోల్ లక్ష్మయ్య, భాస్కర్గౌడ్, గంగాధర్, కరణ్ లాల్, రాంనర్సయ్య, గంగ, మీసాల రాము పాల్గొన్నారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ -
వాతావరణం
ఉదయం నుంచిఎండ తీవ్రత ఉంటుంది. అప్పుడప్పుడు వడగాలులు వీచే అవకాశం ఉంది. మధ్యాహ్నం ఉక్కపోత పెరుగుతుంది. మెరిసిన ఆత్మకూర్ ఆణిముత్యం సివిల్స్లో 278 ర్యాంకుసాధించిన ఎహ్తేదా ముఫస్సీర్ ఆత్మకూర్: యూపీఎస్సీ ఫలితాల్లో ఆత్మకూర్కు చెందిన ఎహ్తేదా ముఫస్సీర్ ప్రతిభచాటింది. ఎలాంటి కోచింగ్ లేకుండానే ఆలిండియా 278 ర్యాంకు సాధించి ఐఏఎస్కు ఎంపికై ంది. ఆత్మకూర్కు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు సయ్యద్ఖాసిం కుమారుడు ఇబ్రహిం ఖలీల్కు ఇద్దరు కుమార్తెలు రుఫియా, ఎహ్తేదా ముఫస్సీర్, కుమారుడు సయ్యద్ తఫస్సూల్ ఉన్నారు. రెండో కుమార్తె ఎహ్తేదా ముఫస్సీర్ పదో తరగతి వరకు మహబూబ్నగర్లోని ఆకృతి పాఠశాలలో చదివి 2014లో 10/10 గ్రేడ్ను సాధించిన ఆమె.. ఇంటర్ బైపీసీ సిరి కళాశాలలో పూర్తి చేసి 987 మార్కులు సాధించి టాపర్గా నిలిచారు. అనంతరం ఢిల్లీలోని లేడి శ్రీరాం కళాశాలలో పొలిటికల్ సైన్స్ డిగ్రీ విద్యను 2020లో పూర్తి చేసింది. తర్వాత సోదరి రుఫియాతో కలిసి ఎహ్తేదా ముఫస్సీర్ ఇంట్లోనే సివిల్స్కు ప్రిపేర్ అయ్యి.. 2023లో నిర్వహించిన యూపీఎస్సీ పరీక్షలకు హాజరైంది. ఈ క్రమంలో మంగళవారం విడుదలైన ఫలితాల్లో జాతీయ స్థాయిలో 278 ర్యాంకు సాధించగా.. ఆమె సోదరి రుఫియా ఫలితాల్లో స్వల్ప తేడాతో వెనకబడిపోయింది. ఎహ్తేదా అత్యుతమ ర్యాంకు సాధించడంతో ఆత్మకూర్లో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తాతయ్యే స్ఫూర్తి.. ‘మా తాతయ్య సయ్యద్ఖాసీం రిటైర్డు ఉపాధ్యాయుడు. తాను, తన కుమారులు ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగుతున్నామని.. మీరు ఇంకా గొప్పస్థాయిలో కలెక్టర్ కావాలని తరచుగా చెప్పేవారు.’ అని ఎహ్తేదా చెప్పారు. దీంతో పదో తరగతి నుంచే గట్టిగా నిర్ణయించుకొని సివిల్స్ వైపు అడుగులు వేశానని పేర్కొన్నారు. 278 ర్యాంకు రావడంతో మా తాతయ్య కల సాకారమైందని ఆనందం వ్యక్తం చేశారు. పేదలకు అండగా నిలబడలన్నదే తన లక్ష్యం అని వివరించారు. -
బస్సులు కేటాయించాలని వినతి
వనపర్తిటౌన్: నిజాం కాలంలో ఏర్పాటైన వనపర్తి ఆర్టీసీ డిపోలో రవాణా సేవలు విస్తృతం చేసేందుకు చొరవ చూపాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి కోరారు. మంగళవారం హైదరాబాద్లోని బస్భవన్లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ను కలిసి లేఖ అందించారు. డిపోకు 26 బస్సులు కేటాయించాలని, ప్రజలకు ఆర్టీసీ సేవలను మరింత చేరువ చేసేందుకు బస్సుల కేటాయింపు అనివార్యమని తెలిపారు. అదేవిధంగా పాత బస్టాండ్ కమర్షియల్ ప్రాంతంలో ఉందని.. వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. పాత బస్టాండ్ను అభివృద్ధి చేస్తే ఆదాయం సమకూరడమేగాక ప్రజలకు వ్యాపార సముదాయం మరింత చేరువ అవుతుందని వివరించారు. రూ.80 వేల ఔషధాలు సీజ్ వనపర్తిటౌన్: నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించే మెడికల్ దుకాణాలు, ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని డ్రగ్ ఇన్స్పెక్టర్లు రష్మి, రబీయా హెచ్చరించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని పలు ప్రైవేటు ఆస్పత్రుల మెడికల్ దుకాణాలపై దాడులు నిర్వహించారు. శ్రీసాయి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో అనుమతి లేకుండా విక్రయిస్తున్న రూ.80 వేల మందులు సీజ్ చేసి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కు పంపినట్లు వివరించారు. బస్టాండ్లలో వసతుల కల్పనపై దృష్టి అమరచింత: జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్లలో నెలకొన్న సమస్యలు తెలుసుకుని మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వనపర్తి ఆర్టీసీ డిపో మేనేజర్ వి.వేణుగోపాల్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని బస్టాండ్ను ఆయన పరిశీలించి వసతులపై ఆరా తీశారు. కూర్చోడానికి బేంచీలు, మహిళలకు మరుగుదొడ్లు, ప్రహరీ లేదనే ప్రయాణికులు వివరించారు. జిల్లాకేంద్రం నుంచి ఆత్మకూర్ వరకు నడుస్తున్న షటిల్ బస్సులను అమరచింత వరకు కొనసాగించాలని స్థానిక నాయకులు కోరారు. అనంతరం డీఎం మాట్లాడుతూ.. డిపో పరిధిలోని అన్ని బస్టాండ్లను సందర్శిస్తున్నామని, కనీస సౌకర్యాల కల్పనకు కావాల్సిన నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపించనున్నట్లు వివరించారు. ప్రహరీ నిర్మాణానికి రూ.12 లక్షలు మంజూరయ్యాయని, బస్టాండ్ ప్రాంగణంలో ఉన్న డబ్బాల తొలగింపునకు సహకరించాలన్నారు. శిథిలావస్థకు చేరిన మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం అదనపు బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. ఆయన వెంట డిప్యూటీ ఆర్ఎంఓ లక్ష్మి ధర్మ, డిప్యూటీ ఈఈ పోచయ్య, మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ నాగభూషణంగౌడ్ తదితరులు ఉన్నారు. కష్టపడే వారికి గుర్తింపు పెబ్బేరు రూరల్: పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టి చూసుకుంటామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మంగళవారం పెబ్బేరులో నాగర్కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవితో కలిసి విలేకర్లతో మాట్లాడారు. కృష్ణానదిలో ఉన్న నీటిని రైతులకు ఎలా అందించాలో తమకు తెలుసని.. ప్రజా సేవే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన పార్టీ పెబ్బేరు మండల కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. ఈ నెల 23న మల్లు రవి నామినేషన్ వేస్తున్నారని.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొంటారని చెప్పారు. బిజినేపల్లి నుంచి నాగర్కర్నూల్ వరకు 12 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి నామినేషన్ వేయనున్నట్లు చెప్పారు. కార్యకర్తలు, నాయకులు, అభిమానులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకొని గ్రామ కమిటీలు వేశారు. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్, అక్కి శ్రీనివాసులుగౌడ్, వెంకటేష్సాగర్, సురేందర్గౌడ్, బీరం రాజశేఖర్రెడ్డి, శంకర్నాయక్, కౌన్సిలర్ అక్కమ్మ తదితరులు పాల్గొన్నారు. -
గర్వకారణం..
మా కుటుంబానికి చెంది న దోనూరు అనన్యరెడ్డి యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించడం చాలా గర్వంగా ఉంది. ఆమె తండ్రి సురేష్రెడ్డి తన ఇద్దరు కుమార్తెల చదువుల కోసం గ్రా మాన్ని వదిలి మహబూబ్నగర్లో స్థిరపడ్డా రు. తండ్రి ఆశయాన్ని నెరవేర్చిన అనన్యరెడ్డికి శుభాకాంక్షలు. – దోనూరు నాగార్జున్రెడ్డి, ఎంపీపీ, పొన్నకల్ గ్రామం జాతీయస్థాయిలో గుర్తింపు యూపీఎస్సీ ఫలితాల్లో దోనూరు అనన్యరెడ్డి జా తీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించి పొన్నకల్కు జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చింది. చదువులో రాణించి ఉన్నత స్థాయి ఉద్యోగానికి ఎంపికవడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. పట్టుదలతో చదువుకుంటే ఉన్నత స్థాయికి చేరొచ్చని నిరూపించింది. – దోనూరు విజయకుమార్రెడ్డి, పొన్నకల్ -
మెకానికల్ ఇంజినీర్కు 627వ ర్యాంక్
వెల్దండ: సివిల్స్ ఫలితాల్లో నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని చెదురుపల్లి ఉమ్మడి పంచాయతీ పోషమ్మగడ్డతండాకు వడ్తావత్ యశ్వంత్నాయక్ జాతీయ స్థాయిలో 627వ ర్యాంకుతో సత్తాచాటారు. తండాకు చెందిన ఉమాపతి, పద్మ దంపతుల మొదటి కుమారుడు యశ్వంత్. ఇతను ఇంటర్మీడియట్ నారాయణ కళాశాలలో, ఐఐటీ మద్రాస్లో మెకానికల్ ఇంజినీయక్ పూర్తిచేశారు. తర్వాత సివిల్స్ సాధించడమే లక్ష్యంగా చదివి.. రెండోసారి ప్రయత్నంలో మెరుగైన ర్యాంకు సాధించాడు. తమ కుమారుడు సివిల్స్ సాధించడంతో తల్లిదండ్రులు పద్మ, ఉమాపతి హర్షం వ్యక్తం చేశారు. గిరిజన విద్యార్థి సివిల్స్లో ర్యాంక్ సాధించడంతో తండావాసులు, బంధువులు అభినందించారు. -
తాగునీటి ఎద్దడి తలెత్తనివ్వొద్దు
కొల్లాపూర్: వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని మిషన్ భగీరథ అధికారులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించారు. సోమవారం ఆయన నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల కలెక్టర్లు ఉదయ్కుమార్, తేజస్ నందలాల్, అదనపు కలెక్టర్లు కుమార్ దీపక్, సంచిత్ గంగ్వార్తో కలిసి ఎల్లూరు సమీపంలోని మిషన్ భగీరథ పంప్హౌజ్, కృష్ణానదిలో బ్యాక్ వాటర్ను పరిశీలించారు. నల్లమల అటవీ ప్రాంతంలో ఉండే కోతిగుండు వద్దకు వెళ్లి, అక్కడి నుంచి బ్యాక్ వాటర్ లెవల్స్, నీటి ప్రవాహం చూశారు. మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్రెడ్డి, సీఈ చెన్నారెడ్డితో వారు మాట్లాడారు. ప్రస్తుత వాటర్ లెవెల్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. వేసవి ముగిసే వరకు తాగునీటి అవసరాలకు 2.4 టీఎంసీ నీళ్లు అవసరమవుతాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం శ్రీశైలం బ్యాక్వాటర్లో తెలంగాణ ప్రభుత్వం తాగునీటి అవసరాలకు వినియోగించుకునేందుకు 5 టీఎంసీల మేరకు నీటి నిల్వలు ఉన్నాయని చెప్పారు. బ్యాక్ వాటర్ లెవల్స్ రెగ్యులర్గా పర్యవేక్షించాలని కలెక్టర్లకు సూచించారు. తాగునీటి అంశాలను రాష్ట్ర ప్రభుత్వం సమీక్షిస్తోందని, ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే పరిష్కారానికి అవసరమైన నివేదిక అందించాలన్నారు. మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటరమణ, ఈ ఈ సుధాకర్సింగ్, డీఈ అంజాద్పాష ఉన్నారు. -
జాతీయ హోదా అడిగావా..: వంశీచంద్
ప్రఽదాని నరేంద్రమోదీ దగ్గరకు వెళ్లి ఈ ప్రాంతానికి ఒక్క రూపాయి తెచ్చావా.. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగావా.. కృష్ణా– వికారాబాద్ రైల్వే లైన్పై విన్నవించావా.. ఇవన్నీ అడగకుండా కేవలం బీజేపీలో జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి కావాలని మోదీని అడుక్కున్న దొరసానివి నువ్వు. ఎన్నికలు వచ్చినప్పుడు నాది నారాయణపేట అంటున్నావ్.. పేట బిడ్డవైతే సైనిక్ స్కూల్ పోతుంటే ఎందుకు ఆపలేదు.. ధన్వాడ బిడ్డవని చెబుతవ్.. ధన్వాడ చెరువును మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు నింపలేదు. కేవలం ఓట్ల కోసమే మాట్లాడుతున్నావ్ తప్ప.. ఈ ప్రాంత అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు. పద్మశాలీలకు పెద్దఎత్తున టెక్స్టైల్ పార్కు రావాలన్నా.. ప్రతి గ్రామంలో రోడ్లు కావాలన్నా.. పేటలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మించాలన్నా.. హస్తం గుర్తుకు ఓటు వేసి ఎంపీగా గెలిపించండి అని ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి విన్నవించారు. -
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం
పోలీసు ప్రజావాణికి ఆరు అర్జీలు వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఆరు అర్జీలు దాఖలయ్యాయి. ఏఎస్పీ రామదాసు తేజావత్ బాధితులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరిష్కారం కోసం ఆయా అర్జీలను సంబంధిత పోలీసు అధికారులకు సిఫారస్ చేశారు. పరస్పర గొడవలకు సంబంధించి రెండు, భూతగాదాలకు సంబంధించిన నాలుగు అర్జీలు దాఖలైనట్లు ఏఎస్పీ వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీస్ ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పాన్గల్: అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్పార్టీ లక్ష్యమని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం మండలంలోని మల్లాయిపల్లి, చింతకుంట, దొండాయిపల్లి, దావాజిపల్లి, అన్నారం, పాన్గల్లో పర్యటించి సమస్యలు తెలుసుకొని ఆయా గ్రామాల్లో కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంపు, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరయ్యాయని.. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా చేపడతామని, అర్హులను స్వయంగా ఎంపిక చేస్తానని పేర్కొన్నారు. రూ.2 లక్షల పంట రుణమాఫీ, పంటల బీమా త్వరలో అమలు చేస్తామని, ఇప్పటికే 5 ఎకరాలలోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు రైతుభరోసా పథకం కింద పంట పెట్టుబడి సాయాన్ని అందజేశామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయే తప్పా ఎవరికి లబ్ధి చేకూరలేదని చెప్పారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి నాలుగు నెలలకే అభివృద్ధి ఏది అంటూ రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. మల్లాయిపల్లికి చందాపూర్ నుంచి రామన్పాడు నీరు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. చింతకుంటలో పలు కుటుంబాలను మంత్రి పరామర్శించారు. కాంగ్రెస్పార్టీపై నమ్మకంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేశారని.. అదే స్ఫూర్తితో పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేస్తూ విజయానికి కృషి చేయాలన్నారు. వెంకటేష్నాయుడు, గోవర్ధన్సాగర్, రవికుమార్, పుల్లారావు, మధుసూదన్రెడ్డి, బ్రహ్మయ్య, వెంకటయ్యయాదవ్, జయరాములుసాగర్, జయకళ, రామస్వామి, జగదీశ్వర్రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
పేటలో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మించాలి
పేట మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని, కోయిల్సాగర్ బ్యాక్వాటర్ నుంచి కోయిలకొండ మండలం గణపతిరాయ చెరువు నింపాలని సీఎం రేవంత్రెడ్డిని ఎమ్మెల్యే పర్ణికారెడ్డి కోరారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో తనకిచ్చిన మెజార్టీ కంటే రెండింతలు ఎక్కువ వంశీచంద్రెడ్డికి ఇచ్చి గెలిపించాలి. ● దమ్మున్న నాయకుడు రేవంత్రెడ్డి ప్రచారం ఇక్కడి నుంచి ప్రారంభించడం కాంగ్రెస్ విజయానికి నాంది పలుకుతుందని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేకాధికార ప్రతినిధి, మాజీ ఎంపీ జితేందర్రెడ్డి పేర్కొన్నారు. చేనేత పరిశ్రమల ఏర్పాటును, సైనిక్ స్కూల్ను గత ప్రభుత్వం రద్దు చేసిందని, వంశీ గెలిచిన తర్వాత ఈ ప్రాంతానికి సైనిక్ స్కూల్ మంజూరు చేయిస్తామన్నారు. ● ముదిరాజ్ల చిరకాల కోరిక అయిన బీసీ–డీ నుంచి బీసీ–ఏ మార్చేందుకు సీఎం రేవంత్రెడ్డి హామీ ఇవ్వడంపై ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ ఎక్కడ? మాయమాటలతో మందకృష్ణను బుట్టలో వేసుకొని.. ఎస్సీ వర్గీకరణ చేస్తామంటున్న బీజేపీ మేనిఫెస్టోలో ఈ విషయం ఎక్కడ ఉందో చెప్పాలని, ఏఐసీసీ కార్యదర్వి సంపత్కుమార్ పేర్కొన్నారు. ఇంకో పార్టీ బీఆర్ఎస్ పాతాళానికి పోయిందన్నారు. రేవంత్ చేసే పనులు చూసి దేశ ప్రజలు మెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. పాలమూరుకు జాతీయ హోదా తెచ్చారా? మోదీని ప్రధాని చేయాలని.. రేవంత్రెడ్డిని ఓడగొట్టాలని ఇక్కడ బీజేపీ అభ్యర్థి అనుకుంటున్నారు. పదేళ్ల నుంచి మోదీ ప్రధానిగా ఉన్నారు కదా.. ఏ రోజైనా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్కు జాతీయ హోదా అడిగారా.. నిధులు తెచ్చారా అని రేవంత్ ప్రశ్నించారు. ముదిరాజ్లను బీసీ–డీ నుంచి ఏ గ్రూప్లో మార్చడానికి, మాదిగ బిడ్డల ఏబీసీడీ వర్గీకరణ గురించి అడిగారా.. మహబూబ్నగర్–రాయచూర్ రోడ్డు ఎందుకు పడావ్ పడింది.. మక్తల్–నారాయణపేట ఎత్తిపోతల పథకానికి జాతీయ నిధులు ఏమైనా తెచ్చారా అని మండిపడ్డారు. పాలమూరును ఎండబెట్టి.. లక్షలాదిగా వలసలు పోతుంటే ఒక్క రోజు పట్టించుకోలేదని.. అయినా బీజేపీకి ఓటు వేయాలి.. రేవంత్ను ఓడగొట్టాలని అంటున్నారని ధ్వజమెత్తారు. బలహీనపర్చాలనే ఉద్దేశంతోనే.. కాంగ్రెస్ వచ్చిన 100 రోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాం.. 30వేల ఉద్యోగాలు ఇచ్చాం.. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇంటికి ఉచిత కరెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇచ్చాం.. ఇందిరమ్మ ఇళ్ల ఇస్తున్నాం.. ఇందుకు రేవంత్ను ఓడగొట్టాలా అని ప్రశ్నించారు. తనతో పాటు మంత్రివర్గ సహచరులు రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారని. రాత్రి, పగలు కష్టపడుతున్నామని వివరించారు. బూర్గుల రామకృష్ణారావు తర్వాత తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ పాలమూరు నుంచి మీ బిడ్డ సీఎం అయితే ఎందుకు ఓర్వడం లేదని.. మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే హక్కు మాకు లేదా అని ప్రశ్నించారు. రేవంత్రెడ్డిని బలహీనపరచాలనే ఉద్దేశంతో అరుణమ్మ బీఆర్ఎస్తో కుమ్మక్కయ్యారని విమర్శలు గుప్పించారు. మహబూబ్నగర్ బీఆర్ఎస్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి ఐదేళ్లు ఎక్కడిపోయారని ప్రశ్నించారు. అమరచింత బీఆర్ఎస్ జెడ్పీటీసీ సరోజ, నర్వ జెడ్పీటీసీ జ్యోతిలు సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేశారు. సభలో ఎమ్మెల్యేలు మధుసూదన్రెడ్డి, యెన్నం శ్రీనివాస్రెడ్డి, అనిరుధ్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, వీర్లపల్లి శంకర్, జెడ్పీచైర్పర్సన్లు వనజ, స్వర్ణసుధాకర్, సరిత, మాజీ ఎమ్మెల్యే గురునాథ్రెడ్డి, టీపీసీసీ కల్లుగీత కార్మిక రాష్ట్ర చైర్మన్ కేశంనాగరాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి సమస్య ఉత్పన్నం కావొద్దు
కొత్తకోట రూరల్: జిల్లాలో తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చూడాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం మదనాపురం మండలంలోని రామన్పాడు ప్రాజెక్టును కలెక్టర్ తేజస్ పవార్, అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్రెడ్డితో కలిసి సందర్శించారు. అనంతరం కొత్తకోట ఎంపీడీఓ కార్యాలయంలోని ప్రొ. జయశంకర్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రిజర్వాయర్లో ఎన్ని రోజులకు సరిపడా నీటినిల్వ ఉంది.. అన్ని ఇంటెక్వెల్ల వద్ద మోటార్లు నడుస్తున్నాయా? అనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వేసవిలో తాగునీటి సరఫరాలో సమస్య తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని, ఇందులో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిస్థితులను చక్కబెట్టాలని సూచించారు. అత్యవసరమైతే ప్రత్యామ్నాయంగా బోరుమోటార్ల ద్వారా తాగునీటి సరఫరా చేయించేలా ఇప్పటికే అన్ని ముందస్తు చర్యలు పూర్తి చేశామన్నారు. ప్రతి ఇంటికి వందశాతం తాగునీరు.. ప్రతి ఇంటికి వందశాతం తాగునీరు అందించడమే మిషన్ భగీరథ లక్ష్యమని.. అందుకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ తేజస్ పవార్ కోరారు. ఎక్కడైనా సమస్య తలెత్తి ఒకరోజు సరఫరాలో అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నాయ మార్గాల్లో అందించాలని, నీటి ఇబ్బందులు ఉండవనే భరోసా ప్రజలకు కల్పించాలని అధికారులకు సూచించారు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈసీ చెన్నారెడ్డి, మిషన్ భగీరథ ఎస్ఈ జగన్మోహన్, ఈఈ మేఘారెడ్డి, జెడ్పీ సీఈవో యాదయ్య, డీఆర్డీఓ నాగేంద్ర, మిషన్ భగీరథ ఏఈలు, అధికారులు ఉన్నారు. తాగునీటి సరఫరాపై అపోహలొద్దు.. వీపనగండ్ల: వేసవిలో తాగునీటి సరఫరాపై జిల్లా ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావద్దని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా అన్నారు. సోమవారం 50 గ్రామాలకు తాగునీరు అందిస్తున్న గోపల్దిన్నె రిజర్వాయర్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రిజర్వాయర్కు అనుసంధానంగా ఉన్న రామన్పాడు జలాశయంలో కూడా వేసవికి సరిపడా నీటి నిల్వ ఉందన్నారు. గద్వాల, వనపర్తి జిల్లా ప్రజలకు పైపుల ద్వారా అందుతున్న నీటి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు ఏర్పడినా వెంటనే మరమ్మతులు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. జిల్లా, గ్రామస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉన్నారని.. తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గంటగంటకు సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆయన వెంట కలెక్టర్ తేజస్ పవార్, అదనపు కలెక్టర్ సంచిత్గంగ్వార్, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్రెడ్డి, సి.చెన్నారెడ్డి, ఎస్ఈ జగన్మోహన్, ఈఈ మేఘారెడ్డి, జెడ్పీ సీఈఓ యాదయ్య, ఇన్చార్జ్ డీఆర్డీఓ నాగేంద్ర, జూరాల డీఈ భవాని, తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా -
అంతా మీ చేతుల్లోనే..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/నారాయణపేట: ‘కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. అందరూ ఏకమయ్యారు. ఎమ్మెల్యే ఎన్నికల కంటే కష్టపడాలి. లోక్సభ ఎన్నికలు జరిగిన మరుక్షణం స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. మీరు ఊళ్లలో పట్టు సడలిస్తే.. రేపు ఎవరో ఒకరు మోపు అయి వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీలుగా వస్తారు. అప్పు మీకు తలనొప్పి.. ఖర్చు మోపైడెతది. ఎంపీ ఎన్నికలు అయిన వెంటనే స్థానిక ఎన్నికలు పెట్టి.. మిమ్మల్ని గెలిపించుకుంటాం. పార్టీ కోసం పని చేసే వారిని గుర్తు పెట్టుకుంటాం. మీ త్యాగాలు గుర్తుపెట్టుకుని అవకాశాలు కల్పించడమే కాదు.. గెలిపించుకుని తీరుతాం. మీ శ్రమ ఉరికే పోదు.’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపారు. నారాయణపేట జిల్లా వేదికగా సోమవారం ఆయన పార్లమెంట్ ఎన్నికల ప్రచార శంఖారావం పూరించారు. ఈ మేరకు క్రీడా మైదానంలో నిర్వహించిన జనజాతర సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసి పేదలను ఆదుకునే బాధ్యతను మీ చేతుల్లోనే పెడతామని.. నాగర్కర్నూల్, మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానాలు గెలవాలని పిలుపునిచ్చారు. ‘నా పాలమూరులో తప్పు జరిగితే జాతీయ స్థాయిలో చెప్పుకునే పరిస్థితే ఉండదు.. మీరు అండగా ఉండి ఆశీర్వదిస్తే 14 అసెంబ్లీ స్థానాల్లో 12 గెలిచాం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామన్నారు. ‘నేను మీ బిడ్డను.. మీరు పెట్టిన చెట్టు వృక్షమైంది.. దాన్ని నరికేందుకు ఢిల్లీ నుంచి ఒకరు, ఫామ్ హౌస్ నుంచి ఒకరు వస్తున్నారు. అంతా మీ చేతుల్లోనే ఉంది. మహబూబ్నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలి’ అని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి నారాయణపేట జనజాతర సభలోముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విపక్షాలపై ఫైర్.. సెంటిమెంట్ అస్త్రం -
కాంగ్రెస్ సర్కార్ను నిద్రలేపేందుకే జలదీక్ష
● పంటలు ఎండుతుంటే సీఎం, మంత్రులు క్రికెట్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.. ● జలదీక్షలో మాజీ మంత్రి హరీశ్రావు గద్వాల రూరల్: నడిగడ్డ ప్రాంత ప్రజల గొంతు తడపడానికి, ఎన్నికల సమయంలో మోసపూరిత హామీలిచ్చి నాలుగు నెలలైనా వాటి ఊసు మర్చిపోయి మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ సర్కార్ను నిద్రలేపడానికి జలదీక్ష చేస్తున్నట్లు మాజీ మంత్రి తన్నీర్ హరీశ్రావు ధ్వజమెత్తారు. సోమవారం గద్వాలలో ఎమెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తలపెట్టిన ఒకరోజు జలదీక్ష కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన హరీశ్రావు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఒక్కరోజు కూడా సాగునీరు, తాగునీటికి ఇబ్బందులు తలెత్తలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే నీటి కరువు వచ్చిందని, ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, సర్కారు దవాఖానాలో మందులు లేవని, కేసీఆర్ కిట్లు లేవని మండిపడ్డారు. పంటలు ఎండిపోయి రైతులు విలవిల్లాడుతుంటే మరోవైపు మంత్రులు, ముఖ్యమంత్రి క్రికెట్ మ్యాచ్లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకనవుతా.. నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ తనకు ఓటేసి గెలిపిస్తే పార్లమెంటులో రైతులు, కూలీలు, అన్ని వర్గాల ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకనవుతానని అన్నారు. బీజేపీ పార్టీకి ఓటేస్తే రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందన్నారు. రైతుల పంటలు ఎండుతుంటే నేరుగా వెళ్లి వారికి న్యాయం చేయాలంటూ గొంతెత్తిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో గద్వాల ప్రజలు తెలివైన వారని, తమకోసం నిలబడే బండ్ల కృష్ణమోహన్రెడ్డి లాంటి నాయకుడిని గెలిపించుకున్నారని అన్నారు. నిత్యం ప్రజల కోసం కష్టపడుతూ ప్రజాసమస్యలపై పోరాటం చేసే నాయకుడు అని, ఇప్పుడు నీటిసమస్య వస్తే జలదీక్ష చేసి కాంగ్రెస్ సర్కారు మెడలు వంచి నీళ్లను తీసుకొచ్చేలా కృషి చేస్తున్నారన్నారు. గొంతెండుతున్నా పట్టించుకోరా.. ఎన్నికల సమయంలో కర్ణాటక నుంచి నాయకులు వచ్చి ఇక్కడ డబ్బులు పంచి కృష్ణమోహన్రెడ్డిని ఓడించాలని చూసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ప్రజల గొంతెండుతుంటే ఎందుకు వారితో మాట్లాడి నీరు ఇప్పించలేకపోతున్నార ని హరీశ్రావు ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలపై సీఎం రేవంత్రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ఎద్దేవా చేశారు. హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్.ప్రవీణ్కుమార్కు ఓటు వేయాలని అన్నారు. అలాగే, రైతులకు గొడ్డలి పెట్టు వంటి నల్లచట్టాలు తీసుకొచ్చిన ఘనత బీజేపీకే దక్కుతుందని, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా అన్యాయం చేసింది ఆ పార్టీయేనని, ఇప్పుడు ప్రజలను ఓట్లు ఎలా అడుగుతారన్నారు. తనతోపాటు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి ప్రా జెక్టుల వద్ద నిద్రపోయి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టులను పూర్తిచేయించామని, ఉమ్మడి పాలమూరు జిల్లాలో 6.50లక్షల ఎకరాలకు సాగునీటిని అందించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందున్నారు. రాజకీయాలు పక్కన పెట్టి ఆదుకోవాలి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాలు పక్కనపెట్టి నడిగడ్డ ప్రజల గొంతును తడిపేలా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి నారాయణపూర్ డ్యాం నుంచి 5టీఎంసీల నీటిని తీసుకురావాలని డిమాండ్ చేశారు. అందుకే తాను జలదీక్ష చేపట్టినట్లు తెలిపారు. అనంతరం మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు.. దీక్ష చేపట్టి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. కార్యక్రమంలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, గడ్డం కృష్ణారెడ్డి, నాగర్దొడ్డి వెంకట్రాములు, అభిలాష్రావ్, ప్రతాప్గౌడ్, నాగిరెడి పాల్గొన్నారు. -
రేపు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు
వనపర్తి: స్థానిక డా. బాలకిష్టయ్య క్రీడా ప్రాంగణంలో బుధవారం జిల్లాస్థాయి మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం అధ్యక్షుడు వాకిటి శ్రీధర్, ప్రధానకార్యదర్శి బి.నర్సింహ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28న సూర్యాపేటలో జరిగే తెలంగాణ అంతర్రాష్ట్ర పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు. రామన్పాడుకు జూరాల నీరు నిలిపివేత మదనాపురం: రామన్పాడు జలాశయంలో నీటి మట్టం తగ్గుతుంది. సోమవారం 1,011 అడుగులకు చేరింది. జూరాల ఎడమ, సమాంతర కాల్వ ద్వారా వచ్చే నీటిని నిలిపివేశారు. తాగునీటి అవసరాల కోసం 20 క్కూసెక్కులు నీటిని వినియోగిస్తున్నామని ఏఈ సింగిరెడ్డి రనీల్రెడ్డి తెలిపారు. ప్రాంతీయ పార్టీలతోనే దేశాభివృద్ధి కొత్తకోట రూరల్: ప్రాంతీయ పార్టీలతోనే దేశాభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి ఎస్.నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం కొత్తకోటలోని ఓ ప్రైవేట్ గార్డెన్స్లో నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశానికి ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, రాజేందర్రెడ్డి, అంజయ్యయాదవ్, పార్టీ పాలమూరు ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో జరిగే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్పార్టీ మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు వస్తోందని.. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని ప్రజలకు తెలిసేలా వివరించాలన్నారు. సాగునీరు అందక పంటలు ఎండుతుంటే ఏ మంత్రి వెళ్లి పరిశీలించిన దాఖలాలు లేవని.. ఐపీఎస్ మ్యాచ్ చూడటంపై ఉన్న శ్రద్ధ ప్రజాపాలనపై లేదని ఆరోపించారు. గడిచిన పదేళ్లలో మోదీ నాయకత్వంలో దేశ ప్రజలకు చేసిన అభివృద్ధి ఎంతో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. మోదీ మాటలకే గ్యారంటీ లేదని.. డీకే అరుణ మాటలు ఎవరు నమ్ముతారన్నారు. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే దేశం నాశనమవుతుందని, యువత, మేధావి వర్గం దేశాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ పార్టీలకు ఓటు వేస్తేనే దేశానికి శ్రీరామరక్ష అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ వామన్గౌడ్, ఎంపీపీ గుంత మౌనిక, మున్సిపల్ చైర్పర్సన్ పి.సుఖేశిని, వైస్ చైర్మన్ బీసం జయమ్మ, చెన్నకేశవరెడ్డి, విశ్వేశ్వర్, గాడీల ప్రశాంత్, చీర్ల నాగన్నసాగర్, అయ్యన్న, సుభాష్, కౌన్సిలర్లు, కో–ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. పీయూలో క్యాంపస్ రిక్రూట్మెంట్ మహబూబ్నగర్ ఎడ్యకేషన్: పాలమూరు యూనివర్సిటీలో సోమవారం క్యాంపస్ రిక్రూట్మెంట్ కార్యక్రమాన్ని దివాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి వివిధ గ్రూప్లకు సంబంధించి 65 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రిన్సిపాల్ చంద్రకిరణ్, దివిస్ ల్యాబ్స్ హెచ్ఆర్ హరికృష్ణ, ప్లేస్మెంట్ ఆఫీసర్ అర్జున్కుమార్ పాల్గొన్నారు. -
తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు
మదనాపురం/ఆత్మకూర్: ఈ వేసవిలో ఎట్టి పరస్థితుల్లో తాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తేజస్ నందలాల పవార్ తెలియజేశారు. ఆదివారం మండలంలోని రామన్పాడు రిజర్వాయర్(ఇన్టెక్ వెల్), రిజర్వాయర్లో నీటి నిల్వలను కలెక్టర్ పరిశీలించారు. రామన్పాడు రిజర్వాయర్లో నీటి మట్టం ఎంత ఉంది, ఇంకా ఎన్ని రోజులకు సరిపడా నీరు ఉంది, తదితర అంశాలపై మిషన్ భగీరథ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రానీయకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. రానున్న రోజుల్లో ప్రజల తాగునీటి అవసరాలకు తగ్గట్టు తాగునీటి సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా బోర్లు, పంపు సెట్ల మరమ్మతులు సైతం పూర్తయ్యాయని, తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో మిషన్భగీరథ ఎస్.ఈ జగన్ మోహన్, ఈ.ఈ మేఘారెడ్డి, ఏఈ రామకష్ణ, ఇతర అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు. కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
Pagination
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
GHMCలో వెలుగు చూసిన భారీ స్కామ్
విడుదలకు ముందే రికార్డులు.. రాజమౌళి సినిమాను దాటేసిన కల్కి!
రూ. 250 కోట్ల ఖర్చు.. బౌలర్ల స్వర్గాధామం! కూల్చివేతకు బుల్డోజర్లు సిద్ధం (ఫొటోలు)
T20 World Cup 2024: పూర్వ వైభవం దిశగా వెస్టిండీస్
గీసుకునే బొమ్మలివి! ఇదే నా ప్రేయసి, ఆస్తి..!
బీవోబీ-మైక్రోసాఫ్ట్ జెన్ఏఐ హ్యాకథాన్.. రూ.లక్షల్లో ప్రైజ్మనీ
టీపీసీసీ కొత్త బాస్ ఎవరు?.. హైకమాండ్ నిర్ణయం ఏంటి?
భారీగా పెరిగిన వింబుల్డన్ గ్రాండ్స్లామ్ ఫ్రైజ్మనీ.. ఎన్ని కోట్లంటే?
T20 World Cup 2024: ఇరగదీస్తున్న సిరాజ్ మియా.. వరుసగా రెండు మ్యాచ్ల్లో..!
ముందుగానే వచ్చేస్తున్న దేవర.. ఎప్పుడంటే?
Advertisement