-
సీఐ, ఎస్ఐ వేధిస్తున్నారు.. సూసైడ్ లేఖ రాసి..
సాక్షి, హసన్పర్తి: తెలంగాణలో పోలీసుల వేధింపులే కారణమంటూ సూసైడ్ లేఖ రాసి పెట్టి ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన హన్మకొండ జిల్లాలో కలకలం సృష్టించింది.వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లా హసన్పర్తికి చెందిన ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి సూసైడ్ లేఖ రాసి పెట్టి అదృశ్యమయ్యాడు. ఈ సందర్భంగా ప్రశాంత్ సూసైడ్ లేఖలో.. తన చావుకు సీఐ, ఎస్ఐ కారణమని తెలిపాడు. సీఐ తన సెల్ఫోన్, వాచీ లాక్కుకొని తనను తీవ్రంగా కొట్టారని ప్రశాంత్ ఆరోపించారు. పోలీసులు సమస్యను పరిష్కరించకపోగా తీవ్రంగా కొట్టడంతో దెబ్బలు భరించలేక సూసైడ్ నోట్ రాసి అదృశ్యమయ్యాడు. అలాగే, తన దగ్గర అప్పు తీసుకున్న వారు తిరిగి ఇవ్వమంటే వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన చావుకు సీఐ, ఎస్ఐ కారణమంటూ.. సూసైడ్ నోట్ రాసి అదృశ్యమైన వ్యక్తిహన్మకొండ - పోలీసుల దెబ్బలు భరించలేక సూసైడ్ నోట్ రాసి, తన చావుకు హసన్ పర్తి సీఐ, ఎస్ఐ కారణమని అదృశ్యమైన వ్యక్తి.తన దగ్గర అప్పు తీసుకున్నవారు వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయిస్తే.. వారు తనను కొట్టారని ఆరోపణ. తన… pic.twitter.com/WFHGs1Qkea— Telugu Scribe (@TeluguScribe) May 1, 2024 Video Credit: Telugu Scribeఈ నేపథ్యంలో తన భర్తను కాపాడాలని హసన్పర్తి పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితుడి భార్య శ్యామల హన్మకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. పోలీసుల కారణంగా అవమాన భారంతో తన భర్త ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడని ఆమె తెలిపారు. ఇక, ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
బీఆర్ఎస్తోనే రక్ష! : మాజీ సీఎం కేసీఆర్
సాక్షి, వరంగల్: ‘‘ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టుగా బీజేపీకి 400 సీట్లు కాదు.. కనీసం 200 సీట్లు దాటేలా లేవు. మనకు ఇదే మంచి సమయం. తెలంగాణలో లోక్సభ సీట్లన్నీ గెలిస్తే.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పేగులు తెగేదాకా కొట్లాడుతాం. కేంద్రంలో హంగ్ వస్తే కీలకపాత్ర పోషించే అవకాశం ఈ రోజు తెలంగాణకు ఉంది..’’ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మన గోదావరి నీళ్లను ఎత్తుకుపోతామన్న బీజేపీకి.. హామీలిచ్చి అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్కు ఓటేస్తే ప్రయోజనం ఉండదన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర ఆదివారం హనుమకొండకు చేరుకుంది. పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్ నుంచి హనుమకొండ చౌరస్తా వరకు కేసీఆర్ రోడ్డు షో నిర్వహించారు. కూడలి వద్ద ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘గోదావరి నదిని తీసుకొని పోతా అంటూ ఓట్లు పడే టైంలో నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్ పంపించాడు. ప్రాణం పోయినా ఇవ్వబోమని రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ పెట్టాలి. నేనున్నప్పుడు అదే పంచాయతీ పెట్టిన. ఆయనేమో ఎత్తుకుపోతా అంటరు. ఈ చేతకాని రేవంత్రెడ్డి ప్రభుత్వం నోరు మూసుకొని పడి ఉంది. అందులో ఏం మతలబు దాగి ఉంది. ఎవరూ కాపాడాలి? దయచేసి మన గోదావరిని, కృష్ణాను కాపాడుకోవాలన్నా.. తెలంగాణకు రావాల్సిన నిధులు రాబట్టుకోవాలన్నా.. మన ప్రాజెక్టులకు జాతీయ హోదా రావాలన్నా.. నిరుద్యోగ సమస్య తీరాలన్నా.. మన బతుకులు బాగు పడాలన్నా.. కచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులే గెలవాలి. అదే తెలంగాణకు క్షేమం. దయచేసి ఆలోచన చేయాలి. లంచాల కోసమే కాంగ్రెస్ పర్మిషన్లు ఆపింది తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రమంతా భూముల ధరలు బ్రహ్మాండంగా పెరిగాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగింది. కానీ ఇప్పుడు డౌన్ అయింది. దాని మీద బతికే వేల మంది రోడ్ల మీద పడ్డారు. రాష్ట్రంలో హైదరాబాద్తోపాటు పెద్ద పట్టణాల్లో ఐదు నెలలుగా బిల్డింగ్ పర్మిషన్లు ఇస్తలేరు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఎస్ బీపాస్ తెచ్చి.. అప్లికేషన్ పెడితే 21 రోజుల్లో ఆటోమేటిగ్గా పర్మిషన్లు ఇచ్చేయాలని చట్టం చేసినం. ఇప్పుడున్న సీఎం, వారి మంత్రివర్గం ఆ చట్టాన్ని ఉల్లంఘించి పర్మిషన్లు ఇవ్వడం లేదు. ఎందుకో తెలుసా. ఎవరైనా బిల్డింగ్లు కడితే చదరపు మీటర్కు ఇంత అని కాంగ్రెస్కు లంచం ఇవ్వాలట. దానికోసం మొత్తం రాష్ట్ర ప్రగతిని, అభివృద్ధిని ఆపేశారు. అంతేకాదు పూర్తయిన భవనాలకు కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. ఈ బండారమంతా బయటపెడతాం. త్వరలోనే దీనిపై పార్టీ కార్యాచరణతో ముందుకు వెళ్తుంది. ఒక్క హామీ కూడా అమలు చేయలేదు ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెలియదు. భూగోళం తెలియదు. మొన్న ఎక్కడనో మాట్లాడుతూ కృష్ణానది కూడా నేనే కట్టిన అంటడు. ప్రపంచంలో ఎవరైనా నది కడతారా? ‘ఏరి కోరి మొగుడిని తెచ్చుకుంటే ఎగిరి ఎగిరి తన్నిండంట’ అన్నట్టు ఉన్నది. అడ్డగోలు హామీలు చూసి ఓట్లేస్తే.. నాలుగైదు నెలల్లోనే ఆగమాగం చేసేశారు. తెలంగాణకు ఏమైందో అర్థం కావడం లేదు. కరెంట్ ఎక్కడికి పోయింది? సాగునీళ్లు ఏవి? పంటలు ఎందుకు ఎండుతున్నాయి? మంచి నీళ్ల కరువు ఎందుకు వస్తోంది? కాంగ్రెస్ సర్కారు ఒక్క హామీ కూడా సరిగా అమలు చేయలేదు. కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామన్నారు. ఏమైంది? రైతుబంధు అందరికీ రాలేదు. ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామన్నారు. డిసెంబర్ 9 నాడే రూ.2 లక్షల రుణమాఫీ అన్నారు. ఏదీ కాలేదు.అచ్ఛేదిన్ కాదు.. సచ్చేదిన్..బీజేపీ చాలా ప్రమాదకరమైన పార్టీ. దానికి ఎంతసేపూ పంచాయతీలు పెట్టించడం, విద్వేషం నింపడమే. ఆ పార్టీ ఎజెండాలో ప్రజల కష్టసుఖాలు ఉండవు. దయచేసి యువతను కోరుతున్నా.. ఆవేశం కాదు.. ఆలోచన చేయాలి. ఈ దేశం మీది. ఈ రాష్ట్రం మీది. రేపటి భవిష్యత్ మీది. ప్రధాని మోదీ భేటీ బచావో, భేటీ పడావో, జన్ ధన్ యోజన వంద నినాదాలు చెప్పారు. విదేశాల నుంచి నల్లధనమంతా తెచ్చి ఇంటికి రూ.15 లక్షల చొప్పున ఇస్తానన్నారు. ఎవరికైనా కనీసం ఐదు రూపాయలన్నా వచ్చాయా? అచ్ఛే దిన్ అచ్ఛే దిన్ అన్నారు.. అది రాలేదు కానీ సచ్చేదిన్ వచ్చింది. ధరలు విపరీతంగా పెరిగాయి. రూపాయి విలువ పడిపోయింది. కేంద్రంలో 18 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఒక్క ఖాళీ కూడా నింపలేదు. విభజన చట్టంలో కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని ఉంటే.. మోదీ దానిని గుజరాత్కు ఎత్తుకెళ్లారు. అలాంటి బీజేపీకి ఎందుకు ఓటేయాలి?’’ అని కేసీఆర్ ప్రశ్నించారు. -
వరంగల్: బైక్పై నలుగురు.. ప్రమాదంలో అక్కడికక్కడే మృతి
సాక్షి, వరంగల్: నలుగురు యువకుల ప్రాణాలను బస్సు రూపంలో మృత్యువు కబలించింది. నిర్లక్ష్యపు ప్రయాణానికి నాలుగు ప్రాణాలు గాల్లో కలిసాయి. వరంగల్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకున్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ హృదయ విదారకఘటన వర్ధన్నపేట మండలం ఇల్లంద శివారు వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై జరిగింది.వర్ధన్నపేట నుండి వరంగల్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సును ఇల్లందు నుంచి వర్ధన్నపేట వైపు వస్తున్న ద్విచక్రవాహనం పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా. మరో యువకుడు వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతులు వరుణ్ తేజ(18), సిద్దు(18),గణేష్(18), రనిల్ కుమార్(18) లుగా పోలీసులు గుర్తించారు.నలుగురు యువకులు స్నేహితులు, ప్రమాద సమయంలో ఒక్క ద్విచక్ర వాహనంపై నలుగురు యువకులు ప్రయాణించారు. మృతులు వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందినవారు కాగా యువకుల మృతితో వారి కుటుంబ సభ్యుల రోదన వర్ణనాతీతంగా మారగా ఇల్లంద గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు. -
కాళేశ్వరంపై చర్చకు రా! కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్
సాక్షి ప్రతినిధి, వరంగల్/ రాంగోపాల్పేట్: మాజీ సీఎం కేసీఆర్కు దమ్మూ, ధైర్యముంటే కాళేశ్వరంపై బహిరంగ చర్చకు రావాలని టీపీసీసీ చీఫ్, సీఎం ఎనుముల రేవంత్రెడ్డి సవాల్ చేశారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాని కేసీఆర్.. గంటల కొద్దీ టీవీ స్టూడియోలో కూర్చుని కాళేశ్వరంపై మాట్లాడారని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ ఓట్ల రాజకీయాలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని ఆరోపించారు. కేసీఆర్, మోదీ తోడు దొంగలని.. వారికి లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. చచ్చిన పాములా మారిన బీఆర్ఎస్కు ఈ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం హనుమకొండ జిల్లా మడికొండలో నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభలో, అంతకుముందు సికింద్రాబాద్లోని ప్యాట్నీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో రేవంత్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కేసీఆర్ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాలేదు. అడిగేటోళ్లు, చూపించేటోళ్లు నీవోళ్లే.. గంటల కొద్దీ టీవీ స్టుడియోలో కూర్చుని మాట్లాడావ్. మేధస్సు కరిగించి కాళేశ్వరం కట్టినమంటున్నవ్ కదా.. మరి మేడిగడ్డ మేడిపండు ఎందుకైంది. సూటిగా సవాల్ విసురుతున్నా.. మేడిగడ్డ వద్దే మేధావులతో చర్చిద్దాం.. కేసీఆర్.. దమ్ముంటే చర్చకు రావాలి. గత పదేళ్లలో దోపిడీ కోసం మెదడు రంగరించారు కనుకనే కాళేశ్వరం కూలిపోయింది. లక్ష కోట్లు ఖర్చుపెట్టిన ప్రాజెక్టు ఏడాదన్నా లేకపాయే.. ఇంకా ఏం మాట్లాడుతున్నారు. ఇంతకంటే దివాళాకోరు తీరు ఎక్కడా ఉండదు. కాంగ్రెస్ హయాంలో దశాబ్దాల కింద కట్టిన నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ, దేవాదుల, శ్రీశైలం, భీమా, నెట్టెంపాడు.. ఇలా ఎన్నో ప్రాజెక్టులు చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఆ ఇద్దరూ తోడు దొంగలు ప్రధాని మోదీ, కేసీఆర్ తోడు దొంగలు. ఒక నాణేనికి బొమ్మ బొరుసులాంటి వాళ్లు. వారి చీకటి ఒప్పందాలు, ముసుగు రాజకీయాలతో దేశాన్ని మోదీ, రాష్ట్రాన్ని కేసీఆర్ భ్రష్టు పట్టించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్కు బుద్ధి చెప్పిన ప్రజలు.. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి, మోదీకి గుణపాఠం చెప్పాలి. వారి కుట్రలను భగ్నం చేయాలి. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధాని మోదీ.. పదేళ్లలో ఇచ్చింది 7 లక్షల ఉద్యోగాలు. ఏమైనా పొంతన ఉందా? మోదీ ప్రజల సంక్షేమాన్ని విస్మరించి అదానీ, అంబానీలకు దోచిపెట్టారు. బీజేపీ నల్ల చట్టాలతో అంబానీ, అదానీలకు వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టే కుట్ర చేసింది. ఢిల్లీ సరిహద్దుల్లో హరియాణా, పంజాబ్ రైతులు చేసిన ఉద్యమంతో ప్రధాని మోదీ దిగివచ్చి క్షమాణలు చెప్పిన విషయాన్ని మర్చిపోగలమా? బీజేపీ ప్రజా సంక్షేమాన్ని వదిలేసి మత రాజకీయాలకు పాల్పడుతోంది. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెలో ఉండాలి. అంతే తప్ప రాజకీయం చేయొద్దు. ఓరుగల్లులో విజయం ప్రజాపాలనకు నాంది అసెంబ్లీ ఎన్నికలకు ముందు నేను చేపట్టిన పాదయాత్ర సందర్భంగా.. తెలంగాణను పట్టిపీడిస్తున్న కేసీఆర్ పాలన నుంచి విముక్తి కోరాను. ఆ పిలుపు మేరకు ఇక్కడి 12 అసెంబ్లీ స్థానాల్లో 10 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ఓరుగల్లు ప్రజలు ప్రజాపాలనకు పునాదులు వేశారు. ఎర్రబెల్లి దయాకర్రావు వంటి చీడపురుగును ఓడించిన యశస్విని, ఝాన్సీరెడ్డి ప్రజల మదిలో నిలిచారు. ఓరుగల్లు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు... ఐటీ విస్తరణతోపాటు హైదరాబాద్– వరంగల్– రామగుండం ఇండ్రస్టియల్ కారిడార్తో యువతకు ఉపాధి కల్పిస్తాం.వానాకాలం వస్తే నీళ్ల నిలిచిపోయి, మురికి కంపు కొట్టే గోసను రూపుమాపుతాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తాం. హైదరాబాద్ మాదిరి ఔటర్ రింగురోడ్డు నిర్మించి.. విమానాలు సరాసరిగా దించగలిగేలా మహర్ధçశ కల్పిస్తాం’’ అని సీఎం రేవంత్ చెప్పారు. వరంగల్ సభలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రోహిత్ చౌదరి, మంత్రులు శ్రీధర్బాబు, కొండా సురేఖ, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, మామిడాల యశస్వినిరెడ్డి, వరంగల్ అభ్యర్థి కడియం కావ్య తదితరులు పాల్గొన్నారు. హరీశ్.. రాజీనామా పత్రం జేబులో పెట్టుకో.. ‘‘బీఆర్ఎస్ నేత హరీశ్రావు ఒక మాట అన్నడు.. రైతు రుణమాఫీ చేసి చూపిస్తే రాజీనామా చేస్తానని అన్నడు. నేను ఈ వేదిక మీది నుంచి మాట ఇస్తున్నా.. రామప్ప శివుని సాక్షిగా, సమ్మక్క–సారలమ్మ సాక్షిగా, వేయి స్తంభాల గుడి సాక్షిగా చెప్తున్నా.. సూర్యుడు పడమరన ఉదయించినా, భూమి ఆకాశం తిరగబడ్డా, తుపాను వచ్చినా, భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా సరే.. పంద్రాగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతా.. హరీశ్రావు.. సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నావుకదా.. రాజీనామా పత్రం జేబులో పెట్టుకో.. పంద్రాగస్టు నాడు నీతో మాట్లాడుతా.. మాటమీద ఉండాలె.. మీ మామలా దళితుడిని సీఎం చేస్తా, లేకుంటే తలకాయ నరుక్కుంటానని తలకాయ లేని మాటలు మాట్లాడుదామని అనుకుంటున్నవేమో! ఆనాడు వంద రూపాయల పెట్రోల్ తెచ్చుకున్నవ్.. పది పైసల అగ్గిపెట్టె దొరకలే.. ఇప్పుడట్లనే అనుకుంటున్నవేమో.. రుణమాఫీ చేసి పంద్రాగస్టు నాడు నీ ఆఖరి శాసనసభ సభ్యత్వం సంగతి తేలుస్తా..’’ కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి ‘‘గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే హైదరాబాద్ నగరం అభివృద్ధి జరిగింది. 2004, 2009లో వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే కృష్ణా, గోదావరి జలాలతో హైదరాబాద్ దాహార్తిని తీర్చింది. ఔటర్ రింగ్రోడ్డు, ఎయిర్పోర్టు, మెట్రో రైలు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలను తీసుకువచ్చింది. సికింద్రాబాద్లో దానం నాగేందర్ను ఎంపీ గెలిపిస్తే కేంద్రంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తారు. ఓటేసే బాధ్యత మీదైతే కీలక స్థానం కల్పించే బాధ్యత నాది. హైదరాబాద్లో మత సామరస్యాన్ని కాపాడింది కాంగ్రెస్ పార్టీయే. కానీ మోదీ దేవుళ్ల పేరు చెప్తూ, దేవుళ్లను రోడ్డు మీదకు తెస్తూ ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారు.సికింద్రాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించిన దత్తాత్రేయ, కిషన్రెడ్డిలు కేంద్ర మంత్రులుగా ఉన్నా.. ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదు. 2021లో నగరాన్ని వరదలు ముంచెత్తితే.. కిషన్రెడ్డి హోం శాఖ సహాయ మంత్రిగా డిజాస్టర్ మేనేజ్మెంట్ తన పరిధిలో ఉన్నా ఒక్క రూపాయి కూడా తీసుకుని రాలేకపోయారు. ప్రధాని మోదీ హైదరాబాద్కు వచ్చే పెట్టుబడులను గుజరాత్కు తరలించుకుపోతుంటే కూడా కిషన్రెడ్డి ఏమి చేయలేకపోయారు...’’ అని రేవంత్ విమర్శించారు. సికింద్రాబాద్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యరి్థగా పోటీచేస్తున్న పద్మారావుగౌడ్ మంచోడేనని.. కానీ వాళ్ల గురువు కేసీఆర్ను నమ్ముకుంటే మాత్రం మునిగినట్లేనని వ్యాఖ్యానించారు. మహంకాళి ఆలయంలో పూజలు.. భారీ ర్యాలీ బుధవారం ఉదయం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో సీఎం రేవంత్రెడ్డి, సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం వద్ద నుంచి ప్యాట్నీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ కార్నర్ మీటింగ్ నిర్వహించిన అనంతరం సీఎం రేవంత్ మరో కార్యక్రమానికి వెళ్లిపోగా.. దానం నాగేందర్ ఇతర నేతలతో కలసి నామినేషన్ వేసేందుకు జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్లారు. సీఎం పర్యటన, ర్యాలీ, కార్నర్ మీటింగ్ సందర్భంగా సుమారు 3 గంటల పాటు సికింద్రాబాద్ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయి.. వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. -
ప్రేమాయణంతో బయటపడ్డ నిత్యపెళ్లి కొడుకు వ్యవహారం
సాక్షి, వరంగల్: సుందరయ్య నగర్లో నిత్య పెళ్లి కొడుకు బాగోతం వెలుగులోకి వచ్చింది. ఒకరికి తెలియకుండా మరొకరిని మూడు వివాహాలు చేసుకున్న ఘనుడు.. మరో యువతితో తిరగడంపై మూడో పెళ్లికూతురు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వరంగల్ నగరంలోని సుందరయ్య నగర్కు చెందిన రాజేష్ హైదరాబాద్లో కార్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఫిబ్రవరి 2022న నగరంలోని చార్ బౌలీకి చెందిన సుమన ప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత మే 2022న ఆంధ్రాకు చెందిన శ్రావణి హైదరాబాదులో రెండో పెళ్లి చేసుకున్నాడు. మూడు నెలల అనంతరం సుందరయ్య నగర్కు వచ్చిన రాజేష్ సుందరయ్య నగర్కు చెందిన సారికతో ప్రేమాయణం సాగించి 2024 ఫిబ్రవరిలో తీసుకెళ్లి హైదరాబాద్ ఆర్య సమాజంలో మూడో వివాహం చేసుకున్నాడు. వీరి ముగ్గురిని వేరు వేరు చోట్ల అద్దెకు అద్దెకు ఉంచాడు. రాజేష్ ఇప్పుడు వీరి ముగ్గురిని కాదని కరుణ అనే యువతతో తిరుగుతుండడంతో నిన్న సుందరయ్య నగర్కు రావడంతో సారిక తల్లిదండ్రులు రాజేష్తో గొడవకు దిగడంతో వారి కళ్లు తప్పి రాజేష్ పరారయ్యాడు. సారిక తల్లిదండ్రులు డయల్ 100కు కాల్ చేయగా ఇంతే జారిగంజ్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరికి విడాకులు ఇవ్వకుండా తన కూతురిని మూడో పెళ్లి చేసుకున్న రాజేష్పై చర్యలు తీసుకొని తన కూతురి జీవితాన్ని కాపాడాలంటూ సారిక తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సురేశ్ రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు మృతి
కింగ్స్ పోరులో పంజాబ్ చేతిలో చెన్నై చిత్తు
IPL 2024 RR vs SRH: సై అంటే సై అంటున్న కొదమసింహాలు
ఆ మహిళ ఏకంగా 69 మంది పిల్లలకు జన్మనిచ్చిందా?
తగ్గిన యూపీఐ చెల్లింపులు.. ఎంతంటే..
అసభ్య వీడియోల కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు
ఒకసారి ఆ క్లిప్ చూడండి.. చంద్రబాబు ఎంత నీచుడో..!
నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
ఒకసారి ఆ క్లిప్ చూడండి.. చంద్రబాబు ఎంత నీచుడో..!
నా బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్లో వారిద్దరే ఉన్నారు.. ఎన్టీఆర్ లేడు: రాజమౌళి
తప్పక చదవండి
- నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- ఏప్రిల్లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
Advertisement