-
ఎమ్మెల్యే ‘తెల్లం’కు కాంగ్రెస్ కండువా.. స్పందించిన కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీది ద్వంద్వ నీతి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆదివారం(ఏప్రిల్ 7) ఎక్స్లో ఒక పోస్టు చేశారు. ఆదివారం సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న ఫొటోను కేటీఆర్ పోస్టు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ తాజాగా రిలీజ్ చేసిన లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో రాజ్యాంగ పరిరక్షణ అనే చాప్టర్ 13వ పాయింట్ గురించి ప్రస్తావించారు. ఎమ్మెల్యే లు, ఎంపీలు ఒక పార్టీ లో గెలిచి ఇంకో పార్టేకి వెళితే ఆటోమెటిక్గా అనర్హతకు గురయ్యేలా చట్ట సవరణ చేస్తాం అని మేనిఫెస్టోలో చెబుతున్న కాంగ్రెస్ తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి ఏకంగా ఎంపీ టికెట్ కేటాయించిందని మండిపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కండుడవా కప్పి మరీ చేర్చుకుంటున్నారన్నారు. గెలిచేంత వరకు ఒక మాట ... గెలిచాక ఇంకో మాట. ఇదే కాంగ్రెస్ రీతి .. నీతి. బీజేపీకి కాంగ్రెస్కు తేడా ఏంటి. మేనిఫెస్టోలు అమలు చేసే ఉద్దేశం లేనపుడు ఎందుకీ నాటకాలు రాహుల్గాంధీ అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇదీ చదవండి.. బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే -
దానం నాగేందర్ను గెలిపించడమే మా బాధ్యత: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్సభ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ పార్టీదేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ది కుటుంబ పాలన అని అన్నారు. ఇదే సమయంలో కేంద్రమంత్రిగా ఉండి సికింద్రాబాద్కు కిషన్ రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. సికింద్రాబాద్ ఎంపీగా దానం నాగేందర్ను గెలిపించడమే మా బాధ్యత అని వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాటపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ..‘సభకు 10 లక్షల మందిని తరలిస్తాం. ఏప్రిల్ ఎనిమిదో తేదీన నాంపల్లిలో ఫిరోజ్ఖాన్ ఆధ్వర్యంలో మరోసారి మీటింగ్ ఉంటుంది. బూత్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. భువనగిరి, నల్లగొండలో ఖచ్చితంగా గెలుస్తాం. సికింద్రాబాద్లో కూడా దానం నాగేందర్ను గెలిపిస్తాం. దానం గెలుపు బాధ్యత మాదే. తెలంగాణలో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా ఈసారి గెలిచాం. బీఆర్ఎస్ పార్టీది కుటుంబ పాలన. మాజీ మంత్రి హరీష్రావు మాటలకు అర్ధం లేదు. కేసీఆర్ చేసిన పాపాలకు వర్షాలు కూడా పడటం లేదు. కేసీఆర్ కేబుల్ బ్రిడ్జ్ వేసి హైదరాబాద్ అభివృద్ధి అంటున్నాడు. 40వేల కోట్లతో మూసి ప్రాజెక్ట్ను ప్రక్షాళన చేసి అభివృద్ధి చేస్తాం. కేంద్రమంత్రిగా ఉండి కిషన్రెడ్డి సికింద్రాబాద్ను పట్టించుకోలేదు. ఎలాంటి అభివృద్ధి చేయలేదు. కిషన్ రెడ్డి మతాల మధ్య గొడవలు పెట్టి గెలవాలని చూస్తున్నాడు. అది సాధ్యం కాదు. కాంగ్రెస్ కచ్చితంగా 14 సీట్లు గెలుస్తుంది’ అని కామెంట్స్ చేశారు. ఇక, దానం నాగేందర్ మాట్లాడుతూ..‘సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి కోమటిరెడ్డి ఇన్ఛార్జ్గా ఉన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. రాబోయే ఎన్నికల్లో నేను గెలవడానికి అందరి సహకారం కావాలి. తుక్కుగూడ సభ విజయవంతం చేయడానికి సమావేశమయ్యాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
రాజీనామాయే ప్ర‘దానం’!
రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ తో బీఆర్ఎస్ కీలక నేతలు పార్టీని వీడుతుండటం కలకలం రేపుతోంది. దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే సికింద్రాబాద్ ఎంపీగా పోటీకి దింపుతామని కాంగ్రెస్ అధిష్టానం తేల్చినట్టు వచ్చిన వార్తలు చర్చనీయాంశంగా మారాయి. దీనికితోడు మంత్రి కోమటిరెడ్డి కూడా దానం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఎంపీగా పోటీ చేస్తే ఇబ్బందులు వస్తాయని వ్యాఖ్యానించారు. ఇక వచ్చే నెల 6న తుక్కుగూడలో నిర్వహించే సభ, లోక్సభ మేనిఫెస్టోపై చర్చించేందుకు టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ శుక్రవారం భేటీ అయింది. కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్యను కలిసిన దీపాదాస్ మున్షీ, మల్లురవి, సంపత్ కుమార్ అంతకుముందు గాం«దీభవన్ వేదికగా టీపీసీసీ ప్రచార కమిటీ భేటీ అయింది. ఇక బీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్, ఎంపీ కె.కేశవరావు సీఎం రేవంత్తో భేటీ అయ్యారు. కాంగ్రెస్లో చేరుతానని ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, మల్లు రవి, ఇతర నేతలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాసానికి వెళ్లి కాంగ్రెస్లోకి ఆహ్వనించారు. కె. కేశవరావు కుమార్తె, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్లో చేరనున్నారు. కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కూడా చేరేందుకు రంగం సిద్ధమైంది. నర్సాపూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి కూడా శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిశారు. – సాక్షి, హైదరాబాద్ -
దానం అవుట్.. సికింద్రాబాద్ సీటు మరొకరికి??
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు షాకిచ్చే యోచనలో ఏఐసీసీ ఉన్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇప్పటికే ఆయన పేరును ఆ పార్టీ ప్రకటించింది. అయితే ఆయన తీరుతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఇప్పుడు ఆ టికెట్ మరొకరికి ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే.. ఎంపీ టికెట్ ఉంటుందని దానంకు ఏఐసీసీ ఇదివరకే స్పష్టం చేసింది. దీంతో మూడో జాబితాలో దానం నాగేందర్ పేరును అధికారికంగా ప్రకటించింది కాంగ్రెస్. అయితే ముందు ఓకే చెప్పి తర్వాత ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. ఈలోపు ఆయన ఎన్నికపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు అవుతున్నాయి. కోర్టు సైతం ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఇదంతా పరిగణనలోకి తీసుకున్న ఏఐసీసీ దానంను తప్పించి.. ఆ స్థానంలో మరో అభ్యర్థిని నిలపాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు తెర మీదకు వచ్చింది. ఆయన పేరును ఏఐసీసీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో అధిష్టానం నిర్ణయం ఏంటన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్.. హైకోర్టులో మరో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల వేళ ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు ఎదురుదెబ్బ తగిలే అవకాశముంది. దానం కాంగ్రెస్ చేరడం, సికింద్రబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై రేపు హైకోర్టులో విచారణ జరుగనుంది. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నగరానికి చెందిన రాజు యాదవ్ అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్పై పోటీ చేసి దానం ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలో ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక, కొద్దిరోజుల క్రితమే దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరారు. దీంతో, దానంకు కాంగ్రెస్ ఎంపీ సీటు ఆఫర్ చేసింది. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి దానం బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుంచి పోటీ చేయడం రాజ్యాంగ విరుద్దం, చట్ట విరుద్దమంటూ పిటిషనర్ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా దానం నాగేందర్పై స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే సమయంలో దానంపై అనర్హత వేయాల్సిందిగా కోరారు. కాగా, ఈ పిటిషన్పై రేపు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. దానం నాగేందర్ ఎన్నిక చెల్లదంటూ ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. జస్టిస్ విజయసేన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీనిపై దానం నాగేందర్కు నోటీసులు జారీ చేసింది. అయితే, దానం నాగేందర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని విజయారెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఓటర్లకు డబ్బులు పంచారని, ఈ విషయంలో కేసులు నమోదయ్యాయని కోర్టుకు వివరించారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం దానంకు నోటీసులు జారీ చేసింది. -
కాంగ్రెస్లో చేరిన రంజిత్రెడ్డి, దానం నాగేందర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్సీ సమక్షంలో చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ను దానం నాగేందర్కు కాంగ్రెస్ ఖరారు చేసింది. కాగా, బీఆర్ఎస్ను ఖాళీ చేయడమే టార్గెట్గా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. బీఆర్ఎస్కి చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గుడ్ బై చెప్పారు. ఇటీవల రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు ప్రకాష్ గౌడ్, యాదయ్య కలిశారు. అలాగే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను మల్కాజిగిరి, మేడ్చల్ ఎమ్మెల్యేలు రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి ఇటీవల కలిసిన సంగతి తెలిసిందే. చేవెళ్ల పార్లమెంట్ నుంచి రంజిత్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి పట్నం సునీతా రెడ్డిని బరిలో దింపాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు సమాచారం -
కాంగ్రెస్లోకి దానం, పసునూరి!
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే, మరో సిట్టింగ్ ఎంపీ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమయ్యింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో భేటీ అయ్యారు. దానం నాగేందర్ జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ఆయన్ను కలిశారు. అరగంట సేపు జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు మన్సూర్ అలీఖాన్, విష్ణునాథ్, రోహిత్చౌదరి, ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రోహిణ్రెడ్డి పాల్గొన్నారు. రెండు మూడురోజుల్లో మంచి ముహూర్తం చూసుకుని కాంగ్రెస్లో చేరనున్నట్లు ఈ సందర్భంగా నాగేందర్ తెలిపారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దానం రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. ఇక పసునూరి దయాకర్ సచివాలయంలో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే రాజ్ఠాకూర్, పాలకుర్తి కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీరెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. కాగా ఇద్దరు నేతలు ఈనెల 18న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిసింది. దానం నాగేందర్ను సికింద్రాబాద్ ఎంపీగా బరిలో నిలిపే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉందని గాందీభవన్ వర్గాలంటున్నాయి. మరోవైపు పీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఎంఅర్జీ వినోద్రెడ్డి శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తనకు సికింద్రాబాద్ నుంచి పోటీచేసే అవకాశం కల్పించాలని ఆయన కోరినట్లు సమాచారం. -
వైఎస్సార్ హయాంలోనే కాంగ్రెస్ హవా
హైదరాబాద్: రాష్ట్రంలో అనుకూల పవనాలతో అధికారం ‘హస్త’గతమైనప్పటికీ రాజధాని హైదరాబాద్ మాత్రం కాంగ్రెస్ను దూరం పెట్టింది. దశాబ్ద కాలంగా ఈ పార్టీకి ఇక్కడ ఆదరణ లభించడం లేదు. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన మూడో ఎన్నికలోనూ కాంగ్రెస్ ఖాతా తెరవకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వాస్తవంగా పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాల్లో ఖాతా తెరవడం కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సాము కాగా, కోర్సిటీలో సైతం అదే పరిస్థితి నెలకొంది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో మాత్రమే కాంగ్రెస్ హవా కొనసాగింది. ఈ మేరకు 2009లో ఖైరతాబాద్లో దానం నాగేందర్, జూబ్లీహిల్స్లో విష్ణువర్ధన్రెడ్డి, సనత్నగర్లో మర్రి శశిధర్రెడ్డి, గోషామహల్లో ముఖేశ్గౌడ్, సికింద్రాబాద్లో జయసుధ, కంటోన్మెంట్లో శంకర్రావు, మల్కాజిగిరిలో ఆకుల రాజేందర్, ఉప్పల్లో బండారి రాజిరెడ్డి, ఎల్బీనగర్లో దేవిరెడ్డి సుధీర్రెడ్డి, శేరిలింగంపల్లిలో భిక్షపతి యాదవ్, మహేశ్వరంలో సబితారెడ్డి, ముషీరాబాద్లో మణెమ్మ తదితరులు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పూర్తిగా చతికిలపడింది. 2014లో జరిగిన ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలనుసైతం దక్కించుకోలేక పోయింది. 2018 ఎన్నికల్లో టీడీపీ, టీజేఎస్తో కలిసి కూటమిగా పోటీ చేసినా ఫలితం దక్కలేదు. అన్ని స్థానాల్లో అపజయాన్ని మూటగట్టుకుంది. పదేళ్లలో రెండు పర్యాయాలు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినా..అందులోనూ సైతం మొక్కుబడి స్థానాలకు పరిమితమైంది. కాగా కాంగ్రెస్ పరిస్థితి దిగజారడానికి ప్రధాన కారణం నాయకత్వ లోపమే. నగర అధ్యక్షుల ఎంపికలో ఆలస్యం..సీనియర్ల మధ్య సమన్వయలేమి కాంగ్రెస్కు నష్టం చేకూర్చింది. 2014, 2018 అసెంబ్లీ, 2019 లోక్సభ, 2020లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నా అధిష్టానం సమీక్షించుకోకపోవడం దారుణం. -
అభ్యర్థులు ఎక్కడ ఓటు వేస్తారంటే?
హైదరాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలో గెలుపు కోసం మూడు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. నెల రోజుల నుంచి ప్రచారంతో హోరెత్తించిన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు బుధవారం వ్యూహాలు, ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యారు. గురువారం ఈ ముగ్గురు అభ్యర్థులు నియోజకవర్గంలోని వేర్వేరు డివిజన్ల పరిధిలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ►బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ వెంకటేశ్వరకాలనీ డివిజన్ బంజారాహిల్స్ రోడ్ నెం. 14లోని ఓల్డ్ వెంకటేశ్వరనగర్ బూత్ నెం. 130లో తన ఓటు వేయనున్నారు. ► కాంగ్రెస్ అభ్యర్థి పి. విజయారెడ్డి ఖైరతాబాద్ డివిజన్ పరిధిలోని టెలిఫోన్ భవన్ పక్కన పాఠశాల విద్యాశాఖ పోలింగ్ బూత్ నెం. 59లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ► బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి జూబ్లీహిల్స్ డివిజన్పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నెం. 2 షేక్పేట మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన 140వ బూత్లో ఓటు వేయనున్నారు. -
ఆస్తులకు మించిన అప్పుల్లో ఎమ్మెల్యే దానం
బంజారాహిల్స్: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బుధవారం నామినేషన్ దాఖలు చేయగా అఫిడవిట్లో తన ఆస్తులను ప్రకటించారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తులు, కేసుల వివరాలను వెల్లడించారు. దానం నాగేందర్ పేరిట మొత్తం ఆస్తుల విలువ రూ. 41,33,50,000గా పేర్కొన్నారు. కాగా వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో 47.63 లక్షలు ఉండగా ఆయన భార్య దానం అనిత పేరు మీద 78.17 లక్షల డిపాజిట్లు ఉన్నాయి. కుమార్తె సాయి ప్రియ పేరిట 9.55 లక్షలు డిపాజిట్లు ఉన్నాయి. ఈక్విటీ షేర్లు, పెట్టుబడుల రూపంలో భాగ్యలక్ష్మి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థలో రూ. 16.16 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎంఎస్పీ. ఇండెన్ సంస్థ నుంచి తనకు రూ. 2.74 కోట్లు రావాల్సి ఉందని పేర్కొన్నారు. తనకు వరంగల్ జిల్లా నిరుకులలో 6.09 ఎకరాలు, కళ్ళం గ్రామంలో 18.29 ఎకరాలు, నల్లగొండ జిల్లా పోచంపల్లి గ్రామంలో 9 ఎకరాలు, జనగాం జిల్లా పల్లగుట్ట గ్రామంలో 16 ఎకరాలు, యాదాద్రి భువనగిరి జిల్లా మల్యాల గ్రామంలో 4.11 ఎకరాలు ఉన్నట్లు వెల్లడించారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 3లోని 1432 గజాల్లో ఇల్లు ఉందని దాని ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 25 కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. తనకు రూ. 47.55 కోట్ల అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. భార్య పేరిట రూ. 2 కోట్ల అప్పు ఉందని కాగా తన చేతిలో రూ. 1.50 లక్షల నగదు మాత్రమే ఉందని అఫిడవిట్లో పేర్కొనడం గమనార్హం. ఆభరణాల విలువ రూ. 27కోట్లు దానం నాగేందర్తో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేరిట రూ. 27 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు ఉన్నట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. వీటిలో దానం పేరిట 1297 క్యారెట్ల వజ్రాలు(రూ.2.99 కోట్లు), 80 తులాల బంగారం(21.6లక్షలు), పది కేజీల వెండి(రూ.4.4 లక్షలు) ఉండగా ఆయన భార్య అనితకు 1350 క్యారెట్ల వజ్రాభరణాలు(3.39కోట్లు), 225 తులాల బంగారం(60.75లక్షలు) ఉన్నాయి. రూ. 10.82 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నట్లు పేర్కొన్నారు. -
విద్యాసాగర్ రావును బీజేపీ బలి పశువును చేస్తోంది: దానం నాగేందర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు రాష్ట్రానికి ఇచ్చిన వివరాలను ‘రిపోర్టు టు పీపుల్ పేరుతో’ కేంద్రమంత్రి కిషన్రెడ్డి పవర్ పాయింట్ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. ఈ సందర్బంగా దానం నాగేందర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి వాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలి. రావాల్సిన నిధులు ఇప్పటివరకు కేంద్రం ఇవ్వలేదు. ఎంపీగా గెలిచిన తర్వాత సికింద్రాబాద్ నియోజకవర్గానికి కిషన్రెడ్డి ఏం చేశారో చెప్పాలి. మోటర్లకు మీటర్లు పెడతామని కేంద్రం చెప్పలేదా?. రాజ్యాంగపరంగా రావాల్సిన నిధులను కూడా కేంద్రం అడ్డుకుంది. హైదరాబాద్, తెలంగాణ నుంచి వస్తున్న రిసోర్సెస్ వల్లనే రాష్ట్రానికి ఆదాయం వస్తోంది. దాని ఆధారంగానే అభివృద్ధి జరుగుతోంది. కిషన్ రెడ్డి ఈ మాయ మాటలు పక్కన పెట్టాలి. ఇప్పటికైనా కేంద్రం తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీ. విద్యాసాగర్ రావు హైదరాబాద్ రెండో రాజధాని అంటూ చేసిన కామెంట్స్పై కూడా దానం స్పందించారు. తెలంగాణకు రెండో రాజధాని అంటూ బీజేపీ మళ్లీ మాటలు చేప్తోంది. హైదరాబాద్ ప్రజలను గందరగోళానికి గురిచేయడానికి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. విద్యాసాగర్ను బలిపశువును చేయడానికే బీజేపీ ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తోంది. ఇది కూడా చదవండి: రాహుల్తో జూమ్ మీటింగ్.. 22న కాంగ్రెస్లోకి పొంగులేటి, జూపల్లి, కూచుకుళ్ల! -
ఖైరతాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిని నేనే
బంజారాహిల్స్: ‘ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా దానం నాగేందర్ పోటీ చేస్తాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అపోహలు, వదంతులు నమ్మొద్దు’ అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పెద్ద సంఖ్యలో విచ్చేసిన కార్యకర్తల సమక్షంలో స్పష్టం చేశారు. ఫిలింనగర్ బస్తీల్లో పాదయాత్ర చేయడానికి వచ్చిన ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ముఖ్యమంత్రికి అన్నీ తెలుసని, ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా తనే నిలబడతానని వెల్లడించారు. కొంత మంది యూట్యూబ్ చానళ్లు పెట్టుకొని పనికిమాలిన వార్తలను ప్రసారం చేస్తుంటారని, అదే పనిగా వైరల్ చేస్తున్నారని, వాటిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖైరతాబాద్లో మరోసారి గులాబీ జెండా గుబాళిస్తుందని వెల్లడించారు. -
అర్వింద్ పద్ధతి మారకుంటే ప్రజలు ఊరుకోరు: దానం
బంజారాహిల్స్ (హైదరాబాద్): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను లక్ష్యంగా చేసుకుని ఎంపీ ధర్మపురి అర్వింద్ చేస్తున్న వ్యక్తిగత దాడిని ఎట్టి పరిస్థితిలో చూస్తూ ఊరుకునేది లేదని, పద్ధతి మార్చుకోకపోతే ప్రజల చేతిలో చావుదెబ్బతినాల్సి వస్తుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించారు. శనివారం ఆయన కవితను కలసి సంఘీభావం తెలిపారు. అనంతరం మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ కలసి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ను ఉద్దేశించి బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అర్వింద్ మాటలు వింటే ప్రజల రక్తం మరిగిపోతోంద న్నారు. కాంగ్రెస్ పార్టీలో బీఫారమ్స్ అమ్ముకున్న చిల్లర వ్యక్తి అరవింద్ ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారన్నారు. -
Sadar Festival 2022 :హైదరాబాద్ లో వైభవంగా సదర్ వేడుకలు (ఫొటోలు)
-
ఖైరతాబాద్ ఎమ్మెల్యే కార్లపై 66 చలాన్లు.. రూ. 37, 365 చెల్లించి..
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు చెందిన అయిదు కార్లకు పెండింగ్ చలాన్లను ఆదివారం క్లియర్ చేశారు. కొంత కాలంగా ఆయనకు చెందిన టీఎస్ 09 ఎఫ్ఏ 0999తోపాటు మరో నాలుగు కార్లకు 66 చలానాలు పెండింగ్లో ఉన్నాయి. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ తిరుగుతున్న ఈ వాహనాలపై బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో పెండింగ్ చలాన్ల జాబితా గుట్టురట్టైది. దీంతో 66 చలానాలకుగాను రూ. 37365లను ఎమ్మెల్యే చెల్లించారు. ఈ మేరకు బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేస్తూ ఎమ్మెల్యే దానం నాగేందర్కు చెందిన అయిదు కార్లకు చెందిన చలానాలు క్లియర్ అయినట్లు తెలిపారు. చదవండి: బంజారాహిల్స్: ఖరీదైన కార్లే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు -
విశ్వక్ సేన్ అసలు హీరోనే కాదు: ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్
Danam Nagender Fires On Vishwak Sen: యంగ్ హీరో విశ్వక్సేన్- ప్రముఖ టీవీ యాంకర్కు మధ్య జరిగిన మాటల యుద్దంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరగుతుంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా విశ్వక్ సేన్, ఆయన టీం చేసిన ప్రాంక్ వీడియో విమర్శల పాలైన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై ఓ టీవీ ఛానెల్లో జరిగిన డిబెట్లో విశ్వక్ సేన్, సదరు యాంకర్ దేవీ నాగవల్లి మధ్య వాడివాడి చర్చ జరిగింది. స్టూడియో నుంచి 'గెట్ అవుట్' అంటూ యాంకర్ గట్టిగా అరవడం, దానికి విశ్వక్ సేన్ అభ్యంతరకర ఎఫ్.. పదంతో దూషించడం నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఇక దీనిపై మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ హీరోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చదవండి: విశ్వక్సేన్పై మంత్రికి ఫిర్యాదు చేసిన ప్రముఖ యాంకర్ ‘చానళ్లు విశ్వక్ సేన్ హీరోగా గుర్తిస్తున్నారో లేదో మాకు తెలియదు. కానీ, మేం మాత్రం అతడిని హీరోగా గుర్తించడం లేదు. లైవ్లో ఇలాంటి అసభ్యకర పదాలు వాడటం కరెక్ట్ కాదు. దేవి నాగవళ్లికి యాంకర్గానే కాదు, బయట సమాజంలో కూడా మంచి పేరు ఉంది. అలాంటి యాంకర్ను పట్టుకుని అతడు అలా అనడం సహించరానిది. మీడియాలో మాట్లాడాల్సిన సమయంలో అనేక ప్రశ్నలు ఎదురవుతుంటాయి. వాటికి జవాబు చెప్పే సత్తా ఉన్నప్పుడు మాత్రమే మీడియా ముందుకు రావాలి. లేకపోతే సైలెంట్గా ఉండాలి. స్టూడియోలో విశ్వక్ సేన్ మాట్లాడిన మాటల మీద పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలి’ అన్నారు. లేకపోతే మహిళా సంఘాలతో కేసు పెట్టిస్తామని, అతను ఆ మాట అనగానే అదే వేదికపై యాంకర్ చెప్పుతో కొట్టేది ఉండే అని ఆయన వ్యాఖ్యానించారు. చదవండి: ‘గెట్ అవుట్’ అంటూ విశ్వక్ సేన్పై టీవీ యాంకర్ ఫైర్ ‘విశ్వక్ సేన్ బయట కనపడితే మా మహిళలు చెప్పులు తీసుకుని కొడతారు. విశ్వక్ సేన్ లాంటి వ్యక్తికి బుద్ది చెప్పాల్సిందే. ఇంకోసారి మరెవరు ఇలాంటి పదాలు వాడకుండా చేయాలి. విశ్వక్ సేన్ లాంటి వాళ్లను సినిమాల్లోకి తీసుకోవద్దని దర్శక నిర్మాతలను కోరుతున్నాను’ అని దానం నాగేందర్ పేర్కొన్నారు. అయినప్పటికీ తమ మహిళ సంఘాలు ఆయనను కొట్టడానికి రెడీగా ఉన్నారని దానం హీరోపై ఫైర్ అయ్యారు. అనంతరం రోడ్లపై ఇలాంటి వ్యవహరాలు చేయడం. కిరోసిన్ డబ్బాను పట్టుకుని సినిమా ప్రమోషన్స్ చేసుకోవడానికి ఆయన ఏమైన పెద్ద హీరో అనుకుంటున్నాడా? అని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే యాంకర్ దేవి నాగవళ్లి ఫిర్యాదుతో విశ్వక్ సేన్పై ప్రభుత్వపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పిన సంగతి తెలిసిందే. -
GHMC: మేయర్ సహా మంత్రులకు జీహెచ్ఎంసీ జరిమానా
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 21వ తేదీ నుంచి ట్విట్టర్ ద్వారా ఫ్లెక్సీలు, హోర్డింగులు, ఇతర నిబంధనల అతిక్రమణలపై ఫిర్యాదుల స్వీకరణను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగంలోని సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్(సీఈసీ) ఫిర్యాదుల స్వీకరణను పునరుద్ధరించింది. టీఆర్ఎస్ ప్లీనరీ నేపథ్యంలో టీఆర్ఎస్ నేతల ఫ్లెక్సీలతో నగరాన్ని నింపేందుకు, వారికి పెనాల్టీలు వేయకుండా ఉండేందుకేనని ప్రజల నుంచి ముఖ్యంగా నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. సర్వర్ అప్డేషన్ కోసమని సీఈసీ పేర్కొన్నా ప్రజలు విశ్వసించలేదు. ప్రతిపక్ష రాజకీయపార్టీలు ఆందోళనలు సైతం నిర్వహించాయి. ► తాజాగా ట్విట్టర్ ఖాతా తెరిచి ఇన్ని రోజుల్లో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ఈ చలానాలతో పెనాల్టీలు విధించారు. ఈ పెనాల్టీల విధింపులో మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఉన్నారు. పెనాల్టీల విధింపు ఇంకా కొనసాగుతోంది. తాజా సమాచారం మేరకు జారీ అయినా పెనాల్టీల్లో ఆయా నాయకులకు పడ్డ మొత్తం పెనాల్టీలు దాదాపుగా దిగువ విధంగా ఉన్నాయి. (వాట్సాప్ చెకింగ్ వీడియో వైరల్: క్లారిటీ ఇచ్చిన సీపీ అంజనీ కుమార్) ► ఒక్కొక్కరికి పదుల సంఖ్యలో ఫ్లెక్సీల ఏర్పాటుకు ఈ పెనాల్టీలు విధించారు. అందరికంటే ఎక్కువగా ఎమ్మెల్యే దానం నాగేందర్కు రూ.3 లక్షలకు పైగా, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు రూ.1.60 లక్షలకు పైగా పెనాల్టీలు పడ్డాయి. టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ పేరిట రూ.2.20 లక్షలు, మంత్రి చామకూర మల్లారెడ్డికి రూ.10 వేలు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావుకు రూ.10 వేలు, కాలేరు వెంకటేశ్కు రూ.25 వేలు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి రూ.60వేలు పెనాల్టీలు పడ్డాయి. కార్పొరేటర్ రాగం సుజాత రూ.2 లక్షలు. ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉంది. (చదవండి: రిటైరైనవారు ప్రభుత్వ సలహాదారులా?) -
చివరి శ్వాస ఉన్నంత వరకూ టీఆర్ఎస్తోనే: దానం
సాక్షి, హైదరాబాద్: ‘చివరి శ్వాస ఉన్నంత వరకు టీఆర్ఎస్తోనే ఉంటా. విధేయతతో కేసీఆర్, కేటీఆర్ నాయకత్వం కిందే పనిచేస్తా. నా ఇంటికి ఎవరు వచ్చినా టీఆర్ఎస్ కండువా కప్పుకుని రావాల్సిందే’ అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఆయన పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్లో చిచ్చు పెట్టేవారికి పుట్టగతులు ఉండవని మండిపడ్డారు. తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్న వారిపై ఇప్పటికే సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశానని వెల్లడించారు. డబ్బులు పెట్టి పీసీసీ పదవి తెచ్చుకున్న వారు ఎలా పనిచేస్తారో అందరికీ తెలుసన్నారు. రేవంత్ నాయకత్వంలో ఎలా పనిచేస్తారో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్లో తనకు చాలా అవమానాలు జరిగాయన్నారు. కాంగ్రెస్లో కంటే టీఆర్ఎస్లో నాకు పదింతలు గౌరవం దొరుకుతోందన్నారు. ఉమ్మడి ఏపీలో అభివృద్ధి జరగనందునే ఆత్మ పరిశీలనతో టీఆర్ఎస్ చేరి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నామన్నారు. బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములయ్యేందుకు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్లో చేరాలన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణలో భవిష్యత్తు లేదన్నారు. తాను సీఎం కేసీఆర్ను మంత్రి పదవి అడగలేదని ఇకముందు కూడా అడగని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షాలు అదే పనిగా విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. -
దానం నాగేందర్ వియ్యంకుడిపై దాడి
సాక్షి, బంజారాహిల్స్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వియ్యంకుడు అనిల్ కుమార్ కిషన్పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే... జూబ్లీహిల్స్ రోడ్ నెం. 15లో నివాసం ఉంటున్న ఎమ్మెల్యే నాగేందర్ వియ్యంకుడు అనిల్ కిషన్ సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో మీటింగ్ ముగించుకొని జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ మీదుగా కళాంజలి నుంచి తన ఇంటికి కారులో వెళ్తున్నాడు. కళాంజలి షోరూం దాటగానే గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కారుపై వెనుక నుంచి రాళ్లతో దాడి చేశారు. వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్న ఆయన తన వియ్యంకుడు దానం నాగేందర్కు ఫోన్ చేశారు. అప్రమత్తమైన దానం జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నైట్ డ్యూటీలో ఉన్న ఎస్ఐ నాయుడు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. ఈఘటనలో కారు అద్దాలు పగిలి ఉన్నాయని, సీసీ ఫుటేజీలను పరిశీలించి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఘటనపై న్యాయసలహా అనంతరం కేసు నమోదు చేస్తామన్నారు. ఆయనకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అన్నదానిౖపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. -
ఐపీఎల్ మ్యాచ్లను అడ్డుకుంటాం: టీఆర్ఎస్ ఎమ్మెల్యే
బంజారాహిల్స్: ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తెలంగాణకు చెందిన ఒక్క క్రీడాకారుడిని కూడా ఎంపిక చేయకపోవడం పట్ల ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందరో క్రీడాకారులను అందించిన హైదరాబాద్ నుంచి క్రికెట్కు ఆటగాడిని ఎంపిక చేయకపోవడం పట్ల ఆ జట్టు యాజమాన్యాన్ని దుయ్యబట్టారు. హైదరాబాద్కు చెందిన ఆటగాడు లేకుండా అది హైదరాబాద్ జట్టు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా పునరాలోచించి స్థానిక క్రికెటర్లను సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఎంపిక చేయకపోతే త్వరలో ఉప్పల్లో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్లను అడ్డుకుంటామని హెచ్చరించారు. మిగతా అన్ని జట్లు తమ ప్రాంతం వారికి అవకాశం కల్పిస్తే ఎస్ఆర్హెచ్ మాత్రమే విదేశీ, ఇతర రాష్ట్రాల ఆటగాళ్లకు అవకాశం ఇచ్చిందని, ఇది చాలా బాధాకరమన్నారు. చదవండి: ఆ రికార్డుకు ఆరు వికెట్ల దూరంలో.. -
షేక్పేట తహసీల్దార్.. బదిలీ రగడ!
సాక్షి, హైదరాబాద్: నగరంలో షేక్పేట తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఆకస్మిక బదిలీపై రగడ రగులుకుంటోంది. తాజాగా మాజీ మంత్రి దానం నాగేందర్ వ్యాఖ్యలతో దీనికి మరింత ఆజ్యం పోసినట్లయింది. ఇప్పటికే రాజకీయ ఒత్తిళ్లతోనే బదిలీ జరిగిందని ఆరోపిస్తూ రెవెన్యూ ఉద్యోగ సంఘాలు చేస్తున్న ఆందోళనకు బలం చేకూర్చినట్లయింది. బంజారాహిల్స్ కార్పొరేటర్ విజయలక్ష్మి హైదరాబాద్ మేయర్గా ఎన్నికైన మరుసటి రోజు షేక్పేట తహసీల్దార్కు స్థానచలనం కలిగించడం సర్వత్రా చర్చనీయంశంగా మారింది. అసలేం జరిగిందంటే.. సరిగ్గా పక్షం రోజుల క్రితం జనవరి 20న ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాల జారీలో జరుగతున్న నిర్లక్ష్యం..జాప్యంపై ప్రశ్నించేందుకు బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి తన అనుచరులతో కలిసి షేక్పేట తహసీల్ ఆఫీస్కు వెళ్లారు. ఈనేపథ్యంలో ఎమ్మార్వో శ్రీనివాస్రెడ్డి..కార్పొరేటర్ విజయలక్ష్మి మధ్య వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో షేక్పేట తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్ విజయలక్ష్మి ఒకరిపై మరొకరు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడం సంచలనం సృష్టించింది. ఇదిలా ఉండగా ఈ నెల 11న కార్పొరేటర్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ మేయర్గా ఎన్నికయ్యారు. ఎన్నికైన 72 గంటల్లోనే శ్రీనివాస్రెడ్డిపై బదిలీ వేటు వేస్తూ సీసీఎల్ఏలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ముఖ్యకార్యదర్శి సోమేష్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎస్కు ఫిర్యాదు చేశాం: దానం నాగేందర్ షేక్పేట తహసీల్దార్పై ఎంపీ కేశవరావుతో కలిసి సీఎస్కు ఫిర్యాదు చేసినట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్ వెల్లడించారు. ప్రజాప్రతినిధులంటే తహసీల్దార్కు గౌరవం లేదన్నారు. ఆదాయ, కులదృవీకరణ పత్రాల జారీలో నిర్లక్ష్యం వహించడం వల్లనే సీఎస్కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అండగా ఉద్యోగ సంఘాలు రెవెన్యూ ఉద్యోగ సంఘాలు తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డికి అండగా నిలబడ్డాయి. రాజకీయ జోక్యంతోనే బదిలీ జరిగిందని ఆరోపిస్తూన్నాయి. ఏకంగా మీడియా ముందుకు వచ్చి గళం విప్పుతున్నాయి. దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన మాజీ ఎంపీ కె.కేశవరావు కుమార్తె, అమెరికాలో ఉన్నత ఉద్యోగం సైతం వదిలి ప్రజా సేవకు వచ్చిన ఆమె.. ఇటువంటి చిన్న చిన్న విషయాల కోసం తన అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నాయి. అధికారికంగా ఉత్తర్వులు అందలేదు: శ్రీనివాస్ రెడ్డి ఇంకా అధికారికంగా తనకు బదిలీ ఉత్తర్వులు అందలేదని షేక్పేట మండల తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు బదిలీలు జరగడం సాధారణమేనని, తన బదిలీ కూడా అలా జరిగే ఉంటుందని భావిస్తున్నానన్నారు. తనను ఎందుకు బదిలీ చేశారో తెలియదన్నారు. కార్పొరేటర్ గద్వాల్ విజయలక్ష్మి ముందుగా తనపైనే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారని, ఆ తర్వాతే తాను కౌంటర్ పిటిషన్ వేశానన్నారు. ఆదాయ «ధృవీకరణ పత్రం కోసం ఆమె ఫోన్చేశారని, తన వద్ద వీఆర్వోలు లేరన్న విషయాన్ని చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. ఆ కొద్దిసేపటికే ఆఫీస్కు వచ్చారని, ఆ సమయంలో కోర్టుకు వెళ్లాల్సి ఉండగా కేసును స్టడీ చేస్తున్నానని వెల్లడించారు. నిబంధనల ప్రకారమే తాను నడుచుకున్నానన్నారు. చదవండి: మేయర్ వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో వైరల్ -
ఎమ్మెల్యే దానంపై పోలీసులకు ఫిర్యాదు
-
వైరల్: ‘బెదిరింపులకు దిగిన ఎమ్మెల్యే దానం’
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్కు చెందిన ఓ స్థల వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బ్యాంక్ అధికారులతో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఎమ్మెల్యే తమను బెదిరించారంటూ బ్యాంక్ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. 10 ఏళ్ల క్రితం ఖైరతాబాద్లోని ఓ స్థలంపై ఓ వ్యక్తి లోన్ తీసుకున్నాడు. డబ్బులు తిరిగి కట్టకపోవడంతో ఆ స్థలాన్ని బ్యాంక్ బహిరంగ వేలానికి పెట్టారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న దానం నాగేందర్ బ్యాంక్ అధికారుల విధులకు అడ్డుతగిలారు. ఎమ్మెల్యే తన అనరుచరులతో కలిసి వేలాన్ని అడ్డుకున్నారని బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే తమపై దౌర్జన్యం చేశారని, బెదిరింపులకు దిగారని తెలిపారు. ఆయన అనుచరులు దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. (‘సాఫ్ట్వేర్ శారద’ కథనంపై స్పందించిన ఎంపీ) -
సచివాలయంపై కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: సచివాలయం కూల్చివేతపై ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ హైకోర్టును తప్పుదోవ పట్టించాయని మాజీ మంత్రి దానం నాగేందర్ ఆరోపించారు. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, శ్రీనివాస్రెడ్డితో కలసి శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. హైకోర్టు అనుమతి ఇచ్చిన తర్వాతే సచివాలయం కూల్చివేతలు ప్రారంభమైన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆరేళ్లుగా అభివృద్ధి జరుగుతున్నా కళ్లుండీ చూడలేని కబోదులుగా విపక్షాలు మారాయని విమర్శించారు. వరుస ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తున్నా ప్రతిపక్షాల వైఖరి మారడం లేదని, రాబోయే రోజుల్లో విపక్షాలకు బంగాళాఖాతమే దిక్కవుతుందన్నారు. సచివాలయంలో దేవాలయం, ప్రార్థనా మందిరం దెబ్బతినడంపై సీఎం కేసీఆర్ వివరణ ఇవ్వడంతో పాటు మత పెద్దలతో కూడా మాట్లాడారని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో రోడ్ల విస్తరణ పేరిట ప్రార్థనా మందిరాలను కూల్చివేశారన్నారు. మతాల నడుమ చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. హైదరాబాద్లో మత సామరస్యానికి భంగం వాటిల్లకుండా చూస్తామని, విపక్షాల కుట్రలను అనుమతించేది లేదన్నారు. సచివాలయం శిథిలాలను తిరిగి వినియోగించుకునేందుకు జీడిమెట్లలో ప్రత్యేక ప్లాంటు నెలకొల్పినట్లు బొంతు రామ్మోహన్ వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న గంగా జమునా తెహజీబ్ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని ఎమ్మెల్సీ ప్రభాకర్ అన్నారు. కొత్త సచివాలయం రాష్ట్ర అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తుందని, ప్రతిపక్షాల తీరు మారకుంటే మరింతగా ప్రజలకు దూరమవడం ఖాయమని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్రెడ్డి అన్నారు. -
చెయ్యి కడుక్కోవే శీనన్నా...
సాక్షి, బంజారాహిల్స్: లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు నిత్యావసర సరకులు ఎలా అందుతున్నాయో పరిశీలించేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిన్న (గురువారం) ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి బంజారాహిల్స్ పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా దానం ఇంటికి వచ్చిన శ్రీనివాస్ యాదవ్కు శానిటైజర్తో చేతులు కడిగించారు. ప్రజలకు మరింత అవగాహన పెంచే దిశలో నాగేందర్ గత పది రోజుల నుంచి తన ఇంటి వద్ద ప్రత్యేకంగా శానిటైజర్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికీ తానే దగ్గరుండి చేతులు శుభ్రం చేసుకునేలా అవగాహన కలిగిస్తున్నారు. (కరోనా కథ.. ఇల్లే సురక్షితం) కాగా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అవసరమైన జాగ్రత్తలు పాటించాలని మంత్రి తలసాని అన్నారు. నిన్న ఆయన బేగంబజార్లోని మిట్టికా షేర్ హోల్సేల్ మార్కెట్లో వ్యాపారులతో సమావేశం అయ్యారు. మార్కెట్లో సుమారు 300 దుకాణాలు ఉన్నాయని, రోజుకు 40 దుకాణాల చొప్పున ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల విక్రయాలు జరుపుకోవాలని సూచించారు. (బ్రేక్ 'కరోనా') నిత్యావసరాలపై నిఘా అవినాష్ మహంతి నేతృత్వంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ రెండు రోజుల్లో 20 వేలకు పైగా పాసులు జారీ లాక్డౌన్ నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. నిత్యావసర వస్తువుల్ని రవాణా చేసే వాహనాల కదలికల్ని సమీక్షించడానికి, పర్యవేక్షించడానికి, ఆయా విభాగాలతో సమన్వయానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ కొత్వాల్ అంజనీకుమార్ నిర్ణయం తీసుకున్నారు. నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి దీనికి నేతృత్వం వహిస్తున్నారు. మొత్తం 25 మంది అధికారులతో ఉండే ఈ బృందం 24 గంటలూ మూడు షిఫ్టుల్లో నిర్విరామంగా సేవలు అందిస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి నిత్యావసర వస్తువులు తీసుకువచ్చే లారీలు, నగరంలో వాటిని డిస్ట్రిబ్యూట్ చేసే వాహనాల కదలికలకు ఆటంకం లేకుండా సాగేలా ఈ టీమ్ ఆద్యంతం పర్యవేక్షించనుంది. అలాగే మూడు కమిషనరేట్లకు చెందిన అధికారులు అత్యవసర సేవలు అందించే వ్యక్తులు, వాహనాలకు బుధవారం నుంచి ప్రత్యేక పాస్లు జారీ చేస్తున్నారు. దీనికోసం ఎవరికి వారు హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశారు. నిత్యావసర వస్తువుల్ని ఇళ్లకు సరఫరా చేసే ఈ–కామర్స్ వాహనాలు, వ్యక్తులు, కోళ్లు, కోడిగుడ్లు, ఆవులు, గేదెలు రవాణా చేసే వాహనాలు, కూరగాయలు తరలించే లారీలు, హాస్పిటల్స్లోని వివిధ విభాగాల్లో పని చేసే ఉద్యోగులు, వివిధ స్టార్ హోటళ్లు, లాడ్జిలలో పనిచేసే ఉద్యోగులకు, మండీలు, మార్కెట్లలో పని చేసే హమాలీలు, ఇతర ఉద్యోగులు చేపలు, మాంసం, వంటనూనె,పంచదార రవాణా చేసే వాహనాలు, కేబుల్ టీవీ, ఇంటర్నెట్ సేవల టెక్నీషియన్లకు కొన్ని స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలకు పాస్లు ఇస్తున్నారు. గురువారం రాత్రికి జారీ చేసిన పాసుల సంఖ్య 20 వేలు దాటింది. ఈ పాసులను ఎవరైనా దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులుని స్పష్టం చేస్తున్నారు
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
కాంగ్రెస్లోకి ఆత్మారాంనాయక్
రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం కాదు
ఎన్నికలకు పటిష్ట భద్రత
కాంగ్రెస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి
న్యూస్రీల్
నకిలీ విత్తు.. ఎంచుకుంటే ముప్పు!
‘మోదీ నాయకత్వంలోనే దేశాభివృద్ధి’
సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
నిరంతర విద్యుత్ సరఫరాకు కృషి
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్.. క్రికెట్కు గుడ్బై చెప్పిన స్టార్ క్రికెటర్
తప్పక చదవండి
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- రొమాంటిక్ సీన్స్.. ఒళ్లంతా దద్దుర్లు వచ్చేశాయి: టాలీవుడ్ హీరోయిన్
- నవ్వుతారేమో అనుకున్నా: లాపతా లేడీస్ ప్రతిభ ఇంట్రస్టింగ్ జర్నీ
- ‘సంతోషం’.. కేజ్రీవాల్కు మద్యంతర బెయిల్పై దీదీ
- నామినేషన్ దాఖలుకు బీజేపీ అభ్యర్థి పరుగులు.. చివరికి ఏమైందంటే..
- రెడ్ లిప్స్టిక్ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- డాగ్ లవర్స్ బీ అలర్ట్ : ప్రమాదకరమైన కుక్కలపై తమిళనాడు నిషేధం
- ఆదాయాలు రెట్టింపైనా ఉద్యోగాల్లో కోత!
- కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement