-
అంగ వైకల్యం అడ్డు కాలేదు.. ప్రపంచం మెచ్చిన స్పోర్ట్స్ స్టార్ అయ్యింది..!
ఆమె దృఢ సంకల్పానికి అంగ వైకల్యం అడ్డు కాలేదు. మొండి పట్టుదలతో అనుకున్నది సాధించింది. 22 ఏళ్లకే రోడ్డు ప్రమాదంలో కాలు పోయినా.. కృత్రిమ కాలితో తనకెంతో ఇష్టమైన బ్యాడ్మింటన్ క్రీడలో సక్సెస్ సాధించింది. విధి వెక్కిరించినా సంచలనాలు సృష్టించింది. ఆమె ఆత్మ విశ్వాసం ముందు అంగ వైకల్యం ఓడిపోయింది. ఈ నిజమైన విజేత పేరే మానసి జోషి. గుజరాత్లో పుట్టి, ముంబైలో పెరిగిన 34 ఏళ్ల మానసి రోడ్డు ప్రమాదంలో కాలు పోయినా ఏమాత్రం అధైర్యపడకుండా జీవితంలో ముందడుగు వేసింది. కృత్రిమ కాలితో తనకెంతో ఇష్టమైన బ్యాడ్మింటన్ క్రీడలో సక్సెస్ సాధించింది. శారీరక లోపాన్ని జయించి అంతర్జాతీయ వేదికలపై భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది. ఈ క్రమంలో పారా బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్గా, వరల్డ్ నంబర్ వన్ షట్లర్గా ఎదిగింది. ఆరేళ్ల వయసులోనే రాకెట్ పట్టుకున్న మానసి ఓవైపు ఉన్నత చదువులు చదువుతూనే.. క్రీడల్లో రాణించింది. ముంబైలో ఇంజినీరింగ్ పూర్తి చేశాక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించిన మానసి.. ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయింది. 2011 డిసెంబర్ 2న ద్విచక్రవాహనంపై ఆఫీసుకు వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో ఆమె ఎడమ కాలు పూర్తిగా ఛిద్రమైంది. కాలు కోల్పోయాక కొద్ది రోజుల పాటు డిప్రెషన్లోకి వెళ్లిపోయిన మానసి.. వైకల్యం తన ఎదుగుదలకు అడ్డుకాకూడని నిశ్చయించుకుని ముందడుగు వేసింది. కృత్రిమ కాలును అమర్చుకొని తనకెంతో ఇష్టమైన బ్యాడ్మింటన్ బరిలోకి రీఎంట్రీ ఇచ్చింది. కఠోర శ్రమ అనంతరం జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన మానసి.. 2018లో హైదరాబాద్లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో చేరి తన ఆటకు మరిన్ని మెరుగులు దిద్దుకుంది. గోపీచంద్ శిక్షణలో రాటుదేలిన మానసి.. వరల్డ్ ఛాంపియన్షిప్తో పాటు మరెన్నో అంతర్జాతీయ పతకాలు సాధించింది. తన ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు, పురస్కారాలు పొందింది. 2022లో మానసి వరల్డ్ నంబర్ వన్ ర్యాంకర్గా అవతరించింది. అమెరికాకు చెందిన బార్బీ కంపెనీ మానసి సాధించిన విజయాలకు గుర్తింపుగా ఆమె పోలికలతో బార్బీ బొమ్మను రూపొందించింది. తాజాగా చైనాలో జరుగుతున్న పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లిన మానసి.. సహచర క్రీడాకారిణిలతో కలిసి ఫోటోకు పోజిచ్చింది. With Para baddy girls in China 🇨🇳 pic.twitter.com/bkDNlDM5vl — Manasi Joshi (@joshimanasi11) February 29, 2024 -
ఇండిగో, కోల్కతా ఎయిర్ పోర్ట్ నిర్వాకం: మహిళా పారా అథ్లెట్ ఆగ్రహం
బడ్జెట్ ఎయిర్లైన్స్ ఇండిగోకు సంబంధించి మరో అనుచిత ఘటన వివాదాన్ని రేపింది. అలాగే కోల్కతా విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది దివ్యాంగ మహిళ పట్ల అమానుషంగా వ్యవరించారు. దీనికి సంబంధించిన ఘటనను ఆమె ట్విటర్ షేర్ చేయడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. సెక్యూరిటీ క్లియరెన్స్ సమయంలో వికలాంగురాలైన (వీల్చైర్ యూజర్ కూడా) తనను మూడుసార్లు లేచి నిలబడాలంటూ కోరారని న్యాయ విద్యార్థిని ఆరూషి సింగ్ ట్వీట్ చేశారు. మొదట ఆమె నన్ను లేచి కియోస్క్లోకి రెండు అడుగులు వేయమని చెప్పింది. పుట్టుకతోనే తనకు వైక్యల్యంఉందని తన వల్ల కాదని చెప్పినా. వినిపించుకోకుండా రెండు నిమిషాలే అయిపోతుంది అంటూ వేధించారని ఆమె ఆరోపించారు. దీంతో తాను భయంతో వణికి పోయానంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తనకు 20 నిమిషాలు లేటైందని పేర్కొన్నారు. గతంలో ఇలాంటి జరిగినా, ఇండిగోకు ఇంకా బుద్ధి రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కోల్కతా ఎయిర్పోర్టు అధికారులు వైకల్యం ఉన్న ప్రయాణీకుల పట్ల వ్యవహరించాల్సిన తీరును పునరాలోచించాల్సిన అవసరం ఉందని సింగ్ కోరారు. ఈ ఘటనపై సిఐఎస్ఎఫ్, కోల్కతా విమానాశ్రయం ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయ లేదు. Yesterday evening during the security clearance at Kolkata airport, the officer asked me (a wheelchair user) to stand up, not once but thrice. First she asked me to get up and walk two steps into the kiosk. (1/1) — Arushi Singh (@singhharushi) February 1, 2024 ఇది ఇలా ఉంటే ఇండిగోకు సంబంధించి తాజా సంఘటన కలకలం రేపింది. వీల్ చెయిర్ విషయంలో ఇండిగో సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారంటూ ఆసియా పారా గేమ్స్ పతక విజేత , పారా అథ్లెట్ సువర్ణ రాజ్ ఆరోపణలు గుప్పించారు. దివ్యాంగురాలైన తనకు విమానం డోర్ దగ్గర తన వీల్ చెయిర్ ఇవ్వకుండా ఇబ్బందికి గురి చేశారని మండి పడుతూ తన అనుభవాన్ని ఏఎన్ఐతో షేర్ చేశారు. #WATCH | Chennai, Tamil Nadu: Indian para-athlete Suvarna Raj alleges that she was mistreated by IndiGo Airlines crew members while taking a flight from New Delhi to Chennai yesterday. "...I told them 10 times that I want my personal wheelchair at the aircraft door, but no… pic.twitter.com/avResgXHJ0 — ANI (@ANI) February 3, 2024 విమానం డోర్ వద్ద తనకు వ్యక్తిగత వీల్చైర్ గురించి సిబ్బంది స్పందించలేదని ఆరోపించారు. న్యూఢిల్లీనుంచి చెన్నైకి వెళ్తుండగా ఇండిగో సిబ్బంది తన పట్ల దారుణంగా ప్రవర్తించారని సువర్ణ తెలిపారు. ఇండిగో నిర్ల్యక్షం మూలంగా తన వ్యక్తిగత వీల్చైర్ పాడైందని, దాని రిపేర్కు రూ. 3 లక్షలు ఖర్చయ్యాయని పేర్కొన్నారు. ఈ నష్టాన్ని ఇండిగోనే భరించాలన్నారు. వికలాంగులకు వీల్చైర్లు ప్రోటోకాల్ ఉల్లంఘనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సువర్ణ డిమాండ్ చేశారు. అంతేకాదు సింగ్ వ్యవహారంపై కూడా ఆమె స్పందించారు. వికలాంగుల సమస్యను అర్థం చేసుకొని వారి పట్ల సున్నితంగా వ్యవహరించాలని రాజ్ కోరారు. -
దివ్యాంగ విజయాలు.. వింగ్స్ ఆఫ్ ఫైర్..!
అవయవలోపం ఉన్నా అనితరసాధ్య విజయాలు సాధించడంలో మిన్నగా నిలిచిన దివ్యాంగులకు అభినందన కార్యక్రమం ఆహ్లాదభరితంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దివ్యాంగులు పంచుకున్న క్రీడానుభవాలు అందరి మనసుల్నీ స్పర్శించాయి. గృహనిర్మాణానికి పేరొందిన జీ స్క్వేర్ హౌసింగ్ ఆధ్వర్యంలో జరిగిన హైదరాబాద్ లోని వెస్టిన్ హోటల్లో వింగ్స్ ఆఫ్ ఫైర్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పేరొందిన పారా అథ్లెటిక్స్ను నగదు బహుమతులతో పాటు సన్మానించారు. ఈ సందర్భంగా క్రీడారంగంలో దివ్యాంగుల విజయాలు ప్రతీ ఒక్కరికీ స్ఫూర్తిని అందిస్తాయని సీఆర్పీఎఫ్ డిఐజీ అనిల్ మింజ్ అన్నారు. పారా అథ్లెట్స్కు సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ దివ్యాంగులు విభిన్న రంగాల్లో రాణించేందుకు అన్ని వర్గాల వారూ తమ వంతుగా ప్రోత్సాహించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అతిధిగా పాల్గొన్న భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు బి.సాయి ప్రణీత్ మాట్లాడుతూ క్రీడారంగంలో ఎదురయ్యే సవాళ్లు తనకు తెలుసని వీటిని ఎదుర్కుని విజేతలు కావడం ద్వారా దివ్యాంగులు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారన్నారు. కార్యక్రమంలో సంస్థ సిఇఒ ఈశ్వర్ మాట్లాడుతూ దివ్యాంగుల విజయాలకు తోడ్పడేందుకు వచ్చే ఏడాది నుంచి గెలుపొందిన క్రీడాకారులను సన్మానించడం మాత్రమే కాకుండా క్రీడల్లో పాల్గొనేవారికి ఆర్ధికంగా సాయం అందించనున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నివాసి పారా అధ్లెట్ వేణు తొలి దశలో తనని ఎవరూ ప్రోత్సహించేవారు కాదనీ చెబుతూ తానెలా అడ్డంకుల్ని అధిగమించి విజేతగా నిలిచాడో వివరించారు. అదే విధంగా భాగ్యశ్రీ మాథవ్ రావు జావెద్ మాట్లాడుతూ తన అనుభవాలు వివరించారు. హై జంప్లో పారాఒలింపిక్ గోల్డ్ మెడల్ తో పాటుగా పద్మశ్రీ, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న, అర్జున పురస్కారం తదితర పురస్కారాలు అందుకున్న మరియప్పన్ తంగవేలు, అంతర్జాతీయ పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు గీరీశ్ చంద్ర జోషి, ఇంటర్నేషనల్ పారా అథ్లటిక్స్ ఛాంపియన్ ప్రణవ్ ప్రశాంత్ దేశాయ్, కర్ణాటకకు చెందిన పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ కె. గోపీనాథ్, మేథా జయంత్, తమిళనాడుకు చెందిన స్విమ్మింగ్ ఛాంపియన్ ఎస్ఆర్ తేజస్విని, హైదరాబాద్కు చెందిన నేషనల్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్లు బీర్ భద్ర సింగ్, అజయ్కుమార్లు పాల్గొన్నారు. భాగ్యశ్రీ మాధవరావు జావేద్ లకు రూ.1లక్ష చొప్పున, మరో ముగ్గురికి రూ.75వేల చొప్పున, మరో ముగ్గురు క్రీడాకారులకు 50వేల చొప్పున నగదు బహముతులను అందించడంతో పాటు ఘనంగా సన్మానించారు. -
భారతీయులు గర్వపడేలా చేసిన సచిన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..?
దేశానికి పతకాలను అందించి భారతీయులను గర్వపడేలా చేసిన క్రీడాకారులు నేడు అత్యంత దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాల నుంచి కనీస సాయం కూడా అందకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. స్పెషల్ ఒలింపిక్స్లో రెండు కాంస్య పతకాలు సాధించిన సీతా సాహు సమోసాలు అమ్ముకుంటున్న ఘటనను మరవకముందే మరో వార్త అందరినీ ఆవేదనకు గురిచేస్తోంది. నేషనల్ చాంపియన్(పారా అథ్లెట్) సచిన్ సాహు.. జీవనోపాధి కోసం ఐస్క్రీమ్ బండి నడుపుకుంటున్నాడు. మధ్యప్రదేశ్కు చెందిన సచిన్.. ఒడిశాలోని కళింగ స్టేడియంలో జరిగిన 20వ జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించాడు. ఈ రేసును సచిన్ 1.17 సెకన్లలో పూర్తి చేసి రికార్డు క్రియేట్ చేశాడు. ఆ తర్వాత ప్రభుత్వం తనకు ఎలాంటి సాయం అందకపోవడంతో తాను ఇలా ఐస్క్రీమ్స్ అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా.. సచిన్ 2015 నుండి 2019 వరకు క్రికెట్ ఆడాడు. కానీ, దివ్యాండైన కారణంగా క్రికెట్లో పెద్దగా రాణించలేకపోయాడు. అనంతరం.. గ్వాలియర్ అథ్లెటిక్స్ కోచ్ బీకే ధవన్ సాయంతో పారా అథ్లెట్గా మారాడు. అనంతరం కాంస్య పతకం సాధించాడు. Madhya Pradesh | Para-athlete Sachin Sahu sells ice cream in Rewa to make ends meet "Despite lack of facilities, I won a bronze medal in 400m race in 20th National Para-Athletics Championship. I appeal to the government to support me to play further," he said pic.twitter.com/bH53zzwdcf — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 6, 2022 -
చేయందిస్తే..చరిత్ర సృష్టిస్తా..
సాక్షి, హైదరాబాద్: శరీరం సహకరించకున్నా... అలుపెరుగకుండా విజయాలు సాధిస్తూనే ఉన్న ఆ క్రీడాకారిణి... ఆర్థిక పరిస్థితి సహకరించక చేయూత కోసం ఎదురు చూస్తోంది. కాస్తంత చేయి అందిస్తే...పారా అథ్లెట్గా చరిత్ర తిరగరాస్తానంటోంది. నగరంలోని సరూర్నగర్కు చెందిన కుడుముల లోకేశ్వరి (26) పారా క్రీడాకారిణి. 10 ఏళ్ల వయస్సులో బ్రెయిన్ ట్యూమర్ కారణంగా కుడి వైపు శరీరం పనిచేయడం మానేసింది. అయినా చిన్నప్పటి నుంచి క్రీడల పైన తనకున్న మక్కువే ఆమెను పారా క్రీడాకారిణిగా మార్చింది. 2019 నుంచి నిరంతర సాధన చేస్తున్న లోకేశ్వరి ఈ ఏడాది మార్చి 27న భువనేశ్వర్ కళింగా స్టేడియంలో జరిగిన 20వ నేషనల్ పారా ఆథ్లెటిక్ చాంపియన్ షిప్ డిస్కస్ త్రోలో పాల్గొని సిల్వర్ మెడల్ సాధించింది. గత ఏడాది మార్చిలో బెంగళూర్ కంఠీరవా స్టేడియంలో జరిగిన 19వ జాతీయ స్థాయి పారా అథ్లెటిక్స్లో షాట్ ఫుట్, డిస్కస్ త్రో విభాగంలో 2 కాంస్య పతకాలు సాధించింది. డిసెంబర్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బెంగళూర్లో జరిగిన 3వ ఇండియన్ ఓపెన్ పారా ఆథ్లెటిక్ ఛాంపియన్షిప్ షాట్ ఫుట్లో కూడా సిల్వర్ మెడల్ సాధించింది. 3 సార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకాలు సాధించింది. త్వరలో జరగనున్న ఆసియన్ పారా గేమ్స్ కోసం సాధన చేస్తుంది. ఇందులో పాల్గొనడానికి అర్హత సాధించాలంటే జూన్ నెలలో తునిషియా (నార్త్ ఆఫ్రికా) వేదికగా జరిగే పోటీల్లో పాల్గొనాలి. అయితే ఇందుకు రూ.3 లక్షల వరకు ఖర్చవుతుందని లోకేశ్వరి తెలిపింది. అందుకు ఆమె ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం అనుకూలించడం లేదు. పదేళ్ల క్రితం తండ్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఓ ప్రైవేట్ హాస్పిటల్లో స్వీపర్గా పని చేసే తల్లి జీతంతో కుటుంబ పోషణ కష్టంగా ఉందని తెలిపింది. అప్పులు చేస్తూ సాధన కొనసాగిస్తున్నానని ఇలాంటి పరిస్థితుల్లో తన ప్రతిభను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం లేదా ఎవరైనా దాతలు ఆర్థిక సహాయం అందించాలని కోరుతోంది. దాతలు సహకరిస్తే దేశానికి పతకాలు సాధించగలననే ఆత్మ విశ్వాసం తనకుందని అంటోంది. సహాయం చేయాలనుకునే వారు ఫోన్ నెం 6304394851 లో సంప్రదించవచ్చు. (చదవండి: చిరిగిన పుస్తకాలు..విరిగిన కుర్చీలు) -
యువ స్విమ్మర్ మృతి.. భౌతిక కాయం తరలించేందుకు డబ్బుల్లేని దుస్థితి
Former Swimming Champion Amartya Chakraborty Passed Away: మూడు జాతీయ అవార్డుల గ్రహీత, కామన్వెల్త్ క్రీడల్లో పతకం సాధించిన తొలి భారత స్విమ్మర్ అమర్త్య చక్రవర్తి (19) అనారోగ్యం కారణంగా ఢిల్లీలోని జీబీ పంత్ ఆస్పత్రిలో మృతి చెందాడు. గత కొంతకాలంగా వెన్నెముక, మెదడు సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న అమర్త్య.. బుధవారం ఉదయం కార్డియో రెస్పిరేటరీ అరెస్ట్ కావడంతో కన్నుమూశాడు. భౌతికకాయాన్ని స్వస్థలానికి తరలించేందుకు కూడా డబ్బులు లేవని అమర్త్య తండ్రి అమితోష్ చక్రవర్తి కన్నీరుమున్నీరవడం అందరినీ కలచి వేసింది. కొడుకుని బతికించుకునేందుకు ఉన్నందంతా ఖర్చుచేయడమే కాక పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయానని అమితోష్ వాపోయాడు. ఆర్ధిక సాయం కోసం కేంద్ర క్రీడా శాఖకు, భారత పారాలింపిక్ కమిటీకి ఎన్నిసార్లు లేఖలు రాసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, అమర్త్య చక్రవర్తి అనారోగ్యం కారణంగా ఐదేళ్ల కిందట పారా స్విమ్మింగ్ ఈవెంట్స్లో పాల్గొనే అర్హతను కోల్పోయాడు. అమర్త్య 2017 పారా నేషనల్స్లో ఉత్తమ స్విమ్మర్ అవార్డును గెలుచుకున్నాడు. చదవండి: బోణీ విజయం కోసం ముంబై.. రెండో విజయంపై కన్నేసిన చెన్నై -
అస్తమించిన క్రీడా దిగ్గజం..
సాక్షి, కరీంనగర్ : దివ్యాంగ క్రీడాకారులకు ఆయన ఓ స్ఫూర్తి.. ఆదర్శం. దివ్యాంగుడైనా పట్టుదల.. సడలని ఆత్మవిశ్వాసం.. మనోధైర్యంతో ప్రపంచ స్థాయి పోటీల్లో విజేతగా నిలిచాడు. ఆటే శ్వాసగా ప్రతీ పోటీలో పతకాలు సాధిస్తూ జాతీయ పతాకాన్ని రెపరెపలాడించాడు. ఆయన క్రీడా ప్రతిభ ముందు వైకల్యం తలవంచింది. చివరికి క్యాన్సర్తో ఆయన సాగించిన పోరాటంలో పరాజితుడై తుది శ్వాస విడిచాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లికి చెందిన అర్జున అవార్డు గ్రహీత మాదాసు శ్రీనివాస్రావు(67) హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో మృతిచెందారు. కార్సినోమా క్యాన్సర్తో చికిత్స పొందుతూ కొంతకాలంగా కోమాలో ఉన్న ఆయన బుధవారం రాత్రి తుదిశ్వాస వదిలారు. స్వగ్రామంలో అంత్యక్రియలు.. శ్రీనివాసరావు స్వగ్రామం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో క్రీడాభిమానుల అశ్రునయనాల మధ్య గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. శ్రీనివాస్రావు మృతదేహం వద్ద సర్పంచ్ వీరగోని సుజాత, ఎంపీటీసీ పులి అనూష నివాళులర్పించారు. ఆయనకు భార్య రమాదేవి, ఇద్దరు కుమారులు, రోహిత్, రోహన్, కూతురు ధృవి ఉన్నారు. మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించిన శ్రీనివాస్రావు వృత్తి రీత్యా ఆర్టీసీలో మెకానిక్గా చేరారు. ఉత్తమ దివ్యాంగ ఉద్యోగిగా 1994లో జాతీయ స్థాయి అవార్డును అప్పటి రాష్ట్రపతి శంకర్దయాల్ శర్మ చేతుల మీదుగా అందుకున్నారు. దివ్యాంగుల జాతీయ క్రీడా సంఘానికి అనుబంధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పారా స్పోర్ట్స్ సంఘం ఏర్పాటు చేశారు. 2003లో అర్జున అవార్డు.. 1996లో లండన్లో జరిగిన దివ్యాంగుల ప్రపంచ షూటింగ్ చాంపియన్షిప్లో స్వర్ణ పతకాన్ని సాధించారు. 2002లో బెంగళూరులో జరిగిన వరల్డ్ పారా బ్యాడ్మింటన్లో స్వర్ణం సాధించారు. దీంతో భారత ప్రభుత్వం 2003లో అర్జున అవార్డు ప్రకటించింది. అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి పారా అథ్లెట్ల విభాగంలో అర్జున పురస్కారాన్ని పొందిన తొలి శ్రీడాకారుడిగా రికార్డ్ సాధించారు. 2010లో చైనాలోని గ్వాంగ్ జూలో జరిగిన ఏసియన్ పారా ఫెన్సింగ్లో భారత్కు ప్రాతినిధ్యం వహించారు. 2004లో మలేసియాలో జరిగిన మెన్స్ డబుల్స్ ఏసియన్ పారా బ్యాడ్మింటన్లో కాంస్య పతకం, 2006లో ఇజ్రాయిల్లో జరిగిన సింగిల్స్ ఓపెన్ బ్యాడ్మింటన్లో కాంస్యం, 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో బ్యాటన్ రిలేలో ప్రతిభ కనబరిచారు. 2006 నుంచి ముంబయి మారథాన్ రన్లో వరుసగా పాల్గొన్నారు. చివరగా 2018లో బెంగళూర్ జరిగిన రన్లో పాల్గొని కాంస్య పతకం సాధించారు. వైఎస్సార్ పాదయాత్రలో.. దివంగత సీఎం వైఎస్సార్ జిల్లాలో చేపట్టిన పాదయాత్రలో ఆయనతో కలిసి అడుగులు వేశారు. జమ్మికుంట నుంచి పరకాల వరకు పాదయాత్రలో పాల్గొన్నారు. అర్జున అవార్డు అందుకున్న మాదాసు కు అప్పటి ఏపీ సీఎం వైఎస్సార్ రూ.లక్ష నజరానా అందించారు. 2017లో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం దివ్యాంగ స్ఫూర్తి అవార్డు ప్రదానం చేసింది. ఇంటి స్థలం కోసం.. అర్జున అవార్డు గ్రహీతలకు ప్రభుత్వాలు ఇంటి స్థలాలివ్వడం పరిపాటి. తిమ్మాపూర్ సమీపంలో తనకు 3 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయించాలని ప్రభుత్యాలను విన్నవించినా నేటికీ కేటాయింపులు జరగలేదు. పద్మశ్రీ పురస్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయడం గమనార్హం. 2004లో జిల్లా కేంద్రంలో మాదాసు శ్రీనివాస్రావు కాలనీని ఏర్పాటు చేసింది. తన అంతర్జాతీయ ప్రతిభతో ఎంతోమంది దివ్యాంగులు క్రీడల్లో భాగస్వాములను చేస్తూ వారికి స్ఫూర్తినిచ్చారు. దీంతో అంజనారెడ్డి, రఘురాం వంటి దివ్యాంగ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. శ్రీనివాస్రావు మృతదేహానికి నివాళులరి్పస్తున్న సర్పంచ్ సుజాత -
పారాఅథ్లెట్తో బిచ్చమెత్తించారు..
న్యూఢిల్లీ: శారీరక లోపాలతో సతమతమవుతున్నా వెరవక కష్టించి.. ఏదో సాధించి దేశం పేరు మార్మొగేలా చేయాలని తపన పడుతున్న ఓ పారాఅథ్లెట్కు తీవ్ర అవమానం జరిగింది. దృష్టిలోపం గల కాంచనమాల పాండే ఈ నెల 3 నుంచి 9 వరకూ జర్మనీ రాజధాని బెర్లిన్లో జరిగిన పారా స్విమ్మింగ్ చాంపియన్షిప్లో పాల్గొని వెండి పతకం సాధించారు. అయితే, చాంపియన్షిప్లో పాల్గొంటున్న సమయంలో ఖర్చులకు డబ్బు లేకపోవడంతో ఆమె బిచ్చమెత్తినట్లు రిపోర్టులు వచ్చాయి. కాంచనమాల పాండే ఇంటర్వూ తీసుకున్న మెయిల్ టుడే.. టూర్లో ఆమెకు జరిగిన అవమానాన్ని వెలుగులోకి తెచ్చింది. టోర్నీలో పాల్గొనేందుకు రూ.5 లక్షలు లోన్ తీసుకున్నట్లు కాంచనమాల మెయిల్ టుడేకు వెల్లడించారు. టోర్నమెంట్ ముగిసేనాటికి తాను రూ.1,10,000/- హోటల్ బిల్లు చెల్లించాల్సివుందని చెప్పారు. తాను ఖర్చు చేసిన డబ్బు రీయింబర్స్మెంట్ రూపంలో వెనక్కు వస్తుందో? రాదో కూడా అధికారికంగా సమాచారం లేదని వెల్లడించారు. కాగా, ఈ ఏడాది జరిగిన పారా అథ్లెటిక్ స్విమ్మింగ్ చాంపియన్షిప్కు భారత్ నుంచి ఎంపికైన ఏకైక స్విమ్మర్ కాంచనమాల పాండేనే. కాంచనమాలకు ఈ గతి పట్టడానికి కారణం భారత పారాలింపిక్ కమిటి(పీసీఐ)యే అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టూర్కు బయల్దేరే ముందు ఆర్థిక సాయం కోసం కాంచనమాల పెట్టుకున్న అభ్యర్ధనను పీసీఐ పట్టించుకోలేదు. ఈ ఘటనపై టాప్ చైర్మన్ అభినవ్ బింద్రా ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్, ప్రధానమంత్రి నరేంద్రమోదీలకు ట్వీట్ చేశారు. బింద్రా ట్వీట్కు వెంటనే సమాధానం ఇచ్చిన గోయల్.. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. విచారణ తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)
ఆసీస్ యువ సంచలనానికి లక్కీ ఛాన్స్.. వరల్డ్కప్ జట్టులో చోటు!?
పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
'దేవర' ఫియర్ సాంగ్ వచ్చేసింది
హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
తారక్ అభిమానుల మంచి మనసు.. 'రా ఎన్టీఆర్ 2.0' టీమ్ రక్తదానం
నా ఆల్టైమ్ ఫేవరెట్ క్రికెటర్ అతడే: టీమిండియా స్టార్
సెంటరాఫ్ అట్రాక్షన్గా ఉండాలనే తపన ..!
14 ఏళ్ల వయస్సులోనే కల.. ఎవరీ ‘ఐస్క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’
ఎస్బీఐకి మొట్టికాయలు గట్టిగానే పడ్డాయిగా?
తప్పక చదవండి
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement