నాలుకా.. తాటిమట్టా?  | Sakshi
Sakshi News home page

నాలుకా.. తాటిమట్టా? 

Published Sat, Apr 13 2024 5:37 AM

During the YSRCP regime the welfare of the police was given priority - Sakshi

వైఎస్సార్‌సీపీకి పోలీసులు ఊడిగం చేస్తున్నారని నాడు రామోజీ రాతలు

బెడిసికొట్టడంతో వేధిస్తున్నారంటూ నేడు ప్లేటు ఫిరాయింపు  

వైఎస్సార్‌సీపీ హయాంలోనే పోలీసుల సంక్షేమానికి పెద్దపీట 

16 ఏళ్ల డిమాండ్‌ 16 రోజుల్లో పరిష్కారం 

అమరవీరుల పిల్లలకు 2 శాతం రిజర్వేషన్‌.. ఎస్సైలకు గెజిటెడ్‌ హోదా 

సాక్షి, అమరావతి: ‘అది నేనే... ఇది నేనే... నా చేతులతోనే పోలీసులపై బురద జల్లుతా... మళ్లీ నా నోటితోనే అయ్యో పోలీసులు అంటూ మొసలి కన్నీరు కారుస్తా’  ఇదీ ఈనాడు రామోజీరావు పాత్రికేయ వికృత తాండవం. మొన్నటి వరకు రాష్ట్రంలో ఐపీఎస్‌ అధికారుల నుంచి కానిస్టేబుల్‌ వరకూ వైఎస్సార్‌సీపీకి ఊడిగం చేస్తున్నారంటూ యథేచ్ఛగా రాసేశారు. దీనిపై పోలీసు యంత్రాంగం తిరగబడడంతో రామోజీ వెంటనే ప్లేటు ఫిరాయించి పోలీసులను వైఎస్సార్‌సీపీ నేతలు వేధిస్తున్నారంటూ నిర్లజ్జగా మరో విషపు రోత రాత అచ్చేసేశారు.

చంద్రబాబు ప్రభుత్వంలో పూర్తి నిర్లక్ష్యానికి గురైన పోలీసు వ్యవస్థకు గౌరవాన్ని పెంచింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనన్న నిజాన్ని ఉద్దేశ పూర్వకంగా విస్మరించారు. చంద్రబాబు–పురందేశ్వరి కుట్రలో భాగంగా ఎన్నికల కమిషన్‌(ఈసీ)ను తప్పుదారి పట్టించేందుకు పోలీసులపై దు్రష్పచారం చేశారు. ఈ నేపథ్యంలో ఈసీ ఒక డీఐజీ, అయిదుగురు ఎస్పీలను బదిలీ చేసింది. వారి స్థానంలో ఎన్నికల నియమావళి ప్రకారం కొత్త అధికారులను నియమించింది కూడా. అయినా సరే ఈనాడు రామోజీరావు శాంతించ లేదు.

తనను సంప్రదించకుండా ఎస్పీలను ఈసీ నియమిస్తుందా అన్నట్టుగా పేట్రేగిపోయారు. ‘వీళ్లా ఎస్పీలు..’ అంటూ ఐపీఎస్‌ అధికారులను అవమానపరుస్తూ విషం కక్కారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలపై కూడా దు్రష్పచారానికి పాల్పడ్డారు. దీనిపై ఐపీఎస్‌ అధికారుల సంఘం, పోలీసు అధికారుల సంఘం  తీవ్రంగా స్పందించి ఈసీకి ఫిర్యాదు చేశాయి. దీంతో రామోజీ మరో కుట్రకు తెరతీశారు.  

16 ఏళ్ల డిమాండ్‌ 16 రోజుల్లో పరిష్కారం 
బ్రిటిష్‌ కాలంలో ప్రవేశపెట్టిన తమ యూనిఫామ్‌లో మార్పులు చేయాలని ఆర్మ్‌డ్‌ రిజర్వుడ్‌(ఏఆర్‌), స్పెషల్‌ పోలీస్‌(ఏపీఎస్పీ) కానిస్టేబుళ్లు 16 ఏళ్లుగా చేస్తున్న డిమాండ్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 16 రోజుల్లో పరిష్కరిస్తూ జీవో జారీ చేశారు. బ్యారెట్‌ టోపీ స్థానంలో పీక్‌ టోపీని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. కానిస్టేబుల్‌ నుంచి రిజ ర్వ్‌ ఎస్సై స్థాయివరకు నలుపు రంగు విజిల్‌ కార్డ్‌ను తీసుకువచ్చింది. ఏఆర్, ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు విజిల్‌ కార్డ్‌తోపాటు పోలీస్‌ ఎంబ్లమ్‌ ఉన్న నలుపు బకిల్‌ ఉన్న బెల్ట్‌ను యూనిఫామ్‌లో భాగం చేసింది. 
రాష్ట్రంలో ఎస్సైలకు గెజిటెడ్‌ అధికారి హోదా కల్పించాలన్న దీర్ఘకాలిక డిమాండ్‌పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కొత్త పీఆర్సీ ద్వారా ఆ మేరకు సిఫార్సు చేయనున్నట్టుగా ప్రకటించింది.  
పోలీసులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించేందుకు ఎస్‌ఎల్‌ఆర్, ఏఎస్‌ఎల్‌ఎస్‌ బిల్లులు చెల్లించేలా ఆర్థిక శాఖను ఆదేశించారు. వివిధ రిస్క్‌ అలవెన్స్‌లను మంజూరు చేయాలని ఆదేశించారు.    
24 ఏళ్ల సర్వీసు ఇంక్రిమెంట్‌ను కొనసాగిస్తూనే 30 ఏళ్ల సర్విసుకు ప్రత్యేకంగా ఇంక్రిమెంట్‌ మంజూరు చేయాలని నిర్ణయించింది.  
ఏపీఎస్పీ నుంచి ఏఆర్‌కు మారే పోలీసులకు 6, 12, 18, 24 ఇంక్రిమెంట్లను మంజూరు చేయాలని నిర్ణయించింది.  
అమర వీరుల కుటుంబాల పిల్లలకు ఇంజినీరింగ్, వైద్య విద్య తదితర కోర్సుల్లో 2 శాతం రిజర్వేషన్‌ (ఇది వరకు 0.25 శాతం) కల్పించారు.   

ఇతర ప్రయోజనాలు  
♦ డీజీపీ, జిల్లా ఎస్పీ, పోలీస్‌ కమిషనరేట్లలో ప్రత్యేకంగా గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు.  
♦ కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రాల్లో పోలీసు ఆసుపత్రుల ఏర్పాటు. 
♦ మహిళా పోలీసులకు అదనంగా ఏడాదికి 5 క్యాజువల్‌ లీవులు. చైల్డ్‌ కేర్‌ లీవులు 150 నుంచి 180 రోజులకు పెంపు.  
విధి నిర్వహణలో భాగంగా రాజధానికి వచ్చే మహిళా పోలీసులకు ప్రత్యేక వసతి సౌకర్యం.. ఎల్‌టీసీ సౌకర్యం పునరుద్ధరణ  
 పోలీసు అధికారుల సంఘం తొలిసారిగా రాష్ట్ర జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో భాగం.     

Advertisement
Advertisement