ఓట్ల కోసమే దుష్ప్రచారం
● జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో రైతులకు మేలే తప్ప నష్టం ఉండదు
● ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అపోహలు
కల్పిస్తున్న టీడీపీ, ఎల్లోమీడియా
● వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఉంది
● ఈ ఎన్నికల్లోనూ విజయం తథ్యం
● ‘సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూలో గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య సాక్షి ప్రతినిధి, విజయనగరం:
చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఉమ్మడి విజయనగరం జిల్లాలకు చేసిన మేలు ఒక్కటీ లేదని గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య చెప్పారు. చెప్పుకోవడానికి ఏమీ లేక ఓట్ల కోసం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై దుష్ప్రచారానికి దిగడం నీచాతినీచమని ధ్వజమెత్తారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో రైతులకే మేలే తప్ప నష్టం ఉండదని విస్పష్టంగా చెప్పారు. గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మరోసారి బరిలోకి దిగిన ఆయన తన విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.
సాక్షి: టీడీపీ, జనసేన పార్టీ నాయకులు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులపై హద్దులు మీరి దుష్ప్రచారం చేయడం వెనుక లక్ష్యమేమిటి? అప్పలనర్సయ్య: అధికారం దక్కదనుకున్నప్పుడే చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారం ఆకాశమంత ఎత్తులో చేస్తుంది. తొలి నుంచి వారి తీరే అంత. సొంత మామకు వెన్నుపోటుతో తొలుత ముఖ్యమంత్రి పదవి పొందిన చంద్రబాబు 1999 సంవత్సరంలో బీజేపీ అనుకూల గాలితో రెండోసారి ఆ కుర్చీ ఎక్కారు. అలా తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నా హైటెక్ పేరుతో హంగామా తప్ప రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన వ్యవసాయ రంగాన్ని విస్మరించారు. విద్యుత్ చార్జీలు తగ్గించాలని ఉద్యమిస్తే బషీర్బాగ్లో రైతులపై కాల్పులు జరిపించి ముగ్గురి ప్రాణాలు బలిగొన్నారు. అప్పట్లో చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అదే సమయంలో అలిపిరి ఘటనతో సానుభూతి వస్తుందని ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ప్రజలు అతన్ని ఇంటికి పంపించారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి సంక్షేమ నినాదంతో ముఖ్యమంత్రి అయ్యారు. ఇచ్చిన హామీల కన్నా మిన్నగా రాష్ట్రాన్ని ఇటు సంక్షేమంలో, అటు అభివృద్ధిలో ముందుకు నడిపించారు. అందుకే 2009 ఎన్నికల్లోనూ ఆయనకే ప్రజలు పట్టం కట్టారు. అప్పుడు కూడా ఇదే చంద్రబాబు, ఆయన అనుకూల పచ్చమీడియా కట్టుకథలు, అభూత కల్పనలతో ప్రజలను భయభ్రాంతులను చేయడానికి ప్రయత్నించినా తమ వివేచనతో నిర్ణయం తీసుకున్నారు. 2014 ఎన్నికల్లో 600 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన బాబు ప్రజలను మోసం చేయడంతో 2019 ఎన్నికల్లో ఓటుతో గట్టిగా బుద్ధిచెప్పారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి సంక్షేమ, అభివృద్ధి పాలన అందించారు. కరోనా కష్టకాలంలో చంద్రబాబు హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్యాలెస్ గేట్లు మూసేసుకుంటే, జగన్మోహన్రెడ్డి మాత్రం నిరంతర పర్యవేక్షణతో ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. విపత్తు నిర్వహణలో ఆయన శైలిని పొరుగు రాష్ట్రాల నాయకులూ ప్రశంసించారు. నవరత్నాల్లాంటి సంక్షేమ పథకాలతో పాటు నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందించారు. 59 నెలల పాలనలో మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చారు. మన ఉమ్మడి విజయనగరం జిల్లానే చూసుకుంటే చంద్రబాబు చేయలేక చేతులెత్తేసిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ, కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, జాతీయ రహదారుల విస్తరణ తదితర పనులన్నీ కొలిక్కి తీసుకొచ్చారు. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారానికి తెగించారు. అంతే తప్ప వారి ఆరోపణల్లో వాస్తవం లేదు.
సాక్షి: ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను ఇప్పుడు అదే కూటమిలోనున్న టీడీపీ, జనసేన వ్యతిరేకించడం వెనుక ఉద్దేశం ఏమై ఉంటుంది? అప్పలనర్సయ్య: టీడీపీ, జనసేన ఆ యాక్ట్ను వ్యతిరేకించట్లేదు. దుష్ప్రచారం చేస్తున్నాయి. వాస్తవానికి భూహక్కు చట్టం అన్నివిధాలా రైతులకు ఉపయోగపడుతుంది. మేలు చేస్తుంది. దశాబ్దాల నుంచి రీసర్వే జరగలేదు. నాటి రెవెన్యూ రికార్డులు సరిగాలేవు. చాలామంది రైతులకు యాజమాన్య హక్కుపత్రాలు లేవు. కోర్టుల్లో సివిల్ లిటిగేషన్లు పెరిగిపోతున్నాయి. కలెక్టరేట్లకు వచ్చే ఫిర్యాదుల్లో అధిక భాగం భూవివాదాలే. ఇంట్లో ఏ అత్యవసరం వచ్చినా భూమిని అమ్ముకోవడానికీ వీల్లేని పరిస్థితుల్లో ఎంతోమంది అష్టకష్టాలు పడ్డారు. వీటన్నింటికీ పరిష్కారంగా భూసర్వే చేయించాలని రైతులు చాలామంది కోరుకున్నారు.
కేంద్రంలోని బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా సమగ్ర
భూసర్వేకు మొగ్గు చూపించింది. నాడు అసెంబ్లీలో జరిగిన చర్చలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులతో
పాటు పయ్యావుల కేశవ్ తదితర టీడీపీ నాయకులు కూడా ఈ భూసర్వే చట్టంపై హర్షం ప్రకటించారు. తీరా ఎన్నికలు వచ్చేసరికి ఓట్లకోసం దాన్నే టీడీపీ నాయకులు రైతులకు బూచిగా చూపిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా నీచమైన పని.
సాక్షి: వచ్చే వారమే పోలింగ్. మీ ప్రచారం ఎలా సాగుతోంది? అప్పలనర్సయ్య: అన్నివిధాలా వైఎస్సార్సీపీ ముందుంది. ఏ గ్రామాలకు వెళ్లినా మహిళల నుంచి మంచి స్పందన వస్తోంది. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకంలోనూ వారికే పెద్దపీట వేసింది. గర్భంలోనున్న శిశువు నుంచి ఇంట్లోనున్న వృద్ధుల వరకూ ప్రతి ఒక్కరి సంక్షేమానికి గతంలో ఎన్నడూలేనివిధంగా తీసుకున్న చర్యలు వారిని ఆలోచింపజేస్తున్నాయి. నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లో, అత్యాధునిక వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించడాన్ని వారు చూస్తున్నారు.
సాక్షి: నవరత్నాల ప్లస్పై ప్రజల స్పందన ఎలా ఉంది? అప్పలనర్సయ్య: గత 59 నెలల పాలనలో క్రమం తప్పక 130 సార్లు బటన్ నొక్కి నవరత్నాలను అందించిన వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని అన్నివర్గాల వారు ఆశిస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాల ప్లస్ కోసం మరో 130 సార్లు బటన్ నొక్కుతారని బలంగా నమ్ముతున్నారు. అందుకోసం ఎమ్మెల్యేకు ఒకటి, ఎంపీకి ఒకటి రెండు బటన్లు నొక్కాలన్న జగన్మోహన్రెడ్డి పిలుపునకు సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. మళ్లీ వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే.
సాక్షి: మీ నియోజకవర్గానికి అభివృద్ధి ప్రణాళిక ఏమిటి? అప్పలనర్సయ్య: విద్య, వైద్యం, రోడ్లు, గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి గత ఐదేళ్లలో ప్రాధాన్యం ఇచ్చాం. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే తోటపల్లి బ్రాంచ్ కెనాల్, ఏడువంపుల గెడ్డ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు సత్వర పూర్తిచేసి ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాం. గజపతినగరంలో వంద పడకల ఆస్పత్రి ప్రారంభిస్తాం. డిగ్రీ కాలేజీ భవనాల నిర్మాణం పూర్తిచేస్తాం. అక్కడక్కడా మిగిలిన రోడ్ల నిర్మాణ పనులన్నీ సత్వరమే చేయిస్తాం. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో గ్రామస్వరాజ్యాన్ని సాకారం చేస్తాం. సాక్షి: భూ సర్వేకు రైతుల సహకారం ఎలా ఉంది? అప్పలనర్సయ్య: ఉమ్మడి విజయనగరం జిల్లాలో వ్యవసాయమే ప్రధానం. ఎక్కువ మంది రైతులు, వ్యవసాయ కూలీ కుటుంబాలే. భూ సర్వే వల్ల నష్టపోయామని ఇప్పటివరకూ ఒక్కరైనా జిల్లాలో చెప్పారా? లేకపోయినా అదో భూతంలా టీడీపీ నాయకులు, ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. రైతులు మాత్రం భూసర్వే సహకరిస్తున్నారు. అధికారుల సమక్షంలో హక్కులు పొందుతున్నారు.
సాక్షి: భూహక్కు సాకార దిశగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అప్పలనర్సయ్య: పేదల వద్దనున్న డి.పట్టా భూములు, చుక్కల భూములు వాస్తవానికి ప్రభుత్వ భూములు. వాటిని ఏళ్ల తరబడి సాగుచేసుకోవడమే తప్ప అత్యవసర ఆర్థిక అవసరాలకు అమ్ముకోవడానికి వీల్లేని పరిస్థితి. వారికి మేలు చేసేలా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం భూహక్కు కల్పించింది. లక్షలాది ఎకరాల డి.పట్టా భూములను జిరాయితీగా మార్పు చేసింది. చుక్కల భూములకు మోక్షం కల్పించింది. వేలాది మంది గిరిజనులకు గతంలో ఎన్నడూ లేనివిధంగా భూపట్టాలు ఇచ్చారు. అలాంటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రజల భూమి ఎందుకు లాక్కొంటుంది? 14 ఏళ్ల పాలనలో రైతులకు మంచి పనులు ఒక్కటైనా చేశానని చంద్రబాబు చూపించగరా?