Naima Khatoon: వందేళ్లకు ఆమె వచ్చింది.. | Sakshi
Sakshi News home page

Naima Khatoon: వందేళ్లకు ఆమె వచ్చింది..

Published Fri, Apr 26 2024 11:14 AM

Naima Khatoon Becomes First Woman Vice Chancellor Success Story - Sakshi

వందేళ్ల చరిత్ర ఉన్న అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ ఎప్పుడూ ఒక మహిళను వైస్‌ చాన్సలర్‌గా చూడలేదు. కాని మొదటిసారి ప్రొఫెసర్‌ నైమా ఖాతూన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్మువి.సి.గా నియమించారు. దీంతో నైమా ఖాతూన్‌ చరిత్ర సృష్టించారు. ఆమె మైనారిటీ వర్గ మహిళలకు గొప్ప స్ఫూర్తి కాగలదంటూ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నైమా ఖాతూన్‌ పరిచయం..

నైమా ఖాతూన్‌కు ముస్లిం మహిళల చదువు గురించి చాలా పట్టింపు ఉంది. ‘ఉత్తరాదిలో నేను ప్రిన్సిపాల్‌గా పని చేసిన అలీగఢ్‌ విమెన్స్‌ కాలేజ్‌ చాలా ముందంజలో ఉంది. అక్కడ మూడు వేల మంది ముస్లిం ఆడపిల్లలు చదువుకుంటున్నారు. కాని ఇదొక్కటే సరిపోదు. ఉత్తరప్రదేశ్, బిహార్‌లలో ముస్లిం బాలికల విద్య చాలా వెనుకబడి ఉంది. దక్షణాదిలో ముస్లిం సమూహాలు విద్యా రంగంలో ముస్లిం బాలబాలికలను ఫ్రోత్సహిస్తున్నాయి. ఉత్తరాదిలో ఆ పని జరగడం లేదు. రాజకీయ, ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనాన్ని జయించాలంటే విద్యార్జనకు మించిన వేరే మార్గమేదీ లేదు’ అంటుందామె.

విద్యారంగంలో బాలికల విద్య కోసమే కాదు ఉన్నతవిద్యలో ముస్లింల ్రపాతినిధ్యం పెరగాలని కోరుకునే నైమా ఖాతూన్‌ను భారత ప్రభుత్వం గుర్తించి రెండు రోజుల క్రితం అత్యంత ప్రతిష్టాత్మకమైన అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయానికి వైస్‌ చాన్సలర్‌ను చేసింది. దాదాపు 100 ఏళ్లకు మించిన ఘన చరిత్ర ఉన్న ఈ విశ్వవిద్యాలయానికి ఇలా ఒక మహిళ వి.సి. పదవిలో కూచోవడం ఇదే మొదటిసారి.

గమనించాల్సిన విషయం ఏమంటే ఇన్నాళ్లు పురుషులు మాత్రమే వి.సి.లుగా ఉన్న జె.ఎన్‌.యుకు శాంతిశ్రీ పండిట్‌ మొదటి మహిళా వి.సి. కావడం, అలాగే జామియా మిలియా ఇస్లామియాకు నజ్మా అక్తర్‌ తొలి వి.సి. కావడం (ఆమె పదవీకాలం ముగిసింది) పాతమూసలను బద్దలు చేయడమే. ఆ వరుసలో ఇప్పుడు నైమా ఖాతూన్‌ చేరారు.

సైకాలజీప్రొఫెసర్‌..
ఒడిశాకు చెందిన నైమా ఖాతూన్‌ ఉన్నత విద్య అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీలోనే జరిగింది. అక్కడే ఆమె బి.ఏ. సైకాలజీ చదివింది. ఆ తర్వాత పి.హెచ్‌డి. వరకూ అక్కడే కొనసాగి 1988లో అదే యూనివర్సిటీలో లెక్చరర్‌గా తన ఫ్రయాణం మొదలెట్టింది. ఆ తర్వాత అసోసియేట్‌ప్రొఫెసర్‌గా,ప్రొఫెసర్‌గా పదోన్నతి పొంది సైకాలజీ డిపార్ట్‌మెంట్‌ చైర్‌పర్సన్‌ అయ్యింది.

పొలిటికల్‌ సైకాలజీ అధ్యయనంలో భాగంగా ‘హిందూ ముస్లిం యువతపై రాజకీయ భావోద్వేగాల ప్రభావం’ అనే అంశం మీద ఆమె చేసిన పి.హెచ్‌డి. కీలకమైనది. అలీగఢ్‌ విమెన్స్‌ కాలేజ్‌కు ప్రిన్సిపాల్‌గా పని చేస్తూ ఉండగా ఆమెను వి.సి.గా పని చేసే అవకాశం వరించింది. ఇప్పుడు ఎలక్షన్‌ కోడ్‌ అమలులో ఉంది కనుక ఇ.సి. అనుమతి తీసుకోని ఆమె నియామకం చేసింది ప్రభుత్వం. నైమా ఖాతూన్‌ తరచూ అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో తన పరిశోధనా పత్రాలను సమర్పిస్తుంటారు.

రాజకీయ ప్రాతినిధ్యం..
భారతదేశంలో మహిళలకు రాజకీయ ్రపాధాన్యం లభించడం లేదని నైమా ఖాతూన్‌ అంటారు. ముఖ్యంగా అణగారిన వర్గాల స్త్రీలు పార్లమెంట్‌ వరకూ చేరుకోవడానికి చాలా అడ్డంకులు ఉన్నాయని, రాజకీయ అధికారం లేకుండా కీలకమైన విధానమార్పు తేలేమని అభి్రపాయపడతారు. ‘ఆర్థిక శక్తిని, రాజకీయ శక్తిని పొందడటంలో అణగారిన వర్గాల స్త్రీలు నిస్సహాయంగా ఉన్నారు’ అంటారామె.

ఇవి చదవండి: Neelima Penumarthy: కథలకో గంట 1/24.. నీలిమ చెప్పే కథ చదవండి!

Advertisement
Advertisement