దేశం మార్పు కోరుతోంది! | Sakshi
Sakshi News home page

దేశం మార్పు కోరుతోంది!

Published Sat, Apr 6 2024 1:58 AM

The country wants change - Sakshi

కాంగ్రెస్‌ అంటేనే గ్యారంటీ, చెప్పిందే చేస్తుంది, చేసేదే చెప్తుంది. కాంగ్రెస్‌ పార్టీకి, వివిధ రాష్ట్రాలకు జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీలను వంద రోజుల్లో తు.చ. తప్పకుండా అమలు చేసిన ఘనత ఉంది. శని వారం హైదరాబాద్‌ తుక్కు గూడలో లోక్‌సభ ఎన్నికల శంఖం పూరిస్తోంది. ఈ దేశంలో ఉన్న మేధావులతో, ప్రజాస్వామికవాదులతో చర్చించి ‘5 న్యాయాలతో కూడిన మేనిఫెస్టో’ను రూపొందించి అమలుకు సిద్ధమైంది. కాంగ్రెస్‌ మేని ఫెస్టోను ప్రధానంగా 1. వర్క్‌(పని) 2. వెల్త్‌( సంపద) 3. వెల్ఫేర్‌(సంక్షేమం) కలయికగా చెప్పవచ్చు.

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ‘జోడో యాత్ర’లో ప్రతిపాదించిన  ఐదు న్యాయాలు: యువ న్యాయం, నారీ న్యాయం, రైతు న్యాయం, శ్రామిక న్యాయం, సామాజిక న్యాయం కోసం 25 గ్యారెంటీలు ప్రజలకు ఇస్తున్నాం.యువ న్యాయం కింద చదువుకున్న యువతకు ఉద్యోగ నియమకాల్లో భరోసా కల్పిస్తాం. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం ఖాళీలను భర్తీ చేస్తాం. 30 లక్షల కొత్త ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు అందిస్తాము. పేపర్‌ లీక్‌ల నుంచి విముక్తి కల్పిస్తాం, అందుకు పటిష్ఠమైన పరీక్ష విధానాన్ని కఠినమైన చట్టాలను రూప కల్పన చేస్తాం. ‘యువ క్రాంతి పథకం’ కింద నిరుద్యోగ యువతీ యువకుల కోసం రూ. 5000 కోట్లతో ‘స్టార్ట్‌ ఫండ్‌’ ఏర్పాటు చేస్తాం.

నారీ న్యాయం కోసం ‘మహాలక్ష్మి’ పథకం కింద ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళకు ప్రతి ఏడాదికి లక్ష రూపాయల సాయం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం నియామకాల్లో 50 శాతం ఉద్యోగాలు మహిళలకు రిజర్వ్‌ చేస్తాం. మహిళా శక్తిని గౌరవిస్తాం. ‘ఆశా’ వర్కర్లు, మధ్యాహ్న భోజన– అంగన్వాడీ కార్యకర్తలకు అధిక జీతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వ సహకారం రెట్టింపు చేస్తాం. ‘అధికారం– మైత్రి’ కార్యక్రమంలో భాగంగా మహిళలకు చట్టపరమైన హక్కులు, ప్రభుత్వ పథకాల గురించి తెలియజేసేందుకు ప్రతి గ్రామంలో ఒక ‘అధికార మైత్రి’ నియామకం చేపడుతాం. సావిత్రీబాయి ఫూలే పేరిట హాస్టళ్లు ఏర్పాటు చేస్తాం.

ఇండియా కూటమి ప్రభుత్వంలో రైతులకు పెద్దపీట వేయబోతున్నాం. రైతు ప్రాధాన్యంగా కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో రూపొందింది. స్వామినాథన్‌ కమిషన్‌ సూచ నల మేరకు రైతులు పండించిన ధాన్యానికి సరైన మద్దతు ధర కల్పిస్తూ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తాం. ‘రైతు రుణ మాఫీ’ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించాము. అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా రైతుల రుణమాఫీ కోసం ‘రైతు కమిషన్‌’ ఏర్పాటు చేయ బోతున్నాం. దానికి చట్టబద్ధత ఉంటుంది.

రైతులకు పంట నష్ట సమయంలో ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు పంటల బీమా చెల్లింపు విష యంలో అనేక కొరీలు పెడుతూ రైతులను ఇబ్బంది పెడుతున్నట్టు జోడో యాత్రలో రాహుల్‌ గాంధీ దృష్టికి వచ్చింది. దీని పరిష్కారం కోసం పంటం నష్టపోతే 30 రోజుల్లో బీమా సొమ్ము నేరుగా రైతు బ్యాంకు ఖాతాలోకి జమ చేసే విధంగా బీమా చెల్లింపు ప్రత్యక్ష బదిలీ పద్ధతిని అమలు చేయబోతున్నాం. వ్యవసాయ పనిముట్లకు, ఎరువులకు, విత్తనాలకు జీఎస్టీ మిన హాయింపు ఇవ్వాలని నిర్ణయించాం.

శ్రామిక న్యాయం పేరుతో దేశవ్యాప్తంగా శ్రామి కులకు రోజువారీ వేతనం రూ. 400కు పెంచడం జరుగుతుంది. ఇది జాతీయ ఉపాధి హామీ కూలీలకు కూడా వర్తింప చేస్తాం. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు ఉచిత చికిత్స అందిస్తాం. మందులు, పరీక్షలు, శస్త్రచికిత్సతో సహా మరో 25 లక్షల హెల్త్‌ కవరేజ్‌ ఇస్తాం. కేవలం గ్రామాలకే పరిమితమైన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరించేటట్టు కొత్త చట్టాలు తీసుకు రాబోతున్నాం. కీలకమైన ప్రభుత్వ విధుల్లో కాంట్రాక్టు కార్మిక వ్యవస్థను రద్దు చేయబోతున్నాం. సైన్యంలో కాంట్రాక్టు పద్ధతిని ప్రోత్సహించే ‘అగ్నిపథ్‌ పథకా’న్ని రద్దు చేయబోతున్నాం.

ఈ దేశంలో జనాభా దామాషా ప్రకారంగా ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందాలని, రాజకీయ అవకాశాలు కూడా అందాలనే సమున్నత ఆలోచనతో దేశంలో అట్టడుగు వర్గాలను వృద్ధిలోకి తీసుకువచ్చే లక్ష్యంతో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం.దేశంలోని ప్రజల సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం కులగణన చేపడుతున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల పై ఉన్న 50 శాతం పరిమితిని తొలగించి రాజ్యాంగ సవరణ ద్వారా పూర్తి హక్కులను కల్పించే విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోబోతున్నాం. ఎస్సీ–ఎస్టీ జనాభా ప్రకారం ‘ఎస్సీ–ఎస్టీ సబ్‌ ప్లాన్‌’ పేరుతో స్పెషల్‌ బడ్జెట్‌ కేటాయించి వారి సమున్నత అభివృద్ధికి కృషి చేస్తాం.

‘జల్‌ జంగల్‌ జమీన్‌’ చట్టంకింద వచ్చే క్లెయిమ్స్‌ సంవత్సరంలో పరిష్కరించి వారికి పోడుభూమి పట్టాలు అందజేస్తాం. గిరిజన జనాభా అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో ‘పీసా’ చట్టం తీసుకొచ్చి వారి భూములపై యాజమాన్యం వాళ్ళకే అందజేస్తూ, ‘మనభూమి – మన పాలన’ అమలు చేయబోతున్నాం.సమాజంలో అన్ని వర్గాల  ప్రజలను కలుపుకొని ప్రణాళికలు రూపొందించి, వాటికి చట్టబద్ధత కల్పించి అవి తప్పనిసరి అమలయ్యేటట్టుగా చూసి ఈ దేశంలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించే లక్ష్యంతో కాంగ్రెస్‌ పార్టీ  పనిచేస్తోంది.

మేనిఫెస్టో రూపకల్పనలో, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం, కేంద్ర మాజీ మంత్రి జై రామ్‌ రమేష్, తెలంగాణ ప్రభుత్వ ఐటీ, ఇండస్ట్రీ, శాసన వ్యవహారాల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌ బాబు  కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఎన్నికల్లో పార్టీల జెండాలను ప్రజలు చూసే పరిస్థితి లేదు. మోదీకి వ్యతిరేకంగా ఓటు వేసి, ఈ పాలనకు చమర గీతం పాడడానికి  దేశ ప్రజలు నిర్ణయించుకున్నారు.

- వ్యాసకర్త కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి మొబైల్‌: 98667 76999
- డా‘‘ కొనగాల మహేష్‌
 

Advertisement
Advertisement