మేడిపల్లి: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూడాలని, తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకి పంపాలని అడిషనల్ కలెక్టర్ రాంబాబు అన్నారు. మండలంలోని ఈదులలింగంపేట సెర్ప్ కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోళ్లపై ఆరా తీశారు. ఆకస్మికంగా వర్షం వస్తే ధాన్యాన్ని కాపాడుకునేందుకు టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఎండవేడిమి అధికంగా ఉండటంతో హమాలీలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనంతరం వారికి మజ్జిగ ప్యాకెట్లు అందించారు. కట్లకుంటలో డీఆర్డీవో మదన్మోహన్ పర్యటించారు. వారితోపాటు ఏపీఎం అశోక్, వ్యవసాయ అధికారి త్రివేదిక, ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఉన్నారు.
మోదీతోనే దేశాభివృద్ధి
రాయికల్: ప్రధాని మోదీతోనే దేశం అభివృద్ధి చెందుతుందని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పడాల తిరుపతి అన్నారు. మండలంలోని కుమ్మరిపల్లిలో గురువారం గడపగడపకూ బీజేపీ కార్యక్రమంలో భాగంగా మోదీ ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. ధర్మపురి అర్వింద్ను ఎంపీగా.. మోదీని ప్రధానిగా గెలిపించాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఉడుత రవీందర్, బీజేపీ మండల ఉపాధ్యక్షుడు ఉడుత రాంసురేశ్, నాయకుల పంచతి నరేశ్, పాలడుగు రవీందర్, దువ్వాక నరేశ్, కొడిమ్యాల శేఖర్, నాగరాజు, పాలిక శేఖర్, పంచతి రాజు, బొమ్మకంటి రవి, కొడిమ్యాల రాజశేఖర్ పాల్గొన్నారు.
విద్యుత్ లైన్ల మరమ్మతు తరుచూ చేయాలి
జగిత్యాలఅగ్రికల్చర్: విద్యుత్ లైన్ల మరమ్మతు తరుచూ చేస్తూ.. సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సత్యనారాయణ సిబ్బందికి సూచించారు. జిల్లాకేంద్రంలోని ఇంజినీర్స్ భవన్లో గురువారం విద్యుత్ లైన్ల మరమ్మతు, ప్రమాదాలు, సంస్థ అభివృద్ధిపై అంతర్గత శిక్షణ ఇచ్చారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవా లని, ప్రజలను అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు. రైతులకు అవసరమైన ట్రాన్స్ఫార్మర్లను సిద్ధం చేయాలని, విద్యుత్ మోటార్ల కు కెపాసిటర్లు బిగించుకునేలా చూడాలని సూచించారు. విద్యుత్ బిల్లులు ఆన్లైన్లో చెల్లించేలా చూడాలన్నారు. విద్యుత్ అధికారులు తిరుపతయ్య, గంగారాం, రాజిరెడ్డి, తిరుపతి, రవీందర్, లక్ష్మణ్, నగేష్కుమార్, వెంకటేశ్వర్లు, జవహర్ నాయక్, హరీష్, రాజు పాల్గొన్నారు.
శ్రీరాముడికి పట్టాభిషేకం
పెగడపల్లి: మండలంలోని నంచర్ల, నామాపూర్, ఎల్లాపూర్, అయితిపల్లిలో శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. భక్తుల శ్రీరామనామ స్మరణ మధ్య పట్టాభిషేకం కార్యక్రమాన్ని చేపట్టారు. నామాపూర్లో 108 హోమగుండాలతో యజ్ఞం నిర్వహించారు. రోటీగూడెం మౌనస్వామి గీతో పదేశం చేశారు. రామ భక్తులు, దీక్షాపరులు శోభాయాత్ర చేపట్టారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్, జెడ్పీటీసీ రాజేందర్రావు స్వామివారిని దర్శించుకున్నారు.