● హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు ప్రారంభం ● భక్తులతో పులకించిన కొండగట్టు పుణ్యక్షేత్రం
● అంజన్న నామస్మరణతో మార్మోగిన ఆలయం
కొండగట్టు/జగిత్యాల: ‘రామలక్ష్మణ జానకీ.. జైబోలో హనుమాన్కీ..’ అంటూ కొండగట్టులోని అంజన్న ఆలయం పులకించిపోయింది. హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. హనుమాన్ దీక్షాపరులు మాల విరమణకు వేల సంఖ్యలో తరలివచ్చారు. మంగళవారం స్వామివారి జయంతి కావడంతో సుమారు 1.50లక్షల మంది భక్తులు వస్తారని ఆలయ అధికారులు తెలిపారు. కొండపైకి వచ్చిన భక్తులు ముందుగా క్యూలైన్ ద్వారా స్వామి వారిని దర్శించుకోవాలని, ఇరుముడులను ఆలయంలో ఏర్పాటు చేసిన జాలీల్లో సమర్పించాలని, పాత కోనేరు ఎదురుగా ఉన్న మెట్ల నుంచి కల్యాణకట్ట వద్ద ఏర్పాటు చేసిన లైన్ల ద్వారా మండపంలోకి వెళ్లి మాల విరమణ చేసుకోవాలని, శ్రీరామకోటి స్తూపం వద్దగల షెడ్డులో తలనీలాలు సమర్పించాలని, కోనేరులో పుణ్యస్నానం ఆచరించి.. చివరగా ప్రసాదం తీసుకుని తిరుగు ప్రయాణం కావాలని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వొద్దని కలెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. కొండగట్టులో ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ప్రసాదం తీసుకునేందుకు 12 క్యూలైన్లు, ప్రత్యేక దర్శనం, మాల విరమణ, కేశఖండన టికెట్లకు ఆరు కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు.