మన్ననూర్: అచ్చంపేట నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజలకు ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ.. ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ రూ.లక్ష విరాళం అందజేశారు. అమ్రాబాద్ మండలం మన్ననూర్లో పదేళ్లుగా ఆర్డీటీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చెంచులకు ఉచితంగా, ఇతరులకు 20 శాతం రుసుంతో ప్రతి నిత్యం అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నారు. ‘స్పందించు సాయం అందించు’ (ఇండియా ఫర్ ఇండియా) అనే కార్యక్రమంతో నల్లమలలో ఈ సంస్థ ఆధ్వర్యంలో విస్తృతంగా సేవలందిస్తున్నారు. వీరి సేవా కార్యక్రమాలకు స్పందించిన ఎమ్మెల్యే.. ఆర్డీటీ ఆస్పత్రి వైద్యుడు సైఫుల్లాఖాన్తో పాటూ సిబ్బందిని తన ఇంటి వద్దకు పిలిపించుకుని నాణ్యతకు సంబంధించి వైద్యపరమైన సూచనలు సలహాలతో పాటూ చెక్కు రూపంలో ఈ విరాళం అందజేశారు. ఆర్డీటీ సంస్థ చేస్తున్న సేవలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీటీ సంస్థ ఏటీఎల్ రామ్మోహన్, రాధమ్మ, అచ్చయ్య, భాస్కర్, రాజేష్, అంజనమ్మ తదితరులు పాల్గొన్నారు.
అగ్నిమాపక శాఖ
అనుమతులు తప్పనిసరి
నాగర్కర్నూల్ క్రైం: ఆస్పత్రులు, సినిమా థియేటర్లతో పాటు పెద్ద భవనాలకు అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని నాగర్కర్నూల్ ఫైర్ ఆఫీసర్ కృష్ణమూర్తి తెలియజేశారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాదాలు వెంటనే అదుపు చేసేందుకు అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అగ్నిమాపకశాఖ నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. ఫైర్ సిబ్బంది కురుమూర్తి, నాగేష్, శ్రీనివాస్రెడ్డి, జగన్మోహన్, మహమూద్ పాల్గొన్నారు.