పిన్నాపురం వద్ద నిర్మాణంలో ఉన్న గ్రీన్కో ప్రాజెక్టు
ఏ ఇంటికి వెళ్లినా.. ఏ ఊరులో అడుగుపెట్టినా.. సంక్షేమం స్వాగతిస్తోంది. లంచాలు ఇచ్చే పనిలేదు, కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం అంతకన్నా లేదు.. అర్హులైతే చాలు ప్రభుత్వ పథకాలు తలుపుతడుతున్నాయి.. నగదు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి చేరుతోంది. ఇల్లు లేదనే బాధ లేదు.. పొలం ఎండిందనే బెంగ లేదు.. ఊళ్లకు ఊళ్లు పుట్టుకొస్తున్నాయి. వ్యవసాయం పండుగ అవుతోంది. పిల్లల చదువుకు భరోసా లభిస్తోంది.. ఆరోగ్యం చేరువైంది. ఉద్యోగాల విప్లవం వచ్చింది.. ఉపాధి కొత్త పుంతలు తొక్కుతోంది.. ఇలా ఒక్కటేమిటి, అన్ని వర్గాల సంక్షేమానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం బాటలు వేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరు నమ్మకానికి ప్రతిరూపంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ప్రజల నాడి తెలుసుకునేందుకు నిర్వహించిన రోడ్షో ఆద్యంతం సంక్షేమ బావుటా రెపరెపలాడింది.
నిరుద్యోగ సమస్య తీరినట్లే
కాల్వబుగ్గ మీదుగా పిన్నాపురం వెళ్లాం. కొండల మధ్యలో అద్భుతంగా ‘గ్రీన్కో’ నిర్మిస్తోన్న పవర్ప్లాంటు. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టు. రూ.15వేల కోట్లతో నిర్మిస్తున్నారు. సీఎం వచ్చి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర చరిత్రలో ఇదే భారీపెట్టుబడి పరిశ్రమ. ప్రత్యక్షంగా, పరోక్షంగా 25వేల ఉద్యోగాలు రానున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య తీరనుంది.
14 రకాల వైద్య పరీక్షలు
గోరుమానుకొండ ఆసుపత్రికి చేరుకున్నాం. పుష్పరాణి అనే సీహెచ్ఓ ఉన్నారు. ఓ వృద్ధురాలు ఆస్పత్రికి వస్తే పరీక్షిస్తున్నారు. అక్కడే 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులు ఇస్తున్నారు. మరీ అవసరమైతే పెద్ద డాక్టర్లకు ఫోన్ చేసి రోగి పరిస్థితి వివరించి మందులు ఇస్తున్నారు. రోగం వస్తే ఊరు దాటే పనేలేదని గ్రామస్తులు తెలిపారు.