Diwali Celebrations In Chitrakoot: చిత్రకూట్ దీపావళి వేడుకల్లో తొక్కిసలాట.. పలువురికి గాయాలు!
Published
Mon, Nov 13 2023 10:06 AM
అయోధ్య తర్వాత అంతటి ఘన చరిత్ర కలిగిన మధ్యప్రదేశ్లోని చిత్రకూట్లో దీపావళి మేళా ప్రారంభమయ్యింది. ఇది ఐదు రోజుల పాటు జరగనుంది. దీపావళి సందర్భంగా లక్షలాది మంది భక్తులు చిత్రకూట్కు చేరుకున్నారు.
భక్తులు మందాకినీ నదిలో స్నానం చేసి, మాతగజేంద్ర నాథ్ ఆలయంలో జలాభిషేకాలు నిర్వహిస్తున్నారు. అలాగే కామతానాథ్ స్వామిని దర్శించుకుని, పంచకోసి పర్వతం కమదగిరికి ప్రదక్షిణలు చేస్తున్నారు. లంకా విజయం తర్వాత శ్రీరాముడు చిత్రకూట్లో దీపాలను దానం చేశాడని స్థానికులు చెబుతారు. ఈ నేపధ్యాన్ని పురస్కరించుకుని చిత్రకూట్లో దీపావళి మేళా నిర్వహిస్తుంటారు.
ఈసారి చిత్రకూట్ దీపావళి మేళాకు అత్యధికంగా భక్తులు తరలివచ్చారు. 25 కిలోమీటర్ల పరిధిలో ఈ మేళాను ఏర్పాటు చేశారు. కామదగిరి ప్రదక్షిణ మార్గంలో భక్తుల రద్దీ నెలకొంది. దీంతో తోపులాట చోటుచేసుకుని పలువురు గాయాలపాలయ్యారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు గాయపడిన భక్తులకు వైద్య సహాయం అందించారు. ప్రస్తుతం లక్షలాది మంది భక్తులు చిత్రకూట్లో దీపదానాలు నిర్వహిస్తున్నారు. జిల్లా యంత్రాంగం భక్తుల సౌకర్యార్థం పలు ఏర్పాట్లు చేసింది. మేళా ప్రాంతంలో పోలీసు బలగాలు భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. ఇది కూడా చదవండి: దీపావళి వేళ... అమ్మవారికి రోబోటిక్ హారతులు!