18 ఏళ్ల నాటి కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు | Encounter Specialist Pradeep Sharma Jailed For Life In 2006 Fake Encounter Case, Know All Details About This - Sakshi
Sakshi News home page

2006 Fake Encounter Case: 18 ఏళ్ల నాటి కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు

Published Wed, Mar 20 2024 12:09 PM

Encounter Specialist Pradeep Sharma Jailed For Life In Fake Encounter Case - Sakshi

సాక్షి, ముంబై : 18 ఏళ్లుగా కొనసాగుతున్న ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో తాజాగా ముంబై హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నవంబర్‌ 11, 2006 ఢిల్లీలో గ్యాంగ్‌ స్టర్‌ చోటా రాజన్‌ సన్నిహితుడు రామ్‌నారాయణ్‌ గుప్తాది ఫేక్‌ ఎన్‌కౌంటరేనని నిర్ధారించింది. ఈ కేసులో మాజీ ఎన్‌ కౌంటర్‌ స్పెషలిస్ట్‌ ప్రదీప్‌ శర్మను జస్టిస్ రేవతి మోహితే దేరే, జస్టిస్ గౌరీ గాడ్సేలతో కూడిన ముంబై హైకోర్టు ధర్మాసనం దోషిగా తేల్చుతూ ఆయనకు జీవిత ఖైదు విధించింది. 

2013లో ప్రదీప్‌ శర్మను నిర్దోషిగా ప్రకటిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘శర్మ ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేసినట్లు లభ్యమైన సాక్ష్యాలను ట్రయల్ కోర్టు పట్టించుకోలేదు. సాధారణ సాక్ష్యాధారాలు సైతం ఈ ఫేక్‌ ఎన్‌కౌంటర్‌లో అతని ప్రమేయం ఎలాంటిదో నిస్సందేహంగా రుజువు చేస్తున్నాయి’ అని కోర్టు పేర్కొంది. అనంతరం, మూడు వారాల్లో సంబంధిత సెషన్స్ కోర్టులో లొంగిపోవాలని ధర్మాసనం శర్మను ఆదేశించింది.

దీంతో పాటు పోలీసులతో సహా 13 మందికి ట్రయల్ కోర్టు విధించిన నేరారోపణ, జీవిత ఖైదును హైకోర్టు సమర్థించింది. మరో ఆరుగురు నిందితుల నేరారోపణ, జీవిత ఖైదును రద్దు చేసి వారిని నిర్దోషులుగా ప్రకటించింది.

నవంబర్‌ 11,2006 ఢిల్లీ ఫేక్‌ ఎన్‌ కౌంటర్‌ కేసు
నవంబర్ 11, 2006న మహరాష్ట్ర వాశి నగర పోలీస్‌ టీం సభ్యులు గ్యాంగ్‌ స్టర్‌ చోటా రాజన్‌ గ్యాంగ్‌లో సభ్యుడిగా ఉన్నారనే అనుమానంతో నారాయణ్‌ గుప్తా అలియాస్ లఖన్ భయ్యా అతని స్నేహితులు అనిబేదాను అదుపులోకి తీసుకున్నారు. అదే రోజు సాయంత్రం ముంబై అంధేరి నానా నాని పార్క్‌లో ఎన్‌ కౌంటర్‌ స్పెషలిస్ట్‌ ప్రదీప్‌ శర్మ టీం నారాయణ్‌ గుప్తాను ఎన్‌కౌంటర్‌ చేసింది. తన అన్న నారాయణ్‌ గుప్తాది ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ అంటూ నవంబర్‌ 15,2006న బాధితుడి తమ్ముడు రామ్‌ ప్రసాద్‌ గుప్తా బాంబే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

శర‍్మ నిర్ధోషి
అప్పటి నుంచి సుదీర్ఘంగా కొనసాగుతున్న ఈ కేసులో జులై 2013లో సెషన్స్ కోర్టు ఫేక్‌ ఎన్‌ కౌంటర్‌లో 13 మంది పోలీసులతో సహా 22 మందిపై అభియోగాలు మోపింది. సాక్ష్యాలు లేని కారణంగా శర్మను నిర్దోషిగా ప్రకటిస్తూ 21 మంది నిందితులను దోషులుగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. 21 మంది నిందితుల్లో ఇద్దరు కస్టడీలోనే చనిపోయారు.

మా అన్నది ఫేక్‌ ఎన్‌కౌంటరే 
అయితే ఎన్‌కౌంటర్‌లో దోషులుగా నిర్ధారించడంతో ఈ కేసులో ప్రమేయం ఉన్న పలువురు నారాయణ్‌ గుప్తా తమ్ముడు రామ్‌ ప్రసాద్‌ పెట్టిన కేసును సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఆ దోషులే కోర్టు తీర్పును సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలు చేయడంతో కేసు మలుపు తిరిగింది.  

కోల్డ్‌ బ్లడెడ్‌ మర్డర్‌కు
తాజాగా, సుధీర్ఘంగా కొనసాగిన ఈ దర్యాప్తులో పోలీస్‌ అధికారి ప్రదీప్‌ శర్మ ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేసినట్లు ముంబై హైకోర్టు తీర్పిచ్చింది. ప్రభుత్వ తరుపు న్యాయవాది, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీవ్ చవాన్ వాదిస్తూ .. ప్రస్తుత ఈ ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో శాంతిభద్రతల్ని కాపాడాల్సిన పోలీసులే కోల్డ్‌ బ్లడెడ్‌ మర్డర్‌కు పాల్పడ్డారని వాదించారు.  

3 వారాల గడువుతో
ఈ కేసులో శర్మను దోషిగా నిర్ధారించాలని కోరుతూ ప్రాసిక్యూషన్, అపహరణ, హత్యల మొత్తం ఆపరేషన్‌కు మాజీ పోలీసు ఎన్‌కౌంటర్‌ స్పషలిస్ట్‌  ప్రదీప్‌ శర్మే అసలు సూత్రదారి అంటూ కేసును తీర్పిచ్చింది. శర్మ లొంగిపోయేందుకు 3 వారాల గడువు ఇచ్చింది. 

Advertisement
Advertisement