Watch Live : కుప్పంకు కృష్ణా జలాలిచ్చిన సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

Watch Live : కుప్పంకు కృష్ణా జలాలిచ్చిన సీఎం జగన్‌

Published Mon, Feb 26 2024 1:32 PM

CM YS Jagan In Kuppam - Sakshi

కుప్పంకు కృష్ణా జలాలు అందాయి. తాగు, సాగునీటి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కుప్పం ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ... కరువు తాండవమాడిన కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలిస్తానన్న మాట నిలబెట్టుకుంటూ... సీఎం జగన్‌ కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి విడుదల చేశారు. అనంతరం చిత్తూరు జిల్లాలోని రామకుప్పం మండలం రాజుపేట గ్రామంలో బహిరంగసభలో పాల్గొన్నారు. కుప్పం నియోజవర్గంలోని 110 మైనర్‌ ఇరిగేషన్‌ చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయుకట్టుకు సాగునీరు, కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 4.02  లక్షల జనాభాకు త్రాగునీరు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. అనంత వెంకటరెడ్డి హంద్రీ–నీవా సుజల స్రవంతిలో భాగంగా రూ.560.29 కోట్ల వ్యయంతో చేపట్టిన కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులు పూర్తిచేశామని తెలిపారు.

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రసంగం

  • మీ చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ఆప్యాయతలు, ప్రేమానురాగాలు చూపిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన నా ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకూ, తాతకూ, ప్రతి సోదరుడికీ, స్నేహితుడికీ ముందుగా రెండు చేతులూ జోడించి పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.
  • దేవుడి దయతో ప్రజలందరిక చల్లని దీవెనలతో ఈరోజు మన కుప్పంలో మరో మంచి కార్యక్రమం జరుపుకొంటున్నాం.
  • ఈ కుప్పం నియోజకవర్గానికి నీళ్లందించే ఒక గొప్ప కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో ఈరోజు జరుపుకొంటున్నాం.
  • కొండలు, గుట్టలు దాటుకొని ఏకంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా సుజల శ్రవంతిలో భాగంగా కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ఇప్పటికే ప్రవేశించింది.
  • ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు, ఎక్కడ కుప్పం? 672 కిలోమీటర్ల దూరంలో ఉండి 540 మీటర్ల ఎత్తు అంటే 1600 అడుగుల ఎత్తు.. పైకెక్కి ఈరోజు కృష్ణమ్మ మన కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించడం నిజంగా చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో నిలిచిపోయే రోజు అవుతుంది.
  • 2022, సెప్టెంబర్ 23న ఇదే కుప్పం నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభకు.. ఆరోజునేను హాజరైనప్పుడు ఆనాడు మీ అందరికీ ఒక మాటిచ్చాను.
  • చంద్రబాబు హయాంలో లాభాలున్న పనులు మాత్రమే చేసి, దోచేసుకొని ఆ తర్వాత ఆపేసిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు మనమే పూర్తి చేస్తామని, కృష్ణా జలాలు తరలిస్తామని, కుప్పం నియోజకవర్గానికి ఆ నీళ్లు తెస్తామని ఆ నాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని కుప్పానికి ఈరోజు కృష్ణా జలాలు తీసుకురాగలిగానని సగర్వంగా తెలియజేస్తున్నా.
  • కృష్ణా జలాలను తీసుకు రావడమే కాకుండా మరో రెండు ప్రాజెక్టులను కూడా మరింత స్టోరేజీ క్రియేట్ చేస్తూ మరో రెండు రిజర్వాయర్ల ప్రాజెక్టులకు సంబంధించిన పనులకు కూడా శ్రీకారం చుట్టే దిశగా దానికి కూడా పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది.
  • దాదాపు 6300 ఎకరాలకు సాగునీరు అందిస్తూ, కుప్పం నియోజకవర్గం, పలమనేరు నియోజకవర్గాల్లో 110 చెరువులు నింపుతూ ఇప్పటికే అడుగులు పూర్తి కావచ్చాయి.
  • ఈరోజు మరింత స్టోరేజీ క్రియేట్ చేస్తూ కుప్పం నియోజకవర్గంలో 1 టీఎంసీ సామర్థ్యంతో అన్ని కోణాల్లోనూ పరిశీలన, సర్వే అండ్ లెవలింగ్ ఆపరేషన్స్ పూర్తి చేసి రెండు చోట్ల రిజర్వాయర్ల నిర్మాణానికి అనువుగా ఉందని గుర్తించడం జరిగింది.
  • గుడిపల్లి మండలంలోని యామగానిపల్లె వద్ద ఒక రిజర్వాయర్, శాంతిపురం మండలం మాదనపల్లె వద్ద మరో రిజర్వాయర్ ను 535 కోట్లతో నిర్మించడానికి, అదనంగా దీని వల్ల మరో 5 వేల ఎకరాలకు తాగు, సాగు నీరు అందించేందుకు మనందరి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పరిపాలన అనుమతులు కూడా ఇవ్వడం జరిగిపోయింది.
  • ఈ 2 ప్రాజెక్టులే కాకుండా రాబోయే రోజుల్లో మరో ముఖ్యమైన ప్రాజెక్టు పాలారు ప్రాజెక్టుకు సంబంధించి .6 టీఎంసీల కెపాసిటీతో చిన్నపాటి రిజర్వాయర్ కట్టి 215 కోట్లతో కట్టడానికి కూడా పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది.
  • కుప్పం నియోజకవర్గానికి మీ బిడ్డ నీళ్లు తెచ్చాడు. వచ్చే టర్మ్ లో ఈ మూడు ప్రాజెక్టులూ పూర్తి చేసి మీకు అందిస్తాడు.
  • ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా  ప్రాతినిథ్యం వహిస్తున్న చంద్రబాబు.. మీరందరూ చూశారు. కొత్త కాదు.
  • 14 ఏళ్లు ఈ పెద్దమనిషి సీఎంగా కూడా చేశాడు. మూడుసార్లు సీఎం అయ్యాడు.
  • 35 సంవత్సరాల్లో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయాడంటే, కుప్పానికే నీరు తీసుకొనిరాలేదు అంటే, కుప్పానికే ప్రయోజనం లేని ఈ నాయకుడి వల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా బాగా ఆలోచన చేయాలి.
  • చంద్రబాబు హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు ఎలా జరిగాయో మీ అందరికీ తెలుసు.
  • దాన్ని నీరుపారే కాల్వగా కాకుండా తన జేబులో నిధులు పారే కాలువగా మార్చుకున్న పరిస్థితులు కనిపిస్తాయి.
  • ఈ కాంట్రాక్టును తనకు భారీ వాటా ఇచ్చేవారిలో ఎవరికి ఇవ్వాలి, అంచనాలు ఎలా పెంచాలి, మట్టి పనులు  ఎలా పెంచుకోవాలి, ఇలా ఎంత ముడుపులు పుచ్చుకోవాలనే అంశంపైనే చంద్రబాబు రీసెర్చ్ చేశాడు.
  • ఇక్కడి ప్రజలకు గానీ, పక్కనే ఉన్న పలమనేరులో ఉన్న 2 లక్షలమంది ప్రజలకు గానీ వీరికి మంచి నీళ్లు ఎలా అందించాలి, సాగునీరు ఎలా అందించాలన్న అంశంపై కనీసం ఆయన దృష్టి కూడా లేదంటే ఆలోచన చేయమని అడుగుతున్నా.
  • కుప్పం, పలమనేరు ప్రజలు కలలుగన్న ఈ స్వప్నాన్ని పూర్తిచేసింది ఈరోజు చిత్తశుద్ధి చూపించింది మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి గర్వపడుతున్నా.
  • ఇదే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు 2015లో జలవనరుల శాఖ పరిపాలన అనుమతులు మంజూరు చేసిన తర్వాత 2015 నుంచి 2018 మధ్యలో రకరకాల కారణాలు చూపిన చంద్రబాబు.. అంచనాలను అమాంతం పెంచుకుంటూ పోయాడు.
  • 561 కోట్లకు పెంచుకుంటూ తనకు కావాల్సిన కాంట్రాక్టర్లకు, తన పార్టీ వారికి, బినామీలకు పనులు అప్పజెప్పాడు.
  • 2019 ఎన్నికలకు ముందు పనులు పూర్తిచేయకపోగా, లాభాలు వచ్చే పనులు మాత్రమే చేసి మిగిలిన ముఖ్యమైన పనులు వదిలేసి తన అస్మదీయ కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలు సొమ్ములు ఇచ్చాడు చంద్రబాబు.
  • కుప్పం, పలమనేరులో 4 లక్షల ప్రజలకు నీరందే కాలవ కాకుండా చంద్రబాబు జేబులోకి నిధులు పారే కాలువగా ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ ను తన సొంత నియోజకవర్గాన్ని కూడా ఉపయోగపెట్టుకున్నాడంటే ఇంతకన్నా అన్యాయమైన వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తాడా?
  • ఇంత అన్యాయపు నాయకుడిని, తన నియోజకవర్గ ప్రజల్నే దోచుకున్న నాయకుడిని, దాహార్తిని కూడా తీర్చని ఈ నాయకుడిని, ఇంతకాలం భరించిన ఈ కుప్పం ప్రజలందరికీ మీ సహనానికి, మీ మంచితనానికి నా జోహార్లు చెబుతున్నా.
  • ఎవరి వల్ల కుప్పానికి మేలు జరిగిందో ఆలోచన చేయాలి.
  • 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉంటూ, 14 సంవత్సరాలు సీఎంగా పరిపాలన చేసిన చంద్రబాబు వల్ల కుప్పానికి మంచి జరిగిందా? కేవలం 58 నెలలు మాత్రమే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పానికి మేలు జరిగిందా? ఆలోచన చేయాలి.
  • కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకొచ్చింది ఎవరంటే మీ జగన్
  • కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చింది ఎవరంటే మీ జగన్
  • కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్
  • కుప్పానికి పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీజగన్
  • చంద్రబాబు తన హెరిటేజ్ డెయిరీ లాభాల కోసం మూసేయించిన చిత్తూరు డెయిరీని తెరిపించడమే కాకుండా అమూల్ ను తీసుకొచ్చి ఇదే కుప్పం, ఇదే పలమనేరు పాడి రైతులందరికీ గిట్టుబాటు ధరను అందించే ఏర్పాటు చేసింది ఎవరంటే మీ జగన్.
  • ఇదే చిత్తూరు జిల్లాకు ఈ జిల్లా ప్రజలకు అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ అయిన వెల్లూర్ సీఎంసీ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ రాకుండా చిత్తూరు జిల్లాకు రాకుండా కుప్పం ప్రజలకు అందుబాటులోకి రాకుండా, పలమనేరు ప్రజలకు రాకుండా చేసింది ఎవరంటే చంద్రబాబు, ఈనాడు రామోజీరావు వియ్యంకుడు, చంద్రబాబు పార్టనర్.
  • వీళ్లిద్దరూ కలిసి ఆ కాలేజీ నిర్మాణం ముందుకు తీసుకెళ్లకపోతే మళ్లీ ఆ కాలేజీని చిత్తూరులో పున:ప్రారంభించేట్టటుగా చేసింది ఎవరంటే మీ జగన్.
  • కుప్పంలో మరో రెండు విద్యత్తు సబ్ స్టేషన్లు నిర్మించింది ఎవరంటే మీ జగన్.
  • కుప్పంలో ఇంటిగ్రేటెడ్ ఆఫీసు కాంప్లెక్సులు నిర్మిస్తోంది ఎవరంటే మీ జగన్.
  • కుప్పం మున్సిపాలిటీకి 66 కోట్లు ఇచ్చి పనులు జరిగిస్తున్నది ఎవరంటే మీ జగన్.
  • చంద్రబాబుకు నా మీద కోపం వచ్చినప్పుడల్లా కొన్ని మాటలు వస్తుంటాయి.
  • పులివెందులను, కడపను తిడతాడు. చివరికి రాయలసీమను కూడా తిడుతూ ఉంటాడు.
  • కానీ అందుకు భిన్నంగా మీ జగన్ ఏనాడూ కూడా ఇక్కడి ప్రజల్ని గానీ, కుప్పం నియోజకవర్గాన్ని కానీ ఏనాడూ మీ జగన్ ఒక్క మాట అనలేదు. పైగా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని మంచి చేస్తున్నది మీ బిడ్డ.
  • పులివెందులలో ఉన్నా, కుప్పంలో ఉన్నా, అమరావతిలో ఉన్నా, ఇచ్చాపురంలో ఉన్నా.. పేదల్ని పేదలుగా చూశామే తప్ప వారి కులం, వారి మతం, ప్రాంతం, చివరికి వారి పార్టీ కూడా చూడకుండా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం.
  • గత ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటేసిన కుప్పంలో ఉన్న పేదలందరికీ ఓ మాట చెబుతున్నా.. మీరందరూ నావాళ్లే.
  • బాబుకు మించి ప్రతి విషయంలోనూ కూడా ఇక్కడి ప్రజలకు మనసు చూపాం. మంచి చేశాం.
  • ఇదే కుప్పాన్ని తీసుకోండి. నేను చెప్పే ఈ అంశాలన్నా ఒక్కసారి టైమ్ తీసుకొని ఆలోచన చేయండి.
  • కుప్పం నియోజకవర్గంలో మొత్తం 87,941 కుటుంబాలుంటే ఈ 57 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలో మన ప్రభుత్వ పథకాలు, నవరత్నాలు అందుకున్న కుటుంబాలు.. అక్షరాలా ఏకంగా 82,039.
  • అంటే 93.29 శాతం కుటుంబాలు మన ప్రభుత్వ పథకాలు అందుకున్నారు. మన నవరత్నాలు అందుకున్నారు. మన మనసున్న పాలన అంటే ఇదీ కాదా? అని అడుతున్నా.
  • మనందరి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 2019 జూన్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా డీబీటీ ద్వారా లంచాలు, వివక్ష లేకుండా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి రూ.2.55 లక్షల కోట్లు నేరుగా వెళ్లింది.
  • ఇందులో కుప్పం నియోజకవర్గంలోని నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేసిన మొత్తం అక్షరాలా 1400 కోట్లు.
  • కుప్పంలో ఉన్న ప్రతి పేద కుటుంబాన్నీ అడుగుతున్నా. ఇక్కడున్న మిమ్మల్నందరినీ అడుగుతున్నా. మీ బ్యాంకులకు మీరు వెళ్లండి. 10 సంవత్సరాల మీ బ్యాంకు అకౌంట్ స్టేట్ మెంట్ కావాలని అడగండి.
  • చంద్రబాబు 5 సంవత్సరాల పరిపాలకు సంబంధించింది, ఈ 5 సంవత్సరాలు మీ బిడ్డ పాలనకు సంబంధించినది అడగండి.
  • మీ బ్యాంకు ఖాతాల్లో గతంలో చంద్రబాబు హయాంలో కనీసం ఒక్క రూపాయి అయినా మీ బ్యాంకు అకౌంట్లలోకి వచ్చిందా? చూసుకోమని అడుగుతున్నా.
  • అదే మీ బిడ్డ ప్రభుత్వం ఈ 57 నెలల కాలంలోనే నవరత్నాల పాలనలో మీ ఖాతాలకు అందించిన సాయాన్ని అదే మీ బ్యాంక్ స్టేట్ మెంట్ లో చూడండి. ఎన్ని లక్షలు మీరు అందుకున్నారో కనిపిస్తుంది.
  • మరి ఎవరిది మనసున్న పాలన? ఎవరికది పేదల ప్రభుత్వం అన్నది ఆలోచన చేయమని అడుగుతున్నా.
  • గతంలో మాదిరిగా ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. క్యూల్లో నిలబడాల్సిన పని లేదు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా మీ ఇంటికే వచ్చి వాలంటీర్లు చిక్కటి చిరునవ్వుతో పలకరిస్తూ మీ ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ నెల నెలా ఇచ్చే పెన్షన్ నే తీసుకుంటే చంద్రబాబు హయాంలో వాలంటీర్ వ్యవస్థే లేదు.
  • అరకొర పెన్షన్ రూ.1000 కుప్పంలో కేవలం 31 వేల మందికి ఇచ్చిన పరిస్థితులు.
  • మీ బిడ్డ ప్రభుత్వంలో 57 నెలల్లో ఏకంగా 1000 పెన్షన్ ను 3 వేలకు పెంచింది మీ బిడ్డ ప్రభుత్వమే.
  • గతంలో 30 వేల మందికి ఇస్తుంటే మీ బిడ్డ హయాంలో ఏకంగా 45374 మంది ఇదే కుప్పంలో పెన్షన్లు తీసుకుంటున్నారు.
  • చంద్రబాబు 5 సంవత్సరాల్లో మీ బిడ్డ ఈ 57 నెలల కాలం గమనిస్తే చంద్రబాబు హయాంలో 200 కోట్లు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితుల నుంచి ఈరోజు ఏకంగా 507 కోట్లు నా అవ్వాతాతలకు, వికలాంగ సోదరులకు, అక్కచెల్లెమ్మలకు, వింతువులకు ఈరోజు మీ బిడ్డ ఇస్తున్నాడు.
  • మనందరి ప్రభుత్వంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతు భరోసాగా ఒక్క కుప్పంలోనే ఏకంగా 44,640 మంది రైతన్నలకు రైతు భరోసా పథకం ద్వారా ఏకంగా రూ.214 కోట్లు నేరుగా ఇవ్వడం జరిగింది.
  • చంద్రబాబు హయాంలో రైతన్నలకు ఇలా రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం ఏరోజూ జరగలేదు. రైతు భరోసానే లేదు.
  • ఒక రైతు భరోసా కేంద్రం కూడా లేదు. మన గ్రామ స్థాయిలో ఆర్బీకేలు ఏకంగా 83 మన కుప్పంలోనే కనిపిస్తాయి.
  • కుప్పంలో ప్రతి గ్రామంలో ఒక విలేజ్ సెక్రటేరియట్, వార్డు సెక్రటేరియట్లు 93 కనిపిస్తాయి.
  • వాలంటీర్ వ్యవస్థ, ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్. ఏకంగా 76 విలేజ్ క్లినిక్స్ కుప్పం నియోజకవర్గంలోనే కనిపిస్తున్నాయి.
  • ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే సచివాలయాల్లో పని చేస్తున్న మన పిల్లలు 942 మంది.
  • ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్ లు వీటిలో పని చేస్తున్న పిల్లలు మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నారు. ఇవన్నీ గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జరగలేదు
  • కేవలం 57 నెలల మీ బిడ్డ పాలనలోనే జరుగుతోంది.
  • పొదుపు  సంఘాల అక్కచెల్లెమ్మలకు రుణాలన్నీ కూడా మొదటి సంతకంతోనే మాఫీ చేస్తానని చంద్రబాబు దగా చేస్తే, 2016 అక్టోబర్ నుంచి సున్నా వడ్డీ పథకాన్ని కూడా రద్దు చేశాడు.
  • అక్కచెల్లెమ్మల జీవితాలు చిన్నాభిన్నమైన పరిస్థితి గతంలో ఉంటే మనందరి ప్రభుత్వం వైయస్సార్ ఆసరా కింద రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల కోట్లు ఇస్తే, ఒక్క కుప్పంలోనే అక్షరాలా 44,888 మంది అక్కచెల్లెమ్మలకు 172 కోట్లు ఇచ్చాం.
  • మనందరి ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం కింద నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చింది మరో 30 కోట్లు. దీని వల్ల 6055 సంఘాలకు మంచి జరిగిస్తూ 59662 మంది అక్కచెల్లెమ్మలకు మరో 30 కోట్లు ఇచ్చి తోడుగా నిలబడింది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే.
  • చంద్రబాబు హయాంలో చదివించే తల్లులకు అమ్మ ఒడి అనే స్కీమే లేదు.
  • మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న అమ్మ ఒడి ద్వారా కుప్పం నియోజకవర్గంలో చదివించే తల్లులు 35951 మందిని ప్రోత్సహిస్తూ ఇచ్చినది అక్షరాలా రూ.155 కోట్లు.
  • కుప్పంలో 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు పాలనలో అందించిన ఇళ్ల పట్టాలు ఓ సున్నా.
  • అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 57 నెలల కాలంలోనే కుప్పం నియోజకవర్గంలోనే ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఇప్పటికే 15721 పట్టాలిచ్చాం. ఈనెలలోనే మరో 15 వేల ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వబోతున్నాం.
  • మీ బిడ్డ జగనన్న ప్రభుత్వంలో నా అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ మొత్తం 30755 ఇళ్ల పట్టాలు ఇవ్వగలుగుతున్నాం.
  • బాబు హయాంలో కుప్పంలో ఇళ్లు మంజూరు చేసింది పేదలకు కేవలం 3547 మాత్రమే. అందులో కట్టింది కేవలం 2968 మాత్రమే.
  • అదే మీ బిడ్డ ప్రభుత్వంలో అక్షరాలా 7898 ఇళ్లు మంజూరు చేసి వాటిలో ఇప్పటికే 4871 ఇళ్లు పూర్తి చేశాం.
  • చంద్రబాబు హయాంలో 45-60 సంవత్సరాల మధ్య వయసున్న అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారత కోసం ఆయన చేసింది ఒక సున్నా.
  • మీ బిడ్డ హయాంలో ఈ 45-60 సంవత్సరాల అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ వైయస్సార్ చేయూత ద్వారా కుప్పంలో ఏకంగా 19921 మందికి మంచి జరిగిస్తూ వారి కుటుంబాల ఖాతాల్లోకి పంపింది 85 కోట్లు.
  • వైద్య ఆరోగ్య రంగాన్ని చూసుకోండి. నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీని.. పునర్జీవింపజేసి కుప్పంలో కొత్త 108, 104 వాహనాలు కుయ్ కుయ్ కుయ్ అని తిరుగుతున్నాయంటే కేవలం మీ అన్న పాలనలోనే.
  • ఆరోగ్య ఆసరా, జగనన్న ఆరోగ్య సురక్ష పథకాలు అమలవుతున్నాయంటే మనసున్న మన పాలనలోనే జరుగుతున్నాయి.
  • చంద్రబాబు హయాంలో ఆరోగ్యశ్రీ పేరు మార్చి నిర్వీర్యం చేసి ఎన్టీఆర్ వైద్య సేవ అని మార్చాడు.
  • కుప్పంలో 7002 మందికి అందించిన సాయం 28 కోట్లు అయితే, మీ బిడ్డ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని మెరుగుపర్చి 1000 ప్రొసీజర్లను 3350కి తీసుకుపోయి విస్తరింపజేసి, ఆరోగ్య ఆసరా కూడా ఇస్తూ వీటి ద్వారా ఏకంగా కుప్పంలోనే 17552 మందికి మంచి జరిగిస్తూ 64 కోట్లు నేరుగా ఇచ్చాం.
  • పేదవాడి కోసం, పిల్లల చదువుల కోసం బాబు ఏరోజూ ఆరాటపడలేదు.
  • అరకొర ఫీజు రీయింబర్స్ మెంట్ కింద కేవలం 8459 మందికి మాత్రమే రూ.27 కోట్లు.
  • మనందరి ప్రభుత్వం 57 నెలల కాలంలోనే ప్రతి పిల్లాడికీ 100 శాతం పూర్తి ఫీజురీయింబర్ష్ మెంట్ ఇస్తూ 12093 మందికి విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా చెల్లించిన సొమ్ము అక్షరాలా రూ.61 కోట్లు.
  • చంద్రబాబు ఎంత అన్యాయస్తుడంటే ఇచ్చే అరకొర సొమ్ముకూడా తన నియోజకవర్గంలో కూడా తనవారు, తనకు కాని వారు అని ఎలా విభజించాడో నేను చెప్పిన ప్రతి పథకంలో పెరిగిన లబ్ధిదారులను చూస్తే అందరికీ అర్థం అవుతుంది.
  • ఈ ప్రయోజనాలు మన ప్రభుత్వ హయాంలో ఈ మాదిరిగా పెంచి ప్రతి ఒక్కరికీ జల్లెడ పడుతూ ఏ ఒక్కరికీ మిస్ కాకుండా ఇస్తూ ప్రతి గ్రామ సచివాలయంలో లబ్ధిదారుల జాబితా పెట్టడం జరిగింది.
  • ఇంత పారదర్శకంగా ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా ప్రతి పేదవాడికీ అందుతున్న పరిస్థితులు మన గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి ఒక్కరికీ కనిపిస్తాయి.
  • సొంత నియోజకవర్గంలోనే పేదలకు మంచి చేయని ఈ వ్యక్తి 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మూడు సార్లు 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నా కూడా కుప్పం నియోజకవర్గ ప్రజలకే ఎలాంటి మేలు జరగలేదంటే ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా, కుప్పం నియోజకవర్గానికి అర్హుడేనా? ఆలోచన చేయండి.
  • బాబు ఎలాంటి వాడో తెలుసుకున్న చంద్రగిరి ప్రజలు.. చంద్రగిరిలో ఎమ్మెల్యేగా మంత్రిగా పని చేసి పోటీ చేస్తే 1983లోనే ఏకంగా 17 వేల ఓట్లతో ప్రజలు ఓడగొట్టారు.
  • ఆ తర్వాత ఈ పెద్దమనిషి బీసీలు ఎక్కువగా ఉన్న ఇక్కడ, తన ధనబలం చూపిస్తూ ఈ నియోజకవర్గానికి వచ్చి బీసీల సీటు కబ్జా చేసి 35 ఏళ్లుగా రాజ్యం ఏలుతున్నాడు.
  • కనీసం ఇక్కడ ఒక ఇల్లయినా కట్టుకున్నాడా? ఆయన ఎమ్మెల్యేగా గెలవడం కోసం మీతో పని కావాలి. కానీ ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని ఆలోచన కూడా ఏరోజూ రాలేదంటే ఈ మనిషి మీ మీద చూపిస్తున్న ప్రేమ ఎలాంటిదో అర్థం చేసుకోవాలి.
  • కుప్పం ప్రజలు చంద్రబాబుకు 35 సంవత్సరాలుగా చాలా ఇచ్చారు. కానీ కుప్పానికి బాబు ఏమిచ్చాడో నిలదీయాల్సిన అవసరం ఉంది.
  • సొంత నియోజకవర్గానికే మంచి చేయని ఈ మనిషి 75 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మరో నలుగురితో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి దిగుతున్నాడు.
  • పొత్తులెందుకు అని అడిగితే మాట్లాడడు. మీ పేరు చెబితే ఒక్క మంచైనా ఉందా? ఒక్క స్కీమైనా ఉందా అని అడిగితే మాట్లాడడు.
  • ఏ గ్రామం మధ్య అయినా నిలబడి ఈ గ్రామంలో నా మార్క్ ఫలానా మంచి చేశాను అని చెప్పగలడా అంటే అదీ మాట్లాడడు.
  • సామాజికవర్గాలకు మీరు చేసిన న్యాయం ఏంటని అడిగితే చివరకు కుప్పంలో కూడా బీసీ ఎమ్మెల్యేను పెట్టని తీరు చూస్తే సామాజిక  న్యాయం ఎక్కడ చేశారని అడిగితే అదీ మాట్లాడడు.
  • పేద ఇంటికి వెళ్దాం. ప్రతి పేద ఇంట్లోనూ అడుగుదాం. 14 ఏళ్లు మీరు చేసిన మంచి ఏంటో ఆ ఇంటికి కనీసం ఒక్క రూపాయి అయినా మీరు ఇచ్చారా అని గట్టిగా నిలదీస్తే అదీ మాట్లాడడు.
  • పొత్తుల గురించి మాట్లాడతాడు. ఎవరితో అంటే దత్తపుత్రుడితో మాట్లాడతాడు. ఏ విషయం మాట్లాడతాడంటే తలుపులు బిగించుకొని ప్యాకేజీ ఎంత అని మాట్లాడతాడు.
  • పోనీ కాపులకు మీరు చేసిన మంచి ఏమిటి? వంగవీటి రంగాను హత్య చేయించింది మీరే కదా.. అందుకే మిమ్మల్ని వారంతా వర్గ శత్రువుగా భావిస్తున్నారని అడిగితే దానికి కూడా మాట్లాడడు.
  • ఇదీ బాబు మార్క్ రాజకీయం. చంద్రబాబు మార్క్ రాజకీయం ఇది. వంచన, మోసం, కుట్ర, వెన్నుపోటు.
  • కుప్పం ప్రజలకు కూడా మంచి చేశానని చెప్పే పరిస్థితి లేకపోవడం బాబు మార్క్ రాజకీయం అయితే, కుప్పంలో గత ఎన్నికల్లో బాబుమీద గెలవలేకపోయినా కూడా మీలో ఒకరిని, బలహీనవర్గాల ప్రతినిధిగా భరత్ ను ఎమ్మెల్సీగా చేసి, అతడిని ముందు పెట్టి ఇక్కడి పేద కుటుంబాలన్నింటికీ కూడా చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ప్రతి కుటుంబానికీ మంచి చేయడం మీ జగన్ మార్క్ రాజకీయం అని చెప్పడానికి గర్వపడుతున్నా.
  • భరత్ ను, మన బలహీనవర్గాలకు చెందిన నాయకుడిని, మీ వాడిని ప్రతినిధిగా చేసి ఆయన 2019లో గెలవలేకపోయినా ఎమ్మెల్సీగా చేసి కుప్పానికి 5 సంవత్సరాల్లో మంచి చేశాం.
  • భరత్ ను కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకోండి. నా కేబినెట్ లో మంత్రిగా స్థానం ఇస్తాను. నా గుండెల్లో పెట్టుకుంటాను. తన ద్వారా కుప్పం నియోజకవర్గానికి మరింత అభివృద్ధి, సంక్షేమం చేస్తానని మాట ఇస్తున్నా.
  • ఏ మార్క్ రాజకీయం కావాలి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి.
  • ప్రజల గురించి, పేద వాడి గురించి ఆలోచన చేసే మీ బిడ్డ మార్క్ రాజకీయం కావాలా? లేకపోతే ఎన్నికల్లో మిమ్మల్ని ఉపయోగించుకొని తర్వాత గాలికి వదిలేసే రాజకీయం చంద్రబాబు చేస్తున్నది కావాలా?
  • 14 సంవత్సరాలు తాను చేసింది ఏంటంటే ఒక పెద్ద సున్నా కనిపిస్తుంది. ఎన్నికలు వచ్చే సరికే ప్రజల్ని వెన్నుపోటు పొడవడం కోసం, మోసం చేయడం కోసం రంగులతో మేనిఫెస్టో తెస్తాడు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారు కొనిస్తానంటాడు.
  • ఏరోజైనా ఏ మంచీ చేయని ఈ వ్యక్తి రంగు రంగుల మేనిఫెస్టోతో ప్రజలను వెన్నుపోటు పొడుస్తున్నాడో ఈ వ్యక్తిని నమ్మగలమా.
  • 57 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం చూశారు. ప్రతి ఇంటికీ జరిగిన మంచి చూశారు. పేదవాడి భవిష్యత్ కోసం మీ బిడ్డ పడుతున్న తాపత్రయం చూశారు.
  • మీ బిడ్డను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటే పేదవాడి బతుకు బాగుపడుతుంది. పేదవాడి భవిష్యత్ బాగుపడుతుంది.
  • మీలో ప్రతి ఒక్కరూ మంచి జరిగిన ప్రతి విషయం కూడా ఇంకో వంద మందితో చెప్పి ఓటు వేయించే కార్యక్రమానికి అందరూ పూనుకోవాలని విన్నవిస్తున్నా.
  • దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని, మీ అందరికీ ఇంకా మంచి జరగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.

Advertisement

తప్పక చదవండి

Advertisement