ఒకే నెలలో ఐదు సార్లు రాష్ట్రానికి! | Sakshi
Sakshi News home page

ఒకే నెలలో ఐదు సార్లు రాష్ట్రానికి!

Published Sun, Nov 12 2023 12:49 AM

PM Modi to return for campaign here on November 26th and 27th - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ రాష్ట్రంలో వరుస పర్యటనలు చేపడుతున్నారు. ఇప్పటికే ఈ నెల ఏడో తేదీన, తాజాగా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలకు హాజరయ్యారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లోనూ బహిరంగసభలు, రోడ్‌షోలలో పాల్గొనేందుకు రాష్ట్రానికి రానున్నట్టు తెలిసింది.

ఈనెల 28న ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో.. బీజేపీకి ఊపు తెచ్చేందుకు 25న కరీంనగర్, 26న నిర్మల్‌ బహిరంగ సభల్లో, 27న హైదరాబాద్‌లో నిర్వహించే రోడ్‌షోలో మోదీ పాల్గొననున్నట్టు పార్టీవర్గాలు చెప్తున్నాయి. ఈ పర్యటన షెడ్యూల్‌ ఖరారైతే.. ప్రధాని మోదీ నెల రోజుల్లోనే ఐదుసార్లు రాష్ట్రానికి వచ్చినట్టు అవుతుంది. అయితే ప్రధాని గత నెల 1, 3వ తేదీల్లో మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అవి కూడా కలిపితే రెండు నెలల్లో ఏడుసార్లు రాష్ట్రానికి వచ్చినట్టు అవుతుంది. 

దీపావళి దాటగానే జోరు 
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దీపావళి పండుగ దాటగానే జోరు పెంచాలని బీజేపీ నిర్ణయించింది. దీపావళి తర్వాత పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఆరోజు నుంచి ప్రచార గడువు ముగిసే 28వ తేదీ వరకు ఉధృతంగా కార్యక్రమాలు చేపట్టనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, యూపీ, మహారాష్ట్ర, అస్సాం, గోవా సీఎంలు యోగి ఆదిత్యనాథ్, ఏక్‌నాథ్‌ షిండే, హిమంత బిశ్వశర్మ, ప్రమోద్‌ సావంత్‌లతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నేతలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

Advertisement
Advertisement