దేశం కొందరి సొత్తు కాదు.. సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

దేశం కొందరి సొత్తు కాదు.. సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు

Published Sat, Apr 6 2024 4:35 PM

Sonia Gandhi Criticizes PM Modi Of Destroying Country Dignity And Democracy - Sakshi

జైపూర్: త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశం మొత్తం మోదీ పర్యటన సాగుతోంది. కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచారం చేస్తున్నారు. సోనియా గాంధీ కూడా కొన్ని సమావేశాల్లో పాల్గొంటున్నారు.

జైపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సోనియా గాంధీ ప్రసంగిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ దేశ గౌరవాన్ని, ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కారని, ప్రతిపక్ష నేతలను బీజేపీలో చేర్చుకునేందుకు రకరకాల వ్యూహాలు పన్నుతున్నారని ఆరోపించారు. ఈరోజు మన దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని పేర్కొన్నారు. 

ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేస్తున్నారు, మన రాజ్యాంగాన్ని మార్చడానికి కుట్ర జరుగుతోంది అని సోనియా గాంధీ ఆరోపించారు. ఇది నియంతృత్వ పరిపాలన, దీనికి మనమందరమూ సమాధానం ఇవ్వాలని అన్నారు. తనకు తానే గొప్పవాడినని భావించుకుంటూ.. దేశం గౌరవాన్ని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని పేర్కొన్నారు.

దేశం కొందరి సొత్తు కాదనీ, అందరికీ చెందుతుందని, మన పూర్వీకులు దాని కోసం రక్తాన్ని చిందించారని అన్నారు. విపక్ష నేతలను బెదిరించి బీజేపీలో చేరేలా చేసేందుకు రకరకాల వ్యూహాలు పన్నుతున్నారని సోనియా గాంధీ ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగిస్తూ.. ప్రధాని మోదీని అబద్ధాల నాయకుడు అని అభివర్ణించారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఆయన ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలని కోరారు. మీరు మూడింట రెండొంతుల మెజారిటీ ఇస్తే.. ఈ దేశ రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రధాని మోదీ, ఆయన వ్యక్తులు, ఆర్‌ఎస్‌ఎస్‌ చెబుతున్నాయని ఖర్గే అన్నారు.

Advertisement
 
Advertisement