Asia Cup 2022: Former Pakistan Skipper Salman Butt Huge Warning To Pakistan About Virat Kohli Batting Form - Sakshi
Sakshi News home page

Asia Cup 2022 : కోహ్లి ఫామ్‌లోకి వస్తే అంతే సంగతులు.. పాకిస్తాన్‌కు ఆ దేశ మాజీ కెప్టెన్‌ వార్నింగ్‌!

Published Mon, Aug 15 2022 11:17 AM

Asia Cup 2022: Salman Butt Warns Pakistan Kohli Will Surely Trouble You - Sakshi

Asia Cup 2022 India Vs Pakistan: ఆసియా కప్‌-2022 టోర్నీ ఆరంభానికి సమయం ఆసన్నమవుతోంది. ఈనెల 27న శ్రీలంక, అఫ్గనిస్తాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. ఆ మరుసటి రోజే క్రికెట్‌ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌ జరుగనుంది. ఇక మ్యాచ్‌లో గెలిచి టీ20 ప్రపంచకప్‌-2021లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. 

ఇక ప్రస్తుతం రోహిత్‌ సేన వరుస విజయాలు సాధిస్తూ జోరు మీదున్న తీరు చూస్తే గెలుపు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సీనియర్లు, యువ ఆటగాళ్లు అనే తేడా లేకుండా దాదాపు అందరూ ఫామ్‌లో ఉండటం సహా.. భారత మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఫామ్‌లోకి వస్తే భారత్‌ను ఆపడం ఎవరితరం కాదని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు.  

పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ బట్‌ కూడా ఇదే మాట అంటున్నాడు. రొటేషన్‌ పాలసీతో భారత్‌ తమ ఆటగాళ్లందరినీ పరీక్షిస్తూ బెంచ్‌ను పటిష్టం చేసుకుంటోందని కొనియాడాడు. అదే విధంగా విరాట్‌ కోహ్లి విజృంభిస్తే పాకిస్తాన్‌కు కష్టాలు తప్పవని బాబర్‌ ఆజం బృందాన్ని హెచ్చరించాడు.

మంచి పరిణామం!
ఈ మేరకు తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా సల్మాన్‌ బట్‌ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘భారత జట్టులో రొటేషన్‌ పాలసీ అనేది ఇప్పుడు సర్వ సాధారణం అయిపోయినట్లుగా అనిపిస్తోంది. ప్రతీ సిరీస్‌లోనూ వాళ్లు వేర్వేరు ఆటగాళ్లతో బరిలోకి దిగుతున్నారు.

సీనియర్లకు తగినంత విశ్రాంతినిస్తూ.. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నారు. విభిన్న కాంబినేషన్లతో ముందుకు వస్తున్నారు. నిజానికి ప్రస్తుతం వాళ్ల బెంచ్‌ స్ట్రెంత్‌ కారణంగా సెలక్షన్‌ తలనొప్పిగా మారుతోంది. ఇది మంచి పరిణామమే.

కోహ్లి గనుక ఫామ్‌లోకి వస్తే!
ఇక విరాట్‌ కోహ్లి విషయానికొస్తే... అతడు ఎంతటి అనువజ్ఞుడో, అతని శక్తి సామర్థ్యాలేమిటో అందరికీ తెలుసు. కోహ్లి వీలైనంత తొందరగా ఫామ్‌లోకి వస్తే బాగుంటుందని ఇండియా భావిస్తోంది. ఇక పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో చాలా మంది భారత ఆటగాళ్లు ఫామ్‌లోకి వచ్చిన తీరును మనం చూశాం.

ఒకవేళ కోహ్లి గనుక తిరిగి పుంజుకుంటే.. కచ్చితంగా అతడు పాకిస్తాన్‌కు తలనొప్పిగా మారతాడు’’ అని సల్మాన్‌ బట్‌ పాకిస్తాన్‌ జట్టుకు హెచ్చరికలు జారీ చేశాడు. కాగా దుబాయ్‌ వేదికగా టీ20 ప్రపంచకప్‌-2021లో భాగంగా పాకిస్తాన్‌పై కోహ్లి అర్ధ శతకం(57)తో రాణించిన విషయం తెలిసిందే.

అయితే, ఈ మ్యాచ్‌లో రిషభ్‌ పంత్‌(39) మినహా ఎవరూ కనీసం 20 పరుగులు కూడా చేయకపోవడంతో నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌ బ్యాటర్లను కట్టడి చేయడం భారత బౌలర్లకు సాధ్యం కాకపోవడంతో పది వికెట్ల తేడాతో కనీవిని ఎరుగని రీతిలో ఐసీసీ టోర్నీలో టీమిండియా పాకిస్తాన్‌ చేతిలో ఓటమి పాలైంది.

చదవండి: India Tour Of Zimbabwe: స్టార్‌ ఆల్‌రౌండర్‌ దూరం..! 
WI VS NZ 3rd T20: ఎట్టకేలకు ఓ విజయం.. వైట్‌వాష్‌ అవమానాన్ని తప్పించుకున్న విండీస్‌
టీమిండియా పటిష్టమైన జట్టే కావొచ్చు.. ధీటుగా పోటీ ఇస్తాం..!

Advertisement
 
Advertisement