శతక్కొట్టిన రోహిత్‌, గిల్‌.. పటిష్ట స్థితిలో టీమిండియా | Sakshi
Sakshi News home page

IND VS ENG 5th Test Day 2: శతక్కొట్టిన రోహిత్‌, గిల్‌.. పటిష్ట స్థితిలో టీమిండియా

Published Fri, Mar 8 2024 5:37 PM

IND VS ENG 5th Test: India Lead By 255 Runs At Day 2 Stumps - Sakshi

ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా పటిష్ట స్థితిలో ఉంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు చేసి, 255 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. కుల్దీప్‌ యాదవ్‌ (27), జస్ప్రీత్‌ బుమ్రా (19) క్రీజ్‌లో ఉన్నారు. 

135/1 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌.. రోహిత్‌ శర్మ (103), శుభ్‌మన్‌ గిల్‌ (110) శతకాలతో రెచ్చిపోవడంతో భారీ స్కోర్‌ చేసింది. వీరిద్దరికి యువ మిడిలార్డర్‌ బ్యాటర్లు దేవ్‌దత్‌ పడిక్కల్‌ (65), సర్ఫరాజ్‌ ఖాన్‌ (56) తోడవ్వడంతో టీమిండియా పరుగుల వరద పారించింది.

రవీంద్ర జడేజా (15), దృవ్‌ జురెల్‌ (15), రవిచంద్రన్‌ అశ్విన్‌ (0) నిరాశపరిచినా.. టెయిలెండర్లు కుల్దీప్‌, బుమ్రా అద్భుతంగా ఆడారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో షోయబ్‌ బషీర్‌ 4 వికెట్లు పడగొట్టగా..  టామ్‌ హార్ట్లీ 2, ఆండర్సన్‌, స్టోక్స్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

అంతకుముందు తొలి రోజు ఆటలో ఇంగ్లండ్‌ 218 పరుగులకు ఆలౌటైంది. కుల్దీప్‌ యాదవ్‌ (5/72), అశ్విన్‌ (4/51), జడేజా (1/17) ధాటికి ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో జాక్‌ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు.

డకెట్‌ 27, పోప్‌ 11, రూట్‌ 26, బెయిర్‌స్టో 29, స్టోక్స్‌ 0, ఫోక్స్‌ 24, హార్ట్లీ 6, వుడ్‌ 0, ఆండర్సన్‌ 0 పరుగులు చేసి ఔటయ్యారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌.. యశస్వి జైస్వాల్‌ (56) మెరుపు అర్దశతకంతో విరుచుకుపడటంతో 30 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 135 పరుగులు చేసింది.

రెండో రోజు ఆటలో హైలైట్స్‌..

  • టెస్టుల్లో 12వ సెంచరీ, ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో 48వ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్‌ శర్మ
  • టెస్ట్‌ల్లో 4వ సెంచరీ, ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో 11వ సెంచరీ పూర్తి చేసుకున్న శుభ్‌మన్‌ గిల్‌
  • సుదీర్ఘ విరామం తర్వాత బంతి పట్టిన స్టోక్స్‌ రీఎంట్రీలో తొలి బంతికే రోహిత్‌ శర్మను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు 
  • మెరుపు వేగంతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న సర్ఫరాజ్‌ ఖాన్‌
  • అరంగేట్రం మ్యాచ్‌లోనే హాఫ్‌ సెంచరీ చేసిన దేవ్‌దత్‌ పడిక్కల్‌
  • 50కు పైగా స్కోర్లు చేసిన ఐదుగురు భారత టాపార్డర్‌ బ్యాటర్లు, భారత టెస్ట్‌ క్రికెట్‌లో ఇలా జరగడం ఇది నాలుగోసారి


 

Advertisement
Advertisement