బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ 2024-25 వేదికలు ఖరారు | Sakshi
Sakshi News home page

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ 2024-25 వేదికలు ఖరారు

Published Thu, Feb 22 2024 3:21 PM

Likely Venues For Border Gavaskar Trophy 2024 25 Between India VS Australia - Sakshi

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగాల్సి ఉన్న బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2024-25 వేదికలు ఖరారైనట్లు తెలుస్తుంది. ఫ్యూచర్‌ టూర్‌ ప్రోగ్రామ్‌ (ఎఫ్‌టీపీ) ప్రకారం ఈ టోర్నీ ఈ ఏడాది నవంబర్‌-వచ్చే ఏడాది జనవరి మధ్యలో జరుగనుంది. ప్రతిష్టాత్మక సిరీస్‌కు ఈ దఫా ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనుంది. సంప్రదాయానికి విరుద్దంగా ఈసారి నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ కాకుండా ఐదు మ్యాచ్‌ల సిరీస్ జరుగనుందని తెలుస్తుంది. ఇందులో ఓ డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌ను కూడా యాడ్‌ చేశారని సమాచారం. ఆస్ట్రేలియా గడ్డపై గత రెండు సిరీస్‌ల్లో (BGT) భారత్‌ చారిత్రక విజయాలు సాధించిన విషయం తెలిసిందే.

2018-19, 2020-21 సిరీస్‌లను భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఆసీస్‌ గడ్డపై టెస్ట్‌ల్లో భారత్‌ సాధించిన తొలి విజయాలు ఇవే. ఇటీవల భారత్‌ వేదికగా జరిగిన నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లోనూ భారత్‌దే పైచేయిగా నిలిచింది. ఈ సిరీస్‌లోనూ టీమిండియా 2-1 తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. భారత్‌లో జరిగిన 2016-17 సిరీస్‌లోనూ టీమిండియానే విజయం వరించింది. ఆ సిరీస్‌లో కూడా భారత్‌.. 2-1 తేడాతో ఆసీస్‌ను ఓడించింది.

ఈ లెక్కన టీమిండియా ఆసీస్‌పై వరుసగా నాలుగు టెస్ట్‌ సిరీస్‌ల్లో విజయాలు సాధించింది. అన్ని సిరీస్‌ల్లో టీమిండియా 2-1 తేడాతో ఆసీస్‌ను చిత్తు చేయడం విశేషం. ఈ నాలుగు సిరీస్‌ల్లో 2020-21 గబ్బా టెస్ట్‌కు చాలా ప్రత్యేకత ఉంది. అప్పటిదాకా గబ్బాలో ఓటమి ఎరుగని ఆసీస్‌కు టీమిండియా ఓటమి రుచి చూపించింది. ఆ మ్యాచ్‌లో రిషబ్‌ పంత్‌ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడి టీమిండియాకు చారిత్రక విజయాన్ని అందించాడు.

రాబోయే సిరీస్‌ 2023-25 వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ దృష్ట్యా చాలా కీలకం కానుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు వేదికలను లాక్‌ చేసినట్లు సమాచారం.

  • తొలి టెస్ట్‌: పెర్త్‌ 
  • రెండో టెస్ట్‌: అడిలైడ్‌ (డే అండ్‌ నైట్‌)
  • మూడో టెస్ట్‌: గబ్బా
  • నాలుగో టెస్ట్: మెల్‌బోర్న్‌
  • ఐదో టెస్ట్‌: సిడ్నీ

Advertisement
Advertisement