ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే గాయాల కారణంగా కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా జట్టుకు దూరంగా ఉండగా.. తాజాగా మరో స్టార్ ఆటగాడు గాయం బారిన పడ్డాడు. భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ వెన్ను గాయం తిరిగిబెట్టింది. తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్న అయ్యర్.. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆకాడమీలో చేరినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో అతడు ఇంగ్లండ్తో మిగిలిన మూడు టెస్టులకు దూరం కానున్నట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ తమ రిపోర్ట్లో పేర్కొంది. అయ్యర్ తిరిగి మళ్లీ ఐపీఎల్తో మైదానంలో అడుగుపెట్టనున్నట్లు సమాచారం. కాగా ఇంగ్లండ్ సిరీస్లో ఇప్పటివరకు రెండు టెస్టులు ఆడిన అయ్యర్ అంచనాలను అందుకో లేకపోయాడు.
మొత్తం నాలుగు ఇన్నింగ్స్లలో 26 సగటుతో కేవలం 104 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో అతడిని జట్టు నుంచి తప్పించాలని చాలా మంది మాజీలు డిమాండ్ చేశారు. అంతలోనే అయ్యర్ గాయం బారిన పడటం గమనార్హం. ఇక ఇంగ్లండ్తో మిగిలిన మూడు టెస్టులకు భారత జట్టును బీసీసీఐ ఈ వారంలో ప్రకటించే ఛాన్స్ ఉంది.
మరోవైపు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి అందుబాటుపై ఇంకా సందిగ్ధం నెలకొంది. ఇప్పటివరకు అయితే కోహ్లి నుంచి ఎటువంటి సమాచారం లేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఆఖరి మూడు టెస్టులకు రజిత్ పాటిదార్,సర్ఫరాజ్ ఖాన్ను కొనసాగించే అవకాశముంది. కాగా ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది.
చదవండి: Ranji Trophy: రీ ఎంట్రీలో టీమిండియా ఓపెనర్ ధనాధన్ శతకం.. ఫోర్ల వర్షం