నెల్లూరు(క్రైమ్): ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగరంలోని ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమీక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఎన్నికల్లో పాటించాల్సిన జాగ్రత్తలు, విధులు, నిబంధనలు తదితరాలపై దిశా నిర్దేశం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రచార నిమిత్తం జిల్లాకు విచ్చేసే వీవీఐపీలకు పటిష్ట భద్రతను ఏర్పాటు చేయాలని సూచించారు. నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభంకానున్న తరుణంలో, ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. ఆయా కేంద్రాల వద్ద తగిన బందోబస్తును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమస్యాత్మక గ్రామాలు, ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలన్నారు. ఇతర శాఖలు, స్థానిక గ్రామపెద్దల సమన్వయంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్, గత ఎన్నికల కేసుల్లోని నిందితులను బైండోవర్ చేయాలని తెలిపారు. చెక్పోస్టుల్లో తనిఖీలను ముమ్మరం చేసి మద్యం, నగదు, ప్రలోభాలకు గురిచేసే వాటిని పూర్తి స్థాయిలో కట్టడి చేయాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఏఎస్పీలు సౌజన్య, ప్రసాద్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.