‘దుమ్ము’ దులపండి..!  | Sakshi
Sakshi News home page

‘దుమ్ము’ దులపండి..!

Published Thu, Jan 14 2021 8:30 AM

Ts Govt Clear That Cleanliness In Schools Is Highest Priority - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విద్యా సంస్థలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గతేడాది మార్చి రెండో వారం నుంచి మూతబడ్డ విద్యా సంస్థలు... వచ్చేనెల ఒకటో తేదీ నుంచి తెరుచుకోనున్నాయి. సుదీర్ఘకాలం మూతబడి ఉండటంతో చెట్లు, పొదలు పెరిగాయి. తరగతి గదులు, బెంచీలు దుమ్ముపట్టాయి. అపరిశుభ్ర వాతావరణం నెలకొనడంతో స్వచ్ఛత కార్యక్రమాన్ని స్థానిక సంస్థలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. పాఠశాల/ కళాశాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్‌ వినతికి తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాలన్నీ కలిపి 30 వేల వరకు ఉన్నాయి. ఇవన్నీ దాదాపు పది నెలలకు పైగా మూతబడి ఉన్నాయి. ఆన్‌లైన్‌ బోధన సాగుతున్న క్రమంలో విద్యా సంస్థలను తెరిచి ఉపాధ్యాయుల హాజరుకు అనుమతిచ్చినప్పటికీ పారిశుధ్యంపై స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో బోధన సిబ్బంది కూర్చునే హాల్, రెస్ట్‌రూమ్‌ వరకు శుభ్రం చేశారు. విద్యార్థుల తరగతి గదులు, ప్లేగ్రౌండ్‌ శానిటైజేషన్‌ను పట్టించుకోలేదు. చదవండి: పాతపంట.. కొత్త సంబురం   

20లోగా క్లీన్‌ చేయాలి 
గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని విద్యా సంస్థల్లో పారిశుధ్య కార్యక్రమాలు ఈనెల 20వ తేదీలోగా పూర్తి చేయాలి. ఈమేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కళాశాల ప్రిన్సిపాళ్లు... సంబంధిత పం చాయతీ, మున్సిపాలిటీలకు లేఖలు సమర్పిస్తే వెంటనే సిబ్బంది వచ్చి విద్యా సంస్థల ప్రాంగణాలను శుభ్రం చేయాలి. బుష్‌ కటింగ్, పిచ్చిమొక్కల తొలగింపుతో పాటు నీటి సరఫరా వ్యవస్థ, మురుగునీటి పారుదల వ్యవస్థను పరిశీలిం చి ఆమేరకు మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లా స్థాయి విద్యా పర్యవేక్షణ కమిటీ(డీఎల్‌ఈఎంసీ)లో సభ్యులుగా ఉన్న జిల్లా పంచాయ తీ అధికారి, మున్సిపల్‌ కమిషనర్లకు శానిటైజేషన్‌ పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించింది. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని సూచించింది. 

Advertisement
Advertisement