-
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
-
దివ్యం.. భవ్యం.. రమ్యం రామచరితం
పితృవాక్పాలన, ధర్మవర్తన, సదా సత్యమే పలకడం, ప్రజానురంజకమైన పాలనను అందించడం.. వంటి ఎన్నో లక్షణాలను బట్టి అందరి గుండెల్లో దేవుడిగా కొలువు తీరాడు రాముడు. అయితే మన నిత్యజీవితంలో అసలు రామ శబ్దం లేనిదెప్పుడు? చిన్నప్పుడు లాల పోసి శ్రీరామ రక్ష చెప్పడం దగ్గరనుంచి ‘రామాలాలీ.. మేఘశ్యామాలాలీ’ అనే జోలపాటతో బిడ్డలను నిద్ర పుచ్చడం వరకు... అందరి జీవితాలలో రాముడు ఒక భాగంగా మారిపోయాడు. నేడు ఆ జగదభిరాముడు ఇలపై పుట్టినరోజు.. అంతేనా... ఆదర్శదంపతులుగా పేరు ΄పొందిన సీతారాముల పెళ్లిరోజు కూడా. ఈ సందర్భంగా ఆ పురుషోత్తముడి గురించి... ఆయన ఇక్ష్వాకు కుల తిలకుడు. దశరథ మహారాజ తనయుడు. తండ్రి మాటను నిలబెట్టడం కోసం రాజ్యంతోబాటు సర్వ సంపదలనూ, అన్నిసుఖాలనూ విడనాడి నారదుస్తులు ధరించి పదునాలుగేళ్లపాటు అరణ్యవాసం చేశాడు. ఎన్ని కష్టాలొచ్చినా వెరవలేదు. తాను నమ్మిన సత్య, ధర్మమార్గాలనే అనుసరించాడు. ఒక మంచి కొడుకులా, అనురాగాన్ని పంచే భర్తలా, ఆత్మీయతను అందించే అన్నలా, ప్రజలను కన్నబిడ్డల్లా పాలించే రాజులా ... అందరితో అన్ని విషయాలలోనూ వినమ్రతతో మెలిగే మర్యాద పురుషోత్తముడిలా... ఇలా ఎవరితో ఏవిధంగా ఉండాలో ఆ విధంగానే నడుచుకున్నాడు. అన్నివేళలా ధర్మాన్నే పాటించాడు. ఆపన్నులకు స్నేహహస్తాన్ని అందించాడు. ఆత్మీయులకు, మిత్రులకు అండగా నిలిచాడు. తాను అవతార పురుషుడినని అనలేదు. అనుకోలేదు కూడా... దేవుడినని ఎన్నడూ చెప్పుకోలేదు. ఎవరికీ ఏ ధర్మాన్నీ బోధించలేదు. తాను ఆచరించినదే ధర్మం – అనుకునే విధంగా వ్యవహరించాడు. అందుకే ధర్మం రూపు దాల్చితే రాముడిలా ఉంటుందేమో అనుకునేలా ప్రవర్తించాడు. సంపూర్ణావతారం ధర్మ పరిరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాలన్నింటిలోనూ సంపూర్ణమైనవి రామావతారం, కృష్ణావతారాలే. మిగిలినవి అంశావతారాలు. అంటే అప్పటికప్పుడు ఆవిర్భవించినవి. మత్స్య, కూర్మ, హయగ్రీవ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, కల్కి అవతారాలు. మానవాళిని సత్యవాక్య పాలకులుగా తీర్చిదిద్ది, సన్మార్గంలో నడిపించడం కోసం మానవుడిలా పుట్టాడు. అందరిలాగే ఎన్నో కష్టనష్టాలను అనుభవించాడు. అయితేనేం, ధర్మాన్ని ఎక్కడా తప్పలేదు. అందుకే కదా... అతి సామాన్యులనుంచి అసామాన్యుల వరకు అందరికీ ఆరాధ్య దైవమయ్యాడు. ఉత్తమ మానవుడు ఎలా ఉండాలో తన నడవడిక ద్వారా నిరూపించి, సకల గుణాభిరాముడయ్యాడు. కల్యాణ వైభోగం ఆ శ్రీహరి రామునిగా ఇలపై అవతరించిన పుణ్యతిథి శ్రీరామ నవమి. ఈ పండుగను తొమ్మిది రోజులు జరుపుతారు. చైత్ర శుక్ల పాడ్యమి నుంచి శ్రీరామనవమి వరకూ పూజాదికాలు, రామనామ పారాయణం చేస్తారు. అసలు చైత్ర మాసప్రారంభం నుంచే ఇంటింటా, వాడవాడలా, వీధివీధినా చలువ పందిళ్లు, మామిడాకు తోరణాలు... ఇలా ప్రతిచోటా కళ్యాణోత్సవ సంరంభాలు మొదలవుతాయి. కంచర్ల గోపన్న భక్తరామదాసుగా శ్రీరామసేవా దీక్షను స్వీకరించాడు. ప్రతి సంవత్సరం శ్రీరామ జన్మదినోత్సవమైన శ్రీరామనవమి నాడు శ్రీసీతారాములకు తిరుకల్యాణ మహోత్సవాన్ని జరిపించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు. సిరికల్యాణ తిలకంతో, మణిమయ బాసికాలతో ఆణిముత్యాలే తలంబ్రాలుగా జాలువారే ముగ్ధమోహనమైన, మనోరంజకమైన సీతారాముల పెళ్ళి వేడుక జగదానందకారకమై భాసిస్తుంది. శ్రీరామనవమి మరుసటి రోజు దశమినాడు శ్రీరామ పట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు. పుట్టినరోజునే పెళ్లి వేడుకలా.!? శ్రీరాముడు జన్మించిన పుణ్యతిథి చైత్రశుద్ధ నవమి, పునర్వసు నక్షత్రం, కర్కాటక రాశి, కర్కాటక లగ్నం. ఆనాడు రాముని జన్మదిన వేడుకలు జరిపించాలి. అయితే శ్రీ సీతారామకళ్యాణం జరిపించడంలోని అంతరార్థం ఏమిటనేదానికి పురుషోత్తమ సంహిత అనే ఆగమ శాస్త్ర గ్రంథం ఏమి చెబుతోందంటే– ఆ పరమాత్ముడు అవతారమూర్తిగా ఏ రోజున ఈ పుణ్యపుడమిపై అవతరిస్తే ఆ రోజునే కళ్యాణం జరిపించాల్సి ఉందనీ, ఒకవేళ ఆ తిథి తెలియకపోతే ఏకాదశి రోజున కళ్యాణం జరిపించడం సంప్రదాయమని పేర్కొంది. అందుకే లోక కళ్యాణం కోసం సీతారాములకు çపుణ్యక్షేత్రమైన భధ్రాచలంలో ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమినాడు అభిజిత్ లగ్నంలో పెళ్లి వేడుకలు జరిపిస్తున్నారు. శ్రీరామ నవమినాడు ఏం చేయాలి? ఈరోజు రామునితోబాటు సీతాదేవి ని, ఆంజనేయుని, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను కూడా పూజించాలి. రామునికి జన్మనిచ్చిన కౌసల్యను, దశరథుని కూడా స్తుతించడం సత్ఫలితాలనిస్తుంది. సీతారామ కళ్యాణం జరిపించడం, ఆ వేడుకలలో పాల్గొనడం, చూడడం, శ్రీరామ నవమి వ్రతాన్ని ఆచరించడం, విసన కర్రలు దానం చేయడం మంచిది. సమర్పించవలసిన నైవేద్యం పానకం, వడపప్పు, చలిమిడి, మామిడిపండ్లు, చక్కెర ΄పొంగలి, చెరకు, విప్పపూలు నివేదించాలి. సీతారామ కళ్యాణ తలంబ్రాలను ధరిస్తే ఆటంకాలు తొలగి సత్వరం వివాహం అవుతుందని పెద్దలంటారు. నిత్యజీవితంలో రాముడు... లాల పోసేటప్పుడు శ్రీరామ రక్ష, జోలపాడేటప్పుడు రామాలాలీ మేఘ శ్యామాలాలీ... ఓదార్పుగా అయ్యోరామ... అనకూడని మాట వింటే రామ రామ... పద్దు పుస్తకాలనుప్రారంభిస్తూ శ్రీరామ... కూర్చునేటప్పుడు లేచేటప్పుడూ రామా... ఇలా ఆయన అందరి నాలుకలమీదా నర్తిస్తూనే ఉన్నాడు... ఉంటాడు. అల్లరి చేస్తే కిష్కింద కాండ, కఠినమైన ఆజ్ఞ ఇస్తే సుగ్రీవాజ్ఞ విశాలమైన ఇంటి గురించి చెప్పేటప్పుడు లంకంత ఇల్లు పాతవాటి గురించి చెప్పాలనుకుంటే ఇక్ష్వాకుల కాలం నాటిది... సామెతలు: రామాయణంలో పిడకల వేట; రామాయణమంతా విని రాముడికి సీత ఏమవుతుందన్నట్టు... చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు ఆకారం గురించి చెప్పాలంటే రాముడిలా ఆజానుబాహువంటారు. ఎంతకీ చూడ్డానికి రాబోతే సీతకన్నేశావంటారు. సైన్యంలా వస్తే రామదండు అంటారు. చక్కని జంటను సీతారాముల్లా ఉన్నారంటారు. ఎవరైనా కొట్టుకుంటే రామరావణ యుద్ధమంటారు. అందరిళ్లలోని గిల్లి కజ్జాలను ఇంటంటి రామాయణమంటారు. రాముడు మనకు విలువలను, వ్యక్తిత్వాన్నీ నేర్పితే రామాయణం మనకు జీవిత పాఠాలు బోధిస్తుంది. రామచంద్ర ప్రభువు చల్లని చూపులు మనందరిమీదా ప్రసరించాలని కోరుకుంటూ.... – డి.వి.రామ్ భాస్కర్ తారక మంత్రం ‘శ్రీరామ రామరామేతి రమే రామే మనోరమే .. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే’ అనే శ్లోకం విష్ణుసహస్ర నామంతో సమానమైనదంటారు. మోక్షాన్ని ప్రసాదించే మహామంత్రాలు ఓం నమో నారాయణాయ, ఓం నమశ్శివాయల నుంచి తీసుకున్న అక్షరాల కలయిక అయిన రామనామాన్ని జపిస్తే ఈ రెండు మంత్రాలను జపించడం వల్ల కలిగే ఫలితం కంటె ఎక్కువ ఫలం కలుగుతుంది. మన పెదవులు రామనామంలోని ‘రా’ అనే అక్షరాన్ని పలికినపుడు మనలోని పాపాలన్నీ బయటకు వెళ్లిపోతాయి. ‘మ’ అనే అక్షరాన్ని ఉచ్చరించినప్పుడు అవి లోపలకు రాకుండా మూసుకుంటాయి. కాబట్టి ‘రామ’ అనే రెండక్షరాల తారక మంత్రాన్ని సదా స్మరిస్తుండడం వల్ల పాపాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని కబీరుదాసు, భక్త రామదాసు, తులసీదాసు వంటి మహాభక్తులు ఉవాచించారు. శుభప్రదం... రామచరిత పారాయణం రాముని కాలంలో ధర్మం నాలుగు పాదాలా నడిచింది. దేశం సుభిక్షంగా ఉంది. అందుకే నేటికీ ప్రజలు రాముని వంటి రాజుకొసం– రామరాజ్యం నాటి పాలన కోసం పరితపిస్తుంటారు. తులసీదాసు, రామదాసు, కబీరుదాసు వంటి వారందరూ ...‘‘అంతా రామ మయం.... ఈ జగమంతా రామమయం’’ అని వేనోళ్ల స్తుతించారు. ఆ పురాణ పురుషుని పుణ్యచరితమైన రామాయణాన్ని విన్నా, చదివినా, అందులోని శ్లోకాలను, ఘట్టాలను మననం చేసుకున్నా, శుభం కలుగుతుందని ప్రతీతి. 12 గంటలకు ఎందుకు? రాముడు త్రేతాయుగంలో వసంత రుతువు, చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం, అభిజిత్ ముహూర్తం అంటే మధ్యాహ్నం సరిగ్గా 12:00 గంటలకు జన్మించాడు. అందుకే చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరాముడి వివాహం, పదునాలుగు సంవత్సరాల అరణ్యవాసం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడు అయిన రోజు కూడా చైత్ర శుద్ధ నవమి. శ్రీరామ నవమి రోజున ప్రతి శ్రీరాముని దేవాలయాలలో సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించి సాయంత్రం వీధులలో ఊరేగిస్తారు. శ్రీరాముడు మధ్యాహ్నం 12:00 గంటలకు పుట్టాడు కాబట్టి శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేస్తే శ్రీరామానుగ్రహంతో కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ఏటా చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రంలో అభిజిత్ లగ్నంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం శ్రీసీతారామచంద్రస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవాన్ని భద్రాద్రిలో అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలను తిలకించేందుకు దేశం నలు మూలల నుంచి భక్తులు తరలివస్తారు. తానీషా గోల్కొండ నవాబుగా ఉన్న కాలం నుంచి– ఆనాటి సాంప్రదాయం మేరకు నేటికీ భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా సమర్పించడం ఆనవాయితీ -
Happy Bihu 2024: అంబరాన్నంటే సంబరాలు.. (ఫోటోలు)
-
పండుగ పూట.. మహిళలుగా మారిపోయే పురుషులు (ఫొటోలు)
-
Eid 2024 : ఈద్ ముబారక్ అంటున్న ఈ సెలబ్రిటీలను గుర్తు పట్టారా (ఫోటోలు)
-
ఓ అల్లాహ్ ..ఇదంతా నీవు పెట్టిన భిక్ష!
ముఫ్ఫై రోజుల రమజాన్ ఉపవాసాలు పూర్తయ్యాయి... సహరీ, ఇఫ్తార్ ల ద్వారా సహనశీలత, కృతజ్ఞతాభావం అలవడ్డాయి.. ఖురాన్ పారాయణం, తరావీహ్ నమాజులు ఆత్మకు నెమ్మదిచ్చాయి. మండే ఎండల్లో రోజాలో ఉంటూ ఆకలిని తట్టుకునే సహనం అలవడింది. ఓ అల్లాహ్! ఇదంతా నీ కృపాకటాక్షాలతోనే సాధ్యమైంది! ! ఓ అల్లాహ్! నీకు వేనవేల షుక్రియా (కృతజ్ఞతలు) అంటూ అల్లాహు అక్బర్... అల్లాహు అక్బర్ నినాదాన్ని బిగ్గరగా పఠిస్తూ ఈద్గాహ్ కు చేరుకుంటారు. ‘తఖబ్బలల్లాహు మిన్నా వ మిన్ కుమ్’ మా రమజాన్ ఆరాధనలన్నీ స్వీకరించు ప్రభూ! అంటూ వేడుకుంటారు. నెల రోజుల రమజాన్ ఉపవాసాలు దిగ్విజయంగా పూర్తిచేసుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపునే శుభ సందర్భమే ‘ఈదుల్ ఫిత్ర్’ రమజాన్ పర్వదినం. ఈద్గాహ్ మైదానానికి చేరుకుని అల్లాహ్ ఘనతను, గొప్పతనాన్ని చాటిచెప్పే ముస్లిముల హృదయాలు పులకించిపోతాయి. ఓ అల్లాహ్ మేము 30దినాలు పాటించిన రమజాన్ రోజాలు, నమాజులు, సహరీ, ఇఫ్తార్లు ఇవన్నీ నీవు పెట్టిన భిక్షయే అల్లాహ్ అని ఆనంద భాష్పాలు రాల్చే శుభఘడియలు. రంజాన్లో అల్లాహ్కు ఇచ్చిన వాగ్దానాలు మిగతా 11నెలలూ ఆచరణాభాగ్యానికి నోచుకోవాలని రోదిస్తారు. రాబోయే రంజాన్ వరకూ రంజాన్ స్ఫూర్తి కొనసాగించే భాగ్యాన్నివ్వమని అల్లాహ్ కు విన్నవించుకుంటారు. రెండు రకాతుల షుక్రానా నమాజు చేస్తారు. రమజాన్ మొదలు మళ్లీ వచ్చే రంజాన్ వరకూ స్వర్గాన్ని ఉపవాసకుల కోసం ముస్తాబు చేస్తారు. అలాంటి రంజాన్ను మరోసారి ఇచ్చినందుకు అల్లాహ్కు షుక్రియా తెలుపుకుంటారు. కేవలం మేము రంజాన్ వరకే ముస్లిమ్గాగా ఉండకుండా మిగతా 11నెలలూ ముస్లిమ్గా జీవించే సౌభాగ్యాన్ని ప్రసాదించు అని అల్లాహ్ని వినమ్రంగా వేడుకుంటారు. నెలంతా ఎన్నెన్ని ఆరాధనలు, మరెన్ని పుణ్యకార్యాలు చేసినా వాటిపట్ల రవ్వంత గర్వాన్ని కూడా రానీయకూడదు. నెలసాంతం పాటించిన ఉపవాసాలు, పఠించిన ఖురాన్ పారాయణం, రాత్రుళ్లు నిద్రను త్యాగం చేసి ఆచరించిన నమాజులు, జకాత్, ఫిత్రా దానాలను నీవు నీ ప్రత్యేక కారుణ్యంతో స్వీకరించు ప్రభూ! మా శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని ప్రసాదించు అని వేడుకుంటారు. నమాజు తరువాత ఒకరినొకరు ఈద్ ముబారక్ తెలుపుకుంటారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ప్రేమను చాటుకుంటారు. అందరి పండుగ.. ఈదుల్ ఫిత్ర్ పండుగ నాడు ప్రతీ ముస్లిమ్ కుటుంబం ఉన్నదాంట్లో గొప్పగా జరుపుకుంటుంది. ఇంటిల్లిపాది కొత్తబట్టలు ధరించడం, అత్తరు పరిమళాలు పూసుకోవడం ప్రవక్త సంప్రదాయంగా భావిస్తారు. షీర్ ఖుర్మా పాయసాన్ని తమ ఆత్మీయులకు, దగ్గరి బంధువులకు, ఇరుగు పొరుగు వారికి అందించి ప్రేమను చాటుకుంటారు. తమకు అల్లాహ్ అనుగ్రహించిన అనుగ్రహ భాగ్యాలను చాటుకోవాలన్నది ప్రవక్త బోధన. ఫిత్రా, జకాత్ దానాలతో నిరుపేదలు సైతం పండుగను సంతోషంగా జరుపుకుంటారు. కుటుంబంలోని ఎంతమందైతే ఉన్నారో ప్రతీ ఒక్కరూ ఫిత్రా దానాన్ని లెక్కించి నిరుపేదలకు పంచాలన్న ప్రవక్త సూక్తిని ప్రతీ ఒక్కరూ పాటించాల్సిందే. అర్హులై ఉండి ఫిత్రా చెల్లించకపోతే ఉపవాసాలు స్వీకరించబడవన్నది కూడా ప్రవక్త హెచ్చరిక. ఈదుల్ ఫిత్ర్ ఇలా... ఈదుత్ ఫిత్ర్ పర్వదినంనాడు ముహమ్మద్ ప్రవక్త (స) కొన్ని ఖర్జూరపు పండ్లు తిని నమాజుకోసం ఈద్గాహ్కు వెళ్లేవారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ముస్లిములు ఖర్జూరాలు తిని ఈద్గాహ్ కు చేరుకుంటారు. ఈద్గాహ కు కాలినడకన వెళ్లడం ఉత్తమం. ఈద్ నమాజు తరువాత పిల్లలకు ఈదీ (ఈద్ కానుక)లు ఇస్తారు. ఖజా రోజాలు... రమజాన్ నెలలో ఎలాంటి కారణం లేకుండా ఒక్క రోజాను వదిలేసినా మిగతా రోజుల్లో ఏడాదంతా ఉపవాసం పాటించినా సరితూగదన్నది ప్రవక్త బోధనల సారాంశం. అయితే కొంతమందికి రమజాన్ నెల ఉపవాసాల నుంచి మినహాయింపు ఉంది. బాలింతలు, రుతుక్రమంలో ఉన్న స్త్రీలు, రోగగ్రస్తులు మిగతా రోజుల్లో ఆ ఉపవాసాల సంఖ్యను పూరించాలన్నది ఖురాన్ ఉద్బోధ. ఇలాంటి రోజాలను ఖజా రోజాలు అని అంటారు. వీలయినంత త్వరగా ఈ రోజాలను పూర్తిచేయాలని ఉలమాలు సందేశమిస్తారు. రంజాన్ లో తప్పిపోయిన రోజాలను తొలి తీరికలో పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. రమజాన్ స్ఫూర్తిని ఏడాదంతా కొనసాగించాలి. ఖురాన్ ప్రబోధనలు ►మీలో మీరు ఒకరి ఆస్తిని మరొకరు అన్యాయంగా కబళించకండి. బుద్ధిపూర్వకంగా, అక్రమమైనరీతిలో ఇతరుల ఆస్తిలో కొంత భాగం కాజేసే అవకాశం లభిస్తుందేమో అనే దురుద్దేశ్యంతో దానిని న్యాయనిర్ణేతల వద్దకు తీసుకునిపోకండి. (2:188) ►ధర్మం విషయంలో నిర్బంధంకానీ, బలాత్కారంకానీ లేవు. (2:253) న్యాయం పలకాలి. ►అనాథుల ఆస్తిని అన్యాయంగా తినేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటారు. వారు తప్పకుండా మండే నరకాగ్నిలో త్రోయబడతారు.(4:10) ►తల్లిదండ్రుల ఎడల సద్భావంతో మెలగండి. బంధువులూ, అనాథులూ, నిరుపేదల పట్ల మంచిగా వ్యవహరించండి. పొరుగున ఉన్న బంధువులు, అపరిచితులయిన పొరుగువారు, ప్రక్కనున్న మిత్రులు, బాటసారులు, మీ అధీనంలో ఉన్న దాసదాసీ జనం పట్ల ఉదారబుద్ధితో వ్యవహరించండి. (4:36) ►మంచికి, దైవభక్తికి సంబంధించిన పనులలో అందరి తోనూ సహకరించండి. పాప కార్యాలలో అత్యాచారాలలో ఎవరితోనూ సహకరించకండి. (5:2) ►అల్లాహ్కు పరిశుద్ధతను పాటించేవారు అంటేనే ఇష్టం.(9:108) ►పేదరికానికి భయపడి మీరు మీ సంతానాన్ని హత్య చేయకండి. మేము వారికీ ఉపాధిని ఇస్తాము, మీకూ ఇస్తాము. వాస్తవానికి వారిని హత్య చేయటం ఒక పెద్ద నేరం. (17:29) నీవు అనాథులపట్ల కఠినంగా ప్రవర్తించకు.యాచకుణ్ణి కసురుకోకు.(93.10) (చదవండి: హలీమ్.. రుచికి సలామ్) -
Ugadi 2024: ఈ పండుగకి 'ఉగాది' అనే పేరు ఎలా వచ్చిందంటే..?
తెలుగువారి పండుగ ఉగాది రానే వచ్చేసింది. తెలుగు వాకిళ్లలో క్రోధి నామ సంవత్సరం సందడి మొదలైంది. ఉగాది అంటే ప్రతీ ఒక్కరికి గుర్తుకొచ్చేది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనమే పండుగ ప్రత్యేకత. జీవితంలో వచ్చే కష్టసుఖాలను అందరూ అనుభవించాలని గుర్తు చేసేదే పచ్చడి. హిందూ పురాణాల ప్రకారం, ఉగాదిలో ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం.. ఈ గమనానికి ఆది ఉగాది.. అంటే సృష్టి ఉగాది రోజు నుంచే ప్రారంభమైందని అర్థం. చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాఢ్యమి తిథి రోజును ఉగాదిగా నిర్ణయిస్తారు. ఈ పండుగను తెలుగువారే కాకుండా మరాఠీలు ‘గుడిపడ్వా’గా, తమిళులు ‘పుత్తాండు’, మలయాళీలు ‘విషు’, సిక్కులు ‘వైశాఖీ’, బెంగాలీలు ‘పోయ్ లా బైశాఖ్’గా జరుపుకుంటారు. ఈ సమయంలో ప్రముఖ ఆలయాల్లో పండితులు పంచాంగ శ్రవణం పఠిస్తారు. ఈ నేపథ్యంలో క్రోధి నామ సంవత్సరంలోకి అడుగు పెట్టనున్నాం. ఇవి చదవండి: చైత్ర మాసం విశిష్టత? వసంత నవరాత్రులు ఎందుకు చేస్తారు? -
రెడ్ హెడ్ డేస్ ఫెస్టివల్ గురించి తెలుసా?
రెడ్ హెడ్ డే పండుగ గురించి ఎపుడైనా విన్నారా? నెదర్లాండ్స్లో ఈ పండుగ అత్యంత ఘనంగా జరుగుతుంది. పేరుకు తగ్గట్టే.. ఎర్ర జుట్టు వాళ్లంతా ఒక చోట చేరి చేసుకునే వేడుక ఈ రెడ్ హెడ్ డే ఫెస్టివల్. ఇది ప్రతి ఆగస్టు చివరి వారాంతంలో టిల్బర్గ్ నగరంలో జరుగుతుంది. మూడు రోజుల పాటు జరిగే ఆ పండుగకు పలు దేశాల్లో ఉన్న ఎర్ర జుత్తు మగ, ఆడ అంతా ఒక్క చోట చేరి వేడుక చేసుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 23-25 తేదీల్లో ఈ పండుగను నిర్వహించనున్నారు. అంతేకాదు ఎర్ర జుట్టు లేని వాళ్లు పాల్గొనాలంటే ఎర్ర రంగు బట్ట లేసుకోవాలనే నియమాన్ని పాటిస్తారు. జన్యుపరమైన మార్పులతో ఇలా ఎర్ర జుత్తు వస్తుంది. ప్రపంచ జనాభాలో దాదాపు ఒక శాతం ప్రజలకు ఎర్ర జుత్తు ఉందని ఒక అంచనా. స్కాట్లాండ్, రష్యాలలో రెడ్ హెయిర్ ఉన్నవారు ఎక్కువగా ఉన్నారట. -
Ugadi 2024 : ఈ ఏడాది ఉగాది పేరేంటి? ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
ఉగాది అనేది హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం తొలి రోజు జరుపుకునే తొలి పండుగ. తెలుగువారికి తెలుగు కొత్త సంవత్సరం ఆరంభం. హిందూ క్యాలెండర్ నెల చైత్ర మొదటి రోజు సాధారణంగా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. 2024లో ఉగాది ఏప్రిల్ 9వ తేదీన (మంగళవారం) వస్తుంది. "యుగాది" అనే పదం రెండు పదాల కలయిక - "యుగం" (వయస్సు) , "ఆది" (ప్రారంభం) ఒక శుభ సందర్భం అని అర్థం. పంచాంగం ప్రకారం ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఉంటుంది. ఏప్రిల్ 9 నుంచి క్రోధి నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఏప్రిల్ 9 న క్రోధి అర్థం కోపం కలిగించేదని. మహారాష్ట్రలో ఉగాది పండుగను గుడి పడ్వాగా జరుపుకుంటారు. బెంగాల్, కేరళ, అసోం, పంజాబ్ రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల్లోను ఈ పండుగ జరుపు కుంటారు. బెంగాలీలు “పోయిలా భైశాఖ్”, సిక్కులు “వైశాఖీ”, మలయాళీలు “విషు” అనే పేరుతో ఉగాది పండుగను జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా పలు దేవాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతాయి. మత్స్యావతారం ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణనాన్ని గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన. అంతేకాదు, వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకొంటారు. ఇతర విశేషాలు ఈ రోజు కొత్తగా పనులు మొదలు పెట్టడం, కొత్తగా కార్యక్రమాలు ప్రారంభించడం మంచిది కృతయుగంలో కార్తీకశుద్ధ అష్టమి రోజున ఉగాది జరుపుకునేవారు. త్రేతా యుగంలో వైశాఖ శుద్ధ తదియ రోజున ఉగాది జరుపుకునేవారు. ద్వాపరయుగంలో మాఘశుద్ధ అమావాస్య రోజున ఉగాది జరుపుకునే వారు. శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తులయినది చైత్ర శుద్ధ పాడ్యమి రోజుననే. వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసింది చైత్ర శుద్ధ పాడ్యమి రోజుననే. వారం రోజుల ముందు నుంచే సందడి ఉగాదికి వారం రోజుల ముందునుంచే ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, అలంకరించుకునే పనులతో సందడి మొదలవుతంది. రంగురంగుల రంగువల్లులతో ఇంటి ముంగిళ్లు ముస్తాబవుతాయి. మామిడి ఆకుల తోరణాలతో గుమ్మాలను అలంకరించడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, దానధర్మాలు చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. వంటలు, ఉగాది పచ్చడి, నైవేద్యాలు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి గుమ్మానికి మామిడాకుల తోరణాలు కట్టాలి. తలకు నువ్వుల నూనె పట్టించి నలుగు పెట్టుకుని స్నానం చేసి, కొత్త బట్టలు లేదా శుభ్రమైన దుస్తులు ధరిస్తారు. పాలు పొంగించి, పిండి వంటలు సిద్ధం చేసి. ఇష్టదైవాన్ని పూజిస్తారు. పులిహోర, పాయసం, బొబ్బట్లు ఇలా ఎవరికికి నచ్చినట్టు వారు తయారు చేసుకున్న వంటకాలను నైవేద్యంగా అందిస్తారు. ఏడాదంతా మంచి జరగాలని తొలి పండుగగా తెలుగువారు ఉత్సాహంగా జరుపుకుంటారు. ఏడాది మొత్తం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని గుర్తు చేసే పండగ ఉగాది. కుటుంబమంతా ఆనందంగా గడుపుతారు. కొత్తమామిడి కాయలు, వేపపువ్వు, బెల్లం, పులుపు,కారం, ఇలా షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడితో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజు ఏదైనా మంచి కార్యం తలపెడితే శుభం జరుగుతుందని నమ్ముతారు. బంగారం, కొత్త వస్తువులు,కొత్త వాహనాలు, కొత్త ఇళ్లు లాంటివి కొనుగోలు చేస్తారు.కొత్త వ్యాపారానికి కూడా శుభతరుణంగా భావిస్తారు. పంచాంగ శ్రవణం ఉగాది రోజున పంచాంగ శ్రవణం వింటే మంచిదని పెద్దలు చెబుతారు. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితీ. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు. ఉగాది రోజున కవి సమ్మేళనాలు, కవి సన్మానాలు అంటూ కవులు, రచయితలు సందడి సందడిగా ఉంటారు. -
Ugadi 2024 అచ్చంగా ఆరు : జీవితానికి ఎన్నో లాభాలు
త్వరలో ఉగాది వస్తోంది. ఆరు రుచులున్న ఉగాది పచ్చడిని ఈ రోజు తప్పనిసరిగా సేవించడం ఈ పండగ ఆచారం. ఉగాది రోజున షడ్రుచుల సమ్మేళనం అయిన ఉగాది పచ్చడి సేవిస్తే ఆయా రుచుల్లాగే సంవత్సరమంతా మనకు ఆయా ఫలాలు అందుతాయని, అలా రకరకాల అనుభవాలూ, అనుభూతులను ఆస్వాదించడమే జీవితమని పెద్దలు చెబుతారు. అయితే అలా కేవలం ఉగాది నాడు మాత్రమే కాదు, వీలయితే ప్రతిరోజూ ఆరు రుచుల ఆహారాలను తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండచ్చని ఆయుర్వేదం చెబుతోంది. ఏయే రుచులు ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం. 1. తీపి శరీరంలోని వాత, పిత్త దోషాలను ఈ రుచి సమం చేస్తుంది. తీపి పదార్థాలను తీసుకోవడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది, శరీరం దృఢంగా మారుతుంది. శక్తి అందుతుంది. శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. అయితే వీటిని చాలా తక్కువగా తినాలి. లేదంటే శరీరంలో కఫ దోషం పెరుగుతుంది. ఫలితంగా అధిక బరువు, స్థూలకాయం, డయాబెటిస్ వంటి వ్యాధులు వస్తాయి. కనుక ఈ రుచి ఉన్న ఆహారాలను నిత్యం తక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యంగాఉండవచ్చు . 2. పులుపు వాత దోషాలను పులుపు తగ్గిస్తుంది. పులుపు రుచి ఉన్న ఆహారాలను తినడం వల్ల ఆకలి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు. నిమ్మ, చింతకాయ వంటి పులుపు ఉన్న ఆహారాలను నిత్యం పరిమితంగా తీసుకోవచ్చు. అయితే ఎక్కువగా తీసుకుంటే పిత్త, కఫ దోషాలు పెరుగుతాయి. కనక పులుపు ఆహారాలను కూడా తక్కువగా తీసుకోవాలి. 3. ఉప్పు ఉప్పు ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల వాత దోషం తగ్గుతుంది. ఉప్పు అధికమైతే పిత్త, కఫ దోషాలు పెరుగుతాయి. ఉప్పు ఉన్న ఆహారాల వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. కణాలు శుభ్రమవుతాయి. ఉప్పు ఉన్న పదార్థాలను కూడా తక్కువగా తీసుకోవాలి. ఎక్కువైతే బీపీ పెరుగుతుంది. గుండె జబ్బులు వస్తాయి. 4. కారం కారపు రుచి గల ఆహారాలను తీసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది. ఆకలి వేస్తుంది. కణాలు శుభ్రమవుతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. కఫ దోషం తగ్గుతుంది. కారం ఎక్కువైతే పిత్తదోషం పెరుగుతుంది. అందువల్ల కారాన్ని నిత్యం తక్కువగానే తీసుకోవాలి. 5. చేదు చేదుగా ఉన్న పదార్థాలను తినడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. పిత్త, కఫ దోషాలు తగ్గుతాయి. చేదుగా ఉన్న పదార్థాలను నిత్యం కొద్దిగా ఎక్కువ మోతాదులో తీసుకున్నా పెద్దగా సమస్యలు ఉత్పన్నం కావు. 6. వగరు వగరు ఉన్న పదార్థాలను కూడా నిత్యం తినాలి. కానీ వీటిని తక్కువగా తీసుకోవాలి. లేదంటే జీర్ణాశయంలో గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇక పిత్త దోషం ఉన్న వారికి ఈ రుచి ఉన్న పదార్థాలు ఎంతగానో మేలు చేస్తాయి. పచ్చి అరటి పండ్లు, క్రాన్ బెర్రీలు, గ్రీన్ బీన్స్ వంటివి ఈ రుచి ఉన్న పదార్థాలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. అయితే భోజనం చేసేటప్పుడు ఒకేసారి ఆరు రుచులు కలిసిన పదార్థాలను తినాల్సిన పనిలేదు. రోజులో మొత్తంగా చూసుకుంటే ఈ ఆరు రుచులు ఉన్న పదార్థాలను తిన్నామా లేదో అని చెక్ చేసుకుంటే చాలు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో ఈ ఆరు రుచుల నుంచి ఏవైనా రెండు రుచులు కలిగిన ఆహారాలను ఎంచుకుని తింటే చాలు. అంటే ఉదయం చేదు, కారం, మధ్యాహ్నం తీపి, వగరు, రాత్రి పులుపు, ఉప్పు.. ఇలా రెండేసి రుచులు ఉండేలా ఆహారాలను తీసుకుంటే చాలు. ఇవే తినాలని ఏమీ లేదు. ఎవరికి నచ్చినట్లు వారు ఆహారాలను ఎంచుకుని ఆరు రుచులు కవర్ అయ్యేలా చూసుకుంటే చాలు. -
రంగులు చల్లుకోని హోలీ గురించి తెలుసా?
ప్రకృతిలో సరికొత్త సొగసు కనుల విందు చేస్తుందంటే అది వసంత రుతువు ఆగమనానికి గుర్తింపు మాత్రమే కాదు.. మనుషుల్లో ఉత్సాహానికి కారణం కూడా. ఎందుకంటే..? ఆ రుతువులోనే ఎండిన చెట్లు, కొమ్మలు, రెమ్మలు చిగురిస్తాయి. అంతేనా ఆ కొమ్మలపైన కుహు.. కుహు.. అంటూ మనసు పులకరించేలా కోయిలమ్మ మధురగానాలతో వీనుల విందు చేస్తుంది. మరోవైపు ఆ పచ్చదనపు ప్రకృతి సోయగాలు పుష్ప పరిమళ వికాసాలు అన్నీ ఏకమై ఆవిష్కృతమవుతాయి. ఆ ఆనందభరిత సమయాన చిన్న, పెద్ద, ఆడ, మగ తేడాలు లేకుండా కులమతాలకు అతీతంగా దేశ వ్యాప్తంగా జరుపుకునే తొలి వేడుక హోలీ. హోలీ పండుగ రంగుల పండుగ.. అదో ఆనంద కేళీ… ప్రజలు ఎంతో ఇష్టంగా పాల్గొనే పండుగ. వసంతాగమనంలో వస్తుంది ఈ రంగుల హోలీ. గజగజా వణికించిన చలికి టాటా చెబుతూ.. వేసవి వెచ్చదనంలోకి అడుగుపెడుతున్న వేళ హోలీ వస్తుంది. భారతీయ పండుగల్లో హోలీ మరీ ప్రత్యేకం. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు హోలీని ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. సంవత్సరంలో కేవలం ఒక్క సారి మాత్రమే ఘనంగా జరుపుకునే పండుగలలో హోలీ పండుగ ఒకటి. ఈ పండుగను సత్య యుగం నుంచి జరుగుతున్నట్లుగా హిందూ పురాణాలు తెలియజేస్తున్నాయి. హోళి అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. ఈ హోళిని హోలికా పూర్ణిమ అని కూడా అంటారు. పురాణాల ప్రకారం చూస్తే విష్ణు భక్తుడు ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశ్యపుడు. ప్రహ్లాదుడిని చంపడానికి రాక్షసి హోలికా ప్రయత్నిస్తుంది. ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు కావడం, తనని మాత్రమే పూజించాలన్నా.. తన మాట వినకపోవడంతో హిరణ్యకశ్యపుడే తన కొడుకు ప్రహ్లాదుడిని చంపాలని హోలికాకి ఆదేశాలు ఇచ్చాడు. ఎందువల్ల ఇలా చేస్తాడంటే..రాక్షస రాజు.. హిరణ్యకశ్యపుడు .. కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటాడు.. అది హిరణ్యకశ్యపుడికి నచ్చదు దీంతో భక్త ప్రహ్లాదుని చంపేయాలి అనుకుంటాడు. తన సోదరి అయిన హోలికను పిలుస్తారు. ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుని మంటలలో ఆహుతి చేయమని ఆమెను కోరతాడు. దీంతో ఆమె ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టుకొని, మంటల్లోకి దూకుతుంది. విష్ణు మాయతో ప్రహ్లాదుడు బయటపడతాడు. హోలిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో చిక్కుకొని చనిపోతుందట. మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. సతీవియోగంతో తపస్సులో ఉన్న శివునికి హిమవంతుని కుమార్తె అయిన పార్వతిని ఇచ్చి దేవతలు వివాహం చేయాలనుకుంటారు. కానీ తపస్సులో ఉన్న శివునికి ఎలా తపో భంగం కలిగించాలోనని ఆలోచించి మన్మథున్ని శివుని మీదకు పంపుతారు. కామదేవుడు శివుని తపస్సును భగ్నం చేసేందుకు పూల బాణాలు వదలడంతో శివుని మనస్సు పెండ్లి వైపు మరలిస్తాడు. దీంతో పార్వతీ పరమేశ్వరుల వివాహం జరుగుతుంది. మన్మథ బాణం ప్రభావం తగ్గగానే శివుడు తనకు మన్మథుడి వల్ల తపో భంగం కలిగిందని తన మూడో నేత్రంతో కామదేవుడిని భస్మం చేస్తాడు. పతీ వియోగంతో కామదేవుడి భార్య రతీదేవి శివునితో తన భర్త కామదేవున్ని బతికించమని వేడుకుంటుంది. శివుడు అనుగ్రహించి శరీరం లేకుండా మానసికంగా బతికే వరాన్ని ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున ప్రసాదిస్తాడు. కాముడు తిరిగి బతికిన రోజు కావడంతో కాముని పున్నమిగా పిలుస్తారు. పూర్వం ఈ పండుగ రోజున రకరకాల పూలను ఒకరిపై ఒకరు చల్లుకుని.. అలా వారి సంతోషాన్ని వ్యక్తపరిచేవారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పూల స్థానంలో రకరకాల రంగులు వచ్చాయి. ఈ రంగులను నీళ్ళలో కలుపుకొని ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ప్రేమ తోపాటు, సౌభాగ్యాలు వెల్లి విరుస్తాయి అని అందరూ భావిస్తారు. హోలీ ఎలా వచ్చిందంటే.. ఇక మరో కథనం ప్రకారం.. అప్పట్లో శ్రీకృష్ణుడు గోపికలతో కలసి బృందావనంలో పువ్వులు, రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకునేవారు. ఇలా చేయడం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం. పురాణ కథల ప్రకారంగా.. కృష్ణుడు ముదురు రంగులో ఉంటాడు. రాధ చాలా అందంగా ఉంటుంది. ఓ రోజు కృష్ణుడు తల్లి యశోద వద్దకు వెళ్లి రాధ గురించి చెబుతాడు. రాధ మేని మెరుపు తన ఒంటి ఛాయ పూర్తి విరుద్ధంగా ఉంది, ఆమె నా ప్రేమను అంగీకరిస్తుందా అని అడుగుతాడు. అప్పుడు యశోద బదులిస్తూ, రాధ ముఖానికి కూడా నీకు నచ్చిన రంగు పూయమని సరదాగా అంటుంది. దీంతో తల్లి యశోద సలహాను అనుసరించి, శ్రీకృష్ణుడు రాధ ముఖానికి రంగులు పూస్తాడు. అలా హోలీ మొదలైంది ఈ దినాన రాక్షస పీడ పోయే౦దుకు "హోళికా" అనే ఒక విధమైన శక్తిని ఆరాధిస్తారు. ఈ రోజునే మహాలక్ష్మీ ఆవిర్భావం.. ఆమె ప్రీతి కోస౦ అ౦దరూ కలిసి గానాలు చేయడ౦, పరిహాసాలాడడ౦ చేస్తారు. హోలికాగ్నిని రగిల్చి ఆరాధి౦చే స౦ప్రదాయ౦ ఇప్పుడు తగ్గిపోయి పరిహాసాది క్రియలే మిగిలాయి. శ్రీమహాలక్ష్మి క్షీరసాగర౦ ను౦డి ఆవిర్భవి౦చి౦దని పురాణ కథ. ఈ ఏడాది పూర్ణిమ, ఉత్తర ఫల్గుణి కలిసి వచ్చాయి. కనుక ఈ దినాన భక్తి శ్రధ్ధలతో మహాలక్ష్మిని షోడశోపచారములతో చక్కగా ఆరాధి౦చి లక్ష్మీ అష్టోత్తర శతనామాలు, కనకధారాస్తోత్ర౦, వ౦టివి పారాయణ చేయడ౦ మ౦చిది. ఈరోజున లక్ష్మిని శ్రద్ధగా అర్చి౦చే వారికి సమస్త ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈరోజుననే శ్రీకృష్ణుని ఉయ్యాలలో వేసి ఆరాధి౦చాలి. దీని ’డోలోత్సవ౦’ అని అ౦టారు. ఒరిస్సావ౦టి ప్రా౦తాలలో డోలా పూర్ణిమ పేరుతో ఇప్పటికీ దీనిని ఆచరిస్తారు. నరాడోలాగత౦ దృష్ట్వా గోవి౦ద౦ పురుషోత్తమ౦! ఫాల్గుణ్యా౦ ప్రయతో భూత్వా గోవి౦దస్య పుర౦వ్రజేత్!! ఉయ్యాలలో అర్చి౦పబడిన పురుషోత్తముడైన గోవి౦దుని ఈరోజున దర్శి౦చిన వారికి వైకు౦ఠలోక౦ ప్రాప్తిస్తు౦దని ధర్మశాస్త్రాల వాక్య౦. (చదవండి: జీవితం వర్ణమయం) -
Ramzan: సుర్మాతో.. కంటి సంబంధిత వ్యాధులకు చెక్!
ముస్లింలు పవిత్ర మాసంగా భావించే రంజాన్ మాసంలో ‘సుర్మా’ ఆద్యంతం ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూ ప్రత్యేకత చాటుతోంది. ఈ మాసంలో ముస్లింలు వయోభేదం లేకుండా త్రికరణ శుద్ధితో ఉపవాసం(రోజా)ఉంటారు. ఖురాన్ పఠిస్తూ ఐదు పూటలా నమాజ్ ఆచరిస్తారు. మహ్మద్ ప్రవక్త బాటను అనుసరిస్తూ నిష్టగా ఉంటారు. ఈ క్రమంలో ఈ మాసంలో ముస్లింల నేత్రాలకు అలంకరించే సుర్మాకు ఎంతో విశిష్టత ఉంది. విధిగా కళ్లకు సుర్మా అలంకరించడం పవిత్ర కార్యంగా భావిస్తారు. సువాసన వెదజల్లే అత్తర్లకు ప్రాధాన్యమిస్తారు. ఇదీ.. సుర్మా ప్రశస్తి.. నిత్యం అల్లాహ్ నామస్మరణలో గడిపే దైవప్రవక్త హజ్రత్ మూసా అలైహిసలా తుస్సలాంకు అల్లా ప్రసన్నం పొంది అతడిని అల్లా ఎక్కడున్నాడో చూపించమని అనునయులు కోరుతారు. దీంతో ఈజిప్టు, సిరియా ప్రాంతాలకు చెందిన పెద్దలను సమీపంలోని కోహితూర్ పర్వతం వద్దకు తీసుకెళ్తారు. అక్కడ ఒక్కసారి అల్లాహ్ నూర్ (ఓ వెలుగు)ప్రత్యక్షంకావడం చూసి ఆశ్చర్యానికి గురవుతారు.అప్పుడే కోహితూర్ పర్వతం భస్మమై బూడిదగా(చూర్ణంగా) మారుతుంది. దైవసంకల్పం కళ్లెదుట సాక్షాత్కరించడంతో తమలోని భక్తి ఉప్పొంగి ఆ చూర్ణాన్ని వారు కళ్లకు అద్దుకుంటారు. ఈ సమయంలో తమ కళ్లకు సుదూరంలోని చీమల కదలికలను సైతం పసిగట్టే విధంగా ప్రకాశవంతం కావడం గమనించి అల్లాహ్ కృపవల్లనే సాధ్యపడిందని భావిస్తారు. అప్పటి నుంచి కోహితూర్ పర్వతానికి చెందిన రాళ్ల చూర్ణమే క్రమంగా సుర్మాగా రూపాంతరం చెందిందనేది ముస్లింల ప్రగఢ నమ్మకం. కళ్లకెంతో మేలు..! భక్తితోపాటు వైద్యపరిభాషలోనూ ఈ సుర్మాకు ఆరోగ్యప్రదాయినిగా పేరుంది. కంటికి సంబంధించిన వ్యాధులకు నివారణగా, కళ్లకు చలువగా పనిచేస్తుంది. నమాజ్ చేయడానికి ముందు వజూ ఆచరించాక మహ్మద్ప్రవక్త కంటికి సుర్మా పెట్టుకునే వారని ప్రతీతి. రాత్రివేళ నిద్రపోయేముందు కళ్లకింద సుర్మ రాసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. సుర్మాతో కంటికి సంబంధించిన వ్యాధులు రావని నిరూపి తం కావడంతో ఇతరులు కూడా సుర్మాను రా సుకోవడానికి ఆకర్షితులవుతున్నారు. మహిళలు కళ్లకు కాటుక బదులు సుర్మా వాడడానికి ఇష్టపడుతున్నారు. అతిథులకు సుర్మ, అత్త ర్లు పూయడం ద్వారా గౌరవించే సంప్రదాయాన్ని ముస్లింలు కొనసాగిస్తున్నారు. సుర్మ, అత్తర్ల విక్రయాలు..! అనేక గ్రామాల్లో రంజాన్ సందర్భంగా అత్తర్లు, సుర్మా విక్రయాలకు గిరాకీ ఉంటుంది. దీనికోసం జిల్లాలో పలు అత్తర్లు, సుర్మా అమ్మకాల దుకాణాలు వెలిశాయి. సుర్మా కిలో పొడి ధర రూ.175 నుంచి రూ.550 వరకు ఉంటుంది. వీటిని చిన్న సీసాల్లో నింపి విక్రయిస్తుంటారు. ఇవి రూ10 నుంచి రూ . 100 విక్రయిస్తున్నారు. కంపెనీని బట్టి వీటి ధరలు నిర్ణయిస్తున్నారు. సుర్మాను భద్రపరచడానికి ఆకర్షణీయమైన ఆకారాల్లో సుర్మేన్లు (భరిణె) మార్కెట్లో ఉన్నాయి. వీటి ధర రూ.50 నుంచి రూ.300 వరకు అందుబాటులో ఉన్నాయి. ఇవి చదవండి: HOLI 2024: జీవితం వర్ణమయం -
ఈ పండుగ కొందరికి హోలీ అయితే.. మరి కొందరికి ‘హోలా మొహల్లా’..
ఏటా వసంతాగమన వేళ వచ్చే హోలీ హిందువులకు రంగుల పండుగ. సిక్కులకు మాత్రం ఇది రంగుల పండుగ మాత్రమే కాదు, వీరవిద్యల వేడుక కూడా. హోలీ నాటితో మొదలై మూడు రోజులు కొనసాగే ఈ వేడుకను ‘హోలా మొహల్లా’ అంటారు. సిక్కుల గురువు గురు గోబింద్ సింగ్ ఈ వేడుకను జరుపుకొనే ఆనవాయితీని ప్రారంభించారు. హోలీ వేడుకల్లో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడమే కాకుండా, ఆరుబయట మైదానాల్లోకి చేరి యువకులు సంప్రదాయ వీరవిద్యలను ప్రదర్శిస్తారు. జోడు గుర్రాల మీద నిలబడి స్వారీ చేయడం, గుర్రపు పందేలు, ఒంటెల పందేలు నిర్వహిస్తారు. ‘హోలా మొహల్లా’ అంటే ఉత్తుత్తి యుద్ధం అని అర్థం. ఈ వేడుకల్లో కత్తులు, బరిసెలతో ఉత్తుత్తి యుద్ధాల్లో పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. తొలిసారిగా ‘హోలా మొహల్లా’ వేడుకలు 1701లో ఆనంద్పూర్ సాహిబ్లో జరిగాయి. అదే సంప్రదాయ ప్రకారం ఇప్పటికి కూడా ఆనంద్పూర్ సాహిబ్లో ఈ వేడుకలు ఆర్భాటంగా జరుగుతాయి. పంజాబ్, హర్యానాలతో పాటు పాకిస్తాన్లో కూడా సిక్కులు ఈ వేడుకను సంప్రదాయబద్ధంగా జరుపుకొంటారు. ఉదయం వేళ రంగులు చల్లుకోవడం, వీరవిద్యా ప్రదర్శనలు, ఆయుధ ప్రదర్శనలు; సాయంత్రం వేళలో ఆధ్యాత్మిక సంకీర్తనలు, సంగీత నృత్య ప్రదర్శనలు, కవి సమ్మేళనాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. వేడుకల్లో పాల్గొనడానికి భారీ సంఖ్యలో వచ్చే జనాలకు సంప్రదాయక వంటకాలతో ఆరుబయట విందుభోజనాలను ఏర్పాటు చేస్తారు. ఇవి చదవండి: నాజూగ్గా ఉండే శిల్పాశెట్టి ఇంతలా ఫుడ్ని లాగించేస్తుందా..! -
ఆ గ్రామం.. హోలీకి దూరం!
ప్రస్తుతం దేశమంతా హోలీ సన్నాహాల్లో మునిగితేలుతోంది. అయితే మన దేశంలో హోలీ వేడుకలు చేసుకోని ఒక గ్రామం ఉంది. పైగా ఆ గ్రామంలో హోలీనాడు పిండివంటలు కూడా చేసుకోరు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది? బీహార్లోని ఆ గ్రామంలో గత 250 ఏళ్లుగా హోలీ వేడుకలు చేసుకోరు. అదే ముంగేర్ జిల్లాలోని సజువా గ్రామం. హోలీ వేడుకలు చేసుకుంటే గ్రామంలో విపత్తులు సంభవిస్తాయని ఇక్కడి ప్రజలు నమ్ముతుంటారు. అందుకే ఇక్కడివారంతా రంగుల పండుగకు దూరంగా ఉంటారు. ఈ గ్రామంలో సుమారు రెండువేల మంది నివసిస్తున్నారు. వీరంతా హోలీ వేడుకలు చేసుకోరు. ఈ గ్రామంలో హోలీనాడు ఏదైనా పిండివంటకం చేసుకున్నట్లయితే ఆ కుటుంబానికి ఆపదలు ఎదురవుతాయని ఇక్కడి ప్రజలు చెబుతుంటారు. ఈ గ్రామాన్ని సతీ గ్రామం అని కూడా పిలుస్తారు. సుమారు 250 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో ఒక విషాద ఘటన చోటుచేసుకుందని స్థానికులు చెబుతుంటారు. అయితే ఈ గ్రామంలోని వారు ఏప్రిల్ 14న హోలికా దహనం జరుపుకుంటారు. తమ గ్రామంలో ఎవరూ హోలీ చేసుకోరని గ్రామానికి చెందిన చందన్ కుమార్ తెలిపారు. ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని గ్రామంలోని అందరూ పాటిస్తున్నారని ఆయన తెలిపారు. -
500 ఏళ్ల తర్వాత అయోధ్యలో హోలీ వేడుకలు
భగవాన్ రామ్లల్లా నూతన రామాలయంలో కొలువైన దరిమిలా రామనగరిలో ప్రతి క్షణం ఉత్సాహం కనిపిస్తోంది. దాదాపు 500 ఏళ్ల పోరాటం తర్వాత రామాలయం రూపుదిద్దుకుంది. దీంతో బాలరాముడు తన జన్మ స్థలంలో భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ఇకపై ప్రతి పండుగను అయోధ్యలో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కోవలో అయోధ్యలో 500 ఏళ్ల తరువాత హోలీ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ హోలీ చారిత్రాత్మకంగా నిలిచిపోనుంది. ఈనెల 25న జరగబోయే హోలీ వేడుకలకు రామాలయం ముస్తాబవుతోంది. రామ భక్తులు ఆరోజు బాలరామునితో హోలీ వేడుకలు చేసుకోనున్నారు. హోలీ నాడు 56 వంటకాలను బాలరామునికి నైవేద్యంగా సమర్పించనున్నారు. అలాగే ఆరోజున ఇక్కడికి వచ్చే భక్తులందరికీ ప్రసాద వితరణ చేయనున్నారు. రామమందిరం ట్రస్ట్ కార్యాలయ ఇన్చార్జి ప్రకాష్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ ఇకపై హోలీ వేడుకలు రాముని ఆస్థానంలో జరగనున్నాయని, ఈ నేపధ్యంలో అయోధ్య అంతటా ఆనందం నెలకొన్నదన్నారు. ఇందుకోసం రామమందిర ట్రస్ట్ సన్నాహాలు చేస్తున్నదన్నారు. హోలీ వేడుకల సందర్భంగా అయోధ్యలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. -
‘అక్కడ రాముడుంటే.. ఇక్కడ మురుగన్’.. డీంఎంకే కొత్త ప్లాన్?
భారతీయ జనతా పార్టీ అయోధ్యలో నూతన రామాలయాన్ని ప్రారంభించి, తన ఖ్యాతిని పెంచుకుందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్న వేళ.. తమిళనాట అధికార డీఎంకే ‘మురుగన్’ను ఆశ్రయిస్తున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో విశేషంగా పూజలు అందుకునే మురుగన్ (కుమారస్వామి)ని ఆరాధిస్తూ డీఎంకే ప్రభుత్వం రాబోయే జూన్ లేదా జూలైలో అంతర్జాతీయ ఉత్సవాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిలో మురుగన్ చిత్రాలతో కూడిన ఎగ్జిబిషన్, సదస్సులు నిర్వహిస్తామని హిందూ ధార్మిక, ధర్మాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్బాబు తెలిపారు. తమిళనాడులో రాజకీయ పార్టీలు ‘మురుగన్’ వైపు మొగ్గు చూపడం కొత్తేమీ కాదు. 2020లో ఎల్ మురుగన్ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీ ‘వేల్ యాత్ర’ నిర్వహించింది. డీఎంకే కొంత వరకు నాస్తిక భావజాలాన్ని కలిగివుందని అంటుంటారు. అయితే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం దేవుణ్ణి ఆశ్రయించడం ఇదే తొలిసారి. హిందుత్వంపై తనదైన ముద్రను పెంచుకుంటున్న బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకే డీఎంకే ఈ ఎత్తుగడ వేసిందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మురుగన్ సదస్సు ద్వారా ఎన్నికల్లో లాభపడాలని డీఎంకే భావిస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు. కాగా డీఎంకే సారధ్యలో మురుగన్ సదస్సు నిర్వహణపై బీజేపీ విమర్శలు గుప్పించింది. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆర్.శ్రీనివాసన్ మాట్లాడుతూ మొదట డీఎంకే పార్టీ కేంద్ర ప్రభుత్వ పథకాలను కాపీ కొట్టిందని, ఇప్పుడు బీజేపీ భావజాలాన్ని, రాజకీయాలను కాపీ కొడుతున్నదని ఆరోపించారు. మురుగన్ను తమిళనాడుకు మాత్రమే పరిమితం చేయలేమని, మురుగన్ను దేశవ్యాప్తంగా పూజిస్తారని, డీఎంకే మాయలో ప్రజలు ఎప్పటికీ పడిపోరని పేర్కొన్నారు. బీజేపీ నేతల ఆరోపణలపై రాష్ట్ర మంత్రి శేఖర్బాబు స్పందిస్తూ, మురుగన్ అంతర్జాతీయ ఉత్సవ నిర్వహణలో ఎలాంటి రాజకీయం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మురుగన్ ఆలయాల కోసం ఖర్చు చేస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్లో తిరుచెందూర్ మురుగన్ ఆలయాన్ని చేర్చామని, ఆలయ పునరుద్ధరణకు రూ.300 కోట్లు కేటాయించామని తెలిపారు. అలాగే పళని మురుగన్ ఆలయ పునరుద్ధరణకు రూ.100 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. -
జన్మకో శివరాత్రి అని ఎందుకంటారో తెలుసా!
శివతత్వమే మంగళం. జన్మకో శివరాత్రి అన్నది ఆర్యోక్తి. దీని అర్ధం సంవత్సరంలో వివిధ కారణాల వల్ల నిర్లక్ష్యం చేయబడ్డ దైవారాధన కనీసం శివరాత్రి రోజు చేసినా సమస్త మంగళాలు ప్రోదిచేసి అందించే దైవం బోళాశంకరుడు అన్నది అందరూ అనుభవైకపూర్వకంగా అనుభవించే సత్యం. మహా శివరాత్రి అనడానికి.. ప్రతీమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశిని శివరాత్రి అంటారు.ప్రతి మాసంలో వచ్చే ఈ శివరాత్రిని మాసశివరాత్రిగా వ్యవహరిస్తారు. మాఘ కృష్ణ పక్ష చతుర్దశిలో వచ్చే శివరాత్రికి మహాశివరాత్రి అని పేరు.ఈ తిథి నాడు లింగాకారంలో పరమేశ్వరుడు ఆవిర్భవించిన సందర్బంగా పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక దినంగా మహాశివరాత్రిగా జరుపుకుంటాం. శివ అంటే.. శివ అనే నామమే అత్యంత పవిత్రమైనది.శివ అంటే మంగళం,శుభం,క్షేమం,భద్రం,శాంతం అనే అర్ధాలు చెప్పబడ్డాయి.అన్నిటికీ ఆధారమైనవాడు శివయ్య.అలసిన జీవుడు ధ్యానంలో చేరేది శివ చైతన్యవలయంలోనికే. పరమ శివుని ఆవిర్భావం అందరికీ తెలిసిందే.భక్త సులభుడు మరియు భక్త వరదుడు శంకరుడు అన్నది పురాణాలు ద్వారా అందరికీ సుపరిచితం. శివతత్వం అంటే.. సాక్షాత్ చదువుల తల్లి సరస్వతీ మాత శివతత్వం గ్రంథస్తం చేసే క్రమంలో ఎంత రాసినా తరగని ఘని అయిన పరమేశ్వరుడి తత్వరచన కోసం కాటుక కొండను కరిగించి "సిరా" (ఇంక్) గానూ, కల్పవృక్షం కొమ్మను "కలం"(పెన్) గాను, భూమాతను "కాగితం"(పేపర్)గా చేసుకుని రచన ప్రారంభించి ఎంత రాసినా పూర్తి కానీ సశేషం శివతత్వం అని గ్రహించి "పరమేశ్వరా నీ తత్వం అందనిది కానీ నీ అనుగ్రహం సులభసాధ్యంగా అందరికీ అందేదీ"అని నిర్వచించారట అమ్మవారు. అంతటి విశిష్టతే శివతత్వం. శివపూజ.. గీతాచార్యుడయిన శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా తెలిపిన అమృతవాక్కు పురాణాల ద్వారా గ్రహించిన మహనీయులు ప్రపంచానికి అందించినది "కోటి జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప శివపూజ చేయలేము".సాక్షాత్ దైవమే చెప్పిన ఈ మాట శివపూజలో ఉన్న ధార్మిక ప్రాధాన్యతను తెలియజేస్తోంది. ఈ రోజు ఉపవాసమే నైవేద్యం:- పార్వతీనాధునికి ఉపవాసమే భక్తుడు సమర్పించే నిజమైన నైవేద్యం.తృప్తి కోసం భక్తుడు తాను స్వీకరించే ఆహారం సాత్వికమైనది శివార్పణమ్ చేసి తీసుకోవచ్చు.శక్తి కొద్దీ ఎవరు ఇష్టపూర్వకంగా సమర్పించే ఆహారం అయినా పరమాత్మునికి ప్రీతికరమైనది. అభిషేకప్రియుడు.. లింగరూపుడు అయిన శివయ్యకు శుద్ధజలం(మంచి నీరు)అత్యంత ప్రీతి కరమయిన అభిషేకద్రవ్యం.గంగాధరుడు కాబట్టి గంగకు అత్యంత ప్రాధాన్యత.మరో రకంగా ఆలోచిస్తే సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండే జలం కోరుకున్నాడు భగవానుడు.శక్తి కొద్దీ పంచామృతాలు,పళ్లరసాలు భక్తులు సమర్పిస్తారు.ఒక్కో ద్రవానికి ఒక్కో విశిష్టత చెప్పబడింది.స్థూలంగా శివునికి అభిషేకం అత్యంత ప్రియం. బిల్వదళం.. మారేడుదళాలు సంవత్సరం మొత్తంలో శిశిరఋతువులో సైతం ఆకురాల్చని విధానం కలిగి ఉండటమే కాక శరీరం లోని వేడిని సైతం తగ్గించే శక్తి కలిగి ఉండడంతో గరళకంటుడికి మారేడుదళం సమర్పిస్తారు భక్తులు.ఈ బిల్వదళం సమర్పణలో ఒక్కో రకమయిన పురాణ వివరణలు కూడా ఉన్నాయి. ఈ శివరాత్రి రోజును ఉపవాసంతో శివుడిని అర్చించి జాగరణ చేయడం అనేది అత్యంత కష్టమైన విధి విధానం. వీటన్నింటిని కనీసం ఒక్కసారైన ఆచరించే పూజ చేయగలిగితే చాలని జన్మకో శివరాత్రి అన్నారు. అందులోనూ మాఘమాసం ఈ చలికాలంలో ఇవన్నీ ఒక్కసారైన నియమంగా చేస్తే చాలనే ఉద్దేశ్యంతో వచ్చిన ఆర్కోక్తి జన్మకో శివరాత్రి. అందువల్లే దీన్ని మహా శివరాత్రి అని కూడా పిలవడం జరిగింది. ఐక్యతకు శివకుటుంబం ఆదర్శం.. పరస్పర వైరభావం కలిగిన వాహనాలు ఎద్దు,సింహం,నెమలి,ఎలుక ఏంతో అన్యోన్యతతో ఒదిగి ఉండటం ప్రస్తుత సమాజానికి ఒక విలువైన పాఠం.ఎన్నో వైరుధ్యాలు,భావాలు,వ్యక్తిత్వాలు ఉన్నా సమాజం అనే గొడుగు క్రింద అందరం అన్యోన్యంగా ఉన్నప్పుడే భావితరాలకి శాంతి మరియు సౌబ్రాతృత్వాలు అందించగలం.ఐక్యతే విజయ సూత్రం అని చెబుతోంది శివకుటుంబం. దయగల దైవం చంద్రశేఖరుడు. భక్తితో శివునికి చేరవ్వవుదాం. సత్కర్మలు ఆచరించి నిశ్చలమైన భక్తి, విశ్వాసాలను ఇవ్మమని అడుదాం. శివతత్వాన్ని శాశ్వతం చేసుకుందాం మన నిత్య జీవనవిధానంలో.. (చదవండి: శివయ్య అనుగ్రహం కావాలంటే..) -
అలరించిన జాతీయ సంస్కృతి మహోత్సవాలు (ఫొటోలు)
-
ఒక్క జిలేబీ చాలు.. కుటుంబానికి పండుగే!
కళ, సాహిత్యం, సంస్కృతి, ఆహారం.. ఇవే తాజ్ మహోత్సవ్ ప్రత్యేకతలు. యూపీలోని ఆగ్రాలోగల శిల్పగ్రామ్లో ఫిబ్రవరి 17న తాజ్ మహొత్సవ్ ప్రారంభమయ్యింది. ఇది ఫిబ్రవరి 27 వరకూ కొనసాగనుంది. ప్రస్తుతం జరుగుతున్న తాజ్ మహోత్సవ్లో 300లకు పైగా స్టాల్స్ను ఏర్పాటు చేశారు. వంటకాలకు సంబంధించిన స్టాల్స్ ఆహార ప్రియులను అమితంగా అలరిస్తున్నాయి. వీటిలో హరియాణా జిలేబీ స్టాల్ ప్రత్యేకంగా నిలిచింది. హరియాణాకు చెందిన నరేష్ కుమార్ ఏర్పాటు చేసిన ఈ స్టాల్ ముందు పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఈ జిలేబీ ప్రత్యేకత ఏమిటంటే.. ఒక్క జిలేబీ కుటుంబం అంతటికీ సరిపోతుంది. ఐదుగురు సభ్యులు కలిగిన కుటుంబం ఈ ఒక్క జిలేబీని హాయిగా ఆరగించి ఆనందించవచ్చు. 1952లో తన తాత హరిశ్చంద్ర హల్వాయి ఈ జిలేబీని తయారు చేయడం ప్రారంభించాడని నరేష్ తెలిపారు. తమ మూడో తరం కుటుంబ సభ్యులు కూడా జిలేబీ వ్యాపారంతోనే ఆదాయం సమకూర్చుకుంటున్నామన్నారు. గత 15 ఏళ్లుగా తాజ్ మహోత్సవ్లో జలేబీ స్టాల్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తాము తయారు చేసే జిలేబీ బరువు దాదాపు 250 గ్రాములు ఉంటుందని తెలిపారు.ఈ జిలేబీ ఆరోగ్యానికి ఎటువంటి హాని చేయదని పేర్కొన్నారు. తాజ్ మహోత్సవ్ను సందర్శించే ప్రతీఒక్కరూ ఈ జిలేబీని రుచి చూడాలని కోరుకుంటారని, ఒక్కో జిలేబీ ధర రూ. 400 అని స్టాల్ నిర్వాహకులు నరేష్ తెలిపారు. తాము రూపొందించే జిలేబీని మాజీ ఉప ప్రధాని చౌదరి దేవి లాల్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రుచి చూశారని నరేష్ కుమార్ మీడియాకు తెలిపారు. -
తెలుగు తల్లీ, అదుగోనమ్మా..!
తెలుగు తల్లీ, అదుగోనమ్మా త్యాగయ్య నాదోపాసన రవళిస్తున్నది నీకు భూపాలమై! కర్ణాటక సంగీతం ముమ్మూర్తుల్లో ఒకరైన శ్రీమాన్ త్యాగరాజు 177వ ఆరాధనోత్సవాలు తిరవైయ్యారులో ఘనంగా జరిగాయి. "విదులకు మ్రొక్కెద సంగీత కోవిదులకు మ్రొక్కెద" అంటూ నాదోపాసనతో నిధికన్నా రాముని సన్నిధి చాల సుఖమని అనుకుని ఆపై "ఏ నోము ఫలమో నీ నామామృత / పానము అను సోపానము దొరికెను" అని తెలుసుకుని జీవించారు; నాదబ్రహ్మమై జీవిస్తున్నారు త్యాగరాజు. వారు పాడింది మనం వినలేకపోయాం. వారి సంగీతం సుఖమైంది మనకు చదువయింది. "సామగాన సార్వభౌమ స్వామి త్యాగరాజ నామ" అంటూ అమృతవర్షిణి రాగంలో రూపక తాళంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఒక కీర్తన చేశారు. కర్ణాటకసంగీతం త్యాగయ్య వల్ల పరిపుష్టమైంది. తెలుగుకు గర్వకారణమైంది. "చల్లని భక్తి", "స్మరణే సుఖము", "కులములెల్ల కడతేఱినట్లు", "పరమానందమనే కమలముపై" వంటివి అన్న త్యాగరాజు గొప్పకవి కూడా. వారు రాసింది చదవగలిగే భాగ్యం మనకు అందింది. సంగీతం కోసమే అన్నా వారి నోటి వెంట గొప్ప కవిత్వమూ పలికింది. "భావాభావ మహానుభావ శ్రీరామచంద్ర భావజనక నా భావము తెలిసియు..." "తన తలుపు తీసినట్టి ఒకరింటికి తాఁ గుక్కల తోలు రీతిగాదో" "తవిటికి రంకాడబోతె కూటి తపిల కోతి కొంపోయినట్టుగాదో" "రాగము తాళము రక్తి భక్తి జ్ఞాన యోగము మఱి యనురాగము లేని భాగవతు లుదర శయనులేగాని..." "మనసు స్వాధీనమైన యా ఘనునికి మఱి మంత్రతంత్రములేల" "యజ్ఞాదులు సుఖమను వారికి సము లజ్ఞానులు కలరా ఓ మనసా" "చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో ప్రేమ మీర మెలఁగుచుండే బిరుదు వహించిన సీతారామ..." "ఏఱు నిండి పాఱిన పాత్రకు తగు నీరు వచ్చుగాని" "లేమి దెల్ప పెద్దలెవరు లేరో" (ఇది ఇవాళ్టి తెలుగు కవిత్వానికి, భాషకు, సమాజానికి ఈ మాట సరిగ్గా పొసుగుతుంది) "శాంతము లేక సౌఖ్యము లేదు" ఇవి, ఇలాంటివి ఇంకొన్నీ అన్న వాగ్గాన (వాగ్గేయ) కారులు త్యాగరాజు. రాముణ్ణి "సప్తస్వర నాదాచల దీపం" గా పరిగణించి ఆ వెలుగులో "సంగీత శాస్త్రజ్ఞానము సారూప్య సౌఖ్యదమే మనసా" అని అన్న త్యాగరాజు తెలుగుభాషకు సంగీతం పరంగానే కాదు కవిత్వం పరంగానూ వరవరం. "సామ గాన సార్వభౌమ స్వామి త్యాగరాజ నామ" అంటూ మంగళంపల్లి బాలమురళికృష్ణ నుతిస్తే తెలుగువాళ్లం మనం "కవన సాగర పూర్ణసోమ స్వామి త్యాగరాజ నామ" అంటూ కూడా త్యాగరాజును స్తుతిద్దాం. --రోచిష్మాన్, 9444012279 (చదవండి: అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేళ.. తెలుగు వారు గర్వపడే విషయం!) -
చికూ ఫెస్టివల్ గురించి విన్నారా?
ఓ పండు కోసం ప్రత్యేకంగా జరుపుకునే పండుగ ఇది. ఓ మారుమూల గ్రామం ఈ పండుగను ఏటా ఘనంగా నిర్వహిస్తుంది. అంతేగాదు అక్కడ ఉత్పత్తి అయ్యే ఆ పండ్లు మంచి నాణ్యత గల పండ్లగా జీఐ ట్యాగ్ను కూడా పొందాయి. ఎక్కడ ఈ పండుగ జరుగుతుంది? దేని గురించి నిర్వహిస్తున్నారు? అసలేం జరిగిందంటే..మహారాష్ట్ర నగరానికి 200 కి.మీ దూరంలో ఉండే బోర్డ్ బీచ్ ముంబై వాసులకు మంచి పర్యాటక ప్రాంతంగా అలరారుతుంది. అక్కడకు సమీపంలో ఉండే దహను జిల్లాలోని ఘెల్వాడ అనే చిన్న తీర గ్రామం ఉంది. ఈ గ్రామం చికూ పండ్లకు మహా ప్రసిద్ధి. ఇంతకీ ఏంటీ చికూ పండు అంటే? అదేనండి మనం ఎంతో ఇష్టంగా తినే సపోటానే కొన్ని చోట్ల "చికూ" పండ్లు అని అంటారు. ఈ పండుని దేశ విదేశాల్లో ఒక్కో పేరుతో ప్రసిద్ధి. అయితే ఈ ఘెల్వాడ్ గ్రామం మాత్రం ఈ చికూ పండ్లు(సపోటా పండ్ల)కు మంచి పేరుగాంచింది. అక్కడ ఎటూ చూసిన ఈ పండ్లే కనిపిస్తాయి. పైగా అక్కడ సపోటా మంచి రుచికరంగా ఉంటుంది. అంతేకాదండోయ్ సపోటాల్లో అవే అత్యంత రుచికరమైన నాణ్యతగల పండ్లగా జీఐ ట్యాగ్ను కూడా పొందాయి. ఈ పండ్లను నగరీకరణ పేరుతో కనుమరగ్వ్వకుండా కాపాడాలనే ప్రయత్నంలో భాగంగా ఈ చికూ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నారు. గ్రామీణ పారిశ్రామికవేత్తల సంక్షేమ ఫౌండేషన్ నేతృత్వంలోని స్థానికి సంఘం 2013 నుంచి ఈ చికూ ఫెస్టివల్ని నిర్వహిస్తోంది. స్థానిక రైతులు ఈ వ్యవసాయం ద్వారా ఎక్కువ ఆర్థిక వృద్ధిని సాధించేలా చేయడమే గాక రైతులకు, పట్టణ కేంద్రాల్లోని జనాభా మధ్య అంతరాన్ని తగ్గించేలా చేయడమే ఈ పండుగ ముఖ్యోద్దేశం. ఈ ఏడాది 10వ చికూ ఫెస్టివల్ ఫిబ్రవరి 10, 11 తేదీల్లో బోర్డి తీరాన ఘనంగా జరుగుతోంది. ఈ పండుగను వీక్షించడానికి పెద్ద ఎత్తున పర్యాటకుల తరలి వస్తారు కూడా. ఈ పండుగలో బీచ్ పారాగ్లైడింగ్, చికూ పొలాలు, ఫుడ్ యూనిట్ల పర్యటన, సైక్లింగ్ ఈవెంట్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్షాప్లు(వార్లీ పెయింటింగ్), జానపద నృత్యం, స్థానిక సంగీతం తదితరాలు ఎంతగానో అలరిస్తాయి. ఈ చికూ ఫెస్టివల్లో సంగీత విద్వాంసుడు అష్మిక్ పటేల్, సౌరభ్ సేవ్, కథక్ నృత్యకారిణి యోగిని మ్హత్రేతో వంటి కళకారులు ఈ వేడుకలో తమ ప్రదర్శనలు ఇవ్వడం విశేషం. ఈ ఫెస్టివల్లో ఆ చికూ పండుతో తయారు చేసే ఐస్క్రీంలు, కుల్ఫీలు, చిప్స్ వంటి ఎన్నో రకాల ఉత్పత్తులకు సంబంధించిన స్టాల్స్ సందడి చేస్తాయి. ఒకర రకంగా ఈ పండుగలో ఆ చికూ పండ్ల వ్యవసాయం, వాటి కోసం రైతులు పడే శ్రమ తదితరాలు కళ్లకు కట్టినట్లు కనబడుతుంది. ఇక్కడ అత్యంతా బాగా ఆకట్టుకునేది ఉమెరగావ్లోని ఉద్యానవనాలు. హిరణ్యకేశి నది సమీపంలోని హిరణ్యకేశ్వర్ ఆలయం, గుహలు, తదితరాలు. ఒక పండు కోసం పండుగ నిర్వహించడమే గాక దాని ద్వారా రైతులకు మరింత ఆదాయం వచ్చేలా చేయాలనుకోవడం ప్రశంసించదగ్గ విషయం కదూ! (చదవండి: ఆ మోటర్ సైకిల్కి పాక్ అధ్యక్షుడు ఇప్పటికీ డబ్బు చెల్లించలేదట!పాక్గా ఏర్పడక ముందు జరిగిన ఘటన) -
అక్కడ కవి పుట్టిన రోజు ఓ పండుగలా జరుపుకుంటారు!
మన దేశంలో కవుల జయంతులు, వర్ధంతులు తప్పనిసరి తతంగాలుగా జరుగుతాయి. ఈ తప్పనిసరి తతంగాల్లో ఉత్సాహభరితమైన కార్యక్రమాలు ఉండవు. విందు వినోదాలు ఉండవు. కళా ప్రదర్శనలు ఉండవు. ఒక్కముక్కలో చెప్పాలంటే.. మన దేశంలో కవుల జయంతులు, వర్ధంతుల కార్యక్రమాల్లో వక్తల ఊకదంపుడు ఉపన్యాసాలకు మించిన విశేషాలేవీ ఉండవు. యునైటెడ్ కింగ్డమ్లోని ఇంగ్లండ్, స్కాట్లండ్లలోనైతే, రాబర్ట్ బర్న్స్ పుట్టినరోజు కవితాభిమానులకు పండుగరోజు. ఆయన పుట్టినరోజు అయిన జనవరి 25న ఏటా ఇంగ్లండ్, స్కాట్లండ్లలోని ప్రధాన నగరాల్లో భారీ స్థాయిలో వేడుకలు జరుగుతాయి. ‘బర్న్స్ నైట్’ పేరుతో విందు వినోదాలు, కవితా గోష్ఠులు, సంప్రదాయ సంగీత, నృత్య ప్రదర్శనలు జరుగుతాయి. బర్న్స్ కవిత్వాన్ని చదువుతూ అభిమానులు ఉర్రూతలూగిపోతారు. గాయనీ గాయకులు ఆయన గీతాలను ఆలపిస్తారు. వేడుకలు జరిగే వేదికలకు చేరువలోనే బర్న్స్ జ్ఞాపకాలను తలపోసుకుంటూ భారీస్థాయిలో విందు భోజనాలను ‘బర్న్స్ నైట్ సప్పర్’ పేరుతో నిర్వహిస్తారు. ఈ వేడుకలకు విచ్చేసే అతిథులను సంప్రదాయ బ్యాగ్పైపర్ వాయిద్యాలను మోగిస్తూ స్వాగతం పలుకుతారు. ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది కూడా బర్న్స్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఇంగ్లండ్, స్కాట్లండ్లలోని వివిధ నగరాల్లోని అభిమానులు ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించారు. పద్దెనిమిదో శతాబ్దికి చెందిన స్కాటిష్ కవి రాబర్ట్ బర్న్స్ 1759 జనవరి 25న పుట్టాడు. తన కవిత్వంతో స్కాటిష్ సాహిత్యాన్ని సుసంపన్నం చేశాడు. ఆయన 1796 జూలై 21న మరణించాడు. స్కాట్స్ భాషను, స్కాటిష్ కవిత్వాన్ని సుసంపన్నం చేసిన కవిదిగ్గజం రాబర్ట్ బర్న్స్ జ్ఞాపకార్థం నిర్వహించే ‘బర్న్స్ నైట్ సప్పర్’ కార్యక్రమాన్ని స్కాటిష్ పార్లమెంటు ముఖ్యమైన సాంస్కృతిక కార్యక్రమంగా పరిగణిస్తుంది. స్కాటిష్ పార్లమెంటు కూడా ఈ సందర్భంగా విందు ఏర్పాటు చేస్తుంది. ఈ విందులో స్కాటిష్ బ్రోత్, పొటాటో సూప్, కల్లెన్ స్కింక్, కాక్–ఏ–లీకీ వంటి సూప్స్, గొర్రెమాంసంతో తయారుచేసే హ్యాగిస్ వంటి సంప్రదాయ వంటకాలను వడ్డిస్తారు. ఒక కవి పుట్టినరోజును మరే దేశంలోనూ ఇలా ఒక పండుగలా జరుపుకోవడం కనిపించదు. (చదవండి: ఆత్రేయపురం పూతరేకులను తలపించే ఇరానీ పుతరేకు! ఎలా చేస్తారంటే..) -
శ్రీ సూర్యనారాయణా...
బతుకులో పండుగ కాని క్షణం ఏముంటుంది! జీవితాన్ని కేవలం జీవించడం కాదు, ఉత్సవీక రించుకోమని చెబుతుంది ఒక సూక్తి. కాకపోతే ఒక షరతు; మహాకవి చెప్పినట్టు, మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే అవి మనకేనని ఆనందించే పసికూనలమైపోవాలి అందరం. జీవితం అనుక్షణ ఉత్సవభరితమే అయినా ప్రకృతిలో మారే ప్రతి ఋతువూ, కాలం వెంబడి మనిషి వేసే ప్రతి కీలకమైన అడుగూ పెద్దపండుగ అవుతుంది. ధనూరాశి నుంచి మకరరాశి లోకి సూర్యుడి సంక్రమణాన్ని సంకేతించే అలాంటి పెద్ద పండుగే సంక్రాంతి. ఏటా నెల నెలా రాశి విడిచి రాశిలోకి సూర్యుడు అడుగుపెట్టే ప్రతి సందర్భమూ సంక్రాంతే అయినా, మకర సంక్రాంతి మాత్రమే ఎందుకు మైలురాయి అయిందంటే; అప్పటికి మంచుపొరలు, చీకటి తెరలు క్రమంగా తొలగి వెలుగు వాకిళ్ళు తెరచుకోవడం మొదలవుతుంది. కొత్త పంట చేతికొచ్చిన ఆనందంలో పశువులు, పక్షులతో సహా ప్రకృతి సమస్తం భాగమై మనిషిలో కృతజ్ఞత ఉప్పొంగుతుంది. అలా ప్రతి ప్రాణితోనూ, చెట్టుతోనూ, పుట్టతోనూ తన ముడిని గుర్తుచేసుకునే సందర్భమే సంక్రాంతి. ఆ మాటకొస్తే ఏ పండుగైనా అంతే. చిత్రవిచిత్రమైన రంగవల్లులను తీర్చిదిద్దేది, కొత్త బియ్యపు పిండిని చీమల వంటి సూక్ష్మజీవులకు ఆరగింపు చేసి భూతదయను చాటుకునేందుకేనని పెద్దలంటారు. ఒక్కోసారి తత్త్వం అడుగంటి తంతు మిగలడం కాలం చేసే మాయ. మనిషి ఊహలో తొలిదైవంగా ముద్రపడిన ప్రాకృతిక అద్భుతమే సూర్యుడు. పరోక్ష దేవతలకు భిన్నంగా ఆయన ప్రత్యక్ష దైవం. అందుకే సర్వసాక్షి, కర్మసాక్షి సహా ఆయన చుట్టూ ఎన్నో కల్పనలు. దేవతల్లో పెద్దాయన ఆయనే. ప్రపంచమంతటా తొలి కొలుపులు అందు కున్నవాడిగా ఆయన వైశ్విక దైవం. దేవుడి గురించిన తొలి ఎరుక కలిగించిన ఆ మెరుపు, మైమరపు ఋగ్వేదంతో సహా ఆదిమ కృతులన్నింటిలో నిసర్గసుందరంగా వ్యక్తమవుతాయి. మధ్యధరా సముద్ర ప్రాంతంలో ఒకప్పుడు ప్రధాన దైవమైన సూర్యుడికి మన పౌరాణిక ప్రసిద్ధుడైన నారాయణుని పేరు చేర్చిన ఫలితంగానే ఆయన సూర్యనారాయణుడయ్యాడని గుంటూరు శేషేంద్రశర్మ అంటారు. ఒకప్పుడు పశ్చిమాసియాలో మిత్రారాధన పేరుతో వర్ధిల్లిన సూర్యారాధన ప్రభావం ఇతర మతాలపై ఎలా పడిందో అత్యంత ఆశ్చర్యకరంగా వివరిస్తాడు జి.జె.ఎం. ఫ్రేజర్ తన ‘గోల్డెన్ బౌ’ అనే బృహద్రచనలో. మన శ్రీరామచంద్రుడే కాక, ఒకనాటి పశ్చిమాసియా రాజులు, పర్షియన్ చక్రవర్తులు కూడా తమను సూర్యుడితో ముడిపెట్టుకున్నారు. ఆదిత్యçహృదయోపదేశం పొందిన తర్వాతే రాముడు రావణుని జయించగలిగాడని రామాయణం అంటుంది. సంక్రాంతినీ, సూర్యునీ లోతుగా తడిమిన కొద్దీ ఇంకా ఎన్నెన్ని విశేషాలో! సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించే ఘట్టాన్నే మనం మకర సంక్రాంతిగా జరుపుకొంటాం కానీ నిజంగా సూర్యుడికి గమనమంటూ ఉంటుందా? భూమే సూర్యుడి చుట్టూ ఒకింత వంపుతో తిరుగుతూ దూరమూ, దగ్గరా అవుతున్న క్రమంలోనే కాలాలూ ఋతువులూ ఏర్పడుతున్నాయి. మకర సంక్రాంతిని ఇప్పుడు జనవరి 15న జరుపుకొంటున్నాం కానీ, క్రీ.శ. 1000లో డిసెంబర్ 31న, క్రీ.శ.272లో డిసెంబర్ 21న జరుపుకొనేవారట. మరో తొమ్మిదివేల సంవత్సరాల తర్వాత మకర సంక్రాంతి జూన్ నెలలో వస్తుందట. జ్యోతిశ్శాస్త్ర సంబంధమైన కాలగణనాలు ఇలాంటి విచిత్రాలను ఆవిష్కరిస్తే, శాస్త్రవిజ్ఞానం మరో రకమైన విలక్షణ దృశ్యానికి తెరతీసి ఒక్కోసారి వెన్నులో వణకు పుట్టిస్తుంది. సూర్యుడు ఎంత పెద్దాయనంటే, ఆయన వయసు 460 కోట్ల సంవత్సరాలకు పైనేనట. మరో 500 కోట్ల సంవత్సరాలు గతిస్తే, తన చుట్టూ తిరిగే భూమితో సహా అన్ని గ్రహాలనూ తనలో కలిపేసుకుని ఓ తెల్లని మరుగుజ్జు నక్షత్రంగానూ, ఆ తర్వాత నల్లని నక్షత్రంగానూ మారిపోతాడట. ఆ లోపల తన కేంద్రంలో నిరంతరాయంగా జరిగే కోట్ల టన్నుల హైడ్రోజన్, హీలియవ్ుల కలయిక నుంచి లక్షల టన్నుల పదార్థం శక్తిగా మారిపోయే క్రమంలోనే మన మనుగడకు అవసరమైన వెలుగు, వేడి లభిస్తున్నాయి. శీతోష్ణాల నిర్విరామ ఘర్షణ నుంచే జీవి పుట్టి మనతో సహా అనేక ప్రాణుల రూపంలో పరిణామం చెందడం వేరే కథ. మన ఊహకు అతీతమే కాక, మన నిత్యజీవన సంతోషాలకు ఏమాత్రమూ అడ్డురాని సూర్యుని వైశ్విక మూలాలను ఈ పండుగ వేళ మరీ లోతుగా తడమడమెందుకు? ప్రకృతితో మమేకమై వెలుగూ వేడిలో స్నానిస్తూ ఈ క్షణాలను మధురమధురం చేసుకుందాం. పొన్న,ఉల్లి, జాజి, సంపంగి, మల్లె, మంకెన, ములగ, ఆవ, వంగ, గుమ్మడి పూచాయలు ధరించే ఆ సూర్యనారాయణుడికి నోరారా మేలుకొలుపు పాడుకుందాం. కవయిత్రి కుప్పిలి పద్మ అన్నట్టు, ఒక్కుమ్మడిగా పండుగను పిలిచేందుకు ఈ చేతులతో చుక్కల ముగ్గుల్ని, రంగుల చామంతుల్ని పూయిద్దాం. ఎక్కడెక్కడి చుట్టాలనో ఏడాదికొకచోట కలిపే సారంగధర మెట్ట మీది తనివితీరని తిరునాళ్ళ పుట్టినిల్లు జ్ఞాపకాల నెగడు దగ్గర చలి కాగుదాం. చెట్టుకొకరుగా పుట్టకొకరుగా తుప్పల వెంటా పుంతల వెంటా పడి తిరుగుతూ, ముళ్ళు గుచ్చుకోకుండా, ఒక్క మొగ్గనీ తెంపకుండా, ఒక్క పువ్వునూ వదలకుండా మృదువైన పూల వేట సాగిద్దాం. -
'ఊరికి బంధువులొస్తున్నారు'.. కానుకలతో కాచుకోండి..!
'సంక్రాంతి పండగ వస్తే ఊర్లోకి పాత బంధువులొస్తారు. పండిన పంట నుంచి హక్కుగా తమ భాగం తీసుకుపోతారు. హరిదాసులు, గంగిరెద్దుల వారు, కొమ్మదాసరులు, జంగం దేవరలు, పిట్టల దొరలు, గారడీ వాళ్లు.. వీరందరికీ సంక్రాంతి వస్తే సంవత్సరానికి సరిపడా సాయం. సాటివారికి సాయం చేయడమే సంక్రాంతి'. సంక్రాంతి అనగానే ఊళ్లోకి బంధువులే కాదు డూడూ బసవన్నలు కూడా వస్తారు. సంక్రాంతి అంటే తిని, తేన్చి, సంబరాలు చేసుకునే పండగ మాత్రమే కాదు... రైతు సౌభాగ్యానికీ పల్లె సౌభాగ్యానికీ సహకారం అందించిన అన్ని వర్గాల వారికీ పంపకాలు చేసే పండగ కూడా. సంక్రాంతి పండగ సమయంలో ఇంటికి పుట్ల కొద్దీ చేరిన ధాన్యం నుంచి రైతు తనకు సేవ చేసిన, సాయం చేసిన వర్గాల వారికి భాగం ఇస్తాడు. ‘మేర’ పంచుతాడు. పాలేర్లకి, సేద్యగాళ్లకి. పనివాళ్లకి వడ్లు పోస్తాడు. కొందరికి కొత్తబట్టలు పెడతాడు. అయితే వీరు కాకుండా ఊరి మీద హక్కుగా తమ వాటా కోసం వచ్చే సంప్రదాయ వృత్తికళకారులు వచ్చి ఊరిలో ఆడి, పాడి వినోదం పంచి తమ వడ్లు మూట గట్టుకుని పోతారు. శ్రీమద్రమా రమణ... ‘సద్గురుని కృపచే తారతమ్యము తరచి గనుమన్నా.. ధరణి లోపల మూఢమతులకు దొరుకుటకు బహు దుర్లభమ్మిది’.. అని పాడుతూ గురు కటాక్షం వలనే భక్తిని, ముక్తిని చేరుకోవాలని బోధిస్తూ వీధివీధిన తిరుగుతూ సంక్రాంతి శోభను తెస్తాడు హరిదాసు. పండగ రోజుల్లో దానికి ముందు ధనుర్మాసంలో హరిదాసు తిరగని ఊరు, వీధి ఎంతో బోసిపోతాయి. నెత్తిన అక్షయపాత్ర, భుజాన తంబూర, చేతిలో చిడతలతో ‘శ్రీమద్రమా రమణ గోవిందా’ అంటూ భిక్ష స్వీకరించా ‘కృష్ణార్పణం’ అంటూ మనం సంపాదించిన దానిలో కొంత పేదలకు అర్పణం చేయడం ద్వారా దేవునికి సమర్పణం చేసిన పుణ్యం పొందాలని సూచిస్తాడు హరిదాసు. ఒకప్పుడు పల్లెల్లో ప్రతి వీధి వాకిట్లో హరిదాసు కోసం గృహిణులు కాచుకుని ఉండేవారు. ఇప్పుడు పై అంతస్తుల్లో, అపార్ట్మెంట్ బాల్కనీల్లో నుంచి చూస్తూ కిందకు దిగడానికి బద్దకిస్తున్నారు. హరిదాసు అక్షయ΄ాత్రలో జారవిడిచే కాసిన్ని బియ్యం మన ఇంటి సంపదను అక్షయపాత్రగా మారుస్తాయి. డూడూ బసవన్నలు ‘గంగిరెద్దులా తల ఊపకు’ అని అంటారు గాని దైవచిత్తానికి తల ఊపుతూ భారం అంతా నీదే అనుకోవడానికి మించిన వేరే సుఖం ఏముంటుంది? డూడూలు కొట్టే బసవన్నను యజమాని ముద్దుగా చూసుకున్నట్టే జీవుణ్ణి దేవుడు ముద్దుగా చూసుకుంటారు. గంగిరెద్దులు ఇంటి ముందుకొచ్చి సన్నాయి పాట వినిపిస్తే ఆ కళే వేరు. రంగు రంగుల పాతబట్టలు ఇస్తే అవి బసవడి మూపురం మీదకు చేరుతాయి. కాసులిస్తే గంగిరెద్దులవాడి నల్లకోటు జేబులో చేరుతాయి. కాసిన్ని డబ్బులు ఎక్కువిస్తే గంగిరెద్దులు విన్యాసం చేస్తాయి. యజమాని ఛాతీ మీద సుతారంగా గిట్టలు ఆడిస్తాయి. బుడబుడలు... కొమ్మదాసరులు ‘అంబ పలుకు జగదంబ పలుకు’ అంటూ డమరుకం వాయిస్తూ బుడబుక్కల వాళ్ళు వస్తారు సంక్రాంతికి. తలపాగా, కోటు, గొడుగు చేతబూని శుభాల భవిష్యత్తును చెబుతూ భిక్ష స్వీకరిస్తారు. వారు వేగంగా వాయించే డమరుకం గొప్ప శబ్ద విన్యాసం సృష్టిస్తుంది. వీరికి డబ్బు. వడ్లు, పాతబట్టలు ఇవ్వాల్సిందే. ఇక ఊరికి ఒకప్పుడు కొమ్మదాసరులు వచ్చేవారు. వీరు ఊరి మధ్యలోని చెట్టు కొమ్మెక్కి కూచుని కింద గుడ్డ పరిచి వచ్చేపోయేవారి మీద వ్యాఖ్యానం వినిపిస్తుండేవారు. తగిన సొమ్ము ముట్టజెప్తేనే దిగేవారు. కొయ్య తుపాకీతో పిట్టల దొరలు వస్తారు పెద్ద పెద్ద వాళ్లతో కలిసి తిరగాలనుకునే సామాన్యుడి కలలకు మాటల మలాం పూస్తారు. ‘మేము స్నానం చేసిన సబ్బు నీళ్లతో పేద దేశాల వాళ్లు డ్యాములు కట్టుకున్నారు’ అంటారు. ‘మా ఇంట్లో కేజీ బంగారం కుక్క నాకిందని చెత్తకుప్పలో పడేశాం’ అంటారు. ‘మోదీ గారు పిలిచి పాకిస్తాన్ మీద యుద్ధానికి పొమ్మని ఆర్రూపాయలు అడ్మాన్సు ఇచ్చారు’ అంటారు. దుబాయ్ షేకుతో టిఫిని తిని అమెరికా ప్రెసిడెంట్తో లంచ్కు కూచోపోబోతున్నాం అంటారు. తర్వాత శంఖం ఊదుతూ జంగం దేవరలు వస్తారు. గారడీ వాళ్లు, కనికట్టు ప్రదర్శించేవాళ్లు.. వరుస కడతారు. రైతు ఎవరినీ కాదనడు. అందరినీ ఆదరిస్తాడు. ఇక సాయంత్రమైతే ఊళ్లో పాట కచేరీలు, డాన్సు ప్రోగ్రాములు ఉంటాయి. రకరకాల కళాకారులు దిగుతారు. సినిమా నాటకాలు ఒకప్పుడు వేసేవారు. సినిమాలు కూడా వేసేవారు. సంక్రాంతి సందేశం... సామూహిక ఉత్సవం. జీవితం సాటి మనుషులతో కలిసి మెలిసి సాగాలని చెప్తుంది. ఉన్నది పంచుకుని తినాలని చెప్తుంది. శ్రమ చేసి సమృద్ధితో జీవించమని చెబుతుంది. నలుగురూ కలిసి ప్రకృతి వనరులను ఫలవంతం చేసుకుని నలుగురూ వృద్ధి కావాలని కోరడమే సంక్రాంతి. ఇవి చదవండి: Makar Sankranti 2024: పతంగులు ఎందుకు ఎగురవేస్తారో తెలుసా? -
నటి సాయి పల్లవి కమ్యూనిటీకి చెందిన ‘హేతై హబ్బా’ వేడుక గురించి తెలుసా?
స్టార్ హీరోయిన్ సాయి పల్లవి గురించి తెలియని తెలుగు సినీ ప్రేక్షకుడు ఉండడు. తనదైన నటన, అందం, అభినయంతో చాలా తక్కువ కాలంలోనే ఆడియెన్స్ను విశేషంగా ఆకట్టుకున్న చక్కటి నటి సాయి పల్లవి. కేవలం నటనకు మాత్రమే కాకుండా, సినిమాల కథలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఆమె ప్రత్యేకత. ఒక విధంగా చెప్పాలంటేనే ఈ వైఖరే సాయి పల్లవికి నటిగా గౌరవనీయమైన స్థాయిని అందించింది. పాత్ర ఏదైనా సహజంగా ఆ పాత్రలో ఒదిగి పోవడం ఆమెకు వెన్నతోపెట్టిన విద్య. అంతేకాదు నాట్యంలో కూడా నాట్య మయూరి అనిపించుకుంది. బడగ తెగకు చెందిన సాయి పల్లవి ఫిదాలో అల్లరి అమ్మాయిగా ఫిదా చేసింది. ప్రేమమం మొదలు తెలుగులో నటించిన లవ్ స్టోరీలో సారగ దరియా అంటూ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇంకా విరాటపర్వంలో డీగ్లామరైజ్డ్ పాత్రలో పేదల కష్టాలపై పోరాడే అన్నల ఆకర్షితురాలైన యువతిగా, శ్యామ్ సింగ రాయ్ సినిమాలో దేవదాసిగా సాయి పల్లవి నటన నభూతో నభవిష్యతి. ఏ పాత్రనైనా అవలీలగా నటించడం ఆమెకు తెలుసు. అయితే సాయి పల్లవి తమిళనాడులో నీలగిరి పర్వత ప్రాంతానికి చెందిన బడగ అనే గిరిజన తెగకు చెందిన అమ్మాయి సాయి పల్లవి. గతంలో ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది పల్లవి. అసలు ఏంటీ బడగ జాతి ఈ వివరాలు చూద్దాం. #WATCH | Tamil Nadu: A large number of devotees participate in the Hethiyamman temple festival, in Nilgiris. pic.twitter.com/jLBINIdul9 — ANI (@ANI) January 1, 2024 బడగా, అంటే అర్థం 'ఉత్తరం. పాత కన్నడ బడగానా నుంచి వచ్చింది. బడగాలపై పరిశోధన దాదాపు ఆరు దశాబ్దాలపాటు పరిశోధించిన అమెరికన్ మానవ శాస్త్రవేత్త పాల్ హాకింగ్స్ ప్రకారం సుల్తానుల హింసనుంచి పారిపోయి మైసూర్ మైదానాల నుండి వలస వచ్చిన వొక్కలిగాలుగా భావిస్తారు. నీలగిరి జిల్లాలో దాదాపు 400 గ్రామాలలో బడగలు నివసిస్తున్నారట. బడగలు బడగా అనే భాషను మాట్లాడతారు. దాదాపు ఇది కన్నడ భాషకు దగ్గరగా ఉంటుంది. కానీ లిపి లేదు. ఇంగ్లీష్, తమిళం, మలయాళం, తెలుగు భాషలతోపాటు బడగ భాషను కూడా సాయి పల్లవి బాగా మాట్లాడుతుంది. బడగలు దాదాపు 400 గ్రామాలలో నివసిస్తున్నారు. నీలగిరి జిల్లాలో బడగలు అతిపెద్ద ఆదిమ తెగలు. నీలగిరి మొదట గిరిజనుల భూమి.కుకల్, కడనాడ్, ఈతలార్, నుండాల, మేలూరు, హులికల్, అతికరాట్టి, మేల్కుంద, కిల్కుంద, కెట్టి, తంతనాడు, మిలిదేను, నందట్టి, జక్కనారి, అరవేను, తిన్నియూర్, అయ్యూరు, కన్నెరిముక్కు, బెరగని, త్వున్నేర్, జక్క, తదితర గ్రామాల్లో వీరు నివసిస్తారు.వీరిని నీలగిరి గౌడలు అని కూడా అంటారు.బడగాలు ప్రాచీన శిలాయుగానికి చెందినవారిగా చరిత్రకారులు భావిస్తారు. బడగాలు పండుగలను "హబ్బా" అని పిలుస్తారు. బడగాస్ ప్రధాన దేవతలు హెతాయ్ , అయ్య. అలాగే శివుడు, కృష్ణుడు, ఖాలి, మారి, మునియప్పను కూడా పూజిస్తారు. ముఖ్యమైన పండుగలు డెవ్వా హబ్బా, హేతే హబ్బా, సకలతి హబ్బా, ఉప్పట్టువ హబ్బా. గిరిజన తెగ అయిన బడగాలు మా ఖలీ హబ్బా, దేడిసిమి హబ్బా, కృష్ణ జయంతి, వినాయగర్ చతుర్థి, మర్రి హబ్బా, మురుగర్ హబ్బా, రామర్ హబ్బా, హనుమాన్ జయంతి తోపాటు ప్రకృతిని, నీటిని, సూర్యుడు, సర్పాలను ప్రకృతిని పూర్వీకులను కూడా పూజిస్తారు. ఆదివాసి బడగా పురాతన అగ్ని తయారీ ప్రక్రియ (చెకుముకి రాళ్ల రాపిడి ద్వారా నిప్పు తయారీని) ఇప్పటికీ వారి దేవా పండుగ సమయంలో అవసరమైన ఆచారంగా ప్రదర్శిస్తారు వారు రెండు రాళ్లు లేదా రెండు కర్రలు రుద్దడం ద్వారా రాపిడి ద్వారా అగ్నిని ఉత్పత్తి చేశారు. దీన్ని "నీలిగోలు" లేదా నిటారుగా ఉండే కర్ర అంటారు. శివుని అవతారంగా భావించే సూర్యుడిని,విష్ణువు అవతారంగా నాగప్పను ఆరాధిస్తారు హేతై హబ్బా ప్రతి సంవత్సరం డిసెంబరు-జనవరిలో ఒక నెల పాటు హేతై హబ్బాను ఘనంగా జరుపుకుంటారు. తమిళ మార్గశిర మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే తొలి సోమవారం హేతై హబ్బా వేడుకను నిర్వహిస్తారు. రక్షకురాలిగా , ప్రయోజకురాలిగా విశ్వసించే హేతై అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ఈ పండుగ పచ్చని నీలగిరి ప్రకృతి దృశ్యం నేపథ్యంలో భక్తులు సాంప్రదాయ తెల్లని దుస్తులలో హేతే దేవతను ఆరాధిస్తారు. ప్రతి ఏడాది దాదాపు ఎనిమిది రోజుల పాటు భారీ ఊరేగింపులతో లక్షలాది మంది బడగలు తమ దేవతను కీర్తించేందుకు ఈ వేడుకను జరుపుకోవడం ఆనవాయితీ. సాయి పల్లవి కూడా సాంప్రదాయ దుస్తుల్లో ఈ వేడుకల్లో పాల్గొన్న ఫోటోలు గతంలో షేర్ చేసింది. బడగ కమ్యూనిటీనుంచి వచ్చిన ఇతర ప్రముఖులు బడగ తెగ సంస్కృతి, ఆచారాలతోపాటు విద్యకు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే 80 శాతం అక్షరాస్యతను కలిగి ఉన్నారు. అనేకమంది ప్రభుత్వ ఉద్యోగాలలో , మరికొందరు విదేశాలలో పనిచేస్తున్నారు. వీరిలో ఒకరు మాజీ లోక్సభ ఎంపీ, దివంగత అక్కమ్మ దేవి. ఆమె డిగ్రీ చదివిన తొలి బడగ మహిళ . 1962 నుండి 1967 వరకు నీలగిరి లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఇక తొలి మహిళా పోస్ట్ గ్రాడ్యుయేట్ బెల్లి లక్ష్మీ రామకృష్ణన్ MA ప్రసిద్ధి. ఈమె తొలి మహిళా గెజిటెడ్ అధికారిణి కూడా. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో పనిచేశారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
బీజేవైఎం నిరసన గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత
సీఎం యోగిని టార్గెట్ చేసిన ప్రతిపక్షాలు?
సైబర్ కేటుగాళ్లు దోచేశారు.. ఆర్బీఐ ఉద్యోగినికి రూ.24.5లక్షల టోకరా
వరల్డ్ కప్ నే కాళ్ళ కింద పెట్టుకున్న కెప్టెనే ఇలా అంటే..
Vishnu Priya Photos: టీవీ స్టార్లు కూడా ఎక్కడా తగ్గట్లేదుగా! (ఫొటోలు)
గాజాలో జరుగుతోంది మారణహోమం కాదు: జో బైడెన్
IPL 2024: ధోనిని అవమానించిన ఆర్సీబీ ప్లేయర్లు!.. తప్పు ‘తలా’దేనా?
రైతులూ.. జాగ్రత్త! విత్తనాల కొనుగోలులో.. ఆఫర్లు చూశారో?
RCBని ధోని అవమానించాడా..? ధోనినే ఆర్సీబీ అవమానించిందా..?
'లూసిఫర్2'లో మాఫియా డాన్గా మోహన్లాల్ లుక్ రివీల్
తప్పక చదవండి
- కెనడాలో భారతీయ విద్యార్థుల నిరసన.. ఎందుకంటే?
- Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్
- కొన్ని గంటల్లోనే నిర్ణయం వెనక్కి తీసుకున్న బీఐఏఎల్
- T20: ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో కొత్తగా ఇద్దరు.. స్మిత్కు మరోసారి!
- బరువు తగ్గాలనుకుంటే..ఆ ఆహారాలకు దూరంగా ఉండాలంటున్న నిపుణులు!
- తెలంగాణ డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు
- MI: ఈ సీజన్లో నిరాశే మిగిలింది: నీతా అంబానీ వ్యాఖ్యలు వైరల్
- AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- వారి ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తున్న పాయల్ రాజ్పుత్
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
Advertisement