-
భారత్ వెళ్లొచ్చాక ఆ భయం పోయింది!
సౌత్ కరోలినా: భారత్ పర్యటన తర్వాత భారీ బహిరంగ సభలంటే ఉన్న బెరుకు తనకు లేకుండాపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ ప్రజలు ఎంతగానో ప్రేమించే గొప్ప వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అంటూ ప్రశంసలు కురిపించారు. సౌత్కరోలినాలో జరిగిన ఒక ర్యాలీలో ఆయన భారత్లో పర్యటనను ప్రస్తావిస్తూ..‘భారీగా జనం హాజరయ్యే సభలంటే ఉన్న భయం భారత్కు వెళ్లొచ్చాక పోయింది. మన జనాభా 35 కోట్లు. నా సభలకు మహా అయితే 60 వేల మంది వస్తారేమో. కానీ, భారత్లో జరిగిన సభకు లక్ష మందికిపైగా హాజరయ్యారు. ఆ దేశ జనాభా 150 కోట్లు. నాకు మీపై ఎంత అభిమానమో అక్కడి వారన్నా అంతే. భారతీయులకు అమెరికా అన్నా ఎంతో ప్రేమ. ప్రధాని మోదీ గొప్ప నేత. ఆ దేశ పర్యటన నాకు ఎంతో విలువైంది’ అని వ్యాఖ్యానించారు. -
తాజ్ వద్దకు తీసుకెళ్లినందుకు థ్యాంక్స్: ఇవాంకా
న్యూఢిల్లీ: నటుడు, గాయకుడు దిల్జిత్ దొసాంజ్ చేసిన ఓ ట్వీట్ ట్విట్టర్ను ఊపేస్తోంది. దీనికి కారణం ఆ ట్వీట్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు రిప్లై ఇవ్వడమే. వివరాల్లోకి వెళితే.. ఇవాంకా ట్రంప్ ఇటీవల భారత పర్యటనలో తాజ్మహల్ను సందర్శించిన సంగతి తెలిసిందే. అందులో ఆమె తాజ్మహల్ వద్ద దిగిన ఓ ఫొటోను దిల్జిత్ ఫొటోషాప్ ఉపయోగించి మార్ఫింగ్ చేసి, ఇవాంకా పక్కన తన ఫొటో పెట్టుకున్నాడు. ‘నేనే తనను తాజ్మహల్ వద్దకు తీసుకెళ్లాను.. అంతకంటే ఏం చేయగలను ?’ అంటూ కామెంట్ పెట్టాడు. దీనిపై ఇవాంకా స్పందిస్తూ.. ‘నన్ను తాజ్మహల్ వద్దకు తీసుకెళ్లినందుకు కృతజ్ఞతలు. దీన్ని నేనెప్పటికీ మరచిపోలేను.’ అంటూ రిప్లై ఇచ్చారు. దీనిపై దిల్జిత్ స్పందిస్తూ.. ‘ఓ మైగాడ్.. కృతజ్ఞతలు ఇవాంకా ! ఇది ఫొటోషాప్ చేసిన చిత్రం కాదని అందరికీ చెప్పేప్రయత్నం చేస్తున్నారు. ఈసారి లూథియానాకు రండి’ అన్నారు. దీనిపై మళ్లీ స్పందించిన ఇవాంకా ‘భారతీయ అభిమానులను అభినందిస్తున్నా’ అంటూ ఫొటోషాప్ చేసిన మరికొన్ని చిత్రాలను షేర్ చేశారు. తనపై ఫొటోషాప్ చేసిన ఫొటోలపై ఇవాంకా సీరియస్గా కాకుండా ఫన్నీగా స్పందించడంతో ట్విట్టర్లో నవ్వులు పూశాయి. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఇవాంకా ట్రంప్ మార్ఫింగ్ ఫొటోలు -
‘నమస్తే ట్రంప్; నేను ఎగ్జయిట్ కాలేదు’
దక్షిణ కరోలినా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి ప్రశంసలు కురిపించారు. దేశ ప్రజలకు ఎంతో ఇష్టమైన ప్రధాని అతడు. అతనో గొప్ప వ్యక్తి అని ట్రంప్ అభివర్ణించాడు. దక్షిణ కరోలినాలో శనివారం జరిగిన ఓ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవలి తన భారత పర్యటనను గుర్తు చేశారు. లక్షకు పైగా జనంతో మొతెరాలో లభించిన అపూర్వ స్వాగతం మరువలేనిదని అన్నారు. తనకు భారీ జనబాహుళ్యంతో నిండిన సభల్లో పాల్గొనడం అంటే ఇష్టమని, అయితే, అమెరికాలో భారీ జన సమీకరణ జరగదని అసంతృప్తి వ్యక్తం చేశారు. (చదవండి: ట్రంప్కు అమెరికా వంటలు నచ్చట్లేదిప్పుడు!) ‘ప్రధాని మోదీతో భారత పర్యటన అద్భుతంగా సాగింది. దేశ ప్రజలు ప్రేమించే అతనో గొప్ప వ్యక్తి. మొతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్ అద్భుతం. భారీ సభల్లో మాట్లాడటం నాకు ఇష్టం. నా సభలకు జనం భారీగా వస్తారు. మొతెరా సభకు లక్షా యాభై వేల మంది జనం వచ్చారు. ప్రస్తుత కరోలినా సభకు జనం భారీగానే వచ్చారు. రెండు సభలూ నాకు ఇష్టమే. అయితే నేను ఈ సమూహాన్ని చూసి ఎగ్జయట్ కాలేదు. ఎందుకంటే నమస్తే ట్రంప్లో ఆ జన బాహుళ్యం, వారి ఆదరణ చూశాను కదా..! భారత్లో 150 కోట్ల జనాభా ఉంది. మనకేమో 35 కోట్ల జనాభానే. అమెరికాతో సంబంధాలు భారతీయులకు ఎంతో ఇష్టం. వారికి ఒక గొప్ప నాయకుడు ఉన్నాడు. అదొక విలువైన పర్యటన’ అని అన్నారు. (చదవండి : నమస్తే ట్రంప్ ‘టీవీ’క్షకులు 4.60 కోట్లు!) కాగా, గత సోమవారం సతీసమేతంగా భారత్లో పర్యటించిన ట్రంప్నకు అహ్మదాబాద్లో ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. అహ్మదాబాద్లోని మొతెరాలో జరిగిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో లక్షకు పైగా జనం పాల్గొన్నారు. సబర్మతీ ఆశ్రమం, ఆగ్రాలోని ప్రపంచ సుందర కట్టడం తాజ్ మహల్ను ట్రంప్ దంపతులు, అతని బృందం సందర్శించింది. అమెరికా-భారత్ ద్వైపాక్షిక చర్చల్లో మధ్య మూడు కీలక ఒప్పందాలు కుదిరాయి. -
ట్రంప్కు అమెరికా వంటలు నచ్చట్లేదిప్పుడు!
ట్రంప్ ఇండియా నుంచి వచ్చినప్పటి నుంచి అమెరికన్ వంటలు ఎంతమాత్రం నచ్చడం లేదు. పదే పదే ఇండియన్ వంటకాలే గుర్తుకొస్తున్నాయి. ఒక ఫైలు మీద అయితే తన సంతకానికి బదులు ‘ఆంధ్రా నాటుకోడి పులుసు’ అని రాశాడు. ‘‘ఇదేంటి సార్?’’ అని ఆయన పీయే అడగాలనుకున్నాడుగానీ ‘ఎందుకొచ్చిన లొల్లి’ అనే కాన్సెప్ట్లో భాగంగా కామ్గా ఉండిపోయాడు. ఆరోజు ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ వైట్హౌస్కు ఫోన్ చేశాడు. ఆ సంభాషణ ఇలా జరిగింది: సెక్రెటరీ: హలో ట్రంపుగారు... ట్రంప్: ‘హలో’ ట్రంపు కాదు... డొనాల్డ్ ట్రంప్ని మాట్లాడుతున్నాను...హీ హీ హీ.... సెక్రెటరీ: ఆపవయ్యా బాబూ... నీ నవ్వు... వినలేక ఛస్తున్నాను... ( ఆ సున్నితమైన నవ్వు ఆగిపోయింది) ట్రంప్: విషయం ఏమిటో చెప్పిచావు... సెక్రెటరీ: ఆ ఇరాన్ వాడు మళ్లీ ‘అణ్వాయుధం తయారుచేస్తున్నాను ఖబడ్దార్’ అంటున్నాడు... ట్రంప్: బాసూ, ఇరాన్ అంటే గుర్తుకు వచ్చింది... నేను ఇండియాలో ఉన్నప్పుడు ఇరానీ చాయ్ రుచి చూశాను. అబ్బబ్బా ఎంత బాగుందో! ఆ రోజంతా తాగుతూనే ఉన్నాననుకో... సెక్రెటరీ: ఆపవయ్యా నీ ‘టీ’ గోల! ప్రపంచశాంతి గురించి మాట్లాడుదామని ఫోన్ చేస్తే ఇరాన్ టీ గురించి చెప్పి చావగొడుతున్నావు. అసలు మీ రెండు దేశాల వాళ్లు తెల్లారి లేస్తే చాలు కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. ఇదేమన్నా బాగుందా? అని నేను ఐరాస సెక్రెటరీ జనరల్ హోదాలో ప్రశ్నిస్తున్నాను... ట్రంప్: బాసూ... కారాలు మిరియాలు అంటే గుర్తుకువచ్చింది. ఇండియాలో ఉన్నప్పుడు కారం బాగా దట్టించిన రాయలసీమ నాటుకోడి పులుసు రుచి చూశాను... అబ్బా! అదిరిపోయిందనుకో. తింటున్నప్పుడు ఎవరో ‘మిరియాల చారు’ పట్టుకొచ్చారు. అది కలుపుకొని తింటే రుచి ఉంది... నా సామిరంగా... ఇప్పటికి నోట్లో నీళ్లూరుతున్నాయి... (ట్రంప్ రాకతో ఒరిగిందేంటి?) సెక్రెటరీ: ఆపవయ్యా బాబూ నీ బ్యాంబూలో సోది... ట్రంప్: అరే... బొంగులో చికెన్ గురించి నీకు చెప్పడం మరిచాను. ఒకరోజు అది వడ్డించారు. ‘బొంగులో చికెన్’ ఈజ్ ట్రడిషనల్ ఫామ్ ఆఫ్ కుకింగ్. ఆల్మోస్ట్ నో ఆయిల్ అండ్ కారం... డిష్ అదిరిపోయింది అనుకో! సెక్రెటరీ: కాస్త నీ చికెన్ గోల ఆపుతావా! కాసేపు ఇండియా–అమెరికా సంబంధాల గురించి మాట్లాడదాం. నువ్వు ఇండియా పర్యటించడం ‘చారిత్రక ఘట్టం’ అనే చెప్పుకోవాలి. ఏమంటావు ట్రంపూ... ట్రంప్: ‘చారిత్రక’ అంటే గుర్తుకువచ్చింది. ఇండియాలో ఉన్నప్పుడు రకరకాల చారుల రుచిచూశాను. ఎంత బాగా నచ్చిందో! మజ్జిగ చారు, మిరియాల చారు, టమాటా చారు... వీటిలో పప్పుచారు హైలెట్ అనుకో... హై ప్రోటీన్ చారు... ప్రిపరేష్ 16 నిమిషాలు, కుక్ 30 నిమిషాలు, టోటల్...46 నిమిషాలు... సింపుల్గా చేసుకోవచ్చు... సెక్రెటరీ: ఏమిటయ్యా బాబూ...అప్పటి నుంచి తెగ చావగొడుతున్నావు. నేను మాట్లాడుతున్నదేమిటి, నువ్వు మాట్లాడుతున్నదేమిటీ. ఏమైనా సంబంధం ఉందా? అయినా తప్పు నీది కాదులే...పొద్దున లేచి ఎవడి ముఖం చూసానో... సరే కర్మగాలి చూశానే అనుకో... నీకు ఫోన్ చేయాలని నాకు ఎందుకు అనిపించాలి... దరిద్రం కాకుంటే... ట్రంప్: ఏమిటయ్యో మాటలు మితిమీరి మాట్లాడుతున్నావు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? డోనాల్డ్ ట్రంప్తో, అమెరికా ప్రెసిడెంట్తో మాట్లాడుతున్నావు. నాకు గానీ తిక్క రేగింది అంటే... సెక్రెటరీ: కూల్ ట్రంప్ కూల్... ట్రంప్: బాసూ... ‘కూల్’ అంటే గుర్తుకు వచ్చింది... ఇండియాలో ఉన్నప్పుడు ‘కుల్ఫీ’ తిన్నానయ్యా... తెగ నచ్చేసిందనుకో... మలై కుల్ఫీ, పిస్తా కుల్ఫీ, మ్యాంగో కుల్ఫీ, స్ట్రాబెర్రీ కుల్ఫీ, బటర్ స్కాచ్ కుల్ఫీ, లిచ్చి కుల్ఫీ, కేసర్ పిస్తా కుల్ఫీ, కేసర్ బాదం కుల్ఫీ... ఒక్కటా రెండా... ఎన్నెన్ని కుల్ఫీలు తిన్నానో... సెక్రెటరీ: నీ ఇండియా పర్యటన నా చావుకొచ్చిందయ్యా. బతికుంటే బలుసాకు బిజినెస్ చేసుకొని బతుకుతాను... ఇక సెలవా మరి... ట్రంప్: నువ్వు బలుసాకు అంటే గుర్తుకొచ్చింది... నేను ఇండియా నుంచి తిరుగుప్రయాణం అవుతున్నప్పుడు బ్రహ్మాండమైన విందు ఇచ్చారు. అందులో స్పెషల్ ఏమిటో తెలుసా? బలుసాకు పప్పు, బలుసాకు పప్పుచారు, బలుసాకు మటన్ కర్రీ, బలుసాకు చికెన్ కర్రీ, బలుసాకు ఫిష్ ఫ్రై, బలుసాకు ఫిష్ పులుసు, బలుసాకు బిర్యానీ, బలుసాకు అప్పడాలు, బలుసాకు వడియాలు, బలుసాకు సకినాలు, బలుసాకు కాజా... గమనిక: అటునుంచి ‘సచ్చాన్రో’ అంటూ పెద్ద శబ్దం వినబడి ఫోన్ కట్ అయిపోయింది. అశుభం – యాకుబ్ పాషా -
దత్తుడు గార్లెండ్స్ బాబ్జీ
‘దత్తుడు గార్లెండ్స్ బాబ్జీ, బాబ్జీ గార్లెండ్స్ దత్తుడు’– అంటూ నానుడిలాంటి వాడుక ఆంధ్రప్రదేశ్లో ప్రచారంలో ఉండేది. పెద్ద బస్తీల్లో, చిన్న నగరాల్లో చిన్న చిన్న కూటములుం టాయ్. వారు తమ వృత్తి వ్యాపారాల్లో కొండచిలువల్లా పెరిగిన వారై ఉంటారు. వాళ్లకి కీర్తిని కొనుక్కోవడానికి లెక్కలు చూపని చిల్లర ఉంటుంది. వారి వారి శక్త్వానుసారం అప్పుడప్పుడు సవాపావో, సవాశేరో కీర్తిని కొను క్కుని దండతో ఇంటికి వెళ్తుంటారు. దండోరా వేయించుకుంటారు. ఈ కూటమి వాళ్లకి వినసొంపైన పదవులుంటాయ్. అవి అజాగళస్తనాల్లాంటివి– ఇదేమరి అక్కర్లేని సొల్లు కబుర్లంటే– మొన్న ట్రంప్ టూర్ ప్రసంగాల్లాగా. ట్రంప్ మోదీని, మోదీని ట్రంప్ అడుగడుగునా దండించుకున్నారు. నగర సంకీర్తన వలె పలుచోట్ల పరస్పరం భజించుకున్నారు. ఆ పొగడ్తలకి ఇద్దరి పళ్లు పులిసిపోయి ఉంటాయ్. ట్రంప్ గాంధీ పేరు ఎత్తలేదు, మోదీ తాజ్మహల్ గుమ్మం ఎక్కలేదు. చెల్లుకు చెల్లు ఏ అమెరికా ప్రెసిడెంటు వచ్చినా ఏవుండదు కడుపు నిండేది– మా మేనత్త పెళ్లిళ్లకి వెళ్లినట్టే! ఆ వైనం చెబుతా. ఆవిడ ఆస్తిపరురాలు. బాధ్యతలు లేవు. పెద్దతనంలో కూడా జుత్తూడక, మాట చెడక నిండుగా ఉండేది. ఒంటినిండా నగలుండేవి. వొంకుల వడ్డాణం, కాసులపేరు, ఓ చేతికి కట్టె వంకీ, ఇంకో చేతికి నాగవత్తు ఇంకా చాలినన్ని బంగారు గాజులు ఉండేవి. ముక్కుకి ఎర్రరాయి నత్తు, తలతిప్పితే అరచెయ్యంత చేమంతిబిళ్ల, అసలు సిసలు కంజీవరం పట్టు చీరెలో ఆవిడ పందిట్లో తిరుగుతుంటే దేవుడి రథం కదుల్తున్నట్టుండేది. పెళ్లికి వస్తే హీనపక్షం మూడు రోజులుండేది. పట్టు చీరెలన్నీ ప్రదర్శించేదాకా ఉండేది. ఆ రోజుల్లో అరడజనుంటే మహాగొప్ప. ఆవిడ దీవెనలు మాత్రం ఉదారంగా ఇచ్చేసి, పెళ్లివాళ్లు పెద్దరికంగా పెట్టేవి స్వీకరించి వెళ్లేది. అమెరికా ప్రెసిడెంటు తెల్లఏనుగు లాంటి విమానం గురించి, మందీమార్బలం గురించి, జరగాల్సిన మర్యాదల గురించి ఎన్నో కథలు వింటూనే ఉన్నాం. ఒబామా పెంపుడు కుక్కతో సహా వచ్చాడు. అత్తగారు కూడా వచ్చింది. అసలావిడ కోసమే వచ్చారని అనుకున్నారు. తాజ్మహల్ చూడాలని మదర్ ఇన్ లా అడిగిందట. అది మన దేశ పౌరులు చేసుకున్న అదృష్టం. అయినా ఎప్పుడూ అదేం దరిద్రమో తెలియదు. ఏ అమెరికా ప్రెసిడెంటు వస్తున్నాడన్నా కోట్లకు కోట్లు ధారపోసి అతి మర్యాదలు చేయడం మనకు అలవాటే. కరువులో అధిక మాసం అంటే ఇదే. అప్పుడెప్పుడో ఇవాంకా వస్తేనే భాగ్యనగరానికి రంగులు వేశాం. దానికి రిటన్ గిఫ్ట్గా కేసీఆర్ని పిలిచి ట్రంప్ షేక్హ్యాండ్ ఇచ్చాడు. నవ్వుతూ ఆరుసార్లు చెయ్యి ఊపాడు. జగన్కి పిలుపు లేదు. ఇహ దానిమీద ఆయనంటే గిట్టని మీడియా కావల్సినన్ని కథనాలు అల్లింది. నా చిన్నప్పుడు ఐసన్హోవర్ రష్యానించి వస్తుంటే నెహ్రూ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇప్పుడు ట్రంప్ స్వాగతానికి మోదీ కనీసం కొన్ని వందల కోట్లు ఖర్చుచేసి ఉంటారు. శివరాత్రి నుంచి శివతాండవంలా నడిచింది. మోదీకి కూడా పూనకం వస్తుందని అర్థమైంది. ఆ దేశం గొప్ప దేశమే కావచ్చు. మనదీ గొప్ప దేశమే. అంతమాత్రంచేత దాని పాలకులంతా గొప్పవారు కానక్కర్లేదు. మన దేశాన్ని ఎందరు నికృష్టులు పాలించలేదు. పద్ధతులు పాటించవచ్చుగానీ మరీ అతి అవసరం లేదు. సబర్మతి ఆశ్రమంలో ఎన్నో రకాలు ఎంతో వ్యయంతో, శ్రమతో చేయించిన ఉపాహారాలను ట్రంప్ ముట్టనే లేదు. దారిలో ప్రాకృతిక వాతావరణంలో పచ్చని చెట్టుకింద కావాల్సినన్ని మాంసాహారాలు వండి వడ్డించాల్సింది. ట్రంప్ రాబోతున్న ఎన్నికల దృష్ట్యా వచ్చాడని అందరికీ తెలుసు. మోదీ గాంధీల రాష్ట్రం తనకి బాసటగా ఉంటుందని ట్రంప్ ఆశ. సువీ అంటే రోకలిపోటని తెలియందెవరికి. ఆయన మళ్లీ త్వరలోనే వస్తారు. మళ్లీ పొగడ్తలుంటాయ్ కాకపోతే కొత్తవి. కానీ మహాశయా! ఈసారి తప్పనిసరిగా జగన్మోహన్రెడ్డిని ఆహ్వానించండి. తెలుగువారు కూడా మీ జాతకం తేల్చగలవారే. ఎందుకైనా మంచిది చంద్రబాబుని కూడా పిలవండి. ఆయనగానీ ఒక్క వీల వేస్తే...... వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement