-
U19 WC Ind vs Aus: జగజ్జేతగా ఆసీస్ .. ఇలాంటివి లెక్కలోకి రావు!
ICC Under 19 World Cup 2024: క్రికెట్ ప్రపంచంలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఆస్ట్రేలియా మరో ఐసీసీ టైటిల్ సాధించింది. అండర్-19 వరల్డ్కప్-2024 ఫైనల్లో భారత యువ జట్టుపై గెలిచి నాలుగోసారి జగజ్జేగతగా అవతరించింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత్ను 79 పరుగుల తేడాతో ఓడించి ఘన విజయం అందుకుని ఏ ఫార్మాట్లోనైనా తమకు తామే సాటి అని మరోసారి నిరూపించుకుంది. ఇక సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023లో సీనియర్ జట్టు మాదిరిగానే.. కుర్రాళ్లూ కంగారూల ధాటికి కంగారెత్తి ఒత్తిడిలో చిత్తయ్యారు. ఫలితంగా ఆరోసారి ప్రపంచకప్ గెలవాలన్న యువ భారత్ ఆశలు అడియాలసయ్యాయి. రోహిత్ సేన మాదిరే.. ఉదయ్ సహారన్ బృందం కూడా కీలక పోరులో ప్రత్యర్థి ముందు తలవంచడంతో మరోసారి ఆసీస్ చేతిలో భంగపాటు తప్పలేదు. ఇలాంటివి అసలు లెక్కలోకే తీసుకోరు ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అండర్-19 స్థాయిలో క్రికెట్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఫలితాలు పెద్దగా పరిగణనలోకి రావు. అయితే, ఈ టోర్నీలో సుదీర్ఘ ప్రయాణం ద్వారా భవిష్య క్రికెట్ స్టార్లు తమ తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకునే అవకాశం మాత్రం ఉంటుంది. భారత జట్టు చాలా బాగా ఆడింది. అయితే, ఈసారి ఆస్ట్రేలియా పేపర్ మీద మాత్రమే కాదు.. మైదానంలో కూడా మెరుగ్గానే కనిపించింది’’ అని కైఫ్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయం పంచుకున్నాడు. ఇందుకు నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘‘ఇప్పటికైనా కైఫ్ బాయ్ ఆస్ట్రేలియా ప్రదర్శనను మెచ్చుకున్నాడు’’ అని కొంతమంది.. ‘‘అండర్-19 వరల్డ్కప్లోనూ మనం ఓడిపోయాం కాబట్టే.. ఈ విజయం లెక్కలోకి రాదంటున్నాడు కైఫ్’’ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అప్పుడు పేపర్ మీద మనమే బెస్ట్ అంటూ.. కాగా భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియాతో చేతిలో టీమిండియా ఓడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్.. ‘‘అత్యుత్తమ జట్టు టైటిల్ గెలిచిందంటే నేను అస్సలు ఒప్పుకోను. పేపర్ మీద చూస్తే టీమిండియా అత్యుత్తమంగా ఉంది’’ అని వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో కైఫ్ తాజా వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ఇదిలా ఉంటే.. తొమ్మిది నెలల వ్యవధిలో ఆస్ట్రేలియా వల్ల.. ఐసీసీ ఈవెంట్లలో టీమిండియాకు మూడుసార్లు పరాభవం ఎదురైంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2021-23 ఫైనల్, వన్డే వరల్డ్కప్ ఫైనల్, అండర్ 19 వరల్డ్కప్ ఫైనల్లో ఆసీస్.. భారత క్రికెట్ జట్లను ఓడించి.. టైటిల్స్ ఎగురేసుకుపోయింది. చదవండి: Ravindra Jadeja: మా కోడలి వల్లే ఇదంతా... మండిపడ్డ రివాబా! At u-19 level team results don't matter much. Future stars learn lesson that help them in long journey.. Well played India. This time have to say Australia good on pitch, and on paper 😊#U19WorldCup2024 — Mohammad Kaif (@MohammadKaif) February 11, 2024 -
సీనియర్ల బాటలోనే జూనియర్లు.. వరల్డ్కప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో భారత్ ఓటమి
అండర్ 19 వరల్డ్కప్ 2024 ఫైనల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. యంగ్ ఇండియాతో ఇవాళ (ఫిబ్రవరి 11) జరిగిన ఫైనల్లో యువ ఆసీస్ జట్టు 79 పరుగుల తేడాతో విజయం సాధించి, నాలుగో సారి జగజ్జేతగా నిలిచింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. భారత సంతతికి చెందిన హర్జస్ సింగ్ (55) అర్దసెంచరీతో రాణించగా.. హ్యారీ డిక్సన్ (42), హగ్ వెబ్జెన్ (48), ఒలివర్ పీక్ (46 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో రాజ్ లింబాని 3, నమన్ తివారి 2, సౌమీ పాండే, ముషీర్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన యువ భారత్.. 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలి వంద కోట్లకు పైగా ఉన్న భారతీయులకు నిరాశ కలిగించింది. భారత ఇన్నింగ్స్లో ఆదర్శ్ సింగ్ (47), తెలుగు ఆటగాడు మురుగన్ అభిషేక్ (42), ముషీర్ ఖాన్ (22), నమన్ తివారి (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లు బియర్డ్మ్యాన్ (3/15), రాఫ్ మెక్మిలన్ (3/43), కల్లమ్ విడ్లర్ (2/35), ఆండర్సన్ (1/42) టీమిండియా పతనాన్ని శాశించారు. సీనియర్ల బాటలోనే జూనియర్లు.. భారత క్రికెట్ జట్టును వరల్డ్కప్ ఫైనల్ ఫోబియా వదలట్లేదు. గతేడాది చివర్లో జరిగిన వన్డే వరల్డ్కప్ ఫైనల్లో భారత సీనియర్లు ఇదే ఆసీస్ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొనగా.. తాజాగా జూనియర్లు సీనియర్ల బాటలోనే నడుస్తూ అండర్ 19 వరల్డ్కప్ ఫైనల్లో కుర్ర ఆసీస్ జట్టు చేతిలో ఓటమిపాలయ్యారు. ప్రస్తుత ఎడిషన్లో ఫైనల్ వరకు అజేయ జట్టుగా నిలిచిన భారత్ రోహిత్ సేనలాగే తుది సమరంలో బొక్కబోర్లా పడి భారత క్రికెట్ అభిమానులకు గుండెకోత మిగిల్చింది. చదవండి: World Cup Final: తెలుగులో మాట్లాడుకున్న క్రికెటర్లు.. వైరల్ వీడియో -
World Cup Final: తెలుగులో మాట్లాడుకున్న క్రికెటర్లు.. వైరల్ వీడియో
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న అండర్ 19 వరల్డ్కప్ 2024 ఫైనల్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్న తెలంగాణ ప్రాంత ఆటగాళ్లు అవనీశ్ రావు, అభిషేక్ మురుగన్ తెలుగులో మాట్లాడుకున్నారు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ సమయంలో వికెట్కీపర్ అవనీశ్ రావు, స్పిన్ బౌలర్ అభిషేక్ మురుగన్తో హైదరాబాద్ యాసలో సంభాషించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. విదేశీ గడ్డపై వరల్డ్కప్ లాంటి మెగా ఈవెంట్ ఫైనల్లో ఇద్దరు తెలుగు వాళ్లు మాట్లాడుకుంటుంటే వినసొంపుగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరు క్రికెటర్లు గ్రౌండ్ లో తెలుగులో మాట్లాడుతుంటే వినడానికి హాయిగా ఉంటుంది కదూ.!! 🤩 మరి ఈరోజు U19 ఫైనల్స్ లో అదే జరిగింది 😃 మరి మీరు కూడా చూసేయండి.!! చూడండి ICC U19 World Cup Final#INDU19vAUSU19 లైవ్ మీ #StarSportsTelugu & Disney + Hotstar లో#U19WorldCupOnStar pic.twitter.com/UPX0xz7zCd — StarSportsTelugu (@StarSportsTel) February 11, 2024 ఇదిలా ఉంటే, వరల్డ్కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి దిశగా పయనిస్తుంది. ఆసీస్ నిర్ధేశించిన 254 పరుగుల లక్ష్య ఛేదనలో యువ భారత్ చేతులెత్తేసింది. 36 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 136/8గా ఉంది. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే ఇంకా 118 పరుగులు చేయాలి చేతిలో కేవలం మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఏదైన మహాద్బుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్లో టీమిండియా గట్టెక్కలేదు. మురుగన్ అభిషేక్ (23), నమన్ తివారి (2) క్రీజ్లో ఉన్నారు. భారత స్టార్ త్రయం ముషీర్ ఖాన్ (22), ఉదయ్ సహారన్ (8), సచిన్ దాస్ (9) డు ఆర్ డై మ్యాచ్లో చేతులెత్తేశారు. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (47) కొద్దో గొప్పో ఆడేందుకు ప్రయత్నించాడు. ఆర్శిన్ కులకర్ణి 3, ప్రియాన్షు మోలియా 9, అవనీశ్ 0, రాజ్ లింబాని 0 పరుగులకు ఔటయ్యారు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్లో హర్జస్ సింగ్ (55) అర్దసెంచరీతో రాణించగా.. హ్యారీ డిక్సన్ (42), హగ్ వెబ్జెన్ (48), ఒలివర్ పీక్ (46 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో రాజ్ లింబాని 3, నమన్ తివారి 2, సౌమీ పాండే, ముషీర్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. -
ఆస్ట్రేలియాతో ఫైనల్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?
అండర్ 19 వరల్డ్కప్ 2024 ఫైనల్లో ఆస్ట్రేలియా 254 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ముందుంచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్లో హర్జస్ సింగ్ (55) అర్దసెంచరీతో రాణించగా.. హ్యారీ డిక్సన్ (42), హగ్ వెబ్జెన్ (48), ఒలివర్ పీక్ (46 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సామ్ కాంస్టాస్ 0, ర్యాన్ హిక్స్ 20, రాఫ్ మెక్మిలన్ 2, చార్లీ ఆండర్సన్ 13 పరగులు చేశారు. భారత బౌలర్లలో రాజ్ లింబాని 3 వికెట్లతో చెలరేగగా.. నమన్ తివారి 2, సౌమీ పాండే, ముషీర్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్ కాసేపట్లో ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో భారత బ్యాటింగ్ త్రయం ఉదయ్ సహారన్, ముషీర్ ఖాన్, సచిన్ దాస్ భీకర ఫామ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో ఈ ముగ్గురు రాణిస్తే టీమిండియా గెలుపు నల్లేరుపైనడక అవుతుంది. ఈ టోర్నీ ప్రస్తుత ఎడిషన్లో భారత్ అజేయ జట్టుగా ఉంది. ఈసారి యువ భారత్ టైటిల్ను గెలిస్తే ఆరో సారి జగజ్జేతగా అవతరిస్తుంది. ఆస్ట్రేలియా సైతం మూడుసార్లు వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది. టీమిండియా ఈసారి కూడా టైటిల్ గెలవాలని ఆశిద్దాం. -
టీమిండియా అభిమానుల్లో కలవరం
అండర్-19 వరల్డ్కప్ 2024లో యువ భారత్ జట్టు ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 11న జరిగే ఫైనల్లో టీమిండియా.. పటిష్టమైన ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే ఈ మెగా ఫైనల్కు ముందు భారత క్రికెట్ అభిమానులకు ఓ విషయం తెగ కలవరపెడుతుంది. అదేంటంటే.. వరల్డ్కప్ ఫైనల్ ఆస్ట్రేలియా ఫోబియా. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్కప్ ఫైనల్లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత సీనియర్ జట్టు ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. అచ్చం ప్రస్తుత అండర్ 19 వరల్డ్కప్లో యువ భారత్లాగే 2023 వరల్డ్కప్లో భారత జట్టు కూడా ఫైనల్ వరకు అజేయంగా నిలిచింది. ఈ క్రమమే ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానుల కలవరానికి కారణంగా మారింది. సీనియర్ జట్టు లాగే జూనియర్లు కూడా ఫైనల్ వరకు అజేయంగా నిలిచి, తుది సమరంలో చేతులెత్తేస్తారేమోనని భారత అభిమానులు బెంగ పెట్టుకున్నారు. భారీ అంచనాల నడుమ నాటి వరల్డ్కప్ ఫైనల్ బరిలోకి దిగిన టీమిండియా.. తుది సమరంలో తడబడి ఆసీస్ చేతిలో పరాభవాన్ని ఎదుర్కొంది. వన్డే వరల్డ్కప్ ఫైనల్లో భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడటం ఇది కొత్తేమీ కాదు. 2003 ఎడిషన్లోనూ టీమిండియా ఇలానే ఫైనల్లో ఆసీస్ చేతిలో చిత్తైంది. అయితే ఆ ఎడిషన్లో ఇప్పటిలా భారత్ అజేయ జట్టు మాత్రం కాదు. లీగ్ దశలో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. ఈ సెంటిమెంట్లను పక్కన పెడితే పరిస్థితులు ఎప్పటికీ ఒకేలా ఉండవన్న గ్రహించాలి. గత వరల్డ్కప్ ఫైనల్స్లో ఆసీస్ చేతిలో ఓడిన భారత జట్ల పరిస్థితి.. ప్రస్తుత యువ భారత జట్టు పరిస్థితి వేర్వేరుగా ఉన్నాయి. ప్రస్తుత యువ భారత్ జట్టు అంత ఈజీగా ఓటమి ఒప్పుకునే పరిస్థితి లేదు. సౌతాఫ్రికాతో జరిగిన సెమీఫైనలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. 249 పరుగుల లక్ష్య ఛేదనలో 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన భారత్ను కెప్టెన్ ఉదయ్ సహారన్ (81), సచిన్ దాస్ (96) చిరస్మరణీయ ఇన్నింగ్స్లు ఆడి గెలిపించారు. ప్రస్తుత యువ భారత జట్టు ఎంతటి ఒత్తిడినైనా అధిగమించి, సత్ఫలితాలు రాబట్లగల సమర్ధమైన జట్టు. ఫైనల్లో యంగ్ ఇండియా ఆసీస్ను మట్టికరిపించి, సీనియర్లకు ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని అశిద్దాం. ఈ వరల్డ్కప్ గెలిస్తే యువ భారత్ ఐదో సారి జగజ్జేతగా నిలుస్తుంది. ఫైనల్ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు మొదలవుతుంది. -
వితిన్ వన్ మంత్... డాడీ మళ్లీ నవ్వుతాడు!
వరల్డ్ కప్ ఫైనల్ ఫలితం ‘అయ్యయ్యో’ అనిపించింది. కన్నీళ్ల పర్యంతం అయిన రోహిత్శర్మను చూసిన తరువాత ఈ ‘అయ్యయ్యో’లు రెట్టింపు అయ్యాయి. ఈ అయ్యయ్యోల సంగతి ఎలా ఉన్నా రోహిత్శర్మ కూతురు సమైర వీడియో క్లిప్ ఇంటర్నెట్లో నవ్వుల పువ్వులు పూయిస్తోంది. ఈ వీడియోలో... సమైర తల్లితో కలిసి వస్తుంటే రోహిత్ గురించి ‘ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారు?’ అని ఎవరో అడిగారు. ‘రూమ్లో ఉన్నారు. వితిన్ వన్ మంత్ ఆయన మళ్లీ నవ్వుతాడు’ అన్నది సమైర. ఈ చిన్నారి పెద్దరికానికి నెటిజనులు మురిసిపోతున్నారు. ఇంతకీ ఇది తాజా వీడియో కాదు. గత ఏడాది ఏదో సందర్భంలో ఒక అభిమాని షేర్ చేసిన వీడియో. అయితే మాత్రం ఏమిటీ తాజా పరిస్థితికి జిరాక్స్లా ఉంది. The way she answered 🥹❤ Samaira said : He is in a room, he is almost positive & within one month he will laugh again.@ImRo45 pic.twitter.com/yt3iSQa6MP — 46thcenturywhenRohit (@RohitCharan_45) November 23, 2023 -
తండ్రీకొడుకుల మధ్య చిచ్చురేపిన క్రికెట్ మ్యాచ్.. ఛార్జర్ కేబుల్తో ఉరేసి..
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం జరిగిన వన్డే వరల్డ్కప్ ఫైనల్ మ్యాాచ్ను యావత్ క్రికెట్ అభిమానులంతా ఆసక్తికరంగా వీక్షించారు. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ హై ఓల్టేజ్ పోరును, టీవీ, హాట్స్టార్, పలుచోట్ల భారీ స్క్రీన్ల ద్వారా ఉత్కంఠగా చూశారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఫైనల్ ఫీవర్ దేశం మొత్తాన్ని ఊపేసింది. అయితే వరల్డ్ కప్ తుది పోరు ఓ తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెట్టింది. ఇంట్లో టీవీ చూస్తున్న ఓ తండ్రి.. మ్యాచ్ మధ్యలో టీవీ ఆపేశాడన్న కోపంతో కన్న కొడుకుతో వాగ్వాదానికిదిగాడు. ఈ క్రమంలో గొడవ పెద్దది కావడంతో ఆవేశంలో కొడుకును హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో దారుణం వెలుగుచూసింది,. వివరాలు.. కాన్పూర్కు చెందిన గణేష్ ప్రసాద్ అనే వ్యక్తి ఆదివారం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ చూస్తున్నాడు. ఈ సమయంలో అతడి కుమారుడు దీపక్.. తనకు ఆకలిగా ఉండటంతో త్వరగా వంట చేయాలని కోరాడు. తన మాటలను తండ్రి పట్టించుకోకుండా మ్యాచ్లో లీనమైపోవడంతో దీపక్ టీవీని ఆఫ్ చేశాడు. దీంతో గణేష్ ప్రసాద్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయి కొడుకుతో గొడవపడ్డాడు. ఇది ఇద్దరి మధ్య కొట్లాటకు దారితీసింది. చదవండి: అయ్యయ్యో..ఎంత విషాదం: మంచికోసం వెళ్లి..మృత్యు ఒడిలోకి! అప్పటికే మద్యం మత్తులో ఉన్న గణేష్ ప్రసాద్.. పక్కనే ఉన్న మొబైల్ ఛార్జర్ కేబుల్తో కొడుకును ఉరేసి చంపాండు. అనంతరం ఇంటి నుంచి పారిపోయాడు. మెట్లపై దీపక్ మృతదేహాన్ని పడి ఉండటాన్ని గుర్తించిన వారి బంధువు.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కాన్పూర్ ఏసీపీ బ్రిజ్ నారాయణ్ సింగ్ మాట్లాడుతూ.. క్రికెట్ మ్యాచ్ విషయంలో జరిగిన గొడవే హత్యకు కారణమైందని వెల్లడించారు. నిందితుడు హత్యకు మొబైల్ ఛార్జర్ కేబుల్ను ఉపయోగించాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారని చెప్పారు. తండ్రీ కొడుకులిద్దరూ తరుచూ మద్యం సేవించి గొడవ పడుతుంటారని తెలిసినట్లు పేర్కొన్నారు. ఇటీవల దీపక్ తన తల్లిని కొట్టాడంతో గతవారం ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. -
'అలా అయ్యుంటే టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్లో గెలిచేది!
లక్నో: క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లో కాకుండా లక్నోలో జరిగి ఉంటే టీమ్ ఇండియా గెలిచి ఉండేదని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. లక్నోలో మ్యాచ్ జరిగి ఉంటే, టీమిండియాకు విష్ణువు, భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆశీస్సులు లభించేవని అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. లక్నోలోని క్రికెట్ స్టేడియానికి సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎకనా స్టేడియం అని పేరు పెట్టింది. విష్ణువు అనేక పేర్లలో ఏకనా ఒకటి. ఆ తర్వాత యోగీ ఆదిత్య నాథ్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ స్టేడియానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ పేరును ఖరారు చేశారు. అహ్మదాబాద్ వేదికగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. నరేంద్ర మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియా-భారత్ తలపడ్డాయి. ఇందులో ఆసిస్ 6 వికెట్ల తేడాతో అలవోకగా విజయం సాధించింది. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్కు చేరిన భారత జట్టు క్రిడాకారులు నిరాశలో మునిగిపోయారు. మ్యాచ్కు హాజరైన ప్రధాని మోదీ వారిని ఓదార్చారు. ఇదీ చదవండి: Delhi Pollution Update: ఢిల్లీలో మరికొద్ది రోజుల ఇంతే.. -
CWC 2023 Final: బోల్తా కొట్టించింది పిచ్ వ్యూహమేనా?
2023 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో వరుసగా 10 మ్యాచ్ల్లో గెలుపొంది, అజేయ జట్టుగా నిలిచిన భారత్ ఆఖరి మెట్టుపై బోల్తా పడి మూడోసారి టైటిల్ గెలిచే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది. నాకౌట్ మ్యాచ్ల్లో చతికిలపడటం టీమిండియాకు కొత్తేమీ కానప్పటికీ, ఈ దఫా మాత్రం అభిమానులను తీవ్రంగా బాధ పెట్టింది. ఆశలు రేకెత్తించి, ఆఖరి మెట్టుపై ఉసూరుమనిపించడంతో ఫ్యాన్స్ బాధ వర్ణణాతీతంగా ఉంది. ఈ ఓటమి 140 కోట్ల మంది భారతీయులకు గుండె కోత మిగిల్చింది. ఫైనల్లో భారత్ ఓటమికి గల కారణాలు విశ్లేషిస్తూ పలువురు నిపుణులు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఒత్తిడి, టాస్ ఓడిపోవడమే టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలని మెజారిటీ శాతం అభిప్రాయపడుతున్నారు. కొందరు మాత్రం పిచ్ విషయంలో బీసీసీఐ చేసిన అతే కొంపముంచిందని అంటున్నారు. తమ పేసర్లు భీకరమైన ఫామ్లో ఉన్నప్పుడు నిదానమైన ట్రాక్ రూపొందించడమే పెద్ద తప్పని అభిప్రాయపడుతున్నారు. పిచ్ విషయంలో బీసీసీఐ వ్యూహం బెడిసికొట్టిందని, అదే మనపై ప్రత్యర్ధి పైచేయి సాధించేలా చేసిందని అంటున్నారు. పిచ్ ఎప్పటిలాగే ఉన్నా టీమిండియాకు లబ్ది చేకూరేదే అని అభిప్రాయపడుతున్నారు. మన పేసర్లపై నమ్మకం లేక స్లో పిచ్ను తయారు చేశారా అని ప్రశ్నిస్తున్నారు. జట్టు అన్ని విభాగాల్లో (బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్, పేస్ బౌలింగ్) పటిష్టంగా ఉన్నప్పుడు నిదానమైన పిచ్ను తయారు చేయడంలో అర్ధం లేదని మండిపడుతున్నారు. పిచ్ విషయంలో బీసీసీఐ వ్యూహం మిస్ ఫైర్ అయ్యిందని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా అన్నాడు. పిచ్ స్లోగా ఉండటం, ఆదిలోనే వికెట్లు కోల్పోవడం వల్ల టీమిండియా తీవ్ర ఒత్తిడికి లోనైందని తెలిపాడు. షాట్లు ఆడేందుకు భారత బ్యాటర్లు అష్టకష్టాలు పడ్డారని అభిప్రాయపడ్డాడు. కాగా, అహ్మదాబాద్ పిచ్పై గతంలో పరుగుల వరద పారిన విషయం తెలిసిందే. ఇక్కడి రెగ్యులర్ పిచ్పై అత్యంత భారీ స్కోర్లు నమోదయ్యాయి. అయితే వరల్డ్కప్ ఫైనల్లో రెగ్యులర్ వికెట్ కాకుండా స్లో ట్రాక్ను రూపొందించడంతో టీమిండియా పరుగులు చేసేందుకు నానా ఇబ్బందులు పడి స్వల్ప స్కోర్కే పరిమితమైంది. అనంతరం ఛేదనలో మంచు ప్రభావం చేత పిచ్ మరింత నిదానంగా మారి, దాదాపు నిర్జీవమైన పిచ్గా మారిపోయింది. ఫలితంగా ఆసీస్ బ్యాటర్లు హెడ్, లబూషేన్ క్రీజ్లో పాతుకుపోయి తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించారు. -
డ్రెస్సింగ్ రూంలో క్రికెటర్లను ఓదార్చిన మోదీ
అహ్మదాబాద్: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఓటమి తర్వాత తీవ్ర నిరాశలో ఉన్న భారత క్రికెటర్లను ప్రధాని మోదీ ఓదార్చారు. ఓటమి సాధారణమైనది, నిరుత్సాపడకూడదని ప్రోత్సహించారు. టోర్నీలో వరుసగా పది మ్యాచ్లు గెలిచిన తీరును గుర్తుచేశారు. దేశమంతా చూస్తోంది.. దయచేసి నవ్వండని కోరారు. అప్పుడప్పుడు ఇలా జరగుతుందని కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి చేతులు పట్టుకుని ఉత్సాహపరిచారు. ఆటగాళ్లు ఒకరినొకరు నిరంతరం ప్రోత్సహించుకోవాలని చెప్పారు. గుజరాతీ అయిన రవీంద్ర జడేజాతో ప్రధాని మోదీ గుజరాతీలో మాట్లాడారు. ఏం బాబు అని పలకరిస్తూ ఇరువురు నవ్వులు కురిపించారు. మహ్మద్ షమీ వద్దకు వచ్చిన మోదీ.. షమీని కౌగిలించుకున్నారు. అద్భుతమైన ఆటతీరు కనబరిచావని మెచ్చుకున్నారు. #WATCH | Prime Minister Narendra Modi met Team India in their dressing room after the ICC World Cup Finals at Narendra Modi Stadium in Ahmedabad, Gujarat on 19th November. The PM spoke to the players and encouraged them for their performance throughout the tournament. (Video:… pic.twitter.com/ZqYIakoIIj — ANI (@ANI) November 21, 2023 అహ్మదాబాద్ వేదికగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాతో భారత్ పోరుకు దిగింది. అయితే.. 6 వికెట్ల తేడాతో భారత్పై ఆసిస్ అలవోక విజయం సాధించింది. ఓటమిని చవిచూసిన భారత ఆటగాళ్లు నిరుత్సాహంతో మైదానాన్ని వీడారు. కొందరు ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. మ్యాచ్ను వీక్షించడానికి వెళ్లిన ప్రధాని మోదీ క్రికెటర్లను డ్రస్సింగ్ రూంలో కలిశారు. నిరుత్సాహంలో ఉన్న ఆటగాళ్లను ఓదార్చారు. ఇదీ చదవండి: ద్రవిడ్ను కొనసాగిస్తారా లేక సాగనంపుతారా.. టీమిండియా తదుపరి కోచ్ ఎవరు..? -
వరల్డ్ కప్ రాలేదని యువకుడి ఆత్మహత్య
కోల్కతా : ఇండియా వరల్డ్ కప్ గెలవలేదన్న బాధను జీర్ణించుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమబెంగాల్లోని బంకురా జిల్లాలో ఈ ఘటన జరిగింది. చీరలు అమ్మే దుకాణంలో పనిచేసే రాహుల్ లోహర్(23) టీమ్ ఇండియాకు వీరాభిమాని. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఇండియా ఓటమిని రాహుల్ తట్టుకోలేకపోయాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత రాత్రి 11 గంటలకు రాహుల్ ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడని అతడి బావ ఉత్తమ్ సుర్ తెలిపారు. ఆదివారం రాహుల్ షాప్కు వెళ్లలేదని,ప్రొజెక్టర్లో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూశాడని ఉత్తమ్ చెప్పాడు. ఆ తర్వాత ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపాడు. విషయం తెలిసిన వెంటనే తాను వెళ్లి రాహుల్ను ఆస్పత్రికి తీసుకెళ్లానని, అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు చెప్పినట్లు తెలిపాడు. ఇదీచదవండి..వరల్డ్కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి.. షాహీన్ షా అఫ్రిది పోస్ట్ వైరల్ -
ఆసీస్పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం
వన్డే వరల్డ్కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం టీమిండియాకు అతి త్వరలో రానుంది. స్వదేశంలోనే మరో 3 రోజుల్లో భారత్, ఆసీస్ టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. 5 మ్యాచ్ల ఈ సిరీస్లో గెలిచి ఆసీస్పై ప్రతీకారం తీర్చుకోవాలని భారత ఆటగాళ్లు భావిస్తున్నారు. ఈ సిరీస్ నవంబర్ 23 నుంచి ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్ వైజాగ్ వేదికగా, రెండో టీ20 నవంబర్ 26న (తిరువనంతపురం), మూడో మ్యాచ్ నవంబర్ 28న (గౌహతి), నాలుగు (నాగ్పూర్), ఐదు టీ20లు (హైదరాబాద్) డిసెంబర్ 1, 3 తేదీల్లో జరుగనున్నాయి. కాగా, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో టీమిండియా పోరాడి ఓడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నామమాత్రపు స్కోర్కే (240) పరిమితమైనప్పటికీ.. బౌలింగ్లో రాణించి చివరి వరకు పోరాడింది. ట్రవిస్ హెడ్ (137) చిరస్మరణీయ శతకంతో ఆసీస్ గెలుపు అంచుల వరకు తీసుకెళ్లాడు. లబూషేన్ (58 నాటౌట్) సహకారంతో భారత్కు గెలుపును దూరం చేశాడు. వీరిద్దరు నాలుగో వికెట్కు 192 పరుగలు భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆసీస్ను గెలిపించారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్లో రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లి (54), కేఎల్ రాహుల్ (66) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లు స్టార్క్ (3/55), హాజిల్వుడ్ (2/60), కమిన్స్ (2/34), మ్యాక్స్వెల్ (1/35), జంపా (1/44) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి టీమిండియా పతనాన్ని శాశించారు. -
CWC 2023: ధోని, పాంటింగ్ సరసన చేరిన కమిన్స్
వన్డే వరల్డ్కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా టీమిండియాను ఓడించి ఆరోసారి జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే. పాట్ కమిన్స్ కెప్టెన్గా తన తొలి వరల్డ్కప్ సాధించి, ఓ వినూత్న ఘనత సాధించాడు. పెళ్లైన మరుసటి ఏడాదే వన్డే ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్గా దిగ్గజాల సరసన చేరాడు. గతంలో రికీ పాంటింగ్ (2003), మహేంద్ర సింగ్ ధోని (2011), ఇయాన్ మోర్గన్లు (2019) పెళ్లైన మరుసటి ఏడాదే ప్రపంచకప్ సాధించిన ఆటగాళ్లుగా అరుదైన గుర్తింపు దక్కించుకున్నారు. తాజాగా కమిన్స్ వీరి సరసన చేరి అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. Who should get married in 2026?🤔 pic.twitter.com/RtVJ8PGUuf — CricTracker (@Cricketracker) November 20, 2023 కాగా, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో టీమిండియా పోరాడి ఓడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నామమాత్రపు స్కోర్కే (240) పరిమితమైనప్పటికీ.. బౌలింగ్లో రాణించి చివరి వరకు పోరాడింది. ట్రవిస్ హెడ్ (137) చిరస్మరణీయ శతకంతో ఆసీస్ గెలుపు అంచుల వరకు తీసుకెళ్లాడు. లబూషేన్ (58 నాటౌట్) సహకారంతో భారత్కు గెలుపును దూరం చేశాడు. వీరిద్దరు నాలుగో వికెట్కు 192 పరుగలు భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆసీస్ను గెలిపించారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్లో రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లి (54), కేఎల్ రాహుల్ (66) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లు స్టార్క్ (3/55), హాజిల్వుడ్ (2/60), కమిన్స్ (2/34), మ్యాక్స్వెల్ (1/35), జంపా (1/44) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి టీమిండియా పతనాన్ని శాశించారు. -
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్: 51 టెంకాయలు ఆర్డర్.. ‘ఎక్స్’ పోస్ట్ వైరల్!
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగింది. భారత్ విజయం కోసం కోట్లాది మంది భారతీయులు ఎంతో ఆతృతంగా ఎదురు చూశారు.. అన్ని వర్గాల వారు ఆకాంక్షించారు.. ప్రార్థనలు చేశారు. కానీ అవేవీ ఫలించలేదు. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించి వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు వరల్డ్ కప్లో భారత్ విజయం సాధించి కప్ గెలిస్తే కొట్టడానికి 51 టెంకాయలను థానేకు చెందిన ఓ వ్యక్తి ఫుడ్డెలివరీ యాప్ స్విగ్గీలో ఆర్డర్ చేశారు. ఈ సమాచారాన్ని స్విగ్గీ సోషల్ మీడియా ప్లాట్ఫాం ‘ఎక్స్’ (ట్విటర్) ద్వారా తెలియజేసింది. థానే నుంచి ఎవరో ఇప్పుడే 51 టెంకాయలు ఆర్డర్ చేశారు. బహుశా వరల్డ్ కప్ ఫైనల్ గెలుపు కోసమే అయిఉండచ్చు. అదే నిజమై భారత్కు కప్ రావాలని ఆకాంక్షించింది. కాగా స్విగ్గీ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఈ ఆర్డర్ చేసింది తానే అంటూ ఓ వ్యక్తి స్విగ్గీ పోస్ట్ను రీట్వీట్ చేశారు. భారత్ వరల్డ్ కప్ గెలిస్తే కొట్టడానికే టెంకాయలు ఆర్డర్ చేసినట్లు పేర్కొన్నారు. టీవీ ముందు టెంకాయలు ఉంచిన దృశ్యాన్ని ఈ ట్వీట్కు జత చేశారు. ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. లక్షల్లో వ్యూవ్స్, కామెంట్లు వచ్చాయి. కాగా ఇదే వ్యక్తి భారత్ విజయాన్ని వ్యక్తీకరించడానికి 240 అగరబత్తులను ఆర్డర్ చేశారు. haan bhay yeh someone from thane bhi mai hi hoon, 51 nariyal for unreal manifestation✨ https://t.co/aNa3WACNOp pic.twitter.com/kVuQ6WjCjH — gordon (@gordonramashray) November 19, 2023 -
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో కలకలం
అహ్మదాబాద్: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో కలకలం రేగింది. మ్యాచ్ జరుగుతుండగా పాలస్తీనాకు మద్దతు తెలుపుతూ ఓ వ్యక్తి మైదానంలోకి దూసుకొచ్చాడు. క్రీజ్లో ఉన్న విరాట్ కోహ్లిని కౌగిలించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. దీంతో మ్యాచ్ నిర్వహణలో భద్రతా వైఫల్యంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. #ICCCricketWorldCup | Security breach during the India versus Australia ICC World Cup 2023 Final match, in Ahmedabad after a spectator entered the field (Pics: ANI Photos) pic.twitter.com/AfilmF75sB — ANI (@ANI) November 19, 2023 మైదానంలోకి దూసుకొచ్చిన వ్యక్తి పాలస్తీనాను ప్రతిబింబించే వేషధారణను కలిగి ఉన్నాడు. ఎర్రని షార్ట్ ధరించాడు. తెల్లని టీ షర్ట్ ముందు భాగంలో పాలస్తీనాపై బాంబు దాడులు నిలిపివేయండి అని పేర్కొని ఉంది. టీషర్ట్ వెనుక భాగంలో ఫ్రీ పాలస్తీనా అని రాసి ఉంది. పాలస్తీనా జెండాను ప్రతిబింబించేలా మాస్క్ను ధరించాడు. మ్యాచ్ జరుగుతుండగా.. ఎక్కసారిగా మైదానంలోకి దూసుకొచ్చాడు. క్రీజ్ వరకు చేరుకుని విరాట్ కోహ్లిని హత్తుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలో రంగంలోకి దిగిన సిబ్బంది అతన్ని పట్టుకుని వెనక్కి తీసుకెళ్లారు. క్రికెట్ వరల్డ్కప్లో నేడు భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా మొతేరా స్టేడియంలో నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ను వీక్షించడానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఇప్పటికే ఐదు వికెట్లు కోల్పోయింది. 37 ఓవర్లకు 182 పరుగులు సాధించింది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం అక్టోబర్ 7న ప్రారంభం అయింది. హమాస్ అంతమే ధ్యేయంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. రాకెట్ దాడుల అనంతరం భూతల యుద్ధం చేపట్టింది. హమాస్ మూకలను మట్టికరిపిస్తూ ఇప్పటికే ఉత్తర గాజాను ఆక్రమించింది. అటు దక్షిణ గాజాను కూడా ఖాలీ చేయాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు చేసింది. అటు అల్-షిఫా ఆస్పత్రిని రక్షణ కవచంగా హమాస్ మూకలు ఉపయోగించుకుంటున్నాయని ఆరోపిస్తూ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ సేనలు దాడులు చేస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ వైపు 1,200 మంది మరణించగా.. పాలస్తీనా వైపు 12,500 మంది మరణించారు. ఇందులో 5,000 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఇదీ చదవండి: పాలస్తీనాకు భారత్ రెండోసారి మానవతా సాయం -
వరల్డ్కప్ ఫైనల్పై శివసేన ఎంపీ తీవ్ర విమర్శలు
World Cup final: ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆతిథ్య భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య హోరాహోరీగా సాగుతోంది. దేశవ్యాప్తంగా కోట్ల మంది ఈ ఫైనల్ మ్యాచ్ సంరంభంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో వరల్డ్ ఫైనల్పై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు చేశారు. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్స్ క్రికెట్ ఈవెంట్ కంటే కూడా బీజేపీ ఈవెంట్లా సాగుతోందని సంజయ్ రౌత్ ఆరోపించారు. క్రికెట్ పరిభాషలో బీజేపీపై విమర్శలు గుప్పించారు. "ఈరోజు ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ప్రధాని మోదీ బౌలింగ్, అమిత్ షా బ్యాటింగ్, ఫీల్డింగ్ చేసేలా ఉన్నారు" అని వ్యంగంగా విమర్శించారు. "క్రికెట్లోకి రాజకీయాలు తీసుకురావాల్సిన అవసరం లేదు. కానీ అహ్మదాబాద్లో అదే జరుగుతోంది" అని రౌత్ అన్నారు. ఇందులో తనకేమీ ఆశ్చర్యం లేదన్నారు. ప్రధాని మోదీ హాజరవుతున్నారు కాబట్టి భారత్ కచ్చితంగా కప్ గెలవాలని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ను వీక్షించనున్నట్లు శనివారం అధికారిక ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. -
WC Final: మొతేరా స్టేడియంపై అబ్బురపరిచే ఎయిర్షో దృశ్యాలు
అహ్మదాబాద్: క్రికెట్ వరల్డ్కప్లో నేడు భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా మొతేరా స్టేడియంలో నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ను వీక్షించడానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలో నరేంద్ర మోదీ స్టేడియంపై ఐఏఎఫ్ సూర్యకిరణ్ బృందం ఎయిర్ షోను ప్రదర్శించింది. ఉత్కంఠభరితమైన దృశ్యాలు ప్రేక్షకులను అబ్బురపరిచాయి. IAF's Suryakiran team performs Aerobatic Show over Narendra Modi Stadium ahead of India vs Australia in the ICC Cricket World Cup 2023 Final pic.twitter.com/CKCjJ5jGCX — DeshGujarat (@DeshGujarat) November 19, 2023 ఇప్పటికే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా.. మొదట్లోనే కాస్త తడబడింది. ప్రస్తుతం కోహ్లి, రాహుల్ నిలకడగా రాణిస్తున్నారు. క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోయారు. భారత్ గెలవాలని ఆకాంక్షిస్తున్నారు. టీమిండియా మెరుగ్గా రాణించాలని అభిమానులు పూజలు చేస్తున్నారు. More visuals of the Indian Air Force's air show over Narendra Modi Stadium pic.twitter.com/kXpd2kkJFa — DeshGujarat (@DeshGujarat) November 19, 2023 ఇదీ చదవండి: భారత్ మ్యాచ్ గెలిస్తే చాట్ ఫ్రీ! -
ధనవంతులకు ఫ్రీ పాస్లా..! : హర్ష్ గొయెంకా
న్యూఢిల్లీ: దేశమంతా వరల్డ్ కప్ ఫైనల్ సందడి నడుస్తోంది. సోషల్ మీడియా మొత్తం భారత్-ఆసీస్ మ్యాచ్ ఫీవరే కనిపిస్తోంది. ఈ ఫీవర్ పరిస్థితుల్లో ప్రముఖ పారిశ్రామిక వేత్త, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆర్పీజీ గ్రూప్ అధినేత హర్ష్ గొయెంకా చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ట్వీట్ను నెటిజన్లు ఆయనకే బూమరాంగ్ చేసి రివర్స్ ప్రశ్నలేశారు. ఇంతకీ హర్ష్ గొయెంకా ఏమని ట్వీట్ చేశారంటే ‘ ప్రముఖ వ్యాపారస్తులైన నా స్నేహితులెవరూ డబ్బులు చెల్లించి ఫైనల్ మ్యాచ్ టికెట్లు కొనలేదు. వాళ్లందరూ ఫ్రీ పాస్లు తీసుకున్నారు. ఇక్కడ బాధేంటంటే ధనవంతులు డబ్బు చెల్లించడానికి ఇష్టపడకపోవడమే’ అని వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన ఆయన ఫాలోవర్ ఒకతను ‘మరి మీ పరిస్థితేంటి సార్? టికెటా..పాసా..?’ అని ప్రశ్నించారు. దీనికి స్పందించిన హర్ష్ గొయెంకా ఏదీకాదని సమాధానమిచ్చారు. అహ్మదాబాద్లో జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ టికెట్లు ఒక్కోటి రూ. 2 లక్షల దాకా ప్రముఖ రీసెల్లింగ్ ప్లాట్ఫాంలో అమ్ముడవుతున్నాయి. ఈ ప్లాట్ఫాంలో టికెట్ స్టార్టింగ్ ధర 32వేలుండడం విశేషం. భారత్, ఆసీస్ మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. None of my businessmen friends have paid to get tickets for the #WorldcupFinal, they have all managed to get a ‘pass’. And that’s where the irony lies- it’s the rich who don’t want to pay! — Harsh Goenka (@hvgoenka) November 18, 2023 How about you, Sir? Ticket or Pass. — Anand Singh (@Anands_page) November 18, 2023 ఇదీచదవండి...‘టీమిండియా గెలిచేవరకూ మెతుకు ముట్టం’ -
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కు భారీ భద్రత.. వేల మందితో బందోబస్తు
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో 6,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరిస్తున్నట్లు అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జీఎస్ మాలిక్ తెలిపారు. ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ గ్రాండ్ ఫినాలేకు హాజరయ్యే ముఖ్య వ్యక్తులలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రధాని రిచర్డ్ మార్లెస్ ఉన్నట్లు ఆయన చెప్పారు. ఇక్కడ విలేకరుల సమావేశంలో జీఎస్ మాలిక్ మాట్లాడుతూ మ్యాచ్ చూడటానికి లక్ష మందికి పైగా ప్రేక్షకులు, అనేక మంది ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో గుజరాత్ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ , హోంగార్డులు, ఇతర సిబ్బందితో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ‘ఈ మెగా ఈవెంట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగేలా చూసేందుకు 6,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరిస్తున్నాం. వీరిలో దాదాపు 3,000 మంది స్టేడియం లోపల ఉంటారు. మరికొందరు ఆటగాళ్లు, ప్రముఖులు బస చేస్తున్న హోటళ్లు, ఇతర కీలక ప్రదేశాలలో బందోబస్తు నిర్వహిస్తారు’ అని జీఎస్ మాలిక్ వివరించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఒక కంపెనీ స్టేడియం లోపల, మరొకటి స్టేడియం వెలుపల మోహరించి ఉంటుందని, నగర పోలీసుల ఆధ్వర్యంలో స్టేడియం లోపల తాత్కాలిక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఐజీ, డీఐజీ ర్యాంకుకు చెందిన నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో పాటు 23 మంది డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారులు మ్యాచ్ రోజు సిబ్బందిని పర్యవేక్షిస్తారని జీఎస్ మాలిక్ పేర్కొన్నారు. వీరికి 39 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 92 మంది పోలీస్ ఇన్స్పెక్టర్లు సహాయం చేస్తారని వివరించారు. మ్యాచ్లో ఏదైనా రసాయన, జీవ, రేడియోలాజికల్, న్యూక్లియర్ (CBRN) అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే స్పందించడానికి, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) బృందాలను కూడా నగరంలో మోహరిస్తామని తెలిపారు. బాంబ్ డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్కు చెందిన 10 బృందాలతో పాటు రెండు బృందాలు చేతక్ కమాండోస్, ఒక ఎలైట్ యూనిట్ను స్టేడియం సమీపంలో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. బాంబ్ బెదిరింపులపై స్పందిస్తూ.. ఎక్కడో బయట దేశాల్లో కూర్చొని ఆకతాయిగా చేసే బెదిరింపులను మీడియా హైలైట్ చేయొద్దని జీఎస్ మాలిక్ కోరారు. -
ఆసీస్తో అంత ఈజీ కాదు.. ఏమి చేయాలో మాకు బాగా తెలుసు: రోహిత్ శర్మ
క్రికెట్ అభిమానులు ఏంతో అతృతగా ఎదురు చూస్తున్న వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్ పోరుకు మరి కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా తుది పోరులో భారత్-ఆస్ట్రేలియా జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఇప్పటికే ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో ఆజేయంగా నిలిచిన భారత జట్టు.. ఫైనల్లో కూడా తమ జోరును కొనసాగించి మరోసారి వరల్డ్ ఛాంపియన్స్గా నిలవాలని పట్టుదలతో ఉంది. ఈ ఫైనల్ మ్యాచ్కు ముందు టీమిండియా కెప్టెన్ మీడియా సమావేశంలో పాల్గోన్నాడు. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం అన్ని విధాల సిద్దమైనట్లు రోహిత్ తెలిపాడు. ఏమి చేయాలో మాకు బాగా తెలుసు.. "నేను కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనప్పటి నుంచి ఈ రోజు కోసమే ఎదురు చూశాను. ఈ వరల్డ్కప్ కోసం మేము రెండేళ్ల కిందటే సన్నాహాలు ప్రారంభించాము. మూడు ఫార్మాట్లలో మేము ఒక యూనిట్గా అద్బుతంగా రాణిస్తున్నాం. జట్టులో ఉన్న ప్రతీ ఒక్కరికి వారి పాత్రపై ఒక క్లారిటీ ఉంది. మూడు ఫార్మాట్లలో ఆటగాళ్ల ప్రదర్శన బట్టి అవకాశాలు ఇస్తూ వస్తున్నాం. ఇప్పటివరకు ఈ టోర్నీలో మేము మెరుగైన ప్రదర్శన కనబరిచాం. రేపు కూడా అదే జోరును కొనసాగిస్తామని ఆశిస్తున్నాను. ఇక ఆస్ట్రేలియాను మేము తేలికగా తీసుకోము. ప్రపంచక్రికెట్లో అత్యుత్తమ జట్లలో ఆస్ట్రేలియా ఒకటి. ఈ టోర్నీలో వరుసగా 8 కి ఎనిమిది మ్యాచ్లు గెలిచి ఫైనల్కు వచ్చింది. ఆస్ట్రేలియా ఏమి చేయగలదో మాకు తెలుసు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. అయితే మా ప్రణాళికలు మాకు ఉన్నాయి. వాటిపై మేము దృష్టి పెట్టాలనుకుంటున్నాము. వారి ఫామ్ను చూసి మేము ఎటువంటి ఆందోళన చెందడం లేదు. మాపై చాలా అంచనాలు ఉన్నాయి. టోర్నీ స్వదేశంలో జరుగుతుంది కాబట్టి అంతే ఒత్తిడి కూడా ఉంటుంది. కానీ వాటిన్నంటిని తట్టుకుని ఎలా ఆడాలో మాకు బాగా తెలుసు. డ్రెస్సింగ్ రూమ్లో కూడా మేము ప్రశాంతమైన వాతావారణం ఏర్పరుచుకున్నామని" రోహిత్ పేర్కొన్నాడు. బౌలర్ల గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ.. "ఈ టోర్నీలో మా బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. మేము తొలి నాలుగు,ఐదు మ్యాచ్ల్లో ఛేజింగ్ చేసి విజయం సాధించాం. ప్రత్యర్ధి జట్లను 300 కంటే తక్కువకు పరిమితం చేయడంలో మా బౌలర్లు కీలక పాత్ర పోషించారు. పేసర్లు స్పిన్నర్లు ఇద్దరూ అదరగొట్టారు. మేము టార్గెట్ను డిఫెండ్ చేసుకోవడంలోనూ మా బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేశారు. బుమ్రా, షమీ, సిరాజ్ కొత్త బంతితో అద్బుతాలు చేయగా.. మిడిల్ ఓవర్లలో స్నిన్నర్లు కూడా అత్యుత్తమంగా రాణించారు" అని చెప్పుకొచ్చాడు. -
World Cup 2023 Final: బ్యాటింగా.. బౌలింగా? భారత్ టాస్ గెలిస్తే తొలుత ఏమి చేయాలి?
వన్డే ప్రపంచకప్-2023లో తుది సమరానికి మరి కొన్ని గంటల మాత్రమే మిగిలి ఉంది. ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఫైనల్ పోరులో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే అహ్మబాద్కు చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్లో మునిగి తేలుతున్నాయి. ఇరు జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. అహ్మదాబాద్ స్టేడియంలోని పిచ్కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వికెట్పైన మ్యాచ్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పిచ్ను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హెడ్ కోచ్ ద్రవిడ్తో కలిసి పరిశీలించాడు. మరోవైపు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా స్టేడియంకు వచ్చి పిచ్ను పరిశీలించి, ఫోటోలను తన ఫోన్లో తీసుకున్నాడు. ఆ తర్వాత వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ,ఆస్ట్రేలియా స్పిన్ బౌలింగ్ కోచ్ డేనియల్ వెట్టోరీ కూడా చాలా సేపు ఈ పిచ్ను చెక్ చేశారు. టాస్ గెలిస్తే తొలుత ఏమి చేయాలి..? కాగా ఈ మ్యాచ్లో టాస్ మరోసారి కీలకం కానుంది. ఈ తుదిపోరులో టాస్ గెలిచిన జట్టు తొలుత ఏమి చేస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే సోషల్ మీడియాలో వైరలవుతున్న ఫోటోను బట్టి చూస్తే.. అహ్మదాబాద్ పిచ్ను నల్లమట్టితో తాయారు చేసినట్లు కన్పిస్తోంది. ట్రాక్పై పెద్దగా గ్రాస్(గడ్డి) కూడా లేదు. కాబట్టి కొత్త బంతితో సీమర్లు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. అయితే మ్యాచ్ జరిగే సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎండ ఎక్కువగా ఉంటే మాత్రం పిచ్ బాగా డ్రై అవుతుంది. Captain Pat Cummins inspects the pitch ahead of the final 🔍#CWC23 #INDvAUS pic.twitter.com/ymBAK5o8x6 — ICC (@ICC) November 18, 2023 దీంతో వికెట్ కాస్త హార్డ్గా మారి స్పిన్నర్లకు అనూకూలించే ఛాన్స్ ఉంది. ప్లడ్ లైట్ల కింద పిచ్ కాస్త సీమర్లకు అనుకూలించే ఛాన్స్ ఉంది. ఏదైమనప్పటికీ మధ్యాహ్నం పరిస్థితులు బ్యాటింగ్కు అనూకూలించే అవకాశమున్నందన.. టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది. చదవండి: World Cup 2023 IND Vs AUS Finals: ఈ సారి వరల్డ్కప్ టీమిండియాదే.. ఎలా అంటే? -
వన్డే వరల్డ్కప్ ఫైనల్.. ఆ తెలుగు హీరోలందరూ గ్యారంటీగా!
ప్రస్తుతం మన దేశంలో ఎక్కడ చూసినా క్రికెట్ ఫీవరే కనిపిస్తోంది. 2011 తర్వాత వన్డే ప్రపంచకప్లో టీమిండియా ఫైనల్కి వెళ్లడం, ఇదే ప్రపంచకప్లో టోర్నీలో అన్ని మ్యాచులు గెలవడం.. ఇలా చాలా శుభశకునాలు కనిపిస్తున్నాయి. దీంతో కప్ గ్యారంటీ అని అందరూ గట్టిగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ మ్యాచ్ కోసం తెగ ఎదురుచూస్తున్నారు. తెలుగు స్టార్ హీరోలు కూడా ఇందులో మినహాయింపు ఏం కాదు. సినిమా-క్రికెట్ని విడదీసి చూడలేం. రెండింటికి చాలా మంచి రిలేషన్స్ ఉంటాయి. అందుకు తగ్గట్లే చాలామంది తెలుగు హీరోలకు క్రికెట్ అంటే చాలా ఇష్టం కూడా. ఈ లిస్టులో ఫస్ట్ వెంకటేశ్ ఉంటాడు. ఐపీఎల్ మ్యాచ్ల దగ్గర నుంచి ఇండియా మ్యాచ్ల వరకు హైదరాబాద్లో జరిగే ప్రతి మ్యాచ్కి హాజరవుతుంటారు. ఈ వరల్డ్కప్లో అయితే మొన్నటికి మొన్న జరిగిన సెమీఫైనల్లో సందడి చేశారు. ఇప్పుడు ఫైనల్లో అంతకు మించిన ఎనర్జీతో సందడి చేయడం గ్యారంటీ. (ఇదీ చదవండి: Bigg Boss 7: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఔట్?) వెంకటేశ్ మాత్రమే కాదు మెగా పవర్స్టార్ రామ్చరణ్, కింగ్ నాగార్జున.. వరల్డ్కప్ ఫైనల్ చూసేందుకు అహ్మదాబాద్ రాబోతున్నారట. తెలుగు నుంచి ప్రస్తుతానికైతే ఈ ముగ్గురు హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. ఆదివారం మ్యాచ్ జరిగే సమయానికి ఈ లిస్టులో ఇంకా చాలామంది చేరుతారు. మిగతా ఇండస్ట్రీల నుంచి చూసుకుంటే బాలీవుడ్ స్టార్స్ ఆల్మోస్ట్ అటెండ్ అయిపోతారు. అందులో నో డౌట్. తమిళ్ నుంచి రజనీకాంత్, కమల్ హాసన్, మలయాళం నుంచి మోహన్ లాల్, హిందీ నుంచి అమితాబ్ బచ్చన్.. మ్యాచ్ కోసం గ్యారంటీగా స్టేడియానికి వస్తారని తెలుస్తోంది. దీనిబట్టి చూస్తే గ్రౌండ్లో టీమిండియా హడావుడి కంటే స్టాండ్స్లో స్టార్స్ హీరోల హడావుడే ఎక్కువ ఉండబోతుందనమాట. ఫైనల్ విషయానికొస్తే ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. దీన్ని చూసేందుకు ఇండియా-ఆస్ట్రేలియా ప్రధాన మంత్రులతో పాటు ఇప్పటివరకు వరల్డ్కప్ గెలుచుకున్న జట్ల కెప్టెన్స్ కూడా హాజరు కానున్నారట. ఇదిలా ఉండగా.. ఉదయం 7 గంటల నుంచే స్టార్స్పోర్ట్స్లో లైవ్ కవరేజీ ఉండనుంది. (ఇదీ చదవండి: హీరో ధనుష్ ఇంటికొచ్చిన పోలీసులు? కొడుకు ఆ తప్పు చేయడంతో!) -
Rohit & Cummins WC 2023 Final Poses: సిద్ధమైన మోదీ స్టేడియం.. ట్రోఫీతో కెప్టెన్లు (ఫొటోలు)
-
వరల్డ్కప్ తుది పోరు రేపే.. ఫైనల్స్లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉందంటే?
క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-ఆస్ట్రేలియా ప్రపంచకప్-2023 ఫైనల్కు రంగం సిద్దమైంది. అహ్మదాబాద్ వేదికగా మరో 24 గంటల్లో ఈ మెగా టోర్నీ తుది తుది సమరానికి తెరలేవనుంది. పది వరుస విజయాలతో ఊపు మీద ఉన్న టీమిండియా.. ప్రత్యర్ధి ఆస్ట్రేలియాను చిత్తు చేసి మూడోసారి విశ్వవిజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. ఇప్పటికే అహ్మదాబాద్కు చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్లో మునిగి తేలుతోంది. ఇక వన్డే వరల్డ్కప్ టోర్నీల్లో టీమిండియా ఎన్ని సార్లు ఫైనల్లో అడుగు పెట్టింది? ప్రదర్శన ఎలా ఉందో ఓ లుక్కేద్దాం. టీమిండియా ఎన్ని సార్లు ఫైనల్ చేరిందంటే? వన్డే ప్రపంచకప్ టోర్నీ ఫైనల్లో టీమిండియాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు ఈ ఏడాదితో కలిపి నాలుగు సార్లు వరల్డ్కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. 1987 వరల్డ్కప్ సెమీస్లో ఇంగ్లండ్ను ఓడించి తొలిసారి భారత్ ఫైనల్కు చేరింది. అనంతరం 2003 వరల్డ్కప్ సెమీస్లో కెన్యాను చిత్తు చేసి రెండో సారి ఈ మెగా టోర్నీ ఫైనల్లో భారత్ అడుగుపెట్టింది. ఆ తర్వాత 2011 వరల్డ్కప్ టోర్నీలో సెమీస్లో దాయాది పాకిస్తాన్ను ఓడించి ఫైనల్ బెర్త్ను భారత్ ఖరారు చేసింది. ఇక ఈ ఏడాది వరల్డ్కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్పై విజయం సాధించిన తుదిపోరుకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈ టోర్నీ కంటే ముందు మూడు సార్లు ఫైనల్కు చేరిన టీమిండియా రెండు సార్లు విశ్వవిజేతగా నిలిచింది. కపిల్ డేవిల్స్ అద్బుతం.. 1987 వన్డే వరల్డ్కప్లో అండర్ డాగ్స్గా బరిలోకి దిగిన భారత జట్టు.. తొలిసారి ఈ మెగా టోర్నీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఫైనల్కు చేరడమే కాకుండా పటిష్ట వెస్టిండీస్ను ఓడించి వరల్డ్ ఛాంపియన్స్గా కపిల్ దేవ్ సారథ్యంలోని టీమిండియా నిలిచింది. ఈ మ్యాచ్లో బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచి భారత్కు తొలి ప్రపంచకప్ను అందించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 54.4 ఓవరల్లో కేవలం 183 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో కృష్ణమాచారి శ్రీకాంత్(38) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. అనంతరం 184 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. భారత బౌలర్ల దాటికి 140 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లలో మదన్ లాల్, మొహిందర్ అమర్నాథ్ తలా మూడు వికెట్లు పడగొట్టి కరేబియన్ల పతనాన్ని శాసించారు. వీరిద్దరితో పాటు సంధు రెండు, బిన్నీ, కపిల్ దేవ్ చెరో వికెట్ సాధించారు. ఆసీస్ చేతిలో ఘోర పరాభావం.. 2003 వరల్డ్కప్లో సౌరవ్ గంగూలీ సారథ్యంలోని టీమిండియా రన్నరప్గా నిలిచింది. జోహన్నెస్బర్గ్ వేదికగా ఫైనల్లో 125 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 359 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్(140 నాటౌట్) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. పాంటింగ్తో పాటు డామియన్ మార్టిన్(88 నాటౌట్), ఆడమ్ గిల్క్రిస్ట్(57) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో హర్భజన్ సింగ్ ఒక్కడే రెండు వికెట్లు సాధించాడు అనంతరం 360 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 234 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో సెహ్వాగ్ ఒక్కడే 81 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 82 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. దీంతో రెండో వరల్డ్కప్ ఫైనల్ను టీమిండియా ఓటమితో ముగించింది. మిస్టర్ కూల్ మాయ.. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. వాంఖడే వేదికగా జరిగిన ఫైనల్లో శ్రీలంకను చిత్తుచేసిన ధోని సారథ్యంలోని భారత జట్టు.. 28ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మరోసారి వరల్డ్కప్ ట్రోఫిని ముద్దాడింది. ఈ ఫైనల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 6 వికెట్లకు 274 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో మహేలా జయవర్ధనే (88 బంతుల్లో 103, 13 ఫోర్లు) సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. హర్భజన్ సింగ్ ఒక్క వికెట్ సాధించాడు. అనంతరం 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. తొలి ఓవర్ రెండో బంతికే డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (0) డకౌట్ అయ్యాడు. మరికాసేపటికే సచిన్ టెండూల్కర్ (18) అవుటయ్యాడు. దాంతో భారత్ 31 పరుగులకే ఓపెనర్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో విరాట్ కోహ్లి (35)తో జతకట్టిన గౌతం గంభీర్ జట్టును నడిపించాడు. అయితే క్రీజులో నిలదొక్కుకున్న కోహ్లిని దిల్షాన్ పెవిలియన్కు పంపాడు. ఈ క్రమంలో ఎవరూ ఊహించని విధంగా యువరాజ్ స్ధానంలో మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్కు వచ్చాడు. ధోని క్రీజులోకి వచ్చే సమయానికి భారత్ విజయానికి 170 బంతుల్లో 163 పరుగులు చేయాల్సి ఉంది. గంభీర్, ధోని అద్భుతంగా ఆడుతూ భారత్ ను విజయానికి చేరువ చేశారు. అయితే 97 పరుగులతో సెంచరీకి చేరువలోన్న గౌతం గంభీర్ క్లీన్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత ధోని సిక్స్ కొట్టి జట్టును వరల్డ్ ఛాంపియన్స్గా నిలిపాడు. -
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నిలిపివేయాలని బెదిరింపులు
అహ్మదాబాద్: ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోమారు బెదిరింపులకు పాల్పడ్డాడు. క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ను నిలిపివేయాలని హెచ్చరిస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లు, 2002 నాటి గుజరాత్ అల్లర్ల గురించి పేర్కొంటూ మతపరంగా ఓ వర్గం ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై భారత్ అభిప్రాయాన్ని కూడా ప్రశ్నించాడు. అమెరికా ఆధారిత నిషేధిత సంస్థ సిక్ ఫర్ జస్టిస్ సంస్థకు గురుపత్వంత్ సింగ్ నాయకునిగా ఉన్నాడు. భారత్కు వ్యతిరేకంగా ఈయన హెచ్చరికలు చేయడం ఇదే మొదటి సారి కాదు. ప్రధాని నరేంద్ర మోదీపై హెచ్చరికలు చేస్తూ గత నెలలో కూడా ఓ వీడియోను విడుదల చేశాడు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నుంచి ప్రధాని గుణపాఠం నేర్చుకోవాలని పేర్కొన్నాడు. ఇండియాలో కూడా ఇలాంటి యుద్ధం ప్రారంభమైతుందని బెదిరించాడు. సెప్టెంబరులో భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా కూడా పన్నూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇరుదేశాల మధ్య శత్రుత్వాన్ని పోత్రహించే చర్యలకు పాల్పడినందుకు ఆయనపై కేసు కూడా నమోదైంది. అహ్మదాబాద్ వేదికగా క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మొతేరా స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్కి దేశ విదేశాల నుంచి ప్రముఖులతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ఉపప్రధాని రిచర్డ్ మార్లెస్ కూడా హాజరవనున్నారు. ఇదీ చదవండి: దక్షిణ గాజాను వీడండి.. పాలస్తీనాకు ఇజ్రాయెల్ హెచ్చరికలు
Pagination
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
జాక్వెలిన్ ఫెర్నాండేజ్తో పేపర్ బాయ్, అరి దర్శకుడు?
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
భారత్లో 10 లక్షలు దాటిన ఉబర్ డ్రైవర్ల సంఖ్య
శ్రీరామనవమి, హనుమాన్ జయంతి మనం చేయలేదా?: రేవంత్
విరాట్ కోహ్లి సింగిల్ హ్యాండ్ సిక్స్.. వీడియో వైరల్
'మాత్రు' సినిమా పోస్టర్ లాంచ్ చేసిన విజయేంద్ర ప్రసాద్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (09-05-2024)
హీరోయిన్తో స్టార్ క్రికెటర్ డ్యాన్స్.. నువ్వు ఆల్రౌండరయ్యా సామీ! (ఫోటోలు)
కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై ప్రొ.వసుంధర సంచలన వ్యాఖ్యలు
జమైకా నుంచి దుబాయ్ విమానం వెనక్కి.. కారణం ఇదే
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
- ఏడేళ్ల తర్వాత సీక్వెల్.. 'మాయావన్' టీజర్ విడుదల
- కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
Advertisement