ప్రధాన పార్టీల్లో ఆగని అలకలు | Sakshi
Sakshi News home page

ప్రధాన పార్టీల్లో ఆగని అలకలు

Published Fri, Apr 19 2024 2:10 AM

- - Sakshi

నామినేషన్‌కు అభ్యర్థులు సిద్ధం

22న కాంగ్రెస్‌ అభ్యర్థి సుగుణ..

24న బీజేపీ అభ్యర్థి గోడం నగేశ్‌..

ఇదేరోజు బీజేపీ రెబెల్‌గా సోయం?

ముఖ్యనేతల రాకతోనైనా వీడేనా?

సాక్షి, ఆదిలాబాద్‌: ప్రధాన పార్టీల ఎంపీ అభ్యర్థులు ఖరారై రోజులు గడిచాయి. కాంగ్రెస్‌, బీజేపీ నుంచి టికెట్‌ ఆశించి దక్కని నేతలు అలక బూనారు. కొందరు పార్టీ కూడా మారారు. నామినేషన్‌ ప్రక్రియ మొదలైంది. భంగపడ్డ నేతలు పార్టీకి వ్యతిరేకంగా అడుగు వేస్తారా? కలిసి నడుస్తారా? అనేది కొద్దిరోజుల్లోనే తేలనుంది. ఇక టికెట్‌ దక్కించుకున్న అభ్యర్థులు నామినేషన్‌ వేసేందుకు రెడీ అవుతున్నారు.

‘హస్తం’ నేతలు అలక వీడేదెప్పుడో!
ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్లోని బీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో హస్తం నాయకత్వం కనిపిస్తోంది. తాజాగా మాజీ ఎంపీ సముద్రాల వేణుగోపాలాచారి, బోథ్‌ మాజీ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు. కాగా, టిక్కెట్‌ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్‌, ఏఐసీసీ సభ్యుడు నరేశ్‌జాదవ్‌ ఇంకా ఎక్కడా ప్రచారంలో పాల్గొనడంలేదు.

ఈనెల 22వ తేదీన కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్‌ వేయనున్నారు. ఇదేరోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఆదిలాబాద్‌ పర్యటనకు రానున్నారు. జిల్లా కేంద్రంలోని డైట్‌ మైదానంలో బహిరంగసభకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్య నేతలతో సీఎం సమావేశం కానుండగా, అప్పటికైనా నేతలు అలక వీడుతారో.. లేదో వేచి చూడాలి.

కమలంలో ‘తిరుగుబాటు’ తప్పదా?
బీజేపీ గోడం నగేశ్‌కు టికెట్‌ ఇచ్చిన తర్వాత పార్టీలో అసమ్మతి చోటుచేసుకుంది. ఆశావహుల్లో అసంతృప్తి నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా బోథ్‌ మాజీ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు కాంగ్రెస్‌లో చేరారు. జెడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరారు. మాజీ ఎంపీ రాథోడ్‌ రమేశ్‌ సైలెంట్‌గా ఉన్నారు. కాగా, ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్‌ ఈనెల 24న నామినేషన్‌ వేస్తున్నారు.

ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్‌సాయి ఆరోజు ఆదిలాబాద్‌కు రానున్నారు. పార్టీ టికెట్‌ ఆశించిన సిట్టింగ్‌ ఎంపీ సోయం బాపూరావుకు పార్టీలో నిరాశ ఎదురు కాగా బీజేపీ రెబెల్‌గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. 24న ఆయన కూడా నామినేషన్‌ వేయనున్నట్లు తెలుస్తోంది.

బీఆర్‌ఎస్‌ బీ–ఫాం అందుకున్న సక్కు
బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఆత్రం సక్కు పేరు ఖరారై చాలా రోజులైంది. ఓ దశలో అభ్యర్థిని మార్చుతారనే ప్రచారం జరిగింది. ఈ పరిస్థితుల్లో కొంత గందరగోళం కనిపించింది. రెండ్రోజుల క్రితం మాజీ మంత్రి కేటీఆర్‌ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొనగా అభ్యర్థి మార్పు లేదని స్పష్టమైంది. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మాజీ సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ఆత్రం సక్కు బీ–ఫాం అందుకున్నారు. ఈ నెల 23న లేదా 24వ తేదీన ఆయన నామినేషన్‌ వేయనున్నట్లు సమాచారం.

ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల..
తొలిరోజు రెండు నామినేషన్లు దాఖలు
పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి గురువారం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఉదయం 11గంటలకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజర్షిషా నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగనున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం మొదలైంది. తొలిరోజు ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం జామిడి గ్రామానికి చెందిన రాథోడ్‌ సుభాష్‌ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు.

అలాగే అలయెన్స్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ (ఆధార్‌) పార్టీ తరఫున ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగాదేవిపాడు గ్రామానికి చెందిన మాలోత్‌ శ్యామ్‌లాల్‌నాయక్‌ నామినేషన్‌ వేశారు. వీరు సాదాసీదాగా అనుచరులతో వచ్చి కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ ఛాంబర్‌లో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రాజర్షిషాకు నామినేషన్‌ పత్రాలు అందజేశారు.

పకడ్బందీ బందోబస్తు
నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా పోలీసులు పకడ్బందీ బందోబస్తు నిర్వహించారు. వంద మీటర్ల పరిధి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశా రు. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 3గంట ల వరకు నామినేషన్ల స్వీకరణ ఉండగా కలెక్టరేట్‌కు వెళ్లే రోడ్డుమార్గాన్ని మూసివేసి ట్రా ఫిక్‌ను మళ్లించారు. నామినేషన్లు వేసేందుకు వచ్చిన అభ్యర్థుల వాహనాలు క్షుణ్ణంగా తని ఖీ చేసి ఐదుగురినే లోనికి అనుమతించారు.

గడవు ముగిసేవరకూ ముగ్గురు సీఐలు అ క్కడే విధులు నిర్వహించారు. ఆదిలాబాద్‌ డీ ఎస్పీ జీవన్‌రెడ్డి బందోబస్తును పరిశీలించి పలు సూచనలు చేశారు. మీడియా సెంటర్‌ను వద్ద వంద మీటర్ల పరిధిలో ఏర్పాటు చేశారు.

ఇవి చదవండి: TS: డూప్లికేట్ ఓట్లపై ఫోకస్‌.. ఈసీ కీలక నిర్ణయం

Advertisement
Advertisement