కైలాస్నగర్: జిల్లాలో ఎండల తీవ్రత పెరిగింది. ఉక్కపోత, వడగాలులతో జనం బెంబేలెత్తుతున్నా రు. ఉపశమనం పొందేందుకు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను వినియోగిస్తున్నారు. వీటి వాడకం పెరగడంతో విద్యుత్ వినియోగ పరిమితి దాటిపోయి గృహజ్యోతి లబ్ధిదారుల సంఖ్య తగ్గుతోంది. ఫలితంగా ప్రభుత్వం నుంచి అందే రాయితీ వారికి దూరమవుతోంది. గడిచిన మూడు నెలల్లో గృహజ్యోతి లబ్ధిదారుల సంఖ్య క్రమంగా తగ్గడం పెరిగిన విద్యుత్ వినియోగానికి నిదర్శనంగా నిలుస్తోంది.
పెరిగిన విద్యుత్ వినియోగం
జిల్లాలో మార్చితో పోల్చితే ఏప్రిల్, మే నెలల్లో విద్యుత్ వినియోగం పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు ఇప్పటికే 45 డిగ్రీలకు చేరువయ్యాయి. వడ గాలులు సైతం వీస్తున్నాయి. ఉదయం 10 దాటితే ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను నాన్స్టాప్గా వినియోగిస్తున్నారు. గతేడాది మే నెలలో జిల్లా విద్యుత్ కోటా రోజుకు 1.257 మిలియన్ యూనిట్లు ఉండగా 1.066 మిలియన్ యూనిట్ల విద్యుత్ను వినియోగించారు. ఈ ఏడాది మే నెల రోజు వారి కోటా 1.28 మిలియన్ యూనిట్లు కాగా ప్రస్తుతం 1.59 మిలియన్ యూనిట్ల విద్యుత్ను వినియోగిస్తున్నారు. గతేడాదితో పోల్చితే 15 మిలియన్ యూనిట్ల విద్యుత్ను అధికంగా వాడుతున్నట్లు అధికారులు తెలిపారు.
తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
జిల్లాలో 2,73,934 విద్యుత్ కనెక్షన్లుండగా తెల్లరేషన్ కార్డు కలిగి ఉండి గృహజ్యోతి కింద లబ్ధి పొందే వారు 1,04,157 మంది ఉన్నట్లుగా విద్యుత్శాఖ అఽధికారులు గుర్తించారు. తాము అధికారంలోకి వస్తే 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వారికి ఉచితంగా అందిస్తామని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ వెంటనే దాన్ని అమలు చేస్తూ అర్హులైన వారికి జీరో బిల్లులు జారీ చేశారు. కొంత మంది కనెక్షన్ల వివరాలు తప్పుగా రాయడం, ఆధార్ వివరాలు జత చేయకపోవడం వంటి కారణాలతో లబ్ధి పొందడం లేదు. తాజాగా పెరిగిన ఎండలతో గతంలో జీరో బిల్లులు పొందిన లబ్ధిదారులు సర్కారు రాయితీకి దూరమవుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నెలకు 200 యూనిట్లు వినియోగించే వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఈ పరిమితి దాటితే మొత్తం బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. పెరిగిన విద్యుత్ వినియోగంతో ఈ లబ్ధిదారుల సంఖ్య తగ్గుతోంది. గడిచిన మూడు నెలల్లో 42,797 మంది తగ్గిపోయారు. ఏప్రిల్లో 3,611 మంది తగ్గిపోగా ఈ నెలలో 8వ తేదీ వరకు 38,772 మందికి జీరో బిల్లులు జారీ చేశారు. ఇంకా బిల్లులు జారీ చేయాల్సి ఉన్నందున ఎంత మంది తగ్గుతారనేదీ వెల్లడి కాలేదు. అయితే వారికి వచ్చే రాయితీ మాత్రం 8 రోజుల్లోనే రూ.1.54 కోట్లకు చేరడంతో నెలాఖరు వరకు రూ.3కోట్లకు చేరే అవకాశమున్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. జీరో బిల్లులు రానటువంటి వారంతా బిల్లులు చెల్లించకతప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
జిల్లాలోని గృహజ్యోతి లబ్ధిదారులు,
వారి రాయితీ సొమ్ము
లబ్ధిదారులు రాయితీ సొమ్ము
(రూ.కోట్లలో)
మార్చి 81,569 రూ.2.20
ఏప్రిల్ 77,958 రూ.2.82
మే 38,772 రూ.1.54
(ఈనెల 8వ తేదీ వరకు)
విద్యుత్ పొదుపుగా వాడుకోవాలి
గృహజ్యోతి కింద లబ్ధి పొందాలంటే వినియోగదారులు విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలి. ఎండల తీవ్రత కారణంగా అధికంగా వినియోగించడంతో 200 యూనిట్ల పరిమితి దాటి లబ్ధిదారుల సంఖ్య తగ్గుతోంది. ప్రభుత్వ రాయితీ సొమ్ము మాత్రం పెరుగుతోంది. లబ్ధిదారులు ప్రభుత్వ రాయితీ పొందాలంటే రోజుకు సరాసరి 6.67 యూనిట్లు మాత్రమే వినియోగించాలి. 25 రోజులకు 175 యూనిట్లు వినియోగించినా నెల సరాసరి వినియోగం 210 యూనిట్లు అవుతుంది. అలాంటి వారికి గృహజ్యోతి వర్తించదు. 25 రోజులకు 160 యూనిట్లు వినియోగిస్తే నెలకు 190 యూనిట్లుగా నమోదై పథకం కింద లబ్ధి పొందవచ్చు. వినియోగదారులు విషయాన్ని గమనించి ప్రభుత్వ రాయితీని సద్వినియోగం చేసుకోవాలి.
– జేఆర్.చౌహాన్, విద్యుత్ శాఖ ఎస్ఈ
జిల్లాలో ఈ నెల 1 నుంచి నమోదైన
విద్యుత్ వినియోగం వివరాలు
తేదీ విద్యుత్ వినియోగం
(మిలియన్ యూనిట్లలో)
మే 1 1.565
2 1.571
3 1.582
4 1.602
5 1.509
6 1.601
7 1.503
8 1.605