ఏటీఎల్‌ వినియోగంలో ఏపీ ముందంజ | Sakshi
Sakshi News home page

ఏటీఎల్‌ వినియోగంలో ఏపీ ముందంజ

Published Sat, Apr 20 2024 5:11 AM

AP leads in ATL usage - Sakshi

యునిసెఫ్, టీసీఎస్‌ బృందాల ప్రశంస 

సాక్షి, అమరావతి:  దేశవ్యాప్తంగా ‘అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్స్‌ (ఏటీఎల్‌)’ సద్వినియోగం చేసు­కోవడంలో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉందని యునిసెఫ్, టీసీఎస్‌ ప్రతినిధులు ప్రశంసించారు. శుక్రవారం న్యూఢిల్లీ, హైదరాబాద్‌ నుంచి వచ్చిన యునిసెఫ్, టీసీఎస్‌ ప్రతినిధులు ఎన్టీఆర్‌ జిల్లాలో మొవ్వ, పెనమలూరులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలను సందర్శించారు. దీన్లోభాగంగా అటల్‌ టింకరింగ్‌ ల్యా­బ్స్, హబ్, స్పోక్స్‌ మోడల్‌తో పాటు ప్రభుత్వం అమలు చేసిన స్టెమ్‌ ఆధారిత కార్యక్రమాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విజయవాడలో పాఠశాల విద్య కమిషనర్‌ ఎస్‌.సురేశ్‌ కుమార్‌తో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 713 అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లను హబ్, స్పోక్‌ మోడల్‌గా రూపొందించామన్నారు. విద్యా­ర్థులను సాంకేతికత విజ్ఞానం వైపు ప్రోత్సహించడానికి ‘సంకల్పం’ ప్రాజెక్ట్‌ను అమ­లు చేస్తున్నామన్నారు. అటల్‌ టింకరింగ్‌ మారథాన్, సీడ్‌ ది ఫ్యూచర్, సైన్స్‌ ఫెయిర్, ఇన్‌స్పైర్‌ తదితర పోటీల్లో విద్యార్థులు అద్భుత ప్రతిభ చూపుతున్నారన్నారు. ఇలాంటి సమయంలో అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్స్‌ పనితీరుపై యునిసెఫ్‌ డాక్యుమెంటరీ రూపొందించడం సంతోషంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో న్యూఢిల్లీ నుంచి వచ్చిన యునిసెఫ్‌ ప్రతినిధు­లు అరేలియా ఆర్డిటో (చీఫ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌), ప్రమీల (విద్యా నిపుణురాలు), హైదరాబా­దు నుంచి శేషగిరి మధుసూదన్‌ (విద్యా నిపుణులు), శిఖా రాణా (విద్యాధికారి), టీసీఎస్‌ నుంచి విమల్, విపుల్, శ్రీనివాస్‌ విశ్వ­నాథ, ఏపీ యునిసెఫ్‌ కన్సల్టెంట్‌ టి.సుదర్శన్, రాష్ట్ర నోడల్‌ అధికారి డా.జిఆర్‌ భాగ్యశ్రీ, సమ­గ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.ప్రతాప్‌ రెడ్డి తదితరులున్నారు. 

Advertisement
Advertisement