6జీ టెక్నాలజీపై పరిశోధనకు ప్రతిష్టాత్మక కంపెనీల జట్టు | Sakshi
Sakshi News home page

6జీ టెక్నాలజీపై పరిశోధనకు ప్రతిష్టాత్మక కంపెనీల జట్టు

Published Sat, Feb 24 2024 11:24 AM

Nokia And IISc Partner To Research 6G Technology - Sakshi

టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో సాంకేతిక పరికరాలను మరింత సమర్థంగా తయారుచేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే వాటిలో చాలామార్పులు చేస్తున్నారు. భవిష్యత్తు అవసరాలను తీర్చేలా డేటాలోనూ, దాని వేగంలోనూ మరిన్ని పరిశోధనలు జరగాలని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం వాడుతున్న 5జీకి బదులు 6జీపై ఎన్నో సంస్థలు ఇప్పటికీ పరిశోధనలు చేస్తున్నాయి. 

తాజాగా సమాజంపై నేరుగా ప్రభావం చూపనున్న 6జీ సాంకేతికత, 6జీ వినియోగంపై సంయుక్తంగా పరిశోధన చేసేందుకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ), నోకియా భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా బెంగళూరులో 6జీ పరిశోధనలకు అవసరమయ్యే ల్యాబ్‌ను సైతం ప్రారంభించారు. రేడియో టెక్నాలజీస్‌, ఆర్కిటెక్చర్‌, ఎయిర్‌ ఇంటర్‌ఫేస్‌లో మెషీన్‌ లెర్నింగ్‌ యాప్‌ అప్లికేషన్‌.. ఈ మూడు విభాగాల్లో పరిశోధనలు చేస్తారని నోకియా తెలిపింది. 

ఐఐఎస్‌సీతో జట్టు కట్టడం ద్వారా భారత్‌లో 6జీ సాంకేతికతపై తాము ఇచ్చిన హామీని మరింత ముందుకు తీసుకెళ్లనున్నామని నోకియా పేర్కొంది. ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ పరిశోధనలు ఉంటాయని, అయితే భారత్‌లో సమస్యలకు పరిష్కారం చూపేందుకే ప్రాధాన్యం ఇస్తామని వివరించింది.

ఇదీ చదవండి: 2024లో జీతం ఎంత పెరుగుతుందో తెలుసా..?

ఇంధన సామర్థ్య కమ్యూనికేషన్‌ వ్యవస్థలు, నెట్‌వర్క్‌ల సామర్థ్యాన్ని మెరుగపర్చడం, ఏఐ వినియోగం, రవాణా భద్రతను మెరుగుపర్చడం, ఆరోగ్య సంరక్షణ, విద్య వ్యాప్తి విస్తరణ నిమిత్తం నెట్‌వర్క్‌ సెన్సార్‌ సాంకేతికతలను అభివృద్ధి చేయడం లాంటి వాటిపై ఈ పరిశోధనల సాగే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Advertisement
Advertisement