ఎర్రవల్లిచౌరస్తా: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా కొనసాగాయి. పంచాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీమాన్ సుదర్శన్ నారాయన్ ఆధ్వర్యంలో శిష్య బృందం మూడో రోజు ప్రత్యేక పూజలు చేశారు. సుప్రభాతసేవ, యాగశాల ఆరాదనలు, మూల మంత్రమూర్తి హోమాలు, ధన్వంతరి యాగం, సీతారాములకు నవకలశ స్నపనం(అహిషేకం) వంటి పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్రాజు, పాలక మండలి సభ్యులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
నేడు బీచుపల్లిలో సీతారాముల కల్యాణం..
బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని బుధవారం ఉదయం 10 గంటలకు సీతారాముల కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్ రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆలయ చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై రాములోరి కల్యాణ వేడుకను కనులారా తిలకించాలని కోరారు.