శివాజీనగర: దిన పత్రికల్లో బీజేపీ గురించి అవమానకరంగా ప్రకటనలు ఇచ్చిన కేపీసీసీ, కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్పై బీజేపీ బృందం ఫిర్యాదు చేసింది. బృందం శుక్రవారం ఈ మేరకు నృపతుంగ రోడ్డులో ఉన్న ఎన్నికల కమిషన్ కార్యాలయానికి భేటీ చేసి ఫిర్యాదు చేసింది. కన్నడ, ఇంగ్లీష్ డైలీ పత్రికల్లో పరువు నష్టం కలిగించే ప్రకటనలను చేసిన కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సంబంధించిన అధికారులకు ఆదేశించాలని విన్నవించారు. ఈ బృందంలో ఎమ్మెల్యే రవి సుబ్రమణ్య, న్యాయ విభాగపు రాష్ట్ర సంచాలకుడు వసంత్కుమార్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కర్ణాటక జిందాబాద్ అనాలి
మండ్య: ప్రధాని మోదీకి జిందాబాద్ కొట్టేవారు మనుషులే కాదని, ప్రతి ఒక్కరూ కర్ణాటక జిందాబాద్ అనాలని విశ్రాంత ప్రాధ్యాపకుడు బీ.పి మహేష్ చంద్రగురు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మండ్య నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...రాజ్యాంగాన్ని టచ్ చేస్తే రక్తపాతం జరుగుతుందని, తాము ఎప్పటికి గులాంగిరి ఒప్పుకోమన్నారు. రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ కులమతాల మధ్య చిచ్చుపెడుతోందని మండిపడ్డారు.