● కలెక్టర్ వెంకటేశ్ దోబ్రే
ఆసిపాబాద్: లోకసభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు 753 బ్యాలెటింగ్ యూనిట్లు కేటాయించినట్లు కలెక్టర్ వెంకటేశ్ దోబ్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని వేర్హౌస్లో భద్రపరచిన ఈవీఎంలను శుక్రవారం అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, దాసరి వేణు, ఆర్డీవోలు లోకేశ్వర్రావు, కాశబోయిన సురేశ్తో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు. ఓటింగ్ పరికరాలు కేటాయించారు. తొలుత ర్యాండమైజేషన్ నిర్వహించి, అనంతరం కేటాయించిన ఈవీఎంలకు స్కానింగ్ నిర్వహించారు. జిల్లాలోని ఆసిఫాబాద్ నియోజకవర్గానికి 391 బ్యాలెటింగ్ యూనిట్లు, 391 కంట్రోల్ యూనిట్లు, 448 వీవీ ప్యాట్లు, సిర్పూర్ నియోజకవర్గానికి 352 బ్యాలెటింగ్ యూనిట్లు, 352 కంట్రోల్ యూనిట్లు, 403 వీవీ ప్యాట్లు కంటైనర్ల ద్వారా భారీ పోలీస్ బందోబస్తు మధ్య కేటాయించనున్నట్లు తెలిపారు. ఆసిఫాబాద్ నియోజకవర్గానికి సంబంధించినవి జిల్లా కేంద్రంలోని పీటీజీ పాఠశాలలో, సిర్పూర్ నియోజకవర్గానికి చెందినవి కాగజ్నగర్ పట్టణంలోని సెయింట్ క్లారెట్ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలలో భద్రపరచనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో పాటించాల్సిన నియమ నిబంధనలు, మార్గదర్శకాలను అధికారులకు వివరించారు. అధికారులు, సిబ్బంది ఎన్నికల నిర్వహణకు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, ఎన్నికలు పూర్తయ్యే దాకా రాజకీయ పార్టీలు సహకరించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచార ఖర్చు నమోదు మార్గదర్శకాలను వివరించారు. పోలింగ్ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించారు. ఓటర్లు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. కలెక్టర్ వెంట తహసీల్దార్లు, ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది, డాటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారు.