● సూపరింటెండెంట్ తనిఖీలో బహిర్గతం
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని పీజీ హాస్టల్, హౌస్సర్జన్ హాస్టల్స్లో ఇతరులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సోమవారం ఆయా హాస్టల్స్ను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి. వెంకటరంగారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి వైద్య విద్యార్థుల గురించి ఆరా తీశారు. ఈ సమయంలో అక్కడ వైద్య విద్యార్థులు కాకుండా ఇతరులు ఉంటున్నట్లు గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనధికారికంగా వసతి గృహాల్లో ఉంటున్న వారి వివరాలు సేకరించి వెంటనే వారు ఖాళీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎస్ఆర్ఎంవోను ఆదేశించారు. హౌస్సర్జన్ క్వార్టర్స్ దగ్గర పార్కింగ్ స్థలంలో వాహనాలు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. క్వార్టర్స్కు ఎవరు వస్తున్నారన్న విషయాలపై నిఘా పెట్టాలని సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించారు. ఆసుపత్రిలోని పారిశుధ్య సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. ప్రతిరోజూ ఆసుపత్రి ఆవరణలో పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని శానిటేషన్ సూపర్వైజర్లను ఆదేశించారు. ఆయన వెంట సీఎస్ఆర్ఎంవో డాక్టర్ బి. వెంకటేశ్వరరావు, ఆర్ఎంవో డాక్టర్ వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ శివబాల నాగాంజన్, డాక్టర్ కిరణ్కుమార్ ఉన్నారు.