నేను యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని: టాప్‌ హీరోయిన్‌ | Sakshi
Sakshi News home page

నేను యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని: టాప్‌ హీరోయిన్‌

Published Tue, Apr 23 2024 4:49 PM

Sapthami Gowda Comments On UPSC Exam - Sakshi

'కాంతార' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్‌ సప్తమి గౌడ. ఈ చిత్రంలో లీల పాత్రలో అద్భుతంగా నటించిన సప్తమి గౌడకు ఆ తర్వాత  వరుస అవకాశాలు వచ్చాయి. ద వ్యాక్సిన్‌ వార్‌, యువ, కాళి, కాంతార ప్రీక్వెల్‌ తదితర చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉన్న ఆమె హీరో నితిన్‌ సరసన 'తమ్ముడు'లో కూడా ఛాన్స్‌ దక్కించుకుంది. ఈ సినిమా కోసం ఆమె గుర్రపు స్వారీ కూడ నేర్చుకుంది. తాజాగా యూపీఎస్సీ ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఆమె పలు ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.

బెంగళూరులో సివిల్‌ ఇంజనీరింగ్‌ చదవును పూర్తి చేసిన సప్తమి గౌడకు మొదట యూపీఎస్సీ సాధించి పోలీస్‌ శాఖలో రాణించాలని కోరిక ఉండేదట.. దీనికి ప్రధాన కారణం తన తండ్రి కర్ణాటక పోలీస్‌ శాఖలో ఉన్నతాధికారిగా ఉండటమేనని ఆమె చెప్పింది. 'మా నాన్న మాదిరి పోలీస్‌ విభాగంలో ఉండాలని నాకు ఆశ ఉండేది. దీంతో నా  చిన్నతనం నుంచే చదువులోనూ, క్రీడల్లోనూ రాణించాను. చదువులో చాలా ముందు ఉండేదాన్ని. నేను యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే, గ్యారెంటీగా పాస్ అయ్యేదానిని.. కానీ, ఇప్పుడు అది సాధ్యం కాదు. దానికి చాలా ఫోకస్ కావాలి. అనుకోకుండా నటిని అయ్యాను.' అని ఆమె చెప్పింది.

ఐదేళ్ల వయసులోనే సప్తమి గౌడ ఈత శిక్షణ పొందింది. 2006 నుంచి 2010 వరకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొన్న సప్తమి గౌడ ఎన్నో రజత, కాంస్య, బంగారు పతకాలను కైవసం చేసుకుంది. సప్తమి గౌడ 2020లో విడుదలైన దునియా సూరి 'పాప్‌కార్న్ మంకీ టైగర్'చిత్రంతో తన నటనను ప్రారంభించింది. దీనికిగాను 2021లో ఉత్తమ తొలి నటిగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డును గెలుచుకుంది.  కాంతార చిత్రం  తరువాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా ఆమె సత్తా చాటుతుంది.

Advertisement
Advertisement