షాకింగ్‌: టీ ఇవ్వలేదనే కోపంతో ఆపరేషన్‌ మధ్యలో వెళ్లిపోయిన డాక్టర్‌ | Sakshi
Sakshi News home page

షాకింగ్‌: టీ ఇవ్వలేదనే కోపంతో ఆపరేషన్‌ మధ్యలో వెళ్లిపోయిన డాక్టర్‌

Published Wed, Nov 8 2023 12:50 PM

Angry At Not Served Tea Nagpur Doctor Leaves Surgery Midway - Sakshi

ముంబై: వైద్యులను దేవుడితో పోలుస్తున్నారు. ఆ దేవుడు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మను ఇస్తారని అంటుంటారు. కేవలం డబ్బుల కోసమే కాకుండా, మానవతా హృదయంతో తన వద్దకు వచ్చిన వారి ప్రాణాలను రక్షిస్తున్న ఘనత వైద్యులకే దక్కుతుంది. అయితే ఇటీవల పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుప్రతులనే తేడా లేకుండా వైద్యవవస్థ వ్యాపారంగా మారింది.

అలాంటి ఓ షాకింగ్‌ ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వృత్తి ధర్మం మరిచిన ఓ వైద్యుడు రోగిపట్ల నిర్లక్ష్యంగా వ్యహరించాడు. డ్యూటీ చేస్తుండగా తనకు టీ ఇవ్వలేదని ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి మధ్యలో వెళ్లిపోయాడు సదరు వైద్యుడు. నాగ్‌పూర్‌లోని మౌడ మండల ప్రభుత్వ ఆసుపత్రిలో నవంబర్‌ 3న జరగ్గా.. ఆలస్యంగా వెలుగుచూసింది. 

వివరాల ప్రకారం.. మౌడ ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం ఎనిమిది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో నలుగురు మహిళలకు ఆపరేషన్‌ చేసిన వైద్యుడు తేజ్‌రంగ్‌ భలవి.. మిగిలిన వారికి కూడా సర్జరీ చేసేందుకు ముందుగా అనస్తీషియా ఇచ్చాడు. అయితే ఆసుపత్రి సిబ్బందిని ఓ కప్‌ చాయ్‌ తీసుకురావాలని వైద్యుడు కోరాడు. కానీ ఎవరూ అతనికి టీ తీసుకోని రాలేదు. దీంతో ఆగ్రహం చెందిన డాక్టర్‌ భల్వాయి.. మిగతా నలుగురికి కు.ని శస్త్రచికిత్స చేయకుండానే ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి వెళ్లిపోయాడు. 

ఈ విషయంపై వెంటనే ఆసుపత్రి సిబ్బంది జిల్లా వైద్యాధికారికి ఈ విషయం తెలపగా.. ఉన్నపళంగా మరో వైద్యుడిని మహిళలకు సర్జరీలు చేసేందుకు పంపించారు. అనంతరం క్టర్‌ భలవి ప్రవర్తనపై జిల్లా యంత్రాంగం సీరియస్‌ అయ్యింది. ముగ్గురు సభ్యులతో కూడిని కమిటీని ఏర్పాటు చేసి వైద్యుడిపై విచారణ చేపట్టినట్లు నాగ్‌పూర్ జిల్లా పరిషత్ సీఈవో సౌమ్య శర్మ తెలిపారు. ఇది చాలా తీవ్రమైన విషయమని, నివేదిక వచ్చిన తర్వాత అతనిపై చర్యలు తీసుకుంటామన్నారు. 
చదవండి: వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు

Advertisement
Advertisement