దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది | Sakshi
Sakshi News home page

దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది

Published Sun, May 5 2024 3:35 AM

దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది

● బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌ ● నియోజకవర్గంలో విస్తృత ప్రచారం

పెద్దపల్లిరూరల్‌: దీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్‌ అవినీతి, కుటుంబ పాలనను అంతం చేసి పదేళ్లలో ప్రధానమంత్రి మోదీ చేస్తున్న నీతివంతమైన పాలనను చూసి ప్రజలు మళ్లీ ఆయనే ప్రధాని కావాలని కోరుకుంటున్నారని, దేశమంతా మోదీ ప్రభంజనం వీస్తోందని బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్‌ అభ్యర్థి గో మాస శ్రీనివాస్‌ అన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్‌, రాష్ట్ర నాయకులు చిలారపు పర్వతాలు, సురేశ్‌రెడ్డితో కలిసి శనివారం ఆయన జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెద్దపల్లితోపాటు రాష్ట్రంలోని 12 పార్లమెంట్‌ స్థానాలను బీజపీ కై వసం చేసుకుంటుందన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల కుటుంబ, అవినీతిపాలన ఇక అంతమైనట్లేనని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చేసిన తప్పులకు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ మైదానంలో ఈనెల 6న జరిగే బహిరంగసభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారని, సభను విజయవంతం చేయాలని శ్రీనివాస్‌, ప్రదీప్‌కుమార్‌ కోరారు. సభా ఏర్పాట్లను వారు పరిశీలించారు. కార్యక్రమంలో నాయకులు రాజ్‌గోపాల్‌, దాడి సంతోష్‌, తంగెడ రాజేశ్వర్‌రావు, మేకల శ్రీనివాస్‌, రాజం మహంత పాల్గొన్నారు.

మోదీకి మద్దతు ఇవ్వండి

కాల్వశ్రీరాంపూర్‌(పెద్దపల్లి): భారతదేశాన్ని అగ్రదేశాల సరసన నిలబెట్టిన ప్రధాని మోదీకి మద్దతు ఇవ్వాలని బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌ కోరారు. మండల కేంద్రంలో జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. తనకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం ఇంటింటా పర్యటించి కరపత్రాలు పంచారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌రావు, నాయకుడు గొట్టెముక్కుల సురేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఓటర్లు పేదల పక్షమే..

ఓదెల(పెద్దపల్లి): పేదోళ్లకు ఓట్లు వేయాలని ఓటర్లు ఫిక్స్‌ అయ్యారని బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌ అన్నారు. గుంపుల, ఇందుర్తి, బాయమ్మపల్లె, హరిపురం, కొలనూర్‌లో జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని కోరారు. నాయకులు దుగ్యాల ప్రదీప్‌రావు, గొట్టెముక్కుల సురేశ్‌రెడ్డి, కారెంగల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

బీజేపీతోనే దేశాభివృద్ధి

సుల్తానాబాద్‌(పెద్దపల్లి): బీజేపీ, ప్రధాని మోదీ తోనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌ అన్నారు. మండల కేంద్రంలో నిర్వహించిన బైక్‌ ర్యాలీలో ఆయన మాట్లాడారు. నాయకులు దుగ్యాల ప్రదీప్‌కుమార్‌, గొట్టె ముక్కుల సురేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement