తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికే.. సీఎం విజయన్‌పై కాంగ్రెస్‌ ఆగ్రహం | Sakshi
Sakshi News home page

తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికే.. సీఎం విజయన్‌పై కాంగ్రెస్‌ ఆగ్రహం

Published Sat, Apr 13 2024 6:20 PM

Congress Said Vijayan Attacks On Rahul Gandhi To Hide Govt Failures - Sakshi

తిరువనంతపురం : ప్రభుత్వ వైఫల్యాను కప్పిపుచ్చుకునేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూరేలా కాంగ్రెస్‌ను, రాహుల్‌ గాంధీని విమర్శిస్తున్నారని మండిపడుతున్నారు.   

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీపీఎం నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలేమీ లేవని, తమ పాలనా వైఫల్యాలు, నిర్వహణ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు తమ పార్టీపై దాడికి విమర్శలు చేస్తున్నారని పరవూరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీశన్ ఆరోపించారు. గత 30 రోజులకు పైగా విజయన్ బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని మినహాయించి కాంగ్రెస్, రాహుల్‌  గాంధీలను విమర్శించడం అందుకు నిదర్శనమని అన్నారు.   

కేరళ ప్రభుత్వం దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కంటే కేరళలో హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించాలనే లక్ష్యంతో కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్ (K-FON) రూ.1,500 కోట్లతో ప్రాజెక్ట్‌ చేపట్టింది.  ప్రాజెక్టును ప్రారంభించి ఏడేళ్లు గడిచినా నేటికీ పూర్తి చేయకపోవడం దుర్వినియోగం, అవినీతికి నిదర్శనమని తెలిపారు. 

ఈ సందర్భంగా కేఫోన్‌ ప్రాజెక్ట్‌పై సీబీఐ విచారణ జరిపించాలని సతీశన్ డిమాండ్‌ చేశారు. డిప్లమాటిక్ బ్యాగ్‌ల కేసు, కరువనూరు సహకార బ్యాంకు కుంభకోణంతో సహా పలు ఆర్థిక కుంభకోణాల్లో అధికార పార్టీ నేతల ప్రమేయం ఉన్నందునే సీఎం విజయన్, అధికార పార్టీ సీపీఐ(ఎం) బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేందుకు భయపడుతున్నారని కాంగ్రెస్ నేత ఆరోపించారు.

ఈ కేసుల్లో చర్యలు తీసుకుంటుందనే భయం సీఎం పినరయి విజయన్‌లో స్పష్టంగా కనిపిస్తోందని దుయ్యబట్టారు. త్రిసూర్‌, తిరువనంతపురం వంటి కీలక లోక్‌సభ నియోజకవర్గాల్లో వామపక్షాల ఓట్లను తమకు అనుకూలంగా మల్చుకునేందుకు బీజేపీ దీన్ని సద్వినియోగం చేసుకుంటుందని వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement