చెన్నై: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ మరోసారి విరుచుకుపడ్డారు. మంగళవారం తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో జరిగిన లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఉదయనిధి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఎంకే నేతలకు నిద్ర లేకుండా చేస్తున్నామని ప్రధాని మోదీ ఇటీవలి తమిళనాడు పర్యటనలో చేసిన వ్యాఖ్యలకు ఉదయనిధి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
మోదీని, బీజేపీని ఇంటికి పంపించేదాకా తమ పార్టీ నిద్రపోదన్నారు. ‘డీఎంకే నేతలకు నిద్ర రావడం లేదని ప్రధాని అంటున్నారు. అవును మేం నిన్ను, బీజేపీని ఇంటికి పంపించేదాకా నిద్రపోము. 2014లో గ్యాస్ సిలిండర్ రూ. 450, ఇప్పుడు రూ.1200. ఇటీవలే పీఎం దానిని రూ.100 తగ్గించి ఒక డ్రామా ఆడారు.ఎన్నికల తర్వాత గ్యాస్ ధరను తిరిగి రూ.500 పెంచుతాడు’అని ఉదయనిధి ఫైర్ అయ్యారు. కాగా, తమిళనాడులో లోక్సభ ఎన్నికల పోలింగ్ తొలి దశలోనే ఏప్రిల్ 19న జరగనుంది. ఇందుకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైంది.