IPL 2024: పంత్‌ రీఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పాంటింగ్‌ | Sakshi
Sakshi News home page

IPL 2024: పంత్‌ రీఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పాంటింగ్‌

Published Wed, Feb 7 2024 4:49 PM

Delhi Capitals Coach Ricky Ponting Says Rishabh Pant Is Very Confident' Of Playing Entire IPL 2024 - Sakshi

ఢిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ తమ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ పునరాగమనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఐపీఎల్‌ సీజన్‌కు (2024) పంత్‌ పూర్తిగా అందుబాటులో ఉండాలని కోరుకుంటూనే.. అతని రీఎంట్రీపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని బాంబు పేల్చాడు. రీఎంట్రీపై పంత్‌ను అడిగితే మాత్రం అన్ని మ్యాచ్‌లకు సై అంటాడని, వికెట్‌కీపింగ్‌ విషయంలోనూ తగ్గేదేలేదని అంటాడని, నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతానని ధీమాగా చెబుతాడని అన్నాడు.

పంత్‌ ప్రస్తుత పరిస్థితి చూస్తే వచ్చే సీజన్‌లో అతను ఆడగలడని తెలుస్తుంది కాని అతను పూర్తి మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడా.. కెప్టెన్సీ, వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలను చేపట్టగలడా అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉందని తెలిపాడు. పంత్‌ రీఎంట్రీకి సంబంధించి ఎలాంటి విషయమైనా తమకు యాడెడ్‌ అడ్వాంటేజ్‌ అవుతుందని అన్నాడు. కారు ప్రమాదం​ తాలూకా గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న పంత్‌ రీఎంట్రీపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడని తెలిపాడు.

ఒకవేళ పంత్‌ కెప్టెన్సీ చేపట్టలేని పక్షంలో డేవిడ్‌ వార్నర్‌ మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపడతాడని కన్ఫర్మ్‌ చేశాడు. ప్రస్తుత జట్టు విషయంలో సంతృప్తి వ్యక్తం చేశాడు. హ్యారీ బ్రూక్‌ తమలో చేరడం కలిసొస్తుందని అభిప్రాయపడ్డాడు. అతన్ని ఫినిషర్‌ పాత్రలో వాడుకుంటామని తెలిపాడు. వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌ టాపార్డర్‌లో ఉంటారని కన్ఫర్మ్‌ చేశాడు. అక్షర్‌, కుల్దీప్‌లతో స్పిన్‌ విభాగం పటిష్టంగా ఉందని ధీమా వ్యక్తం చేశాడు. నోర్జే, జై రిచర్డ్‌సన్‌ అందుబాటులోకి వస్తే తమకు తిరుగే ఉండదని తెలిపాడు. మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో వాషింగ్టన్‌ ఫ్రీడం కోచ్‌గా ఎంపికైన సందర్భంగా మాట్లాడుతూ పాంటింగ్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు.

కాగా, 2022 చివరి రోజుల్లో ఢిల్లీ కెప్టెన్‌ పంత్‌ కారు ప్రమాదానికి గురై ఏడాదికి పైగా క్రికెట్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. పంత్‌ ప్రస్తుతం గాయాల నుంచి పూర్తిగా కోలుకుని ప్రాక్టీస్‌ కూడా చేస్తున్నాడు. అయితే అతను వికెట్‌కీపింగ్‌ చేయగలడా లేదా అనే విషయం అనుమానాస్పదంగా ఉంది. మేజర్‌ యాక్సిడెంట్‌ కావడంతో పంత్‌ రెండు కాళ్లలకు తీవ్రగాయాలయ్యాయి. అతని కాళ్లలో రాడ్స్‌ వేసి సర్జరీ చేశారు. ఈ నేపథ్యంలో పంత్‌ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ ఏడాది ఐపీఎల్‌ మార్చి చివరి నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Advertisement
Advertisement