పంజాబ్ కింగ్స్తో నిన్న (ఏప్రిల్ 4) జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ కిర్రాక్ ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ అయ్యాక తొలి హాఫ్ సెంచరీ చేశాడు. ఈ సీజన్లో గిల్ తొలిసారి స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్లో 48 బంతులు ఎదుర్కొన్న గిల్ 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్. నిన్న జరిగిన మ్యాచ్లో ఢిల్లీపై సునీల్ నరైన్ చేసిన 85 పరుగులు గిల్ ఇన్నింగ్స్కు ముందు సీజన్ టాప్ స్కోర్గా ఉండింది. గంటల వ్యవధిలోనే గిల్..నరైన్ స్కోర్ను అధిగమించి సీజన్ టాప్ స్కోరర్గా అవతరించాడు.
పంజాబ్తో మ్యాచ్లో గుజరాత్ ఓటమిపాలైనప్పటికీ గిల్ ఇన్నింగ్స్ హైలైట్గా నిలిచింది. ఈ ఇన్నింగ్స్లో గిల్ చూడచక్కటి షాట్లు ఆడాడు. గిల్ కొట్టిన సిక్సర్లు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. గిల్ సునాయాసంగా బంతులను బౌండరీ లైన్ పైకి తరలించాడు. ఐపీఎల్లో గిల్ బ్యాట్ నుంచి జాలువారిన క్లాసీ ఇన్నింగ్స్లో ఇది ఒకటి.
కాగా, పంజాబ్తో మ్యాచ్లో గిల్ మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగినప్పటికీ.. శశాంక్ సింగ్ (29 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), అశుతోష్ శర్మ (17 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్) అంతకంటే మెరుగైన ఇన్నింగ్స్లు ఆడి పంజాబ్ను గెలిపించారు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. శుభ్మన్ గిల్ రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా.. శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, ప్రభ్సిమ్రన్ సింగ్ (35) రెచ్చిపోవడంతో పంజాబ్ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 3 వికెట్ల తేడాతో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో గుజరాత్ను వెనుక్కునెట్టి ఐదో స్థానానికి చేరుకుంది.