అతడి వల్లే ఓడిపోయాం.. అలా చేయకుంటే బాగుండేది! | Sakshi
Sakshi News home page

RCB: అతడి వల్లే ఓడిపోయాం.. అలా చేయకుంటే బాగుండేది!

Published Sun, Apr 7 2024 1:12 PM

IPL 2024 That Took Momentum Away: RCB du Plessis Reason Behind Loss - Sakshi

‘‘తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలించలేదు. ఏదేమైనా ఇక్కడ 190 స్కోరు చేస్తే బాగుంటుందని భావించాం. కనీసం ఇంకో 10- 15 పరుగులు చేస్తే ఫలితం బాగుండేది. మిడిల్‌ ఓవర్లలో ప్రత్యర్థి జట్టు స్పిన్నర్లు అద్బుతంగా బౌలింగ్‌ చేశారు.

టాస్‌ గెలిసి తొలుత బౌలింగ్‌ ఎంచుకోవడం కూడా వారికి సానుకూల ఫలితాలను ఇచ్చింది. మ్యాచ్‌ సాగుతున్నీ కొద్దీ పిచ్‌ మీద తేమ కారణంగా బ్యాటింగ్‌ సులువైంది. విరాట్‌ ఆఖరి వరకు బాగానే ఆడాడు. ఆఖరి ఓవర్లలో కామెరాన్‌ గ్రీన్‌ బ్యాట్‌ ఝలిపిస్తే బాగుండేది.

  స్పిన్నర్ల బౌలింగ్‌లో పరుగులు రాబట్టాలని శాయ శక్తులా కృషి చేసినా సాధ్యం కాలేదు. అదే సీమర్ల బౌలింగ్‌లో హిట్టింగ్‌ ఆడగలిగాం. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ప్రత్యర్థిని తొలి నాలుగు ఓవర్లలో బాగానే కట్టడి చేయగలిగాం.

అప్పుడే మ్యాచ్‌ మలుపు తిరిగింది
కానీ ఆరో ఓవర్లో మేము 20కి పైగా పరుగులు సమర్పించుకోవడంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. ఆ తర్వాత మాపై క్రమంగా ఒత్తిడి పెరిగింది. ఎక్కువగా కుడిచేతి వాటం బ్యాటర్లే ఉన్నారు కాబట్టి మాక్స్‌వెల్‌తో బౌలింగ్‌ చేయించలేదు.

ఇద్దరు రైట్‌ హ్యాండర్లు క్రీజులో ఉన్నపుడు మా లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ హిమాన్షు శర్మను బరిలోకి దించాం. వికెట్లు తీసేందుకు మా ప్రయత్నం చేశాం. జైస్వాల్‌(లెఫ్టాండర్‌) అవుటైన తర్వాత కూడా మాక్సీతో బౌలింగ్‌ చేయించాలని అనుకోలేదు.

ఇక ఈ మ్యాచ్‌లో మా ఫీల్డింగ్‌ అత్యంత సాధారణంగా ఉంది. తదుపరి మ్యాచ్‌లో తిరిగి పుంజుకోవడానికి ప్రయత్నిస్తాం’’ అని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ అన్నాడు. ఐపీఎల్‌-2024లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌ చేతిలో ఓటమి అనంతరం ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.ఘ

ఆ ఓవర్లోనే ఆర్సీబీ కొంప మునిగింది
లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్‌ను తొలి నాలుగు ఓవర్లలో కట్టడి చేసినా.. మయాంక్‌ దాగర్‌ వేసిన ఆరో ఓవర్‌ నుంచి మ్యాచ్‌ స్వరూపం మారిపోయిందని డుప్లెసిస్‌ పేర్కొన్నాడు. ఆ తర్వాత ఏ దశలోనూ రాజస్తాన్‌ను ఆపలేకపోయామని.. ఫీల్డింగ్‌ వైఫల్యాల వల్ల కూడా మూల్యం చెల్లించామని తెలిపాడు.

కాగా జైపూర్‌లో శనివారం నాటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 183 పరుగులు చేసింది. అయితే, లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్‌ ఆరంభంలోనే యశస్వి జైస్వాల్‌(0) వికెట్‌ కోల్పోయినా.. జోస్‌ బట్లర్‌(100- నాటౌట్‌), సంజూ శాంసన్‌(69) ఇన్నింగ్స్‌ కారణంగా విజయఢంకా మోగించింది. 

కేవలం 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను పూర్తి చేసి ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఆర్సీబీ బౌలర్లలో రీస్‌ టోప్లీ రెండు వికెట్లు తీయగా.. మహ్మద్‌ సిరాజ్‌, యశ్‌ దయాల్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

ఇక రెండు ఓవర్లు బౌలింగ్‌ చేసిన మయాంక్‌ దాగర్‌ ఏకంగా 34 పరుగులు ఇచ్చుకున్నాడు. రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌లో ఆరో ఓవర్‌ బౌల్‌ చేసిన ఈ లెఫ్టార్మ్‌ ఆర్థోడాక్స్‌ స్పిన్నర్‌ ఏకంగా 20 పరుగులు ఇవ్వడం ఆర్సీబీ కొంపముంచింది. ఇక ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్‌ విరాట్‌ ​కోహ్లి అజేయ శతకం(113) వృథాగా పోయింది.

చదవండి: Virat Kohli: ఇంత స్వార్థమా?.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లి చెత్త రికార్డు

Advertisement
Advertisement