ఇన్ఫీ సీఈవోకు మరో విజిల్‌ ‘బ్లో’! | Sakshi
Sakshi News home page

ఇన్ఫీ సీఈవోకు మరో విజిల్‌ ‘బ్లో’!

Published Wed, Nov 13 2019 5:00 AM

Whistleblower 2nd Letter Levels More Charges Against Infosys CEO Salil Parekh - Sakshi

బెంగళూరు: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సీఈవో సలీల్‌ పరేఖ్‌పై విజిల్‌ బ్లోయర్ల (ప్రజావేగుల) ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. తాజాగా మరిన్ని ఆరోపణలు గుప్పిస్తూ.. మరో ప్రజావేగు ఫిర్యాదు చేశారు. నియామక నిబంధనల ప్రకారం ప్రధాన కార్యాలయమైన బెంగళూరు నుంచి కార్యకలాపాలు సాగించాల్సి ఉండగా ఆయన ముంబైలోనే ఉంటున్నారని అందులో పేర్కొన్నారు. పరేఖ్‌ తరచూ ముంబై నుంచి బెంగళూరుకు రాకపోకలు సాగిస్తుండటం వల్ల కంపెనీకి రవాణా చార్జీలు, విమాన టికెట్‌ చార్జీల రూపంలో ఇప్పటికి రూ.22 లక్షల దాకా ఖర్చయిందని తెలిపారు. ఆయన బెంగళూరుకు మారని పక్షంలో ఖర్చులన్నింటినీ సీఈవో జీతం నుంచే రాబట్టాలని కోరారు. చైర్మన్, స్వతంత్ర డైరెక్టర్లు, నామినేషన్‌ అండ్‌ రెమ్యూనరేషన్‌ కమిటీని (ఎన్‌ఆర్‌సీ) సంబోధిస్తూ ప్రజావేగు ఈ ఫిర్యాదు పంపారు.

‘‘నేను ఇన్ఫీ ఫైనాన్షియల్‌ విభాగంలో ఉద్యోగిని. విషయ తీవ్రత దృష్ట్యా కక్ష సాధింపు చర్యలుంటాయనే భయంతో పేరు వెల్లడించలేకపోతున్నా. నేను కూడా సంస్థలో వాటాదారునే. సలీల్‌ పరేఖ్‌ తీరు వల్ల కంపెనీ ప్రతిష్ట, విలువలు దిగజారిపోతున్న సంగతిని యాజమాన్యం దృష్టికి తేవాలనే ఉద్దేశంతోనే ఉద్యోగులు, వాటా దారుల తరఫున నేను ఈ లేఖ రాస్తున్నా’’ అని ఆ ప్రజావేగు పేర్కొన్నారు. ఈ అంశంపై తగు చర్యలు తీసుకోవాలని.. సంస్థపై ఉద్యోగులు, షేర్‌హోల్డర్లు పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడాలని అభ్యరి్థంచారు. ఆదాయాలు పెంచి చూపిస్తూ.. సలీల్‌ పరేఖ్‌తో పాటు సీఎఫ్‌వో నీలాంజన్‌ రాయ్‌ అనైతిక విధానాలకు పాల్పడుతున్నారంటూ ఇప్పటికే వచి్చన ఫిర్యాదులతో ఇన్ఫీ సతమతమవుతున్న సంగతి తెలిసిందే.

ఇప్పటిదాకా ఇలాంటి సీఈవోను చూడలేదు..
‘నియామకం సమయంలోనే బెంగళూరు కేంద్రంగా పనిచేయాల్సి ఉంటుందని పరేఖ్‌కు కంపెనీ స్పష్టంగా చెప్పింది. ఆయన చేరి ఇప్పటికి ఏడాది దాటి ఎనిమిది నెలలవుతోంది. ఇప్పటికీ ఆయన ముంబైలోనే ఉంటున్నారు. నెలలో రెండు సార్లు బెంగళూరుకు వస్తూ, పోతూ ఉన్నారు. ప్రతి నెలా నాలుగు బిజినెస్‌ క్లాస్‌ టికెట్లు, రెండు చోట్ల విమానాశ్రయాలకు డ్రాపింగ్, పికప్‌ వంటి ఖర్చులుంటున్నాయి. ఇలా రూ. 22 లక్షల దాకా ఖర్చయ్యింది.

ఈ ఖర్చులను ఆయన దగ్గర్నుంచే రాబట్టాలి. అసలు.. ఆయన బెంగళూరులోనే ఉండాలని కంపెనీ బోర్డు ఎందుకు గట్టిగా చెప్పడం లేదు‘ అని ప్రజావేగు తన ఫిర్యాదులో ప్రశ్నించారు. పైపెచ్చు బోర్డును, వ్యవస్థాపకులను తప్పుదోవ పట్టించేందుకు పరేఖ్‌.. బెంగళూరులో అపార్ట్‌మెంటును అద్దెకు తీసుకున్నట్లు చూపిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటిదాకా ఇంత అధ్వానంగా వ్యవహరించే సీఈవోను చూడలేదని వ్యాఖ్యానించారు.

ఠంఛనుగా బోనస్‌ తీసుకుంటారు...
ముంబైలోని పలు చిన్న కంపెనీల్లో సలీల్‌ పరేఖ్‌ సొంతంగా పెట్టుబడులు పెట్టారని, వాటిని చూసుకోవడం కోసమే అక్కడి నుంచి రావడం లేదని ప్రజావేగు ఆరోపించారు. గ్రీన్‌ కార్డును కాపాడుకోవడం కోసమే ఆయన ప్రతి నెలా అమెరికా వెడుతుంటారు తప్ప సదరు టూర్లలో ఎన్నడూ ఏ క్లయింటునూ కలవలేదని, ఇన్ఫీ కార్యాలయాలకు కూడా వెళ్లలేదనే ఆరోపణలూ ఉన్నాయని పేర్కొన్నారు. ఇక, సీఈవో హోదాను అడ్డం పెట్టుకుని నిధులిస్తానని చెబుతూ అమెరికాలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలతో కూడా ఆయన సంప్రదింపులు జరుపుతుంటారని ప్రజావేగు వెల్లడించారు.తన సంతానానికి ఆయా వర్సిటీల్లో సీట్లు దక్కించుకోవడం కోసమే ఇవన్నీ చేస్తున్నారని ఆరోపించారు.మిగతా ఉద్యోగులందరికీ ఈసారి జూలై, ఆగస్టుల్లో గానీ బోనస్‌లు అందలేదని.. సీఈవో మాత్రం ఠంఛ నుగా ఏప్రిల్‌లోనే తీసేసుకున్నారని చెప్పారు. వీటన్నింటిపైనా విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement
 
Advertisement
 
Advertisement