-
Japnit Ahuja: డిజిటల్ జెండర్ గ్యాప్ను కోడింగ్ చేసింది!
స్త్రీలు సాంకేతికంగా కూడా సాధికారిత సాధించాలనే లక్ష్యంతో వారికి ఉచితంగా కోడింగ్ పాఠాలు నేర్పుతోంది ఢిల్లీవాసి 23 ఏళ్ల జష్నిత్ అహుజా. కోడింగ్ తెలిసిన వారికి ఉద్యోగావకాశాలు అధికంగా లభిస్తాయి. ఈ రకంగా దేశంలో ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయిలకు ఆశాజ్యోతిగా మారింది జప్నిత్. ఇప్పటి వరకు 2 వేల మంది అమ్మాయిలకు ఉచితంగా డిజిటల్ పాఠాలు నేర్పింది. వంద మంది వాలంటీర్ల బృందానికి నాయకత్వం వహిస్తోంది. ఢిల్లీకి చెందిన జప్నిత్ అహుజాకు కోడింగ్ అంటే చాలా ఆసక్తి. దాంతో కోడింగ్ నేర్చుకోవడం మీదనే దృష్టిపెట్టింది. అదే సమయంలో ఆమె ఒక విషయాన్ని గుర్తించింది. అదేమంటే, కోడింగ్ రంగంలో స్త్రీలు చాలా తక్కువగా ఉన్నారనీ, ఆ ఉన్న వారిలో కూడా చాలామందికి దానిపై తగినంత పరిజ్ఞానం లేదనీ. మిగిలిన వారితో పోల్చితే కోడింగ్ తెలిసిన వాళ్లకి ఉద్యోగావకాశాలు కాసింత ఎక్కువగానే దొరుకుతాయి. అయితే ఆ రంగంలో పురుషులదే పై చేయి. దాంతో సాంకేతికపరంగా ఏమైనా ఉద్యోగాలు ఉంటే కోడింగ్లో వారే ముందుకు దూసుకుపోవడం వల్ల ఆ ఉద్యోగాలు కూడా వారే ఎక్కువగా దక్కించుకోగలుగుతున్నారు. ఇప్పటిదాకా స్త్రీలు ఎన్నో రంగాలలో పట్టుదలతో కృషి చేసి, పై చేయి సాధించగలుగుతున్నప్పుడు కోడింగ్లో మాత్రం పట్టు ఎందుకు సాధించకూడదు... అని ఆలోచించింది. అంతే... ముందు తాను ఆ రంగంలో బాగా కృషి చేసింది. పట్టుదలతో కోడింగ్ నేర్చుకుంది... ఆ రకంగా అందులో చకచకా పై మెట్టుకు చేరిపోగలిగింది. తనలాగే మరికొందరు ఆడపిల్లలకు కూడా కోడింగ్ నేర్పితేనో... అనుకుంది. అలా అనుకోవడం ఆలస్యం... ఇతర ఆమ్మాయిలను కొందరిని పోగు చేసి తనకు తెలిసిన దానిని వారికి ఉచితంగా పాఠాలు నేర్పడం ఆరంభించింది. అలా తన 16వ ఏట ఆమె ‘గో గర్ల్’ అనే సంస్థను స్థాపించింది. అయితే భాష సమస్య రాకుండా వారికి వచ్చిన స్థానిక భాషలోనే ఉచితంగా కోడింగ్ను నేర్పడం ఆమె ప్రత్యేకత. తోటి ఆడపిల్లలను సాంకేతికంగా ఎదిగేలా చేయడం కోసం ఎంచుకున్న లక్ష్యం, అందుకు ఆమె చేసిన కృషీ వృథా పోలేదు. చాలామంది అమ్మాయిలు ఆమె దగ్గర కోడింగ్ నేర్చుకుని మంచి ఉద్యోగావకాశాలను సాధించుకోగలిగారు. అలా తనకు లభించిన ప్రోత్సాహ ఉత్సాహంతో తన వయసు ఆడపిల్లలకే కాదు, తల్లి వయసు స్త్రీలకు కూడా కోడింగ్ నేర్పడం మొదలు పెట్టింది. అలా తనకు 23 ఏళ్లు వచ్చేసరికి చిన్న, పెద్ద కలిసి దాదాపు రెండు వేల మందికి పైగా ఆమె వద్ద కోడింగ్ నేర్చుకుని సాంకేతికంగా అభివృద్ధి చెంది, తమ కాళ్ల మీద తాము నిలబడగలిగారు. అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఆరవ తరగతి చదివేటప్పుడే కోడింగ్ రంగంలో సాధించిన ప్రావీణ్యం బాల మేధావిగా ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘‘చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే అమ్మానాన్న ఆఫీసులనుంచి ఇంటికి వచ్చేలోగా వారికోసం ఎదురు చూస్తూ రకరకాల వెబ్సైట్లకు రూపకల్పన చేసేదానిని. అప్పుడు నాన్న నాతో.. ‘ఈ పిచ్చి పిచ్చి వెబ్సైట్లు కాదు బేబీ... నువ్వు నాసా సైంటిస్ట్గా ఎదగాలి. తలచుకుంటే నీకదేమీ ఒక లెక్కలోనిది కాదు’ అని చెప్పిన మాట నన్ను ఎంతో ప్రభావితం చేసింది. అలా ఎయిత్ క్లాస్కు వచ్చేసరికి పెద్దయ్యాక నేను చేయవలసింది ఉద్యోగం కాదని... సాంకేతికంగా అభివృద్ధి చెందడం, దానిద్వారా నేను నేర్చుకున్న పాఠాలను పదిమందికీ చెప్పడంలోనే ఎంతో థ్రిల్ ఉందనీ అర్థమైంది. నా దగ్గర కోడింగ్ పాఠాలు నేర్చుకున్న వారే తమంతట తాము స్వచ్ఛందంగా ఇతరులకు నేర్పించడం మొదలు పెట్టారు. ఆ విధంగా ‘కోడింగ్ ఫర్ ఉమెన్ బై ఉమెన్’ కాన్సెప్ట్ మాకు బాగా ఉపకరించింది. అంతేకాదు, డిజిటల్ జెండర్ గ్యాప్ అనే వివక్షను పూడ్చాలన్న నా స్వప్నం సాకారం అయ్యేందుకు ఉపకరించింది. ఏమైనా పిల్లలు గ్యాడ్జెట్స్తో ఆడుకుంటున్నప్పుడు వాళ్లు వాటితో ఏం చేస్తున్నారో... తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి. దానిని వారు మంచికే ఉపయోగిస్తున్నారు అని గుర్తించగలిగితే ఆ దిశగా వారిని ప్రోత్సహించడం మంచిది. నా తల్లిదండ్రులు కోడింగ్పై నాకున్న ప్యాషన్ను గుర్తించకుండా ఏవో పిచ్చి ఆటలు ఆడుతున్నాను అనుకుని దానికి అడ్డుకట్ట వేసి ఉంటే నేను ఈ స్థాయికి ఎదిగి ఉండేదానిని కాను’’ అని ఆమె చెప్పిన మాటలు ఆలోచించదగ్గవి. ∙కోడింగ్లో శిక్షణ పొందుతున్న అమ్మాయిలు -
Nishtha Satyam: సత్య నిష్ఠతో...
వివక్ష అనేది ఎక్కడో ఉండదు. మన చుట్టూనే పొంచి ఉంటుంది. అలాంటి వివక్షను సూక్ష్మస్థాయిలో విశ్లేషిస్తోంది నిష్ఠా సత్యం. స్త్రీ సాధికారతకు సంబంధించిన కార్యక్రమాలపై నిష్ఠగా పనిచేస్తోంది... బాలీవుడ్ సినిమా ‘మొహ్రా’లోని ‘తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్’ పాట యువ గళాల్లో ఎక్కువగా వినిపిస్తున్న కాలం అది. అందరిలాగే తాను కూడా ఆ పాట హమ్ చేస్తోంది నిష్ఠ. ఆమె తండ్రికి విపరీతమైన కోపం వచ్చి ‘నువ్వు ఎలాంటి పాట పాడుతున్నావో తెలుసా’ అంటు తిట్టాడు. చిన్నపాటి పనిష్మెంట్ కూడా ఇచ్చాడు. ‘సరదాగా రెండు లైన్లు పాడినందుకు ఇంత రాద్ధాంతమా?’ అనుకుంది నిష్ఠ. ఒకవేళ ఈ పాట అబ్బాయి పాడి ఉంటే ఇలాగే జరిగి ఉండేదా? ‘జరగదు’ అని బలంగా చెప్పవచ్చు. ఈ సంఘటన ఒక్కటే కాదు పెద్ద కంపెనీలలో పనిచేస్తున్న కాలంలోనూ లింగవివక్షను ఎదుర్కొంది నిష్ఠ. మల్టీనేషనల్ కంపెనీ కేపీఎమ్జీ, అమెరికన్ ఎక్స్ప్రెస్లలో ఎకానమిస్ట్గా పనిచేసిన నిష్ఠా సత్యం ఐక్యరాజ్య సమితిలోకి అడుగు పెట్టింది. ఐక్యరాజ్యసమితిలో పాట్నర్షిప్ అడ్వైజర్గా ప్రయాణం మొదలు పెట్టిన నిష్ఠ డిప్యూటీ హెడ్ హోదాలో పనిచేసింది. ఆ తరువాత యూఎన్ ఉమెన్ మిషన్ హెడ్– తిమోర్–లెస్తే బాధ్యతలు చేపట్టింది. ‘రెండు విధాలుగా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని విశ్లేషించాలి. ఒకటి డిఫాల్ట్ సెట్టింగ్ రెండోది డిజైన్ సెట్టింగ్. డిజైన్ సెట్టింగ్ అనేది పురుషుల నుంచి వచ్చింది. వారికి అనుకూలమైనది’ అంటుంది నిష్ఠ. స్మార్ట్ ఫోన్ల సైజ్ నుంచి పీపీయీ కిట్స్ వరకు మార్కెట్లో ఉన్న ఎన్నో వస్తువుల డిజైన్లు మహిళలకు అనుకూలంగా లేకపోవడంలోని వివక్షను ప్రశ్నిస్తుంది నిష్ఠ. ‘సాంస్కృతిక సందర్భాలు వివిధ మార్గాలలో మహిళలను శక్తిమంతం చేస్తాయి. సాధికారతకు సంబంధించి మన ఆలోచనలను వారిపై బలవంతంగా రుద్దడంలో అర్థం లేదని తిమోర్–లెస్తే మహిళల నుంచి నేర్చుకున్నాను’ అంటుంది నిష్ఠా సత్యం. -
నవ భారతంలోకి ముందడుగు
దేశంలో మహిళలు ఇప్పటికీ అర్ధ బానిసత్వంలోనే ఉన్నారు. పితృస్వామ్యం, సంకుచిత సామాజిక, సాంస్కృతిక విలువలు, లింగ వివక్ష వంటివి మహిళల వెనుకబాటుతనానికి కారణాలు. భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందక పోవడానికి కారణం, పితృస్వామ్యం. ఈ పరిస్థితి మారాలి. మహిళతో పాటు నిరుద్యోగి, రైతు, కార్మికుడు, యువత కూడా జీవన సంక్షోభంలో ఉన్నారు. స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాద భావనలు కూడా సంక్షోభంలో పడ్డాయి. అందుకే 2024 సంవత్సరంలో ప్రజలు ఆత్మగౌరవంతో, అభ్యుదయ భావాలతో నడవాలి. గిరిజనులు, దళితులు, బహుజనులు, ప్రజాస్వామ్యవాదులు స్వేచ్ఛగా జీవించగలిగే నూత్న భారత నిర్మాణం కోసం కలిసికట్టుగా పనిచేయాలి. భారతదేశం లౌకిక దేశం. భారతాన్ని వర్ణ భారతంగా మార్చాలన్నది పెద్ద వ్యూహం. కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామిక, లౌకిక రాజ్యాంగంగా రూపుదిద్దారు. దాని పునాదులను కదపటం ఎవరి వల్లా కాదు. అంబేడ్కర్ రాజ్యాంగ రూపకల్పనలో ఫ్రెంచి విప్లవంలోని వాల్టేర్, రూసో భావాలను తీసు కున్నారు. నిజానికి ఆయన రాజ్యాంగం పునాదుల పునర్నిర్మాణం నుండి ప్రారంభమైంది. రాజ్యాంగం ప్రకారం, ఆరు సంవత్సరముల వయసు పూర్తి అగు వరకు బాల బాలికల ఆరోగ్య పరిరక్షణకు, విద్యా వసతులు కల్పించటానికి ప్రభుత్వం కృషి చేయాలి. 14 సంవత్సరాల వయసు వచ్చువరకు బాల బాలికలకు ఉచిత నిర్బంధ విద్య నేర్పాలి. అయితే ఈనాటికీ బాల బాలికలకు పౌష్టిక ఆహారం పెట్టలేని స్థితిలో మనం ఉన్నాము. పసిపిల్లలకు పాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నాము. పిల్ల లకు పౌష్టికాహారం కావాలి, ఆరోగ్య పరిరక్షణ కావాలి, పర్యావరణ పరిరక్షణ కావాలి. పురిటిలోనే శిశువులు చనిపోతున్న పరిస్థితులు పెరుగుతున్నాయి. ఒక శిశువుని పెంచి పోషించాలంటే పేదరాలైన తల్లి వల్ల కాదు. దానికి ప్రభుత్వపు, సమాజపు బాధ్యత కూడా కావాలి. నిజానికి ఒక శిశువు మరణిస్తే ఆ దేశానికి భవిష్యత్తు మరణించినట్టే. రాను రాను భారతదేశంలో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతోంది. దానికి కారణం విపరీతంగా రేట్లు పెరిగిపోవడమే. 2019 జనవరి నుండి 2022 మే వరకు కూరగాయలు, పాలు, బెల్లం,దుంపలు, వంటనూనె, గుడ్లు, పంచదార ఉత్పత్తి, సరఫరా తగ్గు ముఖం పట్టాయి. బియ్యం, పప్పులు, ఉప్పులు కొనుక్కోలేని స్థితికి సామాన్యులు నెట్టబడుతున్నారు. కారణం కూరగాయలు రైతులకు గిట్టుబాటు కావడం లేదు. ఎరువులు, విత్తనాల ధరలు ఎక్కువవు తున్నాయి. అకాల వర్షాలకు రైతు కుదేలవుతున్నాడు. కాళ్ళు సన్నగా, కడుపులు బోలుగా, భుజాన కండలేక 40 కోట్ల మంది ఈసురోమంటున్నారు. ఇంక స్త్రీల విషయానికి వస్తే పురుషులు తినినంత కూడా తినలేక పోతున్నారు. వాళ్లు అర్ధ బానిసత్వంలోనే ఉన్నారు. వారితో ఆరు గాలం పనిచేయించుకుంటున్నారు. మహిళల్లో సగం మంది కూడా ఉద్యోగినులు లేరు. పితృస్వామ్యం, సంకుచిత సామాజిక, సాంస్కృతిక విలువలు, అల్ప విద్యాస్థాయి, తగు ఆస్తులు లేకపోవడం, లింగ వివక్ష, మహిళలపై నేరాలు, ఘోరాలు అత్యధికంగా ఉండడం వంటివి మహిళల వెనుకబాటుతనానికి కారణాలుగా చెప్పక తప్పదు. ఎన్సీ ఆర్బి (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) నివేదిక (డిసెంబర్ 2023) ప్రకారం, మహిళల పట్ల జరుగుతున్న నేరాలు 2021లో కంటే, 2022లో 4 శాతం అధికంగా సంభవించాయి. 2022లో మహిళలకు వ్యతిరేకంగా 4,45,000 నేర ఘటనలు జరిగాయి. కుటుంబ సభ్యుల క్రూరత్వం, దౌర్జన్యాలు ఈ నేరాలలో అత్యధికం. ప్రతీ జీవన వ్యవ హారంలోనూ, మరీ ముఖ్యంగా ఆదాయంలో లింగ వ్యత్యాసం, వివక్ష తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఉత్పత్తి కార్యకలాపాలలో పట్టణ మహిళల భాగస్వామ్యం 24.0 శాతం కాగా, పురుషుల శాతం 73.8 శాతంగా ఉన్నది. 2004–2005, 2011–2012 సంవత్సరాల మధ్య కార్మిక శ్రేణుల నుంచి దాదాపు రెండు కోట్ల మంది మహిళలు వైదొలిగారని ప్రపంచ బ్యాంకు నివేదికలు వెల్లడించాయి. ఈ అంతరాలను విస్మరించడమంటే, మహిళలు ఇంకా పలు దశా బ్దాల పాటు అణచివేతకు గురికావడమే అని నిష్కర్షగా చెప్పక తప్పదు. భారతదేశం పితృస్వామ్య వ్యవస్థా నిర్మాణంతో ఉంది.అంటే ప్రతీ అంశంలోనూ పురుషుడిదే ఆధిపత్యం. అందుకే ఆడశిశువు భ్రూణ హత్యలు ఎక్కువగా జరిగాయి. ఫలితంగా చాలామంది పురు షులకు ఇప్పుడు పెళ్ళి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకడం లేదు. కొందరు ఎదురు కట్నం ఇచ్చి పెళ్ళి చేసుకుంటున్నారనే కథనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు బాలికలు, యువతులను అపహరించడం, వారిని అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలించి వ్యభిచార వృత్తిలోకి దింపడం ఎక్కువవుతోంది. స్త్రీలను అవమానించడం, అను మానించడం, అపహాస్యం చేయడం, అత్యాచారం చేయడం, అణచి వేయడం నిత్యాచారమైంది. భారతదేశం అంతా ఆర్థికంగా అభివృద్ధి చెందక పోవడానికి కారణం, పితృస్వామ్యం. ముందుగా స్త్రీకి మనం పౌష్టికాహారం పెట్టగలగాలి. స్త్రీల పేరు మీద భూములకు పట్టా లివ్వాలి. బస్సుల్లోనే కాక రైళ్ళల్లోనూ, విమానాల్లోనూ ఉచిత సేవలు అందించాలి. అప్పుడు అన్ని చోట్లకీ ఆమె ప్రయాణించగలుగుతుంది. ప్రస్తుతం బంగారు నిల్వలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి, మూడు శవర్లు బంగారం ప్రతీ స్త్రీకి ఇవ్వాలి. ఇకపోతే నిరుద్యోగుల సంఖ్య భారతదేశంలో పెరిగిపోతోంది. ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా’ నివేదిక 2023 ప్రకారం, 25 సంవ త్సరాల లోపు వయసు పట్టభద్రులలో నిరుద్యోగితా రేటు 42.3 శాతం. 30 నుంచి 34 సంవత్సరాల వయసు పట్టభద్రులలో ఇది 9.8 శాతం. ఈ నిరుద్యోగిత పరిస్థితులు సమాజంపై విషమ ప్రభావాన్ని చూపుతున్నాయి. అంతర్గత వలసలు, అంతకంతకూ పెచ్చరిల్లుతోన్న నేరాలు, హింసాకాండ, మాదకద్రవ్యాల వినియోగం నిరుద్యోగిత పర్యవసానాలే అనడంలో సందేహం లేదు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామన్న పాలకపక్షం హామీ కేవలం ఒక ఎన్నికల జుమ్లా (వంచన) అని తేలిపోయింది. నిరుద్యోగులు ఎక్కువ మంది ఆత్మహ త్యలు చేసుకుంటున్నారు. ఎంఏ, ఎంఎడ్, బీటెక్, ఎంటెక్, బీఎస్సీ, బీఎడ్లు చేసి కూడా ఉపాధి పనులకు వెళ్తున్నారు. సింగపూర్లోని హ్యూమన్ క్యాపిటల్ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్, మరికొన్ని సంస్థలు కలిసి ఏటా విశ్వ ప్రతిభా పోటీతత్వ సూచీ(జీటీసీఐ)ని వెలువరిస్తుంటాయి. విద్య, నైపుణ్య శిక్షణ, అవకాశాల లభ్యత, ప్రభుత్వాల చేయూత వంటి ప్రమాణాల ఆధారంగా ‘జీటీసీఐ’ని రూపొంది స్తాయి. 2023 సూచీలో 134 దేశాలకు గాను ఇండియాకు 103వ స్థానం దఖలుపడింది. అయినా, ప్రపంచంలో అతిపెద్ద ప్రతిభా కర్మా గారం ఇండియాయేనని ప్రభుత్వ వర్గాలు ఊదరగొడుతున్నాయి. ఆర్థిక సాంఘిక సాంస్కృతిక విద్యా సాంకేతిక రంగాలు సంక్షోభంలో ఉన్నాయి. శిశువు, స్త్రీ, నిరుద్యోగి, రైతు, కార్మికుడు, యువత జీవన సంక్షోభంలో ఉన్నారు. భారత రాజ్యాంగం సమర్పించిన స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమత, మమత, ప్రజాస్వామ్యం, లౌకిక వాదం, సామ్యవాదం కూడా సంక్షోభంలో పడ్డాయి. అందుకే 2024 సంవత్సరంలో ప్రజలు సామర్థ్యాన్ని పెంచుకొని, చైతన్యవంతంగా ఉత్పత్తిని పెంచుకోవాలి. సామరస్యతను పెంచుకొని ఆత్మగౌరవంతో, అభ్యుదయ భావాలతో నడవాలి. అంబేడ్కర్, ఫూలే, బుద్ధుని ఆశయా లతో సంపద అందరికి పంపిణీ అయ్యే విధానంతో సాగాలి. మొత్తం భారతదేశం 2025 జనవరి 1 కల్లా సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలి. పారిశ్రామిక విప్లవంలో ముందడుగు వేయాలి. గిరిజనులు, దళితులు, బహుజనులు, ప్రజాస్వామ్యవాదులు స్వేచ్ఛగా జీవించ గలిగే నూత్న భారత నిర్మాణం కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలి. నదులను అనుసంధానం చేసుకొని ఎక్కువ ఎగుమతులు చేయగలిగిన స్థాయిలో ఉత్పత్తిని పెంచుకోవాలి. సాంకేతిక పరిజ్ఞా నాన్ని మరింతగా పెంచుకోవాలి. చంద్రుడినే కాదు, అనేక గ్రహాలను అధీనం చేసుకునే స్థాయికి ఎదగాలి. భౌతిక, రసాయన శాస్త్ర అధ్యయన విస్తృతి పెరగాలి. నోబెల్ బహుమతి పొందగలిగే స్థాయిలో విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యను పెంచాలి. అన్ని దిశలా అన్ని రంగాల్లో భారతీయులందరం భాగస్వాములై భారత భాగ్యోదయా నికి కృషి చేద్దాం. చరిత్రను పాలకులు కాదు, ప్రజలే మారుస్తారు. చరిత్ర నిర్మాణానికి ముందుకు నడుద్దాం. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
San Rechal Gandhi : అందమైన విజయం
పాండిచ్చేరికి చెందిన సాన్ రేచల్ గాంధీ తన శరీరం రంగు కారణంగా వివక్షత, అవహేళనలను ఎదుర్కొంది. బయటి వాళ్ల నుంచి మాత్రమే కాదు బంధువులు, కుటుంబ సభ్యులకు నుంచి కూడా వెక్కిరింపులు ఎదుర్కొంది. ఈ వెక్కిరింపులు తట్టుకోలేక తన స్కిన్ కలర్ మార్చుకోవడానికి రకరకాల కాస్మెటిక్స్ను వాడేది. అయితే ఆ ప్రయత్నాలేవీ ప్రయత్నించలేదు. ఒకానొక దశలో రేచల్కు విసుగొచ్చి ‘ఇదంతా ఏమిటి!’ అనుకుంది. ‘నేను నల్లగా ఉండడం వల్ల ఎవరికీ నష్టం లేదు’ అనుకుంటూ తన రంగును ప్రేమించడం మొదలు పెట్టింది. ఇలా ఉంటే మాత్రమే, ఈ రంగులో ఉంటేనే అందాల పోటీల్లో విజేతలు అవుతారనే స్టీరియోటైప్ ఆలోచనలను బ్రేక్ చేయాలి, సెల్ఫ్–యాక్సెప్టెన్స్ను ప్రమోట్ చేయాలని అందాల పోటీల్లో పాల్గొనాలని నిర్ణయించుకుంది. అయితే కొన్ని పోటీల్లో స్కిన్ కలర్ కారణంగా రిజెక్ట్ చేశారు. అయినా పట్టువదలకుండా అందాల పోటీల్లో పాల్గొనేది. ఎన్నో బ్యూటీ టైటిల్స్ కూడా గెలుచుకుంది. గత సంవత్సరం ‘మిస్ పాండిచ్చేరి’ కిరీటాన్ని గెలుచుకుంది. ‘ఒక డార్క్–స్కిన్ మోడల్ను టీవీలో చూసిన తరువాత నాకు కూడా మోడలింగ్ చేయాలనిపించింది’ అంటున్న రేచల్ ఒక జువెలరీ బ్రాండ్కు మోడలింగ్ చేసింది. మోడల్గా కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఇక తాజా విజయానికి వస్తే సౌత్ ఆఫ్రికాలో జరగనున్న ‘మిస్ ఆఫ్రికా గోల్డెన్’లో మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోంది. -
పాకిస్తాన్పై పీఓకే కన్నెర్ర
కోట్లి (పీఓకే): పాకిస్తాన్పై పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) వాసులు కన్నెర్రజేస్తున్నారు. దశాబ్దాలుగా పాక్ తమపై సవతి తల్లి ప్రేమ చూపుతోందంటూ మండిపడుతున్నారు. చివరికి కరెంటు బిల్లుల మదింపులో కూడా ఈ వివక్ష భరించలేనంత ఎక్కువగా ఉందంటూ వాపోతున్నారు. ‘మా ప్రాంతం నుంచే ఏకంగా 5,000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతోంది. దాన్నంతటినీ తరలించుకుపోయి దేశమంతటికీ వాడుకుంటున్నారు. బిల్లుల విషయానికి వచ్చేసరికి ప్రధాన భూభాగంలో వారికి తక్కువగా, మాకు భరించలేనంత ఎక్కువగా వేస్తున్నారు. ఇది మా పట్ల సహించరాని అన్యాయం‘ అంటూ ఆక్రోశిస్తున్నారు. అది కాస్తా కొద్ది రోజులుగా ఆగ్రహంగా మారి కట్టలు తెంచుకుంటోంది. భారీ కరెంటు బిల్లులకు వ్యతిరేకంగా జనం నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్క కోట్లి జిల్లాలోనే కేవలం ఒక్క నెలలో రూ.139 కోట్ల బిల్లులు వచ్చాయని ప్రముఖ స్థానిక నేత తౌకీర్ వాపోయారు. ‘అందులో కేవలం రూ.19 కోట్ల బిల్లులు కట్టారు. వచ్చే నెల నుంచి అవి కూడా కట్టేది లేదు‘ అని అన్నారు. తమకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. -
రాష్ట్రంలో విద్యపై కేంద్రం వివక్ష!
సాక్షి, హైదరాబాద్: విద్య విషయంలో రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపిస్తోందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. జాతీయ సంస్థల కేటాయింపులో ప్రతి సారీ రాష్ట్రానికి మొండిచేయి చూపుతోందన్నారు. ‘విద్య, వైద్య రంగాల బలోపేతం కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు, పురోగతి’పై శుక్రవారం శాసనసభలో జరిగిన చర్చకు ఆమె బదులిచ్చారు. ‘రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2020 వరకూ విద్యపై రూ.96 వేల కోట్లు ఖర్చు చేసిందని కాగ్ వెల్లడించింది. ఈ ఏడాది రూ.29 వేల కోట్లు ఖర్చు చేశాం. తెలంగాణ వచ్చాక 1,342 గురుకులాలు ఏర్పాటు చేశాం. ఉన్నత విద్యకు రూ.17 వేల కోట్లు ఖర్చు చేశాం. ఫలితంగా రాష్ట్రంలో విద్యార్థుల ప్రవేశాల రేటు 36.2 శాతం ఉంది. ఇది జాతీయ సగటు కన్నా ఎక్కువ..’అని సబిత తెలిపారు. -
ఐఐటీ బాంబేలో కొత్త వివాదం.. నాన్ వెజిటేరియన్లు వేరే చోట కూర్చోవాలంటూ..
ముంబయి: ఐఐటీ బాంబేలో ఆహార అలవాట్లపై వివక్ష చూపుతున్నారనే కొత్త వివాదం తెరమీదకు వచ్చింది. హాస్టల్ క్యాంటీన్లో నాన్వెజ్ భుజించే ఓ విద్యార్థిని మరో విద్యార్థి అవమానపరిచారని ఓ స్టుడెంట్ తెలిపాడు. హాస్టల్ క్యాంటీన్ 12లో ఈ ఘటన వెలుగులోకి వచ్చినట్లు చెప్పాడు. క్యాంటీన్లో శాఖాహారం తినే వారికి మాత్రమే ఇక్కడ కూర్చోవాలి అంటూ పోస్టర్లు కూడా అంటించినట్లు వెల్లడించాడు. ఆ ప్రదేశాల్లో నాన్ వెజిటేరియన్లు ఖాళీ చేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నాడు. హాస్టల్లో తినే ఆహారం ఆధారంగా ఏమైనా విభజన ఉందా? అనే అంశంపై ఆర్టీఐలో సమాధానం కోరినట్లు విద్యార్థులు తెలిపారు. అయితే.. ఈ ప్రశ్నకు ఫుడ్ ఆధారంగా ఎలాంటి వివక్ష లేదని యాజమాన్యం నుంచి బదులు సమాధానం కూడా వచ్చిందని పేర్కొన్నాడు. అయినప్పటికీ ఈ విధంగా వివాదం కొనసాగుతోందని తెలిపాడు. ఈ రకమైన వివక్ష తమకు అవమానకరమని కొంత మంది విద్యార్థులు ట్విట్టర్లో పోస్టు చేశారు. అంబేద్కర్ పెరియార్ పూలే స్టడీ సర్కిల్(ఏపీపీఎస్సీ) విద్యార్థులు ఈ అంశంపై స్పందించారు. ఆహారం ఆధారంగా ఎలాంటి విభజన లేదని ఆర్టీఐలో సమాధానం వచ్చినప్పటికీ కొందరు ఈ రకమైన వివక్షను కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 'విజిటేరియన్స్ ఓన్లీ' అనే పోస్టర్లని క్యాంటీన్ గోడలకు అంటించారని తెలిపారు. Even though RTIs and mails for hostel GSec shows that there is no institute policy for food segregation, some individuals have taken it upon themselves to designate certain mess areas as "Vegetarians Only" and forcing other students to leave that area.#casteism #Discrimination pic.twitter.com/uFlB4FnHqi — APPSC IIT Bombay (@AppscIITb) July 29, 2023 తాము ఉన్నత వర్గాలమని చూటుకోవడానికే కొందరు ఈ రకమైన వివక్ష చూపుతున్నారని విద్యార్థులు చెప్పారు. అట్టడుగు వర్గాల విద్యార్థులను అవమానపరచడమేనని అన్నారు. ఈ అంశంపై ఐఐటీ డైరక్టర్ నుంచి గానీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. నాన్వెజిటేరియన్ విద్యార్థులు ప్రత్యేక ప్లేట్లను ఉపయోగించాలనే ఘటనలు 2018లోనూ జరిగినట్లు చెప్పారు. ఇదీ చదవండి: అమానవీయం: నీళ్లు అడిగాడని.. దివ్యాంగుడ్ని పోలీసులు చితకబాదారు.. వీడియో వైరల్.. -
మాది దిగువ వీధి కాదు..ఇందిరా నగర్
‘కీజ తెరు’ అనంటే తమిళంలో ‘దిగువ వీధి’ అని అర్థం. ప్రతి ఊరిలో దిగువ వీధి ఉంటుంది. దిగువ వీధిలో ఎవరుంటారో ఊరి వారికి తెలుసు. దళితులు. వారు నివసించే ప్రాంతాన్ని ఆ విధంగా గుర్తిస్తారు. ‘ఇలా పేరులో వివక్షను తొలగించండి’ అని తమ వాడ పేరును మార్చడానికి సంవత్సరం పాటు పోరాడింది అనసూయ అనే అమ్మాయి. దిగువ వీధికి బదులుగా వారి వీధి మొన్నటి జూలై 1న ‘ఇందిరా నగర్’ అయ్యింది. వివక్ష గుర్తులను చెరిపే పోరాటం కొనసాగిస్తానని అంటోంది అనసూయ. తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ పదవి స్వీకరించాక 2022 అక్టోబర్లో గ్రేటర్ చెన్నై అంతటా కులాలను సూచించే వీధుల పేర్లను, భవంతుల పేర్లను తొలగించవలసిందిగా ఆదేశించాడు. దేశంలో అన్నిచోట్ల ఉన్నట్టే తమిళనాడులో కూడా ఊళ్లలోని కొన్ని వీధులను కులాల పేర్లతో పిలవడం వాడుకలో ఉంది. సామాజిక స్పృహ పెరిగాక ఈ ధోరణి తగ్గినా చైతన్యం ఎంతో అవసరం ఉంది. ముఖ్యంగా దళితుల విషయంలో. వీరికి ఆలయాల ప్రవేశంలోగాని, ఊరి కట్టుబాట్లలో ప్రాధాన్యం ఇవ్వడంలోగాని వివక్ష పాటిస్తున్నారనే ఎన్నో వార్తలు తమిళనాడు నుంచి వింటూ ఉన్నాం. ఈ నేపథ్యంలో అనసూయ శరవణ ముత్తు అనే 28 ఏళ్ల సివిల్ ఇంజినీర్ తన ఊరిలోని తన వాడకు మర్యాదకరమైన పేరు సాధించడంలో విజయం పొందింది. ఆది ద్రావిడార్ తెరు తమిళనాడులోని అరియలూర్ జిల్లాలో ఆనందవాడి అనే చిన్న పల్లె ఉంది. ఆ పల్లెలో 1994లో దళితులకు పట్టాలిచ్చారు. 2000 సంవత్సరానికి 100 కుటుంబాలు అక్కడ ఇళ్లు కట్టుకుని తమ పేటకు ‘ఇందిరా నగర్’ అని పేరు పెట్టుకున్నారు. అయితే వారు పెట్టుకునే పేరు వారు పెట్టుకోగా ఊరు వారిని తాను ‘ఎలా గుర్తించాలనుకుంటున్నదో’ అలా గుర్తించి ఆ పేటను ‘ఆది ద్రావిడార్ తెరు’, ‘పార తెరు’, ‘ఆది ద్రావిడార్ తెరు’, ‘కీజ తెరు’, ‘దళిత కాలనీ’... ఇలా పిలవడం మొదలెట్టింది. ఇవన్నీ కూడా దళితులు నివసించే ప్రాంతాన్ని సూచించేవే. ‘నా చిన్నప్పుడు స్కూల్లో మా పేట పేరు చెప్పిన వెంటనే నేనెవరో పోల్చుకునేవారు. అప్పుడు నేను ఏమీ చేయలేకపోయాను’ అని ఇదే ప్రాంతం, సామాజిక వర్గం నుంచి చదువుకుని సివిల్ ఇంజనీర్ అయిన అనసూయ శరవణముత్తు అంది. ‘నేను కాలేజీ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెళ్లిపోయాను. 2022లో తిరిగి వస్తే ఇంకా కులాన్ని సూచించే పేరుతోటే నా పేటను పిలుస్తున్నారు. ఇది ఎంతమాత్రం కుదరదు అని నిశ్చయించుకున్నాను’ అంది అనసూయ. అందరితో పోరాడి... ఇందిరా నగర్ అనే పేరును రెవిన్యూ వారు ఏ మాత్రం పట్టించుకోకుండా ‘దిగువ వీధి’ అనే పేరుతోనే వీరి పేటను రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. అలాగే రేషన్ కార్డుల్లో, ఆధార్ కార్డుల్లో, ఓటర్ కార్డుల్లో, చివరకు పాస్పోర్టుల్లో కూడా ఇందిరా నగర్ అని తప్ప రకరకాల వివక్ష పేర్లతో ఇక్కడ నివసిస్తున్న దళితుల గుర్తింపు కార్డులు నమోదై ఉన్నాయి. దాంతో అనసూయ 2022 ఆగస్టు నుంచి పోరాటం మొదలెట్టింది. ‘మొదట కలెక్టర్ చుట్టూ తిరిగాను. తిప్పించుకుని తిప్పించుకుని అక్టోబర్ నాటికి అఫీషియల్గా రికార్డుల్లో మార్చారు. కాని అసలు సమస్య పంచాయతీతో వచ్చింది. ఆనందవాడి పంచాయతీ మా పేటను దిగువ వీధి అని పిలవకూడదనే తీర్మానం చేయడానికి ఏమాత్రం ముందుకు రాలేదు. నేను పోరాడితే ఫిబ్రవరిలో తీర్మానం చేశారు. ఆ తర్వాత పంచాయితీ పెద్దలొచ్చి మా పేట ముందు బోర్డు పెట్టే కార్యక్రమంలో పాల్గొనమని ఎన్నిసార్లు తిరిగినా రాలేదు. దాని కోసం మళ్లీ పోరాడాల్సి వచ్చింది. చివరకు మొన్న జూలై 1న పంచాయతీ పెద్దలంతా వచ్చి బోర్డును నిలబెట్టి వెళ్లారు’ అని తెలిపింది అనసూయ. వివక్షాపూరితం వెనుకబడ్డ, దళిత వర్గాలను సులువుగా గుర్తించేందుకు ఎప్పటి నుంచో వారు నివసించే ప్రాంతాలకు వివక్షాపూరితమైన పేర్లు పెట్టే ఆనవాయితీ ఉందని ఈ ఉదంతం విన్నాక అనసూయను అభినందిస్తూ విల్లుపురం ఎంపీ రవికుమార్ అన్నారు. ‘నువ్వు ఎక్కడుంటావు అనే ప్రశ్నతో ఎదుటివారి కులం ఏమిటో ప్రాంతాన్ని బట్టి అర్థమవుతుంది. దీంతో వివక్ష మొదలవుతుంది. ఇలాంటి వివక్షాపూరితమైన పేర్లను రాష్ట్రమంతా తొలగించాలి’ అని రవికుమార్ అన్నారు. అనసూయలాంటి అమ్మాయిలు పూనుకుంటే అదెంత సేపు? -
అమెరికాలో ఎవరు మనోళ్లు.. ఎవరు పరాయి వాళ్లు?
* మనలో మనకే ఇంత వివక్షా? * "మనోళ్లు "" మనోళ్ళని " చిన్నచూపు చూస్తారా ? (చాలా కాలంగా అమెరికాలో స్థిరపడి అక్కడి సమాజాన్ని నిశితంగా పరిశీలించిన ఒక వ్యక్తికి కౌన్సిలింగ్ ఇస్తుంటే , ఆ వ్యక్తి నాతో పంచుకొన్న సమాచారం ఇది) ఓ కుటుంబం ముప్పై అయిదేళ్ల క్రితమే అమెరికా కు వలసపోయారు. అక్కడే ఉన్నత విద్య, ఉద్యోగం, పిల్లలు. ముందుగా వీసా .. అటుపై గ్రీన్ కార్డు .. అటుపై అమెరికా పౌరసత్వం . వారి పిల్లలు అక్కడే పుట్టారు- జన్మతః అమెరికా పౌరసత్వం. మరో కుటుంబం.. వీరు ఇటీవలే అమెరికాకు వెళ్లారు . ఇంకా వీసా పైనే వున్నారు. వారికో అమ్మాయి / అబ్బాయి. వీరిని పెళ్లి చేసుకొంటారా ? పెళ్లి దాక ఎందుకు ? వారు వీరిని చిన్న చూపు చూస్తారు. దగ్గరకు కూడా రానివ్వరు. ఎందుకంటారా? వివరంగా మీరే చదవండి. ముప్పై / నలభై ఏళ్ళ క్రితం అమెరికాకు వలస పోయి, ఇప్పుడు ఆ దేశ పౌరసత్వాన్ని సాధించిన వారు మేమే గొప్ప, ఉన్నతం అనుకొంటారు. చదువుకునేందుకు లేదా ఉద్యోగం చేసేందుకు వచ్చే వారిని చిన్న చూపు చూస్తారు. ఇలాంటి వారికి తమ అబ్బాయి / అమ్మాయిని ఇవ్వడానికి ఇష్టపడరు. సంబంధాలు చేసుకోరు. పెద్ద వారికంటే, అక్కడే పుట్టి అమెరికా పౌరసత్వాన్ని జన్మతః సాధించుకొన్న రెండవ తరం వారికి జాత్యహంకార భావన చాలా ఎక్కువ . తాము" బ్రౌన్ తోలు కలిగిన శ్వేత జాతీయులు "అనుకొంటారు. అదేంటి?" బ్రౌన్ తోలు కలిగిన తెల్ల జాతివారు"? అనుకొంటున్నారా ? అవునండీ .. తమ తల్లితండ్రులు" ఆసియా నుండి వలస వచ్చారు కాబట్టి తమకు ఇంకా బ్రౌన్ స్కిన్ ఉందని .. తాము వాస్తవంగా అంటే ఆలోచనల్లో ఆంగ్లం మాట్లాడే పద్దతిలో శ్వేతజాతీయులం అని వారు నమ్ముతారు. చదవండి: భారతీయ అమెరికన్ల విలువ పెంచిన ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా ఎన్నిక వీసాపై వచ్చి అక్కడ ఉద్యోగం చేస్తున్న భారతీయులంటే వారికి చిన్న చూపు. కాలేజీలు, ఆఫీస్లలో ఈ బ్రౌన్ తోలు తెల్ల దొరలు , సాధారణ వీసాల వారితో కలవరు, దగ్గరకు రానివ్వరు. ఇక పెళ్లిళ్ల విషయానికి వస్తే బ్రౌన్ తోలు తెల్ల దొరలు , తమలాంటి బ్రౌన్ తోలు తెల్లదొరలనే పెళ్లి చేసుకొంటారు. వీసా వారు తక్కువ జాతివారు ; వారితో పెళ్లి సమస్యే లేదు . అక్కడి మ్యారేజ్ బ్యూరోల్లో " బ్రౌన్ తోలు తెల్ల దొరలకు" వేరే బ్యూరో .. "వీసా వారికి" వేరే బ్యూరో ఉంటుంది . నేను ఒక ప్రశ్న అడిగాను. "అదేంటి అమెరికా దేశాన్ని జాతుల సంగమ దేశంగా పిలుస్తారు కదా ? అక్కడ జాతుల పేరు చెప్పడమే తప్పు . పైగా జాతి అంతరాలు మరచి పెళ్లిళ్లు కూడా చేసుకొంటున్నారు అనుకొంటున్నారా ? అవునండీ .. అది అసలే కాపిటలిస్ట్ దేశం . ప్రతి దానికి ఒక లెక్క ఉంటుందట. ఆ దేశంలో అత్యుత్తమ జాతి ఏది ? శ్వేత జాతి కదా ? రెండో స్థానం బ్రౌన్ తోలు తెల్ల దొరలు / దొరసానులు . అంటే ఇండియా చైనా లాంటి దేశాల నుండి వలస వచ్చిన తల్లితండ్రులకు పుట్టి జన్మతః ఆ దేశ పౌరసత్వాన్ని పొందిన వారు . ఇక అట్టడుగు స్థాయిలో ఉన్న వారు వీసాపై వచ్చి చదువుకుంటున్న వారు, ఉద్యోగాలు చేస్తున్నవారు. శ్వేత జాతి అమ్మాయి, రెండో కేటగిరీకి చెందిన వారినో పెళ్లి చేసుకుంటుందా ? మామూలుగా అయితే జరగదు కానీ.. ఒక లెక్క ప్రకారం జరిగే ఛాన్స్ ఉంది. ఆఫ్రికా / ఇండియా మూలం కలిగిన వ్యక్తి బాగా డబ్బు సంపాదించాడు. తెల్ల అమ్మాయికి ఉద్యోగం లేదు. లేదా తక్కువ జీతం వచ్చే ఉద్యోగం . ఇప్పుడు తాను, తన జాతి పరమైన ఉన్నత స్థానాన్ని ట్రేడింగ్ చేసుకొంటుంది . స్టార్ స్టేటస్ పొందిన నల్ల / బ్రౌన్ జాతి మూలాల్ని కలిగిన యువకుడ్ని పెళ్లి చేసుకొంటే .. వీడికి తెల్ల అమ్మాయి దొరికింది అనే తృప్తి. ఆమెకు కాష్ ఫ్లో .. రేపు పెళ్లి పెటాకులు అయితే .. కావాలని పెటాకులు చేసుకొన్నా.. సగం జీతం .. ఆస్థి లో సగం . దెబ్బకు రెండు పిట్టలు . జాతులు కలిసిపోయి కొత్త తరం మానవాళి రూపొందడం ఉత్తుత్తి మాటే .. అక్కడ సరి కొత్త జాతులు వెలుస్తున్నాయి. చర్మం రంగు .. గ్రీన్ కార్డు / పొరసత్వం , శాలరీ ప్యాకేజీ వీటి ఆధారంగా సరి కొత్త జాతులు వస్తున్నాయి. ఇక్కడ ఇంకో తిరకాసు. దక్షిణ భారతీయులు కొంత లిబరల్ అట. ఉత్తర భారత దేశ మూలాలు కలిగిన వారైతే మహా ముదుర్లు అట . మనిషి ..మానవత్వం ..మట్టి.. మశానం..అన్ని ఉత్తుత్తి మాటలే .నువ్వు అమెరికన్ సిటిజానా ? లేక ఆకు పచ్చ కార్డు ? ఆకు పచ్చ కార్డు అయితే ఇక్కడ "ఎర్ర బస్సు ఎక్కి వచ్చిన జనాలు" అంటారే .. అలాగే ట్రీట్ చేస్తారట . దీనికి తోడు నీ శాలరీ ప్యాకేజీ ఏంటి ? బ్యాంకు బాలన్స్ ఎంత ? .. అక్కడితో అయిపోయిందా ? చదివింది ఎక్కడ ? నువ్వు వీసా పైన ఉన్నా.. ఐఐటీ సరుకైతే కాస్త గౌరవం . అదే చైనా కోళ్లఫారాల సరుకంటే మాహా చిన్న చూపంట.ఇలాంటి వారికి ఏదో పేర్లు వున్నాయి. ఇక్కడి మీడియాకు ఎవరైనా చెప్పండయ్యా బాబు .. " మనోళ్లు " మనోళ్లు " అని రాస్తుంటే / చెబుతుంటే ఏదో ఫీలింగ్ వస్తోంది. చివరాకరికి మనోళ్లు కేటగిరీ అయితే .. జో బిడెన్ .. బరాక్ ఒబామా .. చైనా లో ఫుట్ పాత్ పై వస్తువులు అమ్ముకొనే చున్ వన్ ఉఛ్ .. మెక్సికో నుంచి వలస వచ్చి అమెరికా ఇళ్లల్లో పని చేసుకొనే ఇసాబెల్లా .. కెరిమెన్ .. అందరూ.. అందరూ.. అందరూ మనోళ్లే . వారిది మనది హోమో సేపియన్స్ అనే ఒకటే జాతి . కానీ మనోళ్లు అనే ఫీలింగ్ లేని వారిని.. కనీస మానవ విలువలు లేని వారిని ఎగేసుకొని మనోళ్లు మనోళ్లు అనడం పరమ అసహ్యంగా ఉంటుందా ? ఉండదా ? ఇంత ఆత్మ న్యూనత.. ఇంత ఐడెంటిటీ క్రైసిస్ ఏంటో ? వాసిరెడ్డి అమర్ నాథ్, విద్యావేత్త, మానసిక పరిశోధకులు -
బ్రిటన్ స్కూళ్లల్లో భారతీయ విద్యార్థులు వివక్ష ఎదుర్కొంటున్నారా?
1 ." మీరు స్వస్తిక్ గుర్తును పవిత్రంగా భావిస్తారు. అంటే మీరు నాజీలను సమర్థించేవారు". 2 . " మీరు 330 మిలియన్ దేవతల్ని పూజిస్తారు . అందులో కోతి, ఏనుగు లాంటి జంతువులు కూడా ఉన్నాయి" 3 ." మీరు సతి సహగమన ఆచారాన్ని పాటించారు ". 4 ." మీ కుల వ్యవస్థ వల్లే హిట్లర్ అలా అయ్యాడు" బ్రిటన్ పాఠశాలల్లో భారతీయ మూలాలు కలిగిన విద్యార్థుల్ని బెదిరిస్తూ / గేలి చేస్తూ తోటి విద్యార్థులు అన్న మాటలివి. హెన్రీ జాక్సన్ సొసైటీ బ్రిటన్ లో నివసిస్తున్న వెయ్యి మంది తల్లితండ్రుల్ని ఇంటర్వ్యూ చేసి వెలికి తెచ్చిన కొన్ని అంశాలు ఇవి. ఇలాంటి బుల్లియింగ్ వల్ల తమ పిల్లలు పాఠశాలలకు వెళ్ళడానికి నిరాకరిస్తున్నారు అని ఆ తల్లితండ్రులు చెప్పుకొచ్చారు. ఇది కేవలం బ్రిటన్ పాఠశాలలకు పరిమితమయిన అంశం కాదు. మాయ మర్మం తెలియని వయసులో చుట్టూరా ఉన్న సమాజం, మీడియా నాటిన విష బీజాల కారణం గా నేటి విద్యార్థుల్లో కుల / మత/ ప్రాంత / వర్ణ విద్వేషలు పెచ్చరిల్లు తున్నాయి. ఒక పక్క ప్రపంచం కుగ్రామంగా మారుతున్న వైనం . గ్రామాలు/ పట్ఠణాలు / రాష్ట్రాలు / దేశాలు లాంటి ఎల్లలు దాటి సముద్రాలు దాటి ఖండాలు దాటి తల్లితండ్రులు వలసపోతున్నారు. ఎక్కడో సెటిల్ అవుతున్నారు . అక్కడ పుట్టిన పిల్లలు తమ పూర్వీకుల సంస్కృతిని అది మంచో చెడో తరువాత .. పూర్తిగా ఒంట బట్టించుకోలేరు .. అక్కడి సమాజం లో పూర్తిగా కలవాలంటే ఇదిగో ఇలాంటి ఆటంకాలు / అవాంతరాలు. విద్వేషం .. నేటి సార్వ జనీన జీవన విధానం అయిపోయింది . అవతలి వారి పై కులం/ మతం / వర్ణం / జాతి /పుట్టుక లాంటి వాటి ఆధారంగా విద్వేషాన్ని పెంచుకోవడం .. ఆస్ట్రేలియా నుంచి కెనడా దాకా ఇదే తంతు. లాక్ డౌన్ కాలం లో ఇంటికే పరిమితం కావడం వల్ల జనాల్లో సంకుచిత స్వభావం బలపడిపోయింది . దీనికి తోడు ఆర్థిక మాంద్యం .. కొరతలు .. ద్రవ్యోల్భణం .. ఉద్యోగాలు కోల్పోవడం .. నిరుద్యోగిత .. బలహీనతల్ని రెచ్చగొట్టే సోషల్ మీడియా .. యు ట్యూబ్ వీడియోలు .. అన్నింటికీ మించి మానవ బలహీనతల్ని కనిపెట్టి కాష్ చేసుకొనే రాజకీయ రాబందులు... వందేళ్ల క్రితం ఇప్పుడు మనకు కరోనా వచ్చినట్టే స్పానిష్ ఫ్లూ వచ్చింది. అటు పై మొదటి ప్రపంచ యుద్ధం. అటు పై పదేళ్ల పాటు ప్రపంచ మాంద్యం .. కొరతలు .. దీన్ని ఆసరాగా చేసుకొని నాజిజం, ఫాసిజం , స్టాలినిజం .. ఇలా ప్రపంచం లో అనేక ప్రాంతాల్లో నిరంకుశ రాజ్యాలు వచ్చాయి . మానవాళి పెను మూల్యం చెల్లించుకొంది . బుద్ధి ఉన్నవాడు చరిత్ర నుంచి పాఠాల్ని గ్రహిస్తాడు . డిజిటల్ యుగం లో చరిత్ర పాఠాలు గాలికి పోయాయి . మానవాళి నేడు ఉపద్రవం వైపు వడివడిగా అడుగులేస్తోంది. ప్రేమ .. సహానుభూతి .. ఓర్పు ఇవే మానవాళిని రక్షించగల మందులు . సర్వే జనా సుఖినోభవంతు ! వాసిరెడ్డి అమర్ నాథ్, విద్యావేత్త, మానసిక శాస్త్ర పరిశోధకులు -
సంకల్ప బలమే సబల విజయం
కోపం వస్తే కొందరు ఏంచేస్తారు? దగ్గర్లో ఉన్న వస్తువును నేలకేసి బాదుతారు. మరింత ముందుకు వెళ్లి తమకు తాము హాని చేసుకుంటారు. ప్రతికూలత ప్రతిధ్వనించే కోపాన్ని శక్తిగా మలుచుకుంటే అద్భుతాలు సాధించలేమా! ‘అప్నా క్లబ్’ కో–ఫౌండర్, సీయీవో శ్రుతి విజయగాథ ఈ విషయాన్ని చెప్పకనే చెబుతోంది... శ్రుతికి చిన్నప్పటి నుంచి కోపం ఎక్కువ. అయితే అది అకారణ కోపం మాత్రం కాదు. ‘నీకు ముగ్గురూ ఆడపిల్లలేనా. అయ్యో!’ అని తన తండ్రి దగ్గర ఎవరో వాగినప్పుడు... ‘ఈ అమ్మాయిలకు మ్యాథ్స్ బొత్తిగా రాదు’ ‘కాలేజీలో సైన్స్ జోలికి వెళ్లవద్దు. ఏదైనా తేలికపాటి సబ్జెక్ట్ తీసుకోండి’ అని క్లాసు టీచర్ ఉచిత సలహాలు ఇచ్చినప్పుడు... ‘అలా గట్టిగా నవ్వుతావేమిటీ? ఆడపిల్లను అనే విషయం మరిచావా’ అని బంధువు ఒకరు అన్నప్పుడు... ఆమెకు కట్టలు తెచ్చుకునేంత కోపం వచ్చేది. అయితే ఆ కోపాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో తనకు తెలుసు. ‘ఆడపిల్లలకు మ్యాథ్స్ రాదు’ అని వెక్కిరింపు శ్రుతిలో పట్టుదలను పెంచి ఐఐటీ–దిల్లీ వరకు తీసుకెళ్లింది. అయితే అక్కడ కూడా లింగవివక్ష రకరకాల రూపాల్లో వెక్కిరించేది. ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు ‘ఇక్కడ ఆడవాళ్లకు ఏం పని?’ ‘స్కోర్ జీరో బ్యాచ్’ ఇలా ఎన్నో వెక్కిరింపులు వినిపించేవి. తన స్నేహితులతో కలిసి ఎన్నో కప్పులు గెలుచుకొని ఆ వెక్కిరింపులకు గట్టి సమాధానం చెప్పింది శ్రుతి. చదువు పూర్తయిన తరువాత ఉద్యోగప్రస్థానం మొదలైంది. అయితే అక్కడ కూడా ఏదో రకమైన వివక్షత కనిపించేది. ఆ తరువాత కాలంలో... ఉద్యోగం వద్దనుకొని ఒక స్వచ్ఛంద సంస్థలో చేరింది శ్రుతి. అక్కడ మనసు ప్రశాంతంగా అనిపించింది. తన గురించి తాను తీరిగ్గా ఆలోచించుకునే అవకాశం వచ్చింది. ‘ప్రయాణించడానికి దారులు ఎన్నో ఉన్నాయి. సాధించాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి’ అనే ఎరుక ఆమెలో కలిగింది. ‘నువ్వు ఎంబీఏ చేస్తే రాణించగలవు’ అని అక్కడ ఒకరు సలహా ఇచ్చారు. అలా హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (హెచ్బీఎస్)లో చేరింది. ఇండియాకు తిరిగి వచ్చిన తరువాత ‘సైర్’ పేరుతో టూర్ అండ్ ట్రావెల్ స్టార్టప్ను ఆరంభించింది. ఈ స్టార్టప్ నష్టాలు మిగల్చడంతో పాటు విలువైన పాఠాలు నేర్పింది. ఆ పాఠాల వెలుగులో మరో ప్రయాణం మొదలుపెట్టింది శ్రుతి. చిన్న పట్టణాలలో ప్రజలు ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్) ప్రాడక్ట్స్ కొనడానికి ఆసక్తిగా ఉన్నారనే విషయం అర్థమైన తరువాత మనీష్ కుమార్తో కలిసి ‘అప్నాక్లబ్’ అనే ఎఫ్ఎంసీజీ ప్లాట్ఫామ్ను బెంగళూరు కేంద్రంగా స్టార్ట్ చేసింది. ఈ ప్లాట్ఫామ్ ఒక రేంజ్లో సక్సెస్ అయింది. శ్రుతిలో ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ ప్రపంచానికి తెలిసాయి. ‘అప్నాక్లబ్’ బ్యాకర్స్ జాబితాలో టైగర్ గ్లోబల్, ట్రూ స్కేల్ క్యాపిటల్, వైట్బోర్డ్ క్యాపిటల్... మొదలైన సంస్థలు ఉన్నాయి. ‘శ్రుతి గొప్ప సంకల్పబలం ఉన్న వ్యక్తి’ అని ప్రశంసిస్తున్నారు వైట్బోర్డ్ క్యాపిటల్ పార్ట్నర్ అన్షు ప్రషర్. నిజమే కదా... ‘ఆడపిల్లలకు లెక్కలు రావు’ అనే వెక్కిరింపును సవాలుగా తీసుకొని సంకల్పబలంతో గణితంలో ప్రతిభ ప్రదర్శించింది. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదువుకునే రోజుల్లో అదృశ్య వివక్షను ఖాతరు చేయకుండా ముందడుగు వేయడానికి ఆ సంకల్పబలమే ఉపయోగపడింది. స్టార్టప్ యాత్రలో కూడా కామెంట్స్ రూపంలో లింగవివక్షత కనిపించినా, ధైర్యం కోల్పోకుండా ఉండడానికి ఆ సంకల్ప బలమే ఉపయోగపడింది. ఎక్కడో మొదలైన సంకల్పబలం ‘అప్నా క్లబ్’ వరకు తనతోనే ఉంది. చీకటి కమ్ముతున్నప్పుడు వెలుగును ఆయుధంగా ఇచ్చింది. ఓటమి వెక్కిరించినప్పుడు గెలుపును ఆయుధంగా ఇచ్చింది. ‘కోపం ఉన్న ఆడవాళ్లను జనాలు అసౌకర్యంగా చూస్తారు. మగవాళ్ల విషయానికి వస్తే యాంగ్రీ యంగ్మెన్ అని మురిసిపోతారు’ అంటూ నవ్వుతుంది శ్రుతి. తనను ‘ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్’గా పిలిపించుకోవడం కంటే ‘ఎంటర్ప్రెన్యూర్’గా పిలిపించుకోవడానికే శ్రుతి ఇష్టపడుతుంది. చిన్నప్పుడు తండ్రి ఒకరోజు అడిగాడు... ‘మ్యాథ్స్లో ఎన్ని మార్కులు స్కోర్ చేయాలో తెలుసా?’ ‘నన్ను నమ్మండి’ అన్నది శ్రుతి. అప్పటినుండి తనపై తనకు ఉన్న నమ్మకాన్ని, ఇతరులకు తనపై ఉన్న నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోలేదు శ్రుతి. -
‘సాగు’లో లింగవివక్ష మూల్యం 81.84 లక్షల కోట్లు!
మహిళలపట్ల వివక్ష వల్ల సామాజికంగా వాటిల్లే నష్టానికి వెలకట్టలేం. అయితే వ్యవసాయం, ఆహార శుద్ధి, నిల్వ, పంపిణీ (అగ్రి ఫుడ్ సిస్టమ్స్) రంగాల్లో లింగవివక్ష వల్ల ఎంత నష్టం వాటిల్లుతున్నదో తెలుసుకొనేందుకు ఐక్యరాజ్య సమితి (ఐరాస)కి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ఇటీవల అధ్యయనం చేసింది. లింగవివక్ష కారణంగా ఏటా లక్ష కోట్ల డాలర్ల (రూ. 81,84,550 కోట్లు) సంపదను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోల్పోతున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. వ్యవసాయ రంగంలో మహిళల స్థితిగతులపై 2010 విరామం తర్వాత ఎఫ్ఏఓ వెలువరించిన తొలి అధ్యయన నివేదిక ఇదే. వ్యవసాయంతోపాటు ఈసారి ఆహార శుద్ధి, రవాణా, నిల్వ, పంపిణీ రంగాల్లో రైతులుగా, కూలీలుగా, ఉద్యోగినులుగా, వ్యాపారవేత్తలుగా, చిరు వ్యాపారులుగా పనిచేసే మహిళల స్థితిగతులపై సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక విడుదల చేయటం గమనార్హం. వివక్షను రూపుమాపితే రైతుల ఆదాయం పెరుగుతుంది వ్యవసాయ, ఆహార వ్యవస్థల్లో మహిళలపట్ల లింగ వివక్షను నిర్మూలిస్తే ఆహారోత్పత్తి పెరిగి ఏటా లక్ష కోట్ల డాలర్ల మేరకు ఆదాయం సమకూరుతుంది. పేదరికం, ఆకలి తగ్గుతుంది. 4.5 కోట్ల మంది నిరుపేదలకు అదనంగా ఆహార భద్రత కలుగుతుంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ఎఫ్ఏఓ తేలి్చచెప్పింది. అంతేకాదు.. వాతావరణ మార్పులు, కోవిడ్ మహమ్మారి వంటి విపత్కర పరిస్థితులను దీటుగా తట్టుకోవాలన్నా లింగవివక్షను రూపుమాపాల్సిన అవసరం ఉందని ఎఫ్ఏఓ నివేదిక స్పష్టం చేసింది. లింగ వివక్షను తగ్గించి మహిళా సాధికారతను పెంచే పథకాల వల్ల సగానికి సగం చిన్న రైతులకు మేలు జరుగుతుంది. 5.8 కోట్ల మంది ఆదాయం పెరుగుతుంది. మరో 23.5 కోట్ల మందికి విపత్తులను తట్టుకొనే శక్తి పెరుగుతుందన్నది తమ అంచనా అని ఎఫ్ఏఓ డైరెక్టర్ జనరల్ క్యు డోంగ్యు తెలిపారు. ఏ ముప్పు అయినా మహిళలనే ముందు దెబ్బతీస్తుంది. కోవిడ్ మహమ్మారి వచి్చన మొదటి ఏడాదిలో ఆహార శుద్ధి, పంపిణీ రంగంలో 22% మహిళల ఉద్యోగాలు పోతే, 2% పురుషుల ఉద్యోగాలు పోయాయి. కరువు కాటకాలు, ఉష్ణోగ్రతలు పెచ్చుమీరిన సంక్షోభ కాలాల్లో వ్యవసాయ–ఆహార రంగాల్లో పనిచేసే మహిళల బిడ్డల పోషణ, ఇంటి పనికి అదనంగా దూరం వెళ్లి నీళ్లు తెచ్చే భారం పెరిగిపోతోంది. అల్ప, మధ్య తరహా ఆదాయ దేశాల్లో మొబైల్ ఇంటర్నెట్ సదుపాయం విషయంలో లింగ వివక్ష 25% నుంచి 16 శాతానికి తగ్గినట్లు గుర్తించారు. గత పదేళ్లుగా అనేక దేశాల్లో మహిళలకు అనుకూల విధానాలు వస్తున్నప్పటికీ వ్యవసాయం–ఆహార రంగాల్లో పెద్ద మార్పు కనిపించట్లేదు. 68 దేశాల్లో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన 75% విధానాల్లో మహిళల ప్రాధాన్యతను గుర్తించినప్పటికీ లింగవివక్షను తగ్గించే ప్రయత్నాలు 19% విధానాల్లోనే కనిపించింది. విధాన నిర్ణేతలు క్షేత్రస్థాయిలో లింగవివక్షను తగ్గించేందుకు మహిళా సాధికారతకు పెద్దపీట వేయాలని ఎఫ్ఏఓ సూచించింది. గొడ్డు చాకిరీ.. 18% తక్కువ ఆదాయం ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ, ఆహార వ్యవస్థలపై ఆధారపడి జీవిస్తున్న వారి సంఖ్య 400 కోట్లు. ఏటా 1,100 కోట్ల టన్నుల ఆహారోత్పత్తి జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా సగటున 36% మంది మహిళలకు, 38% మంది పురుషులకు ఉపాధి కల్పిస్తున్న రంగం ఇది. అయితే ఆఫ్రికా దేశాల్లో 66% మంది మహిళలకు వ్యవసాయమే ఉపాధి. చిన్న, సన్నకారు రైతులకు నిలయమైన భారత్ తదితర దక్షిణాసియా దేశాల్లో ఇది మరీ ఎక్కువ. ఈ దేశాల్లో 71% మంది మహిళలు (మహిళా రైతులు, కూలీలు, ఉద్యోగినులు) వ్యవసాయ–ఆహార వ్యవస్థల్లో ఉపాధి పొందుతున్నారు. అలాగే పురుషులు 47% మంది ఉపాధి పొందుతున్నారు. అయితే కూలికి వెళ్లే వారిలో పురుషులకన్నా మహిళల సంఖ్యే తక్కువ. గత పదేళ్లలో పొలం పనులపై ఆధారపడే వారి సంఖ్య 10% తగ్గినట్లు ఎఫ్ఏఓ.నివేదిక చెబుతోంది. వ్యవసాయ–ఆహార వ్యవస్థల్లో ఉపాధి పొందుతున్న మహిళల పని పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. గొడ్డు చాకిరీ చేసినా పని భద్రత లేదు. పార్ట్టైమ్ పనులు, కొన్నాళ్లు మాత్రమే ఉండే పనులు, తక్కువ నైపుణ్యం అవసరమైన పనులే మహిళలకు ఇస్తున్నారు. అందువల్ల పురుషులకన్నా 18% తక్కువగా వారి ఆదాయం ఉంటోంది. కౌలు రైతులకు మరీ కష్టం.. భూమిని కౌలుకు తీసుకున్న మహిళా రైతులు తీవ్ర అభద్రతకు గురవుతున్నారని ఎఫ్ఏఓ పేర్కొంది. 46 దేశాల్లో గణాంకాలను పరిశీలిస్తే 40 దేశాల్లో పురుష రైతులకు ఎక్కువ భూమి హక్కులు ఉన్నాయి. అదేవిధంగా కౌలు నిబంధనలు కూడా వారికి అనుకూలంగా ఉన్నాయి. మరోవైపు మహిళా రైతులకు రుణ సంస్థల నుంచి పరపతి అందట్లేదు. శిక్షణా అవకాశాలు మహిళలకు అంతగా అందుబాటులో ఉండట్లేదు. అన్నిటికన్నా మించి పురుషులను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన సాంకేతికతలు, యంత్రాలనే మహిళలు ఉపయోగించాల్సి వస్తోంది. ఈ అసమానతల వల్ల సమాన విస్తీర్ణంలో పంటలు సాగు చేసిన పురుషులకన్నా మహిళలు సాగు చేసిన పొలాల్లో ఉత్పాదకత 24% తక్కువగా వస్తున్నట్లు ఎఫ్ఏఓ నివేదిక తెలిపింది. ఇప్పుడు మహిళల కోసం వ్యవస్థలు పనిచేయాలి వ్యవసాయ, ఆహార రంగాల్లో లింగ అసమానతలను స్థానికంగా ఎక్కడికక్కడ పరిష్కరించి మ హిళలకు సాధికారత కలి్పస్తే పేదరికాన్ని అంతం చేయడం, ఆకలి కేకలులేని ప్రపంచాన్ని సృష్టించ డం వంటి లక్ష్యాల సాధన కృషిలో ప్రపంచం ముందుకు దూసుకుపోతుంది. వ్యవసాయ, ఆహార వ్యవస్థల్లో మహిళలు అనాదిగా పనిచేస్తున్నారు. వారి కోసం ఈ వ్యవస్థలు పని చేయాల్సిన సమయం ఆసన్నమైంది. – డా. క్యూ డోంగ్యు, డైరెక్టర్ జనరల్, ఆహార–వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏఓ) చదవండి: కృత్రిమ మేధను తలచుకొంటే నిద్రలేని రాత్రులే -
జుట్టుపైనా వివక్ష! క్రౌన్ యాక్ట్ బిల్లుకు ఆమోదం, వారికి ఆనందానికి అవధుల్లేవ్
‘అది జుట్టా, కలుపు మొక్కా?’ అని ఒకరు, ‘గొర్రె బొచ్చుకు, వారి జుట్టుకు ఏమన్నా తేడా ఉందా?’ అని మరొకరు ‘నల్ల జుట్టుంటే ఉద్యోగానికేం పనికొస్తారు?’ జుట్టుపై అమెరికన్ల వివక్షాపూరిత వ్యాఖ్యలివి! జాతి వివక్ష, మత వివక్ష, కుల వివక్ష గురించి విన్నాం. కానీ అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికాలో మాత్రం తలపై జుట్టు దగ్గర్నుంచి కాలి గోళ్ల దాకా అక్కడ అన్నింటా వివక్ష రాజ్యమేలుతోంది. నల్ల జుట్టుపై వివక్షను నిషేధిస్తూ టెక్సాస్ హౌస్ తాజాగా బిల్లును ఆమోదించడంతో ఈ అంశం మరోసారి చర్చనీయంగా మారింది... జుట్టు నల్లగా, పొడవుగా, రింగులు తిరిగి ఉంటే అమెరికన్లు సహించలేరు. కొప్పు బాగా కుదిరితే చక్కగా ఉంటుందంటాం. కానీ నల్లజాతి అమ్మాయిలు రకరకాల హెయిర్ స్టైల్స్తో కొప్పును గొప్పగా ప్రదర్శించడం కూడా అమెరికన్లకు కంటగింపు వ్యవహారమే. స్కూళ్లు, పని ప్రాంతాలు, నలుగురు కలిసే చోట... ఇలా అంతటా ఈ వివక్ష తీవ్ర రూపు దాల్చి కన్పిస్తుందక్కడ. ఆఫ్రో, బ్రయిడ్స్, డ్రెడ్లాక్స్, కార్న్రోస్ హెయిర్ స్టైల్స్ చేసుకునే వారిపై వివక్ష పెరిగిపోతుండటంతో టెక్సాస్లో ప్రతినిధుల సభ కల్పించుకోవాల్సి వచ్చింది. నల్లజుట్టుపై వివక్ష పనికిరాదంటూ క్రౌన్ యాక్ట్ బిల్లును ఆమోదించింది. జుట్టుపై వివక్ష తగదంటూ డెమొక్రాట్ సభ్యురాలు రెట్టా బోవర్స్ తొలుత గళమెత్తారు. ఎవరి జుట్టు ఎలా ఉంటే అలానే ఉండనివ్వాలి. మార్చుకొమ్మని శాసించే హక్కు ఎవరికీ ఉండదు’’అన్నారామె. బోవర్స్ తొలిసారి ఈ బిల్లును ప్రతిపాదించినప్పుడు ఇదంత అవసరమా అని అంతా కొట్టిపారేసారు. కానీ ఇప్పుడది 143–5 ఓట్లతో నెగ్గడంతో ఆమె ఆనందం అవధులు దాటింది. బిల్లు ఎలా వచ్చిందంటే.. హ్యూస్టన్లో బార్బర్స్ హిల్ హైస్కూలులో అధికారులు డెండ్రే ఆర్నాల్డ్ అనే విద్యార్థిపై చూపిన వివక్ష ఈ బిల్లుకు కారణమైంది. ఆర్నాల్డ్ ఏడో తరగతి నుంచి జుట్టు పెంచుకుంటున్నాడు. అది ట్రినిడాడియన్ల సంస్కృతిలో భాగం. కానీ జుట్టు కత్తిరించుకోకుంటే గ్రాడ్యుయేషన్ క్లాసులకు అనుమతించేది లేదని స్కూలు అధికారులు తేల్చి చెప్పారు. అబ్బాయి తల్లిదండ్రులు కాళ్లావేళ్లా పడ్డా లాభం లేకపోయింది. ఇదంతా 2020లో జరిగింది. ఆర్నాల్డ్ కథ ఇంటర్నెట్లో వైరలైంది. అతనికి ప్రఖ్యాత టీవీ షో ది ఎలెన్ డిజెనరస్లో పాల్గొనే అవకాశం వచ్చింది. హెయిర్ లవ్ అనే షార్ట్ ఫిల్మ్ తీసిన దర్శకుడు మాథ్యూ ఎ చెర్రీ ఆ అబ్బాయిని ఆస్కార్ అవార్డు ఫంక్షన్కు కూడా ఆహ్వానించాడు. మరెందరో విద్యార్థులను జుట్టు పొడవుగా ఉందంటూ స్కూలు నుంచి తీసేసిన ఉదంతాలు వెలుగులోకి రావడంతో ఈ వివక్షను నిషేధిస్తూ చట్టం చేయాల్సి వచ్చింది. ఈ వివక్ష ఇప్పటిది కాదు! అమెరికాలో నల్ల జుట్టుపై వివక్ష 18వ శతాబ్దం నుంచీ ఉంది. ఆఫ్రికన్ల జుట్టు గొర్రె బొచ్చులా ఉంటుందని అప్పట్లోనే హేళన చేసేవారు. తర్వాత రకరకాల హెయిర్ స్టైల్స్ చేసుకునే నల్లజాతి మహిళలు ఉద్యోగాలకు పనికి రారన్న అభిప్రాయం అమెరికన్లలో పెరిగింది. జుట్టు ఎక్కువున్న వారికి వృత్తిపరమైన లక్షణాలేవీ ఉండవని, ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే సామర్థ్యముండదని అడ్డమైన వాదనలు తెరపైకి తెచ్చారు. తెల్ల జుట్టు వాళ్లకే ఉద్యోగాల్లో ప్రాధాన్యమిచ్చేవారు. ఇంటర్వ్యూ ఉంటే హెయిర్స్టైల్ మారాల్సిందే! డోవ్, లింక్డిన్ సంస్థలు ఇటీవల జుట్టు వివక్షపై సంయుక్త అధ్యయనం చేశాయి. నల్లజాతి యువతుల్లో మూడింట రెండొంతుల మంది ఇంటర్వ్యూలకి వెళ్లినప్పడు హెయిర్ స్టైల్స్ మార్చుకుంటున్నట్టు తేలింది. నల్లటి కురులున్న 25–34 మధ్య వయసు వారిలో 20 శాతం మందిని ఉద్యోగాల నుంచి తీసేశారు. టీవీ షోలు, సోషల్ మీడియాలోనూ నల్ల జుట్టుపై విషం కక్కడం పరిపాటిగా మారింది. ఒబామా భార్యకూ తప్పలేదు! అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మహిళ మిషెల్కు కూడా జుట్టు వివక్ష తిప్పలు తప్పలేదు. ఒబామా అధ్యక్షుడిగా ఉండగా ఆమె తన రింగుల జుట్టును సాఫీగా ఉండేలా చేయించుకున్నారట. ఈ విషయం గతేడాది ఓ కార్యక్రమంలో ఆమే స్వయంగా చెప్పారు. ‘‘వైట్హౌస్లో ఉండగా ఒబామా పాలనపై కాకుండా నా జుట్టుపై ఎక్కడ చర్చ జరుగుతుందోనని హెయిర్స్టైల్ మార్చుకున్నా. ఒక నల్లజాతి కుటుంబం శ్వేతసౌధంలో ఉండటాన్ని సగటు అమెరికన్లు అంతగా జీర్ణించుకోలేరు. దానికి తోడు నా జుట్టుపైనా వివాదం రేగడం ఎందుకని భావించా’’అన్నారు. అమెరికా సమాజంలో జుట్టు వివక్ష ఎంతలా వేళ్లూనుకుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇరాన్లో మతోన్మాదుల రాక్షసకాండ.. విషవాయువుల ప్రయోగం
నాగరిక ప్రపంచంలో వివక్షకు తావులేదు. ఆడ, మగ అనే తేడా చూపడం నైతిక సూత్రాల ప్రకారమే కాదు, చట్ట ప్రకారమూ ముమ్మాటికీ నేరమే. బాలికలకు విద్యను నిరాకరించడం, వారికి చదువుకొనే అవకాశాలు దూరం చేయడం రాక్షసత్వమే అనిపించుకుంటుంది. ఇస్లామిక్ దేశమైన ఇరాన్లో ఇప్పుడు అచ్చంగా అలాంటిదే జరుగుతోంది. కేవలం విద్యార్థినులను లక్ష్యంగా చేసుకొని విష వాయువుల ప్రయోగానికి పాల్పడుతున్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారు, దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులెవరనేది అంతుచిక్కడం లేదు. మరోవైపు దుండగుల దుశ్చర్యపై బాలికల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడేం జరుగుతోందో తెలియక వణికిపోతున్నారు. సమాజంలో అశాంతి నెలకొంటోంది. విష వాయువుల ప్రయోగాల గుట్టును రట్టు చేస్తామని, దోషులను కచ్చితంగా శిక్షిస్తామని ఇరాన్ ప్రభుత్వం హామీ ఇవ్వడం కొంత ఊరట కలిగిస్తోంది. రగిలిన ఉద్యమం.. ఇరాన్లో 1979లో జరిగిన ఇస్లామిక్ విప్లవం తర్వాత మహిళలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. బాలికలు, యువతులపై ఆంక్షలన్నీ దాదాపుగా తొలగిపోయాయి. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి నిర్భయంగా చదువుకుంటున్నారు. పొరుగున ఉన్న అఫ్గానిస్తాన్ తరహా పరిస్థితులు ఇరాన్లో లేవు. బాలికల విద్యాభ్యాసాన్ని, మహిళలు ఉద్యోగాలకు వెళ్లడాన్ని తాలిబన్ ప్రభు త్వం నిషేధించడం పట్ల ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పద్ధతి మార్చుకోవాలని, మహిళలపై ఆంక్షలు ఎత్తివేయాలని తాలిబన్ పాలకులను హెచ్చరించింది కూడా. అలాంటిది ఇరా న్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. తలపై బురఖా సక్రమంగా ధరించనందుకు 22 ఏళ్ల మహసా అమీనీ అనే యువతిని గత ఏడాది సెప్టెంబర్లో ఇరాన్ నైతిక పోలీసులు నిర్బంధించారు. చిత్రహింసలు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. మూడు రోజులపాటు కోమాలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడిన అమీనీ సెప్టెంబర్ 16న మృతి చెందింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళలు, యువతులు, బాలికలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. నైతిక నియమావళి పేరిట తమను అణగ దొక్కుతున్నారని, గొంతు నొక్కు తున్నారని, హక్కులు హరిస్తున్నారని ఆరోపిస్తూ నెలల తరబడి ఆందోళన కొనసాగించారు. నైతిక పోలీసు వ్యవస్థను రద్దు చేయాలని నినదించారు. వారి ఆందోళన మహోగ్ర ఉద్యమంగా మారింది. మహిళల ఉద్యమం పట్ల ప్రభుత్వం దిగివచ్చింది. వారి డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. మహిళలంతా శాంతించాలని కోరింది. ముష్కరుల ఉద్దేశం అదేనా! మహిళలు, యువతులు, బాలికలు పెద్ద ఎత్తున ఉద్యమించడం, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, దిగి వచ్చేలా చేయడం మతోన్మాదులకు, పిడివాదులకు కంటగింపుగా మారింది. బాలికలను విద్యాసంస్థ లకు వెళ్లకుండా, చదువుకోకుండా చేయడమే లక్ష్యంగా కుతంత్రానికి తెరలేపారు. భయభ్రాంతులకు గురిచేసి, ఇళ్లకే పరిమితం చేయడానికి విష వాయువుల ప్రయోగం అనే దొంగదారిని ఎంచుకున్నారు. విద్యార్థినులెవరూ రాకపోతే పాఠశాలలు మూతపడతాయన్నది వారి ఉద్దేశం. ముసుగులు ధరించి, తరగతి గదుల్లోకి హఠాత్తుగా ప్రవేశించడం, విష వాయువులు వదిలి, క్షణాల్లో మాయం కావడం.. కుట్ర మొత్తం ఇలా సాగింది. జరిగింది ఇదీ.. ► ఇరాన్లో 30 ప్రావిన్స్లు ఉండగా, 21 ప్రావిన్స్ల్లో 50కి పైగా పాఠశాలల్లో విష వాయువుల ప్రయోగాలు జరిగాయి. ► గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటిదాకా 50కి పైగా పాఠశాలల్లో 700 మంది విద్యార్థినులు ఈ ప్రయోగాల బారినపడినట్లు ప్రభుత్వ అధికారులు నిర్ధారించారు. అయితే, ఇప్పటివరకూ ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. ► బాధితుల్లో శ్వాస సంబంధిత సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ► తలనొప్పి, వికారం, వాంతులు, తల తిరగడం, అలసట వంటి లక్షణాలు కనిపించాయి. బాధితులు కాళ్లు, కడుపులో నొప్పితో విలవిల్లాడారు. ► కొందరిలో అవయవాలు తాత్కాలికంగా మొద్దుబారిపోయినట్లు వెల్లడయ్యింది. ► దుండుగులు ప్రయో గించిన వాయువులు ► కుళ్లిన నారింజ పండ్ల వాసన, క్లోరిన్ వాసన, టాయ్లెట్లు శుభ్రం చేసుకొనే రసాయనాల వాసన వచ్చినట్లు బాధితులు చెప్పారు. ► ఫాతిమా రెజై అనే 11 బాలిక విష ప్రయోగం కారణంగా చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఇన్ఫెక్షన్ వల్లే మరణించిందని ఆమె కుటుంబ సభ్యులు, చికిత్స అందించిన డాక్టర్ చెప్పారు. క్షమించరాని నేరం ఇరాన్ పాఠశాలల్లో విష వాయువుల ప్రయోగాలు అంతర్జాతీయంగా సంచలనాత్మకంగా మారాయి. బాలికలపై విష వాయువులు ప్రయోగించడం క్షమించరాని నేరమని ఇరాన్ అధినేత అయతుల్లా అలీ ఖమేనీ చెప్పారు. గుర్తుతెలియని ముష్కరులు ఉద్దేశపూర్వ కంగానే ఈ అకృత్యాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోందని, వారిని బంధించి, చట్టం ముందు నిలబెడతామని, కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. బాలికలపై ఇలాంటి ప్రయోగాలు చేయడం ఏకంగా మానవత్వంపై జరిగిన నేరమేనని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ తేల్చిచెప్పారు. డ్రెస్ కోడ్ ఉల్లంఘిస్తే శిక్షించాల్సిందే ఇరాన్ న్యాయ వ్యవస్థ అధినేత ఘోలామ్హుస్సేన్ మొహసెనీ ఏజీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇస్లామిక్ డ్రెస్ కోడ్ ఉల్లంఘించిన మహిళలను కఠినంగా శిక్షించాలని అన్నారు. మహిళలు హిజాబ్ తొలగించడం ఇస్లామిక్ రిపబ్లిక్ పట్ల, దాని విలువల పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శించడంతో సమానం అవుతుందని చెప్పారు. అలాంటి అసాధారణ చర్యలకు పాల్పడేవారు శిక్షకు గురికాక తప్పదని స్పష్టం చేశారు. -
క్షణ క్షణం వివక్షను ఎదుర్కొంటున్న మహిళ: గవర్నర్ తమిళిసై
సాక్షి, హైదరాబాద్: కంపెనీల ప్రకటనలు మొదలు కొని సినిమాల వరకూ మహిళను వివక్షతో చిత్రీకరించడాన్ని ప్రజలు ఎప్పటికప్పుడు నిరసించాలని, అలాంటి ప్రకటనలు, సినిమాలను తిరస్కరించడం, తమ అభ్యంతరాలను స్పష్టంగా చెప్పడం అవసరమని తెలంగాణ గవర్నర్, పుదుచ్చెరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ధోరణి కనిపిస్తున్నా.. విస్తృత స్థాయిలో సమాజంలో మాత్రం వివక్ష కొనసాగుతూనే ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రింట్, వీడియో, సినిమాల్లో లింగ వివక్ష, మహిళలను నిర్దిష్ట దృక్కోణం (స్టీరియో టైపింగ్)లో చూపడాన్ని నియంత్రించడం, రూపుమాపడం లక్ష్యంగా ఇండియన్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ (ఐఏఏ) శుక్రవారం హైదరాబాద్లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘‘వాయిస్ ఆఫ్ ఛేంజ్’’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మహిళలు నిత్యం వివక్షకు గురవుతూనే ఉన్నారని, ప్రతిక్షణం మహిళను నిర్దిష్ట దృక్కోణంతో చూపుతున్నారని ఈ సందర్భంగా గవర్నర్ సోదాహరణంగా వివరించారు. మహిళలు గవర్నర్లు కారని.. వయసు మీరిన పురుషులే అవుతారన్నట్టుగా ఎనిమిదేళ్ల బాలిక చెప్పడాన్ని తాను ఒక విమానాశ్రయంలో విన్నానని తెలిపారు. ఆఖరుకు మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కొన్ని పోటీల్లో బహుమతులుగా వంట పాత్రలు ఇస్తున్నట్లు ప్రకటించారని.. వారి దృష్టిలో ఆడవారంటే వంటిల్లుకు మాత్రమే పరిమితం అని వ్యాఖ్యానించారు. దేశంలో ఇప్పుడు పురుషుల కంటే మహిళ పైలట్లే ఎక్కువగా ఉన్నారని విమానయాన శాఖ మంత్రి తనతో చెప్పినప్పుడు ఎంతో సంతోషించానని, దురదృష్టవశాత్తూ సమాజంలో చాలామంది పాత, మూస పద్ధతుల్లోనే మహిళలను చూస్తున్నారని అన్నారు. సమాజంలో పదిరెట్లు ఎక్కువ కష్టం మాది... ప్రకటనల్లో లింగ వివక్షను ప్రస్తావిస్తూ.. ‘‘ఒక దాంట్లో మహిళ ట్రాఫిక్ కానిస్టేబుల్ను చూపారు. ఫర్వాలేదని అనుకుంటూండగానే.. ఆమె ఓ పురుషుడి బనియన్ చూసి తన్మయంతో ఊగిపోతున్నట్లు చూపారు. ఆఖరుకు పురుషుడి లోదుస్తుల ప్రకటనకూ మహిళను స్టీరియోటైపింగ్ చేశారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. తంజావూర్ మెడికల్ కాలేజీలో గైనకాలజిస్టుగా ఉండగా... కవలల తల్లి మగబిడ్డకు చనుబాలు, ఆడబిడ్డకు పలచన చేసిన ఆవుపాలు ఇచ్చిన సంఘటన తాను గమనించానని అన్నారు. ఇలాంటి అంశాల విషయంలో సమాజం మైండ్సెట్ మారాలని.. ప్రకటనలు తయారు చేసే వారు కూడా ఈ మార్పునకు తమవంతు సాయం అందించాలని కోరారు. మీడియా, అడ్వర్టైజ్మెంట్ రంగాల వారు ఇలాంటి అంశంపై చర్చించడం ఆహ్వానించదగ్గ పరిణామమని ఐఏఏను ప్రశంసించారు. సమాజంలో మహిళలు అన్ని విషయాల్లోనూ పురుషుల కంటే పది రెట్లు ఎక్కువ కష్టపడాల్సి వస్తోందని ఈ పరిస్థితిలో మార్పు రావాలని, ఇకపై లింగ వివక్ష, స్టీరియోటైపింగ్ విషయాల్లో అందరూ తమ అభ్యంతరాలను స్పష్టంగా వ్యక్తం చేయడం ద్వారా మాత్రమే ఈ మార్పు సాధ్యమని వివరించారు. ‘నిర్భయ’ తరువాత కొంత మార్పు... ప్రకటనలు, సినిమాలు, ఇతర కంటెంట్లలో మహిళ వివక్ష, స్టీరియోటైపింగ్ నిర్భయ ఘటన మారిందని, బాధితుల పేర్లు ప్రస్తావించకపోవడం మొదలుకొని, వారినే దోషులుగా చూపడం వరకూ మీడియా సంయమనంతో వ్యవహరిస్తోందని పాపులేషన్ ఫస్ట్ డైరెక్టర్ డాక్టర్ ఏ.ఎల్.శారద తెలిపారు. డిజిటల్ మాధ్యమం కారణంగా మహిళల అంశాలపై వివరంగా చర్చించే అవకాశం లభిస్తోందని, ప్రకటనలు ఇతర కంటెంట్లలో మహిళలను కించపరచడం తగ్గిందని, యువతకు సంబంధించిన ప్రకటనలో అందరినీ కలుపుకుపోయేలా కంటెంట్ ఉంటోందని ఆమె వివరించారు. ఈ మార్పు భవిష్యత్తులోనూ కొనసాగుతుందన్న ఆశాభావాన్ని డాక్టర్ ఏఎల్ శారద వ్యక్తం చేశారు. అంతకుముందు యూనిసెఫ్ ఇండియా ప్రతినిధి, పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్స్ నిపుణులు గీతాంజలి మాస్టర్ మాట్లాడుతూ ప్రకటనల్లో లింగవివక్ష, స్టీరియోటైపింగ్లపై యునిసెఫ్ జరిపిన పరిశోధన వివరాలను వెల్లడించారు. సమావేశంలో యాక్సెంచర్ మేనేజింగ్ డైరెక్టర్ చారులత రవికుమార్ ‘రెస్పాన్సిబుల్ కమ్యూనికేషన్’ అన్న అంశంపై ప్రసంగిస్తూ కంటెంట్లో ఇప్పటికే సున్నితంగా.. పరోక్షంగా లింగవివక్ష కొనసాగుతోందని వివరించారు. ఐఏఏ ఇండియ ఛాప్టర్ అధ్యక్షులు అవినాశ్ పాండే, ఐఏఏ విమెన్స్ ఎంపవర్మెంట్ కమిటీ ఛైర్పర్సన్ నీనా ఎలవియా జైపూరియా, ‘సాక్షి’ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘జెండర్ కాన్షస్ అండ్ పర్పస్ఫుల్ ఎంటర్టైన్మెంట్’ ‘జెండర్ కాన్షస్ క్రియేటివిటీ ఇన్ కమ్యూనికేషన్స్’, ‘కాన్షస్ క్రియేటివిటీ ఇన్ ఫిల్మ్స్, ఓటీటీ, అండ్ అడ్వర్టైజింగ్’ అంశాలపై ప్యానెల్ డిస్కషన్ నడిచింది. యాంకర్ స్వప్న సమన్వయకర్తగా వ్యవహరించగా సినీ నటుడు అవసరాల శ్రీనివాస్, దర్శకులు నందినీ రెడ్డి, వైల్యులు ప్రణతి రెడ్డి, ఐపీఎస్ అధికారిణి శిఖా గోయెల్ తదితరులు పాల్గొన్నారు. కాస్మోస్ మాయా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో మేఘ తాత ఒక ప్యానెల్ డిస్కషన్కు సమన్వయ కర్తగా వ్యవహరించారు. చదవండి: అసెంబ్లీలో కేటీఆర్, ఈటల మధ్య ఆసక్తికర సన్నివేశం.. -
నిర్లక్ష్యానికి గురవుతున్న బాలికా విద్య
జాతీయ బాలికా దినోత్సవం ఏటా జనవరి 24న జరుపుకుంటున్నాం. దీని ప్రధాన ఉద్దేశాలు... బాలికలు ఎదుర్కొంటున్న అసమానతలు, అత్యాచారాలపై అవగాహన కల్పించడం,; విద్య, ఆరోగ్యం, పోషణ ప్రాముఖ్యాన్ని తెలియజేయడం. ఇందుకోసం ఐక్యరాజ్యసమితి బాలికా దినోత్సవం జరపాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఈ పిలుపునందుకుని భారత్ 2008 నుండీ మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖవారి ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. భారత రాజ్యాంగం ఆడ, మగ – ఇద్దరికీ సమాన హక్కులు కల్పించింది. కానీ లింగవివక్షతో గర్భంలో ఉండగానే స్కానింగ్లతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించి ఆడపిల్ల అని తేలగానే ఇప్పటికీ గర్భస్రావం చేయిస్తున్నారు. మన సాంకేతిక పరిజ్ఞాన పురోభివృద్ధిని ఆడ శిశువుల అంతానికి ఉపయోగించడం దారుణం. 2011 జనాభా లెక్కల ప్రకారం వెయ్యి మంది మగ పిల్లలకు 946 మంది ఆడపిల్లలు ఉన్నారు. దీంతో దేశంలో ఇప్పుడు మగ పిల్లలకు వివాహాలు చేయడానికి ఆడపిల్లలు దొరకని దుఃస్థితి వచ్చింది. చట్టాలు ఎన్ని ఉన్నా బాలికల పట్ల జరిగే అన్యాయం జరుగుతూనే ఉంది. 2015 లో ‘బేటీ బచావో, బేటీ పఢావో’, ‘షాదీ ముబారక్’ వంటి పథకాలు బాల్య వివాహాలను కొంతవరకు తగ్గించాయి. స్త్రీ విద్యావంతురాలు అయితే ఆ కుటుంబం అంతా విద్యా వంతులు అవుతారని భారత ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అన్నారు. ఆనాటి నుండి నేటి వరకూ బాలికల విద్య నిర్లక్ష్యానికి గురి అవుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 82 శాతం మగవారు, 65 శాతం బాలికలు అక్షరాస్యులుగా ఉన్నారు. మిగతా 35 శాతం బాలికలు బడికి దూరంగానే ఉన్నారు. 2009 విద్యాహక్కు చట్టం ఫలితంగా కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలల్లో వెనుకబడిన తరగతుల బాలికలు చదువుకోవడానికి మంచి అవకాశం వచ్చింది. అయినప్పటికీ పల్లెటూర్లలో బాలికల అక్షరాస్యత తక్కువగానే ఉంది. ఏ లక్ష్యాలపై అవగాహన కల్పించడానికి బాలికా దినోత్సవాన్ని జరుపుతున్నామో... వాటిని సాకారం చేయడంలో సమాజంలోని అన్ని వర్గాలకూ బాధ్యత ఉంది. (క్లిక్ చేయండి: మన క్రీడాకారిణులకు బాసట ఏది?) – సయ్యద్ షఫీ, హనుమకొండ (జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం) -
ధర్మాన మాటల్ని వక్రీకరించి.. సోషల్ మీడియాలో గోల..
ఇన్నాళ్లకొకరు (ధర్మాన ప్రసాదరావు) ఉత్తరాంధ్ర వివక్ష మీద గొంతు విప్పి మాటాడేరు. ఇప్పటికైనా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం, పాలనా రాజధాని విశాఖలో ఏర్పాటు చేయకుంటే కనీసం మా ఉత్తరాంధ్ర ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్నారు. అలా అయితే ఉత్తరాంధ్రకు గల సహజవనరుల సాయంతో, ఆర్థిక కేటాయింపులతో, పాలనా ఏర్పాటుతో... ఏ నగరానికీ లేని ఓడరేవు, విమానాశ్రయం; భారీ, మధ్యతరగతి పరిశ్రమలతో మహానగరంగా ఎదగాల్సిన విశాఖను రాజధానిగా చేసి, ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాటలు వేస్తామని రాజకీయ ప్రకటన చేశారు. విశాఖను పాలనా రాజధాని చేయాలన్నదే ప్రసాదరావు కోరుకునేది. అది మరింత బలంగా విన్పించడానికి విశాఖను పాలనా రాజధానిగా చేయకపోతే, కనీసం ఉత్తరాంధ్రను రాష్ట్రంగా చేయాలనన్నారు తప్పా ఉత్తరాంధ్రను రాష్ట్రంగా చేయాలనేమీ అనలేదు. అయినా ప్రసాదరావు మాటల్ని వక్రీకరించి, ఒక్కదాన్నే పట్టుకొని సోషల్ మీడియాలో గోల చేస్తున్నారు. నిజానికి ప్రసాదరావు ఉత్తరాంధ్రను రాష్ట్రంగా చేయాలని డిమాండ్ చేస్తే బాగుండేది. అయినా, ఈ సందర్భంలో ప్రసాదరావు ఆమాత్రం అనడం ఘనతే! ఇప్పటిదాకా ఇలాంటి ప్రకటనలు ఉత్తరాంధ్ర పౌరసమాజం నుండి అరాకొరా (కె.ఎస్.చలం, నల్లి ధర్మారావు, అట్టాడ అప్పల్నాయుడు తది తరులు) వచ్చేయి తప్పా రాజకీయశక్తుల నుంచి రాలేదు. పాలకవర్గ పార్టీల నుంచీ రాలేదు, కమ్యూనిస్టు, విప్లవకారుల నుంచీ రాలేదు. చాలా ఆశ్చర్యంగా ధర్మాన ప్రసాదరావు ప్రకటనపై విచ్చిన్నకారుడు, సమైక్య వ్యతిరేకి వంటి వ్యక్తిగత దాడి మాత్రమే కాక ప్రసాదరావు రాజకీయ ప్రయాణాన్నీ, ఆ ప్రయాణంలో ఉత్తరాంధ్రకు అతను చేసినదేమిటీ, ఇపుడెందుకిలా ప్రకటించాడంటూ... ఉత్తరాంధ్రేతరులే కాక ఉత్తరాంధ్రులూ ప్రశ్నిస్తున్నారు. విచిత్రంగా ఒక్క నల్లి ధర్మారావు తప్పా, ఉత్తరాంధ్ర గురించి తొలినాడు గొంతు విప్పిన కె.ఎస్. చలం గానీ ఇంకెవరుగానీ ఇపుడేమీ మాటాడడం లేదు. స్పందనా రాహిత్యం ఉత్తరాంధ్ర స్వభావంలోకి ఇంకిపోయినట్టుంది. తొలి తరం రచయితలు తప్పా వర్తమాన రచయితలెవరికీ ఉత్తరాంధ్ర జీవన సంక్షోభానికి కారణమయిన రాజకీయార్థిక విషయాలమీద అవగాహనా లేదు, ఆసక్తీ లేదు. అణు విద్యుత్ వ్యతిరేక పోరాటం, నిర్వాసితుల పోరాటాలు, విశాఖ ఉక్కు కర్మాగార కార్మిక పోరాటం వంటివాటిని వీరు సాహిత్యీకరించలేదు. అటు రచయితలుగానీ, ఇటు మేధావులుగానీ ఉత్తరాంధ్ర వివక్షమీద ప్రాంతీయవాద దృష్టితో స్పందించటం లేదు. విశాఖలో స్థిరపడిన (వ్యాపారాలు, ఉద్యోగాలు, రాజకీయాలు చేసి) వారు ఉత్తరాంధ్ర గురించి వ్యాఖ్యానిస్తుంటారు, ఉత్తరాంధ్రుల తరఫున బాధ్యత తీసుకుంటారు. రాజకీయాల్లో, సాహిత్య, సాంస్కృతికాంశాల్లో ఉత్తరాంధ్రపై వివక్ష చూపి, ‘వెనక బడిన జిల్లా’ అనే టాగ్ తగిలించి సానుభూతి చూపుతారు ఉత్తరాంధ్రేతరులు. పాతిక లక్షల ఎకరాల సాగుభూమి ఉన్నా ఎనిమిదిలక్షల ఎకరాలకు మాత్రమే ఇప్పటికీ సాగునీరు అందుతోంది. నాగావళి, వంశధార వంటి పద్దెనిమిది నదులూ, అధిక వర్షపాతం వల్ల అయిదువందల టీఎంసీల నీరు లభ్యమవుతున్నా... సాగునీరందించే ప్రాజెక్టులు పూర్తికాక పోవటంతో నీళ్లన్నీ సముద్రం పాలవుతోన్నవి. వ్యవసాయాధార పరిశ్రమలు లేక, ఉన్నవి మూత పడి ఇటు రైతులూ, అటు కార్మికులూ నష్ట పోతున్నారు. ఉపాధుల్లేక ఏటా ఏభయి వేలమంది ఇక్కడినుంచి వలసలు పోతున్నారు. వలసల నివారణకుగానీ, వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకుగానీ, విశాఖ వంటి నగరంలోని పరిశ్రమలను అభివృద్ధి చేయడానికిగానీ ప్రత్యేక రాజకీయ నిర్ణయాలు, ఆర్థిక కేటాయింపులూ, అధికార యంత్రాంగమూ ఉండాలి. ఇవన్నీ ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తరాంధ్రకు ఒనగూరలేదు. ప్రత్యేక రాష్ట్ర మయితే ఒనగూరే అవకాశాలుంటాయి, ఒనగూరకపోతే కనీసం వీటికోసం తమదయిన ప్రాంతంలో ప్రజలు ఉద్యమించగలరు. పాలనా యంత్రాంగాన్ని ప్రభావితం చేయగలరు. సమగ్ర ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక రాష్ట్రమనేది ఉపకరిస్తుందే తప్పా నష్టపెట్టదు. గనక ధర్మాన ప్రసాదరావేమీ విచ్చిన్నకారుడు కాడు, వారి ప్రకటనేమీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ క్రీడలో భాగం కాదు. ఉత్తరాంధ్రుల లోలోపలి భావాన్నే ప్రసాదరావు పలికేరు. ఇపుడు కాకపోతే మరొకప్పుడయినా ఉత్తరాంధ్ర తన లోలోపలి ఆకాంక్షను కోటిగొంతులతో బహిరంగ పరచగలదు! (క్లిక్ చేయండి: అనూహ్య వ్యూహం ‘గృహ సారథి’) – వంశధార సూరి, శ్రీకాకుళం -
ఇక్కడి వివక్షే కనిపిస్తుందా?
కొంతమంది నియోదళిత్ మేధావులకు, వామపక్షీయులకు ప్రతి విషయాన్నీ కులం లేదా మత కోణంలో చూసే ధోరణి గత 30 సంవత్సరాలుగా అలవాటైంది. అకడమిక్స్లో కూడా ఈ ధోరణి రావడం ప్రమాదకరం. దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన కులాలు, ముస్లింలు, క్రిష్టియన్లు, అగ్ర వర్ణాల వారు కూడా వివక్షను ఎదుర్కొంటున్నారు. 130 కోట్ల జనాభాలో, దాదాపుగా 30 కోట్ల మంది దళితులు ఉన్న భారతదేశంలో... కేవలం కొన్ని సంఘటలను చూపించి రిపోర్టులు తయారు చేసి, దేశమంతా వివక్షత ఉందని చెప్పడం ఎంతమాత్రమూ శాస్త్రీయం కాదు. అధర్మమైన విషయం ఏమిటంటే, ప్రపంచంలో చాలా దేశాల్లో దారుణమైన వివక్ష నేటికీ కొనసాగుతోంది. మన నియోదళిత్ మేధావులు వాటిని ఏమాత్రం ప్రస్తావిం చకుండా భారతదేశానికీ, హిందూమతానికీ వ్యతిరేకంగా పని చేసే కొన్ని సంస్థల రిపోర్టుల గురించి మాట్లాడుతున్నారు. రాజీవ్ మల్హోత్ర, అరవిందన్ నీలకంఠన్ రాసిన ‘బ్రేకింగ్ ఇండియా – వెస్ట్రన్ ఇంటర్వెన్షన్స్ ఇన్ ద్రవిడియన్ అండ్ దళిత్ ఫాల్ట్ లైన్స్’ అనే పుస్తకంలో ఇటువంటి విదేశీ సంస్థలూ, అధ్యయన కేంద్రాలూ, ఎన్జీఓలూ వంటివి భారతదేశాన్ని, హిందూమతాన్ని విచ్ఛిన్నం చేయడానికి గత 30 సంవత్సరాలుగా చేస్తున్న ఒక బహిరంగమైన కుట్ర బట్టబయలైంది. ఇక ప్రపంచంలోని వివక్షకు వస్తే మొదటగా అమెరికాలో ఉన్న నల్లజాతీయులపై వివక్ష నేటికీ కొనసాగుతోంది. అయినా వారికి భారతదేశంలో దళితులలాగా రాజ కీయాలు, విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు లేవు. దక్షిణాఫ్రికాలో నల్లజాతి వివక్ష (అపారై్థడ్) 1992 వరకు చట్టబద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా జరిగింది. ఇప్పటికి కూడా దక్షిణాఫ్రికాలో వాళ్ళు రిజర్వేషన్లు కావాలని అడగలేదు. 1883 వరకు అమెరికాల్లో నల్ల జాతీయులు బానిసలుగా ఉండేవాళ్ళు, 1970 వరకు అమెరికాలో నల్లజాతీయులకు ఓటు హక్కులేదు. ఇప్పటికీ యూఎస్తో సహా అనేక దేశాల్లో జాతి, మతపరమైన వివక్ష ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 1930లలో భారత్లో షెడ్యూల్డ్ కులాల వివక్షమీద అంబేడ్కర్ పోరాటం చేస్తున్న సమయంలోనే అమెరికాలో కూడా వివక్ష మీద పోరాటం జరుగుతోంది. ప్రముఖ అమెరికన్ నల్లజాతీయుల నాయకులు చానీతో బియాస్, బెంజమిన్ మేస్ లాంటి వారు భారతదేశానికి వచ్చి గాంధీని కలిసి వివక్షతపై చర్చలు జరిపారు. 1938లో హోవర్డ్ తురిమెన్ అనే ప్రముఖ నల్ల మతాధికారి అమెరికాకు వచ్చి పోరాటం సాగించాలని గాంధీని కలిసి విన్నవించారు. ప్రముఖ నల్ల జాతి హక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్... గాంధీజీనే ఆదర్శంగా తీసుకున్నారు. అలాగే దక్షిణాఫ్రికాలో అపార్థైడ్కు వ్యతిరేకంగా పోరాడిన నెల్సన్ మండేలా తదితరులు కూడా మహాత్మా గాంధీనే ఆదర్శంగా తీసుకున్నారు. ఇక్కడ నియో దళిత మేధావులు, వామపక్ష వాదులు దాచి పెట్టేదేమిటంటే... పైన పేర్కొన్న నాయకులు ఎవ్వరూ కూడా అంబేడ్కర్ను కలవలేదు. వీరెవ్వరు కూడా ఆయా దేశాల్లో రిజర్వేషన్లు కోరలేదు. ఎందుకంటే ఈక్వాలిటీ అనే యూనివర్సల్ ప్రిన్సిపుల్కు రిజర్వేషన్లు అనేవి బద్ధ వ్యతిరేకం కాబట్టి. దేశం 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనలో కొన్ని శతాబ్దాల కాలం వెనుకబడింది. 1951 నాటికి అక్షరాస్యత కేవలం 16.7 శాతం. గ్రామీణ ప్రాంతాల్లో 9 శాతం, కాబట్టి కేవలం దళితులే కాదు అన్ని కులాల వాళ్ళు, మతాల వాళ్ళు వెనకబడే ఉన్నారు. దళితుల పరిస్థితి ఇంకా దయనీయమనే చెప్పాలి. అయితే ల్యాండ్ సీలింగ్ వల్ల వచ్చిన భూమిలో 46 శాతం దళితులకే వచ్చింది. అయినా ఇంకా అభివృద్ధి జరగాల్సి ఉంది. (క్లిక్ చేయండి: నిరసనకారులకు గుణపాఠమా?!) - డాక్టర్ పి. కృష్ణ మోహన్ రెడ్డి అసోసియేట్ ప్రొఫెసర్, చరిత్ర విభాగం శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం -
బహుజన బతుకమ్మ ఆడదాం
మన సమాజపు ఆవరణలోని పునాది ఉపరితలాల్లో పరివ్యాప్తి చెంది, సమాజపు లోతుల్లోకి పాతుకుపోయిన కులవివక్ష, లింగ వివక్ష గురించి మాట్లాడుకోవడానికి మున్నూట ఆరవై ఐదు రోజులు సరిపోవు. అలాంటి వివక్షకు గురవుతున్న బహుజన సమాజపు స్త్రీలు అచ్చంగా ఆడి పాడేదే బతుకమ్మ పండుగ. చారిత్రక తెలంగాణ సాయుధ పోరాట కాలంలోనూ, తదనంతర విప్లవోద్యమంలోనూ, అలాగే స్వరాష్ట్ర సాధన పోరాటంలోనూ బతుకమ్మ ఒక ఉద్యమ పతాకగా మన చేతికందింది. నిషేధాలకు గురై కూడా కొనసాగుతున్న అంటరానితనం, అన్ని రంగాల్లో ప్రబలిన కులవివక్ష, పితృస్వామ్యం, బతుకమ్మ పండుగల్లోనూ వ్యక్తమవుతుంది. ప్రజలంతా జరుపుకునే పండుగల్లోనూ ఊరూ–వాడల్ని విభజించే కుల వివక్షకు వ్యతిరేకంగా ‘కల్సి ఆడుదాం– కల్సి పాడుదాం–కల్సి పోరాడుదాం’ అంటూ తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం. బహుజన బతుకమ్మ ద్వారా పండుగల్లోని అసమానతలను, వివక్షను సరిచేస్తూ దీన్నొక పంటల పండుగగా జరుపుతున్నాం. అందుకే ‘బహుజన బతుకమ్మ కేవలం ఉత్సవం మాత్రమే కాదు ఉద్యమం’ అంటూ చాటుతున్నాం. బతుకమ్మ బహుజన సాంప్రదాయం. పురాణ ఇతి హాసాల్లో బతుకమ్మ గురించి ఏమి చెప్పినా బతుకమ్మ మాత్రం తెలంగాణ పంటల పండుగ. మత కోణం నుండి దీనిని బ్రాహ్మణీకరించే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు దూరంగా నిశ్చేష్ఠులై ఉండలేము కదా! తెలంగాణ ఉత్పత్తి విధానంలోని నవధాన్యాల సంస్కృతిని ఎత్తిపడ్తూ దానితో ముడిపడ్డ పంటలనూ, ఆ పంటలకు నీరిచ్చే చెరువులూ, కుంటలనూ; వాటికి ఆదరువైన గుట్టలూ, కొండలనూ కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. అలా ప్రతి ఏటా వర్తమాన సమస్యలతో జోడించి బహుజన బతుకమ్మను కొనసాగిస్తున్నాం. నా అనుభవంలో ఏ కులానికి ఆ కులం కలిసి ఆడు కోవడం, బతుకమ్మను నీళ్లల్లో వేసి సాగనంపి మాలో మేమే సద్దులు ఇచ్చిపుచ్చుకునే వాళ్ళం. నా చిన్నతనంలో కుల వాడలు, వెలివాడలు స్పష్టంగా ఉన్న కాలంలో కుర్మోళ్ల బతుకమ్మ, రెడ్డోళ్ల బతుకమ్మ అంటూ పోటీపడేవాళ్ళం. నిన్న మొన్నటిదాకా కూడా దళితుల బతుకమ్మ ఊర్లోళ్ళ బతుకమ్మతో కలిపి ఆడుకోవడం అనేది లేకుండా పోయిన విషయం మన గమనంలో ఉంది. గడిచిన 12 ఏళ్ల అనుభవంలో దళితుల ఆత్మగౌరవాన్ని ఇనుమడింప చేస్తూ ఊరుతోపాటు ఆడి పాడి వారితో కలిసి ఒకే చెరువులో నిమజ్జనం చేయడమే ఒక విప్లవాత్మక చర్యగా ప్రజలు భావించారు. ఇక గర్భగుడిలోకి దళితుల ప్రవేశం గురించి పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుందేమో! ఇంకా కొన్ని గ్రామాల్లో రెండు గ్లాసుల పద్ధతి అమలు జరుగుతోంది. ఇప్పటికీ భూమిలేని దళితులు కోకొల్లలు. వారికి కనీస భూమి ఇవ్వాలి. వారు ఊరుతో కలిసి ఆడుకొని, సహపంక్తి భోజనాలు చేసుకుని ఆత్మ గౌరవంగా పండుగ చేసుకునేలా ప్రజలు ఐక్యతను చాటాలి. - విమలక్క ప్రజా గాయని -
కలలు కల్లలు.. కలవరపెడుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: దేశంలో ఉన్నత ప్రమాణాలున్న విద్యాసంస్థల్లో పెరిగిçపోతున్న విద్యార్థుల ఆత్మహత్యలు కలవరం రేపుతున్నాయి. ఇతర విద్యాసంస్థలకు మార్గదర్శకంగా నిలవాల్సిన ఈ సంస్థలు బ్రిలియంట్ విద్యార్థుల బలవన్మరణాలతో వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఈ సంస్థల్లో ప్రవేశించిన విద్యార్థులు, వారి తల్లితండ్రుల కలలు కల్లలు చేస్తున్నాయి. బంగారు భవిష్యత్తును ఊహించుకుని ఆ సంస్థల్లో అడుగిడుతున్న విద్యార్థులు అక్కడ ఒత్తిడి, వివక్ష, బెదిరింపులు, సరైన మార్గదర్శనం లేక బలవంతంగా తనువులు చాలిస్తున్నారు. కట్టడి నుంచి ఒక్కసారిగా స్వేచ్ఛా ప్రపంచంలోకి ప్రవేశిస్తున్న విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటూ కన్నవారికి శోకం మిగిలిస్తున్నారు. ఇక్కడ విజయం సాధించకపోతే భవిష్యత్తు లేదన్నట్లుగా కుంగిపోతున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లతోపాటు కేంద్ర విశ్వవిద్యాలయాల్లో రాత్రింబవళ్లు కష్టపడితే గానీ సీటు రాదు. మంచి ర్యాంకులతో చేరుతున్న విద్యార్థులు అక్కడికెళ్లిన తరువాత సామాజిక పరిస్థితులు, విద్యా విధానం పూర్తి భిన్నంగా ఉండటంతో ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారు. సహచరæ విద్యార్థులతో పోల్చుకుని కూడా నిరాశా నిస్పృహల్లోకి వెళ్తున్నారు. దీంతో వారు ఆత్మహత్యల వైపు మళ్లుతున్నారు. ఏనిమిదేళ్లలో 130 మంది దేశవ్యాప్తంగా గత ఎనిమిదేళ్లలో 130 మంది వరకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. విద్యార్థుల బాగోగులను చూడాల్సిన ఆయా సంస్థల్లోని అధ్యాపకుల సరైన పర్యవేక్షణ లేకపోవడం కూడా ఓ కారణంగా చెబుతున్నారు. ఇలా బలవన్మరణాలు చేసుకుంటున్న వారిలో 60 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులే ఉండటం గమనార్హం. ఇంటర్మీడియెట్ వరకు అధ్యాపకులు పూర్తిస్థాయిలో వారికి ప్రతీ అంశంలో సహకారం అందిస్తారు. అయితే, ప్రీమియర్ విద్యాసంస్థల్లో చేరే విద్యార్థులకు అవసరమైన మానసిక ధైర్యం, అక్కడ ఎలా మసలుకోవాలి లాంటి వాటి గురించి వివరించకపోవడం వల్ల ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయన్న అభిప్రాయం ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచి్చన వారు ఈ సంస్థల్లో ఎక్కువ ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. 2014 నుంచి ఇప్పటివరకు ఐఐటీల్లో 38 మంది, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 39 మంది, ఎన్ఐటీల్లో 32 మంది, ఐఐఎంలలో ఐదుగురు, ఐఐ ఎస్సీ అండ్ ఐఐఎస్ఈఆర్లో తొమ్మిది మంది, ట్రిపుల్ ఐటీల్లో నలుగురు, కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చే విద్యాసంస్థల్లో ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇటీవలే ఐఐటీ హైదరాబాద్లో... ఇటీవలే హైదరాబాద్ ఐఐటీకి సంబంధించి ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం విదితమే. ఇక్కడ ఎంటెక్ చదువుతున్న రాహుల్ హాస్టల్ గదిలోనే మంచానికి ఉరేసుకోగా.. ఈ మధ్యనే విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న విద్యార్థి సంగారెడ్డిలో లాడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైకి చెందిన మరో ఐఐటీ విద్యార్థి కూడా హాస్టల్ గదిలోనే ఆత్మహత్య చేసుకున్నారు. కుల వివక్ష నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కొన్ని ఘటనలు సంచలనంగా మారుతుంటే.. మరికొన్ని కేసులు పెద్దగా పట్టించుకోకుండానే ముగిసిపోతున్నాయి. విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యులుగా గుర్తించిన వారిపై చర్యలు లేకుండా ముగుస్తున్నాయి. గత ఏప్రిల్లో ఖరగ్పూర్ ఐఐటీలో హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ బోధించే ప్రొఫెసర్ దళితులను, ఆదివాసీ విద్యార్థులను అవమానించేలా మాట్లాడటంతో పెద్దఎత్తున నిరసన పెల్లుబుకడంతో ఆ ప్రొఫెసర్ను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. సాధారణ విద్యార్థుల ఆత్మహత్యలూ ఎక్కువే.. దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. 2017లో 9,905 మంది, 2020లో 12,526 మంది, 2021లో 13,089 మంది విద్యార్థులు బలవన్మరణం పొందారు. గతేడాది 18 ఏళ్లలోపు వయసున్నవారు 10,732 మంది ఆత్మహత్య చేసుకున్నారు. పరీక్షల్లో ఫెయిలవడాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వారే ఇందులో అధికంగా ఉండటం గమనార్హం. విద్యార్థుల ఆత్మహత్యలు మహారాష్ట్ర (1,834)లో ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్ (1,308), తమిళనాడు (1,246), కర్ణాటక (855), ఒడిశా (834) నిలిచాయి. మొత్తం విద్యార్థుల బలవన్మరణాల్లో గ్రాడ్యుయేట్, ఆపైస్థాయి వారి శాతం 4.6గా ఉంది. మరో విద్యార్థి ఇలా కావొద్దు బలవన్మరణం వల్ల తల్లిదండ్రులకు శోకం మిగల్చడం తప్ప... సాధించేది ఏమీ ఉండదు. ప్రతిభ ఉన్న విద్యార్థులే ఇలాంటి విద్యాసంస్థల్లో చేరుతారు. వారికి సరైన మార్గదర్శనం ప్రొఫెసర్లు చేయాలి. మా అబ్బాయి రాహుల్ ఆత్మహత్య చేసుకునే రకం కాదు. అంతకు ముందే పుట్టిన రోజు జరుపుకున్నాడు. షిర్డి వెళ్లి వచ్చాం. ఎక్కడా డిప్రెషన్కు గురైనట్లు కనిపించలేదు. ప్రొఫెసర్ల ఒత్తిడి ఉండొచ్చని భావిస్తున్నా. ఏదైనా లోతుగా విచారణ జరపాలని జిల్లా ఎస్పీని కోరా. ల్యాప్టాప్ ఇప్పటి వరకు మాకు ఇవ్వనేలేదు. మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఆత్మహత్యలు ఎవరూ చేసుకోవద్దు. ఇది లేకపోతే భవిష్యత్తు లేదనే భావన విరమించుకోండి. –ఐఐటీ హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి తండ్రి మధుసూధన్రావు మానసిక ధైర్యం ప్రధానం విద్యార్థులు మానసికంగా దృఢంగా ఉండాలి. ఇంటర్ వరకు ఉన్న వాతావరణానికి æఐఐటీ, ఎన్ఐటీల్లో వాతావరణం భిన్నంగా ఉంటుంది. విద్యా బోధనలో మార్పులు ఉంటాయి. స్వేచ్ఛ ఉంటుంది. స్వతంత్రంగా నేర్చుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు కూడా విద్యార్థులతో మాట్లాడినప్పుడు ఎప్పుడూ చదువు కోసమేకాకుండా.. వారు మానసికంగా దృఢంగా ఉండేలా ధైర్యం చెప్పాలి. సహచర విద్యార్థులు కూడా తోటి విద్యార్థులు డిప్రెషన్లో ఉన్నట్టు తెలియగానే ధైర్యం చెప్పాలి, అధికారుల దృష్టికి తీసుకురావాలి. అప్పుడు సరైన కౌన్సెలింగ్ తీసుకుని ధైర్యం నింపేందుకు వీలవుతుంది. – ఎన్వీ రమణారావు, ఎన్ఐటీ వరంగల్ డైరెక్టర్ మెంటల్ హెల్త్ అవేర్నెస్ క్యాంపులు అవసరం వివిధ సాంస్కృతిక నేపథ్యాల్లో పెరిగిన వాతావరణానికి.. ఐఐటీల్లోని వాతావరణం పూర్తిభిన్నంగా ఉండటంతో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. ఇతర నేపథ్యం నుంచి వచి్చన సహచర విద్యార్థులతో కలవలేకపోవడం, వారితో పోల్చుకుని కుంగుబాటుకు గురికావడం, తక్కువ మార్కులొస్తే క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సరైన ప్లేస్మెంట్లు రావనే భయాలు, బాగా మార్కులు తెచ్చుకుని పెద్ద పెద్ద ప్యాకేజీలు తెచ్చుకోవాలనే తల్లితండ్రుల అంచనాలు చేరుకోకపోవడం వంటివి ప్రభావం చూపిస్తున్నాయి. ఉన్నత చదువు, సంబంధిత అంశాల ఒత్తిళ్లతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడకుండా అన్ని విద్యాసంస్థల్లో ‘మెంటల్ హెల్త్ అవేర్నెస్’క్యాంపులు నిర్వహించాలి. విద్యార్థులు ఒత్తిడికి లోనైనప్పుడు ఏ లక్షణాలు కనిపిస్తున్నాయి? సహ విద్యార్థులు, ఇతరుల ద్వారా ఆయా దశలను ఎలా గుర్తించాలనే దానిపై పకడ్బందీ కార్యాచరణ రూపొందించాలి. ఐఐటీలు, ఎన్ఐటీల వంటి చోట్ల సైకాలజిస్టులను పెట్టినా.. ఒత్తిళ్లు, ఇతర అంశాలపై సరైన అవగాహన కలి్పంచడం లేదు. క్లాస్లు జరిగేప్పుడు, డైనింగ్, టీవీ హాల్ తదితర చోట్ల జనరల్ అంశాలపైనా అవగాహన కల్పించాలి. –వీరేందర్, సైకాలజిస్ట్ చదవండి: మూడు పదులు నిండకుండానే 'గుండెపోట్లు'.. కారణాలివే.. -
పరాన్నజీవులూ, వెళ్లిపొండి.. అమెరికన్ జాత్యహంకార వ్యాఖ్యలు
లండన్: అమెరికాలో భారతీయ మహిళలపై జాత్యహంకార వివక్ష ఘటన మరవకముందే పోలండ్లోనూ అలాంటి ఉదంతమే వెలుగు చూసింది. రాజధాని వార్సాలో ఓ షాపింగ్ మాల్ వద్ద అమెరికా పర్యాటకుడు ఒక భారతీయుడిని జాత్యహంకార ప్రశ్నలతో వేధిస్తూ తీసిన వీడియో వైరల్గా మారింది. ‘‘నేను అమెరికా పౌరుడిని. అందుకే అమెరికాలో మాత్రమే ఉంటాను. అమెరికా మీ వాళ్లతో నిండిపోతోంది. నువ్వెందుకు పోలండ్ వచ్చావు? పోలండ్ను సైతం భారతీయులతో నింపేస్తారా? మీ సొంత దేశానికి పోరెందుకు? మా దేశాలను ఎందుకు ముంచెత్తుతున్నారు? మీకు భారతదేశముందిగా. మీ దేశాన్ని ఎందుకు సుసంపన్నం చేసుకోరు? కష్టపడి సంపన్నంగా మార్చుకున్న మా దేశాలకు ఎందుకొస్తున్నారు? పోలండ్లోనూ స్థిరపడటం ఈజీ అనుకుంటున్నారా? మీ సొంత దేశానికెందుకు వెళ్లరు? మీరంతా మా జాతిని నాశనం చేస్తున్నారు. నువ్వో ఆక్రమణదారువు. పరాయిదేశంలో బతికే పరాన్నజీవివి. ఇక్కడి నుంచి వెళ్లిపో. మీరు మా యూరప్లో ఉండొద్దు. పోలండ్ పోలిష్ జాతీయులదే’’ అంటూ వాగ్వాదానికి దిగాడు. అతన్ని ‘గోయిమ్ టీవీ’ అనే విద్వేష గ్రూప్నకు సారథ్యం వహిస్తున్న జాన్ మినడియో జూనియర్గా గుర్తించారు. -
జార్ఖండ్లో దారుణ కుల వివక్ష.. 50 దళిత కుటుంబాలను తరిమేసి..
మేదినీనగర్(జార్ఖండ్): సమ సమాజం దిశగా ముందడుగేయాల్సిన భారతావనిలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒకే కులానికి చెందిన 50 దళిత కుటుంబాలను కొందరు ఊరిలో నుంచి తరిమేశారు. ఈ దళిత కుటుంబాల ఇళ్లను పూర్తిగా ధ్వంసం చేశారు. ఇళ్లలోని వస్తువుల అన్నింటినీ వాహనాల్లోకి ఎక్కించి, వీరిని సమీప అడవిలోకి తరిమేశారు. జార్ఖండ్లోని పలామూ జిల్లాలోని మరుమటు గ్రామంలో ఈ వివక్షాపూరిత ఘటన జరిగింది. ఘటనపై రాష్ట్ర గవర్నర్ రమేశ్ స్పందించారు. రెండ్రోజుల్లో నివేదిక సమరి్పంచాలని పలాము డిప్యూటీ కమిషనర్ను ఆదేశించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముషార్ కులానికి చెందిన 50 కుటుంబాలు మరుమటు గ్రామంలో నివసిస్తున్నాయి. సోమవారం హఠాత్తుగా కొందరు వీరు ఉండే ప్రాంతానికి వచ్చి అందరినీ చితకబాది ఇంటిసామగ్రిని బయటపడేసి ఇళ్లను ధ్వంసంచేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, మేదినీనగర్ సబ్ డివిజినల్ ఆఫీసర్ రాజేశ్ కుమార్ షా, సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్(ఎస్డీపీవో) సుర్జీత్ కుమార్లు ఘటనాస్థలికి చేరుకున్నారు. బాధిత కుటుంబాలకు మళ్లీ ఊరిలో వారి స్థలాల్లోనే నివాస సౌకర్యాలు కలి్పస్తామని, ప్రస్తుతం తాత్కాలిక శిబిరాల్లో ఉంచామని అధికారులు తెలిపారు. చదవండి: అంధుడైన సాఫ్ట్వేర్ ఇంజనీర్కు.. మైక్రోసాఫ్ట్లో 47 లక్షల వేతనం -
75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!
జెండా పండుగ అయిపోయింది.. ఇక ఆ రంగు లైట్లు ఆర్పేసి ఇటు రండి.. తొమ్మిదేళ్ల దళిత విద్యార్థి ఇంద్రా మేఘ్వాల్ చిత్రపటం వద్ద పెట్టిన కొవ్వొత్తుల వెలుగులో... చీకట్లు చూద్దాం. ఒక గ్లాసుడు నీళ్లు.. పోయిన చిన్న ప్రాణం. అగ్రవర్ణం దాహార్తికి చిన్నబోయిన త్రివర్ణాలు కనిపిస్తాయి. ఇది ‘..అనుకోని సంఘ టన’ అని సర్దిచెప్పుకునే లోపే.. ‘కాదు.. అనునిత్యమే’ అన్నమాట రీసౌండ్లా ‘జనగణమన’కన్నా ఎక్కువ శబ్దంతో మన చెవుల్లో మారుమోగుతుంది. – ఇదీ సామాజిక భారతం రోడ్లపై వేలాది జెండాల ప్రదర్శనలు, వాట్సాప్ డీపీలు, ధగధగా మెరిసే కాంతుల అలంకరణలు, గొప్పగా సంబురాలు.. వీటన్నిటి మధ్య బిల్కిస్ బానో సామూహిక అత్యాచార దోషులకు స్వాతంత్య్ర దినోత్సవం ఇచ్చిన స్వేచ్ఛా వాయువులు. వారి మెడలో పూలదండలు, పంచుకున్న మిఠాయిలు.. అమృతోత్సవాలను చేదెక్కించ లేదూ! – ఇదీ రాజకీయ భారతం ‘కలకత్తా ఫుట్పాత్లపై ఎందరో గాలివానల్లో తడుస్తున్నారు వాళ్లను అడగండి పదిహేను ఆగస్టు గురించి ఏమంటారో..’ .. 1947లో స్వాతంత్య్రం వచ్చిన రోజున మాజీ ప్రధాని వాజ్పేయి రాసుకున్న కవిత ఇది.. ఉత్సవాలు జరిగిన మరునాడే (ఆగస్టు 16న) వాజ్పేయి వర్ధంతి జరిపినవారిలో ఎవరైనా.. ఆయన గుర్తుగానైనా.. ఫుట్పాత్లపై ఉన్న వారిని అడిగి ఉంటారా ‘..ఆగస్టు 15 గురించి ఏమంటారూ’ అని.. – వృద్ధిరేటు 75 ఏళ్లుగా పెరిగీ పెరిగీ హైరైజ్ భవనాల్లో చిక్కుకునిపోయిందని, అక్కడి నుంచి ఫుట్పాత్ దాకా రాలేదని తెలిసేది కదా! – ఇదీ ఆర్థిక భారతం ‘..దేశభక్తి, అఖండత అని ఒకటే అంటున్నారు.. మేం దేశభక్తి ఎలా చాటుకోవాలి? మా ఇంటిపై జెండా ఎగురవేసే కదా..? మరి జెండా ఎగురవేయడానికి మాకు ఇల్లు ఏది?..’ ..ఇది ఏ సామాన్యుడో అన్నది కాదు.. గరీబోళ్ల సీఎం టంగుటూరి అంజయ్య 1970లో అన్నమాట! మరి ‘ఇంటింటికీ జెండా పండుగ’.. అంటూ జెండాలు పంచిన నాయకులకు ఈ ప్రశ్న ఏమైనా ఎదురై ఉంటుందా.. బధిర శంఖారావంలా! – ఇదీ నేటి జన భారతం హుందాతనం, ఆత్మగౌరవం, సమన్యాయం.. చైతన్యం, సమున్నత మానవ విలువలు, సామాజిక న్యాయం, లౌకిక భావన, సౌభ్రాతృత్వం.. ఆదా యాల్లో, అంతస్థుల్లో, అవకాశాల్లో, సౌకర్యాల్లో.. సమానత్వం తెచ్చుకుందాం అని 75 ఏళ్ల క్రితం రాసుకున్న రాతలు రాజ్యాంగం పుస్తకాన్ని దాటి బయటికి రానట్టున్నాయ్.. – ఇదీ గణతంత్ర భారతం ... వీటన్నింటినీ అంబేద్కర్కు వదిలేసి మన నేతలు ఏం చేస్తున్నారో చూడండి. ► గాంధీ, గాడ్సేల ఎత్తును భారతీయత స్కేలుతో కొలిచి.. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువని తేల్చు కునే పనిలో తీరిక లేకుండా మునిగిపోయారు. ► ఇన్నేళ్లూ నెహ్రూ, గాంధీల పాలనలోనే భారతావని నడిచినా.. ఇప్పుడు క్విట్ ఇండియా స్ఫూర్తిగా దేశాన్ని ఏకం చేస్తామంటూ అదే గాంధీలు కొత్తగా ‘జోడో యాత్రలు’ చేస్తున్నారు. ► గాంధీ, నెహ్రూలపై విద్వేషం చిమ్ముతూ కొందరు.. నెహ్రూ కూడళ్లలో జనగణమన పాడుతూ గాంధీకి వెకిలి మకిలి పూస్తే జాగ్రత అని హెచ్చరిస్తూ మరికొందరు.. 75 ఏళ్ల తర్వాత కూడా అవే పేర్లు, అదే స్మరణ, అదే రాజకీయం.. ► 75 ఏళ్ల క్రితం గీసిన విభజన రేఖలు.. ఇప్పుడా దూరాన్ని మరింత పెంచాయి. రెండు వర్గాల మధ్య అపనమ్మకాన్ని, అగాధాన్ని ఎగదోస్తూ.. ‘లౌకికం’ అన్న మాటను ఫక్తు రాజకీయం చేశాయి. మన మట్టి మీదే పుట్టి పెరిగినా.. త్రివర్ణ పతాకం చేతపట్టి మేమూ భారతీయులమే అని చెప్పుకోవాల్సిన దుఃస్థితికి తెచ్చాయి. ► దేశ విభజన నాటి హింసాకాండ, విధ్వంసాలు వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయి. మానిపోతున్న గాయాలను కెలుకుతూ విభే దాలకు ఆజ్యం పోస్తూనే ఉన్నాయి. నాటి దాష్టీకాన్ని నేటికీ అంటగడుతూ.. విచ్ఛిన్నకర శక్తులంటూ పాత కాలపు చర్చను లేవదీస్తూనే ఉన్నాయి. .. ఇదీ 75 ఏళ్ల భారతం.. స్వేచ్ఛ వచ్చిందనుకున్న తొలిరోజున ఉన్నకాడే.. ఇప్పటికీ ఉన్నామని చెప్పకనే చెబుతున్న తీరు.. ఇది స్వప్నం.. స్వాతంత్య్రోత్సవాల సందర్భంగా సోషల్ మీడియాలో యువతతో నడిచిన ఓ చిట్ఛాట్ ఇది. ‘..నేను పుణెలో చదివా, నాలుగేళ్లు బెంగళూరులో, ఇప్పుడు తిరువనంతపురంలో ఉద్యోగం. రేపు ఎక్కడికి వెళ్తానో తెలియదు. నన్ను ఏ ప్రాంతం వాడని అడక్కండి..’ ‘..ఇదిగో వీడు అబ్దుల్లా.. అమెరికా నుంచి ఈమధ్యే దిగుమతి అయ్యాడు, ఢిల్లీ వాడే అనుకోండి. ఈ అమ్మాయి సారిక, వీడి ఫియాన్సీ. వాళ్లు రాజు, అభిషేక్, శ్రవణ్.. మేమంతా హాస్టల్ మేట్స్.. మమ్మల్ని ఏ కులం, ఏ మతం అని ప్రశ్నించకండి. అవన్నీ పాలిటిక్స్ కోసమే.. మేం భారతీయులం..’ ... కెరీర్ గోలలో కొట్టుకుపోతూ దేశం గురించి పట్టించుకోవడం లేదని యువతపై వేస్తున్న అపవాదు నిజం కాదనిపిస్తోంది. వీరిని చూస్తుంటే.. కులం, ప్రాంతం, మతం హద్దులు చెరిపేసుకుని.. అన్ని వర్ణాలనూ త్రివర్ణంలో కలుపుకొని పోతారనే ఆశలు ఇంకా మిణుకుమిణుకుమంటున్నాయి. ఇది నిజం... అట్టడుగు వర్గాలను అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టి ఆనందపడ్డా, వారి పరిస్థితి ఉన్నకాడే ఉన్నదనడానికి ఇదొక్క ‘చిత్రం’ చాలదా! -
లింగ సమానత్వం: స్కూల్లో ఏం చెబుతున్నారు?!
‘ఆడ–మగ సమానత్వం ఎప్పుడు సాధ్యమౌతుంది?!’ ‘ఇప్పట్లో అయితే కాదు..’ అనేది ప్రపంచంలోని అన్ని సమాజాల్లో బలంగా పాతుకుపోయిన ఒక ఆలోచన. కానీ, సాధనతో అన్నీ సమకూరుతాయనేది మనందరికీ తెలిసిందే. ఆ నమ్మకంతోనే ఐక్యరాజ్యసమితి 2030 సంవత్సరానికి గడువును నిర్ణయించింది. లింగ సమానత్వం అనేది ప్రాథమిక మానవ హక్కు మాత్రమే కాదు. శాంతియుత, సంపన్నమైన, స్థిరమైన ప్రపంచానికి అవసరమైన పునాది. లింగ సమానత్వంలో పిల్లల వైఖరిని రూపొందించడంలో తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులు ముఖ్య పాత్ర పోషిస్తారు. జెండర్ రోల్స్ పట్ల పిల్లల ప్రవర్తనలో మార్పులు తీసుకురావడానికి టీచర్ల శిక్షణ కచ్చితంగా సహాయపడుతుంది. అయితే, ‘అమ్మాయిలా ఏడుస్తున్నావేంటి?’ అని అబ్బాయిలను.. ‘ఏంటా వేషాలు, నువ్వేమైనా అబ్బాయివా?’ అంటూ అమ్మాయిలను.. జెండర్ రోల్ని ప్రధానంగా చూపుతూ ఉపయోగించే భాష వల్ల పిల్లల మైండ్సెట్లలో ‘వివక్ష’ ముద్రించుకుపోతున్నది కూడా వాస్తవం. మహిళల హక్కులను ప్రోత్సహించే సామాజిక మార్పును తీసుకురావడానికి విద్య అత్యంత శక్తిమంతమైన సాధనాల్లో ఒకటి. టీచర్లు విద్యావ్యవస్థకు మూల స్తంభం కాబట్టి, పాఠశాల స్థాయి నుంచే మార్పుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. అయితే, తరగతి గదుల్లో పాత మూస పద్ధతిలో భాషను ఉపయోగించకుండా, ప్రణాళికాబద్ధమైన శిక్షణ ద్వారా టీచర్లు లింగ అసమానతలను తొలగించడానికి కృషి చేయవచ్చు. తమకు తెలియకుండానే.. కొన్ని లింగ అవగాహన చర్చల ఆధారంగా లింగ వివక్షకు దూరంగా అందరూ ఆలోచించాలని ఆశించడం వల్ల ఎలాంటి సానుకూల ఫలితాలుండవు. పిల్లల బాల్యం నుంచే ఈ విషయాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. లింగ మూస పద్ధతులను నివారించడంలో టీచర్లు కీలకపాత్ర పోషిస్తారన్నది తెలిసిందే. నిజానికి టీచర్లు విద్యార్థుల పట్ల మంచి ఉద్దేశాలను కలిగి ఉన్నప్పటికీ, వారి సాధారణ బోధనలో తరచూ తమకు తెలియకుండానే జెండర్ లైన్స్ను ఉపయోగిస్తుంటారు. మారుతున్న సమాజ ధోరణులు, భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని టీచర్లు ‘లింగ’ భాషను మార్చుకోవడం కూడా తప్పనిసరి అని అంగీకరిస్తున్నారు ఉపాధ్యాయులు. ఆ దిశగా తామూ ముందడుగు వేస్తున్నామంటున్నారు. శిక్షణ అవసరం లింగ వివక్షలో టీచర్లు ప్రాథమికాంశాలను లోతుగా తెలుసుకుంటే పిల్లల మెదళ్లలో లింగసమానత్వాన్ని పెంపొందించడానికి శ్రద్ధ వహిస్తారు. తరగతి గదిలో ‘జెండర్’ భాషను వాడకుండా మానవసంబంధాలలోనూ, సామాజిక పరమైన పరివర్తన తీసుకురావడానికి, లింగ వివక్ష తగ్గించడానికి టీచర్లకు నైపుణ్యం అవసరం. లింగ సమానత్వానికి అన్ని స్థాయిలలో, అన్ని దశలలోనూ శిక్షణ అవసరం. మూస పద్ధతులకు స్వస్తి తరగతి గదిలో అబ్బాయిలు, అమ్మాయిలకు ఒకే విధమైన బోధన అందించేటప్పుడు ‘జెండర్’ గురించి ప్రస్తావన వస్తే మధ్యలో తటస్థ పదాలను ఉపయోగించడం ముఖ్యం. అంటే, కథనాలలో పాత్రలను ఉదాహరణగా తీసుకుంటున్నప్పుడు గత కాలపు మూస లక్షణాలను ఉపయోగించకూడదు. ఉదాహరణకు: ‘అబ్బాయిలు ధైర్యంగా’, ‘బలంగా ఉన్నారు. ‘అమ్మాయిల్లా ఏడ్వకండి’, ‘అమ్మాయిలు సున్నితమైనవారు,’... ఇలాంటివి. వాటిని వీలైనంతవరకు తొలగించడమే మంచిది. పాఠంలోనూ, సాధనలోనూ అబ్బాయిలు–అమ్మాయిలు సమాన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేలా చదువు ఉండాలి. వీటిని తరగతి గదుల్లోనే కాదు ఇతర నైపుణ్యాలను పెంచే కార్యక్రమాల్లోనూ భాగం చేయచ్చు. అలాగే, కుటుంబ సభ్యుల మాటల్లోనూ, రోజువారీ పనుల్లోనూ ఈ లింగ నిబంధనలు పిల్లల మనస్సుల్లో బలంగా నాటుకుపోతాయి. అందుకని, పాఠశాలలు, కుటుంబాలు పిల్లలను లింగ సమానత్వంవైపు మళ్లించేందుకు కృషి చేయాలి. సమాజంలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి కావల్సిన మార్పును తీసుకు రావాలంటే అన్ని స్థాయిలలో అందరూ కృషి చేయడమే దీనికి సరైన పరిష్కారం. అవగాహన వర్క్షాప్స్ చాలావరకు ఇంటి దగ్గరే వివక్ష ఉంటుంది. చదువు అంటే తరగతి గదిలోనే కాదు ఎన్సిసి వంటి వాటిల్లోనూ అమ్మాయిలను పంపించేందుకు తల్లిదండ్రులు ముందుకురావాలి. పిల్లలను వయసుకు తగినట్టు గైడ్ చేయాలని మా టీచర్స్కి చెబుతుంటాం. కానీ, జెండర్ ని దృష్టిలో పెట్టుకొని కాదు. స్కూల్ పరిధులు దాటి కూడా పిల్లల నైపుణ్యాలు ఉండాలి. వివిధ రకాల వర్క్షాప్స్కి అటెండ్ అవ్వాలి. అందుకే.. ఆటలు, ఇంటర్స్కూల్ కాంపిటిషన్స్, ఇతర విద్యార్థులతో కలిసేలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటాం. పిల్లలను వేదికల మీద మాట్లాడనివ్వాలి. గెస్ట్ లెక్చరర్స్తో క్లాసులు ఇప్పించాలి. ఇవన్నీ కూడా అమ్మాయిలు–అబ్బాయిలు ఇద్దరూ సమానంగా పాల్గొనేవే. ఇలాంటప్పుడు వారిలోని ప్రతిభనే చూస్తారు తప్ప, వివక్ష అనేదానికి చోటుండదు. దీని వల్ల సమానత్వం అనేది దానికదే వస్తుంది. – సంగీతవర్మ, ప్రిన్సిపల్, రిచ్మండ్ హైస్కూల్, హైదరాబాద్ ఇద్దరూ విద్యార్థులే! ఈ మధ్య కాలంలో స్కూల్లో ఏ కార్యక్రమాల్లో అయినా అమ్మాయిలే ముందంజలో ఉంటున్నారు. తరగతిగది వరకే కాకుండా ఇతర ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేస్తుంటాం. కాకపోతే, గ్రామీణ స్థాయిలో అమ్మాయిలనే ఎక్కువ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. సమానత్వం ఇంటి నుంచే మొదలవ్వాలి. తరగతిలో టీచర్కి అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ విద్యార్థులే. – శైలజా కులకర్ణి, టీచర్, జడ్పిహెచ్ఎస్, కల్హర్, సంగారెడ్డి సున్నితత్త్వాన్ని ఇద్దరికీ నేర్పాలి.. ‘నువ్వేమైనా అబ్బాయివా?’ అని అమ్మాయిలను. ‘నువ్వేమైనా అమ్మాయివా?’ అని అబ్బాయిలను మాటలు అనకూడదు. నాకంటే వాళ్లు ఎక్కువ, వీళ్లు తక్కువ అనే ఆలోచన కూడా రాకూడదు. సున్నితత్త్వాన్ని ఇద్దరికీ నేర్పించాలి. ఇద్దరికీ ఎదుటివారికి గౌరవం ఇవ్వడం నేర్పాలి. ఇద్దరికీ ధైర్యం నేర్పాలి. ఇద్దరికీ చదువు నేర్పాలి. ప్రపంచంలో అందరికీ సమానహక్కులు ఉన్నాయి. అన్నింటా సమానత్వం ఉండాలి. ఎదిగే క్రమంలో పడే ‘మాటలు’ వారి మనసులో బలంగా ముద్రవేస్తాయి. మాటల ద్వారా కూడా ఇద్దరినీ వేరుగా చూడకూడదు. వీరే కాదు ఇప్పుడు ట్రాన్స్జెండర్లు కూడా తమ సత్తా చాటుతున్నారు. ఎవరినీ చులకన చేయకూడదు. మనం మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉమెన్ సేఫ్టీ, గర్ల్ సేఫ్టీ అని ఉంటాయి. ఎందుకో కూడా వాటిని వివరించగలగాలి. పీరియడ్స్ సమయంలో సెన్సిటైజ్ విషయంలో ప్రవర్తనలు వేరుగా ఉంటాయి. అబ్బాయిలకు కూడా ఇలాంటి విషయంలో అవగాహన కలిగించాలి. ఎదిగేక్రమంలో శరీరాకృతులు వేరుగా ఉంటాయి కానీ, మేధోపరంగా ఇద్దరూ ఒకటే. అవగాహన కల్పించడమే ముఖ్యం. – మేఘన ముసునూరి, ప్రిన్సిపల్, ఫౌంటెన్హెడ్ గ్లోబల్ స్కూల్ హైదరాబాద్ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో మహిళలు, బాలికలపై అన్ని రకాల వివక్ష, హింస, హానికరమైన పద్ధతులను అంతం చేయడం ద్వారా 2030 వరకు లింగసమానత్వాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఎస్డిజి 5. మహిళల పూర్తి భాగస్వామ్యం, రాజకీయ, ఆర్థిక నిర్ణయాధికారం అన్నిస్థాయిలలో నాయకత్వానికి సమాన అవకాశాల కోసం పిలుపునిచ్చింది. 2015లో ఐక్యరాజ్యసమితి చేసిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ఇది 5వది. – నిర్మలారెడ్డి -
సాధికారతే సౌందర్యం
మహిళలు... మౌనం వీడాలి... గొంతు విప్పాలి. చెప్పాలనుకున్నది... చెప్పగలగాలి. వాళ్లకు... ఓ ఆలంబన కావాలి. వినడానికి ఒకరున్నారనే భరోసానివ్వాలి. సాధికార సాధనలో ఒకరిది తొలి అడుగైతే మరొకరిది వందో అడుగు... అంతే. గమ్యం వేల అడుగుల దూరాన ఉంది. ఆ లక్ష్యాన్ని దగ్గర చేస్తోంది మమత‘సేవ’ ‘సమాజానికి తనవంతుగా ఏదైనా చేయాలి. తనకు గౌరవప్రదమైన స్థానాన్నిచ్చిన సమాజానికి తిరిగి ఇవ్వాలి’... ఇదీ ఆమె ఫిలాసఫీ. మరి ఆ తిరిగి ఇవ్వడంలో ‘మీ ప్రాధాన్యం మహిళలకే... ఎందుకలా?’ అని అడిగిన వాళ్లకు ఆమె చెప్పే సమాధానం ఒక్కటే. ‘‘తరతరాల వివక్షకు తలొగ్గి మగ్గిపోయింది మహిళ. సమానత్వ పోరాటంలో అనుక్షణం అలసి పోతోంది. ఇంటి నాలుగ్గోడలు ఆమెను అర్థం చేసుకుంటాయి. కానీ ఆమె మనసులో ఆవేదనను బయటకు తెలియనివ్వకుండా అడ్డుకుంటాయి కూడా. మహిళ గొంతు విప్పడానికి సాహసం చేయలేని నిస్సహాయ స్థితిలోనే ఉంది నేటికీ. ఆమె ఎదగడానికి నిచ్చెన వేసే వాళ్లు ఉండరు. సాధికారత సాధనలో భాగంగా చెమటోడ్చి ఒక్కో సోపానాన్ని తనకు తానే నిర్మించుకుంటోంది. నా మాటలను నమ్మలేకపోతే నేను దత్తత తీసుకున్న ప్రభుత్వ పాఠశాలలకు వచ్చి చూడండి. ఆడపిల్ల పరిస్థితి అర్థమవుతుంది. ఒక్క పూట అయినా అన్నం దొరుకుతుందని బడికి వచ్చే అభాగ్యులు కనిపిస్తారు. చేనేత కుటుంబాల్లో ఆడవాళ్లను చూడండి, రంగులద్ది అద్ది అరచేతులు రంగుమారిపోయి ఉంటాయి. ఇక వేలాది రూపాయలు పెట్టి ఆ చీరలను ధరించగలిగిన సంపన్న వర్గాల మహిళలను కదిలించి చూడండి, జానెడు పొట్ట ఆకలి తీర్చడానికి పట్టెడన్నం ఎప్పుడు తినాలో తెలియని ఎదురు చూపులే ఉంటాయి. ఇంట్లో మగవాళ్లందరూ భోజనం చేసిన తర్వాత మాత్రమే ఆడవాళ్లు భోజనం చేయాలనే నియమాన్ని పాటిస్తున్న కుటుంబాలు మన దేశంలో ఇప్పటికీ ఉన్నాయంటే నమ్ముతారా?’’ అన్నారామె ఆవేదనగా. మహిళలంతా విజేతలే మమతా త్రివేది పూర్వీకులు వారణాసి నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఎం.ఎ సైకాలజీ చేసిన మమత... తన మామగారు ఆర్.పి. త్రివేది స్థాపించిన పబ్లికేషన్ వ్యాపారాన్ని చూసుకుంటున్నారు. భర్త, కొడుకు చార్టెడ్ అకౌంటెంట్లు. కూతురు యూఎస్లో స్థిరపడింది. ఎంప్టీనెస్ అనేటంతటి పెద్ద పదం కాదు కానీ, కుటుంబ బాధ్యతలన్నీ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఏర్పడే ఒకలాంటి శూన్యత చాలామందికి ఎదురవుతుంది. కొద్ది సంవత్సరాలుగా ఒకే మూసలో సాగుతున్న డైలీ రొటీన్ కొంతమందిలో బోర్కు దారి తీస్తుంది.ఆ స్థితిలోనే జీవితానికి కొత్త అర్థాన్ని చెప్పుకోగలగాలి. అదే చేశారు మమత. ‘‘మా అమ్మాయి ప్రోత్సాహంతో నలభై ఏడేళ్ల వయసులో మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నాను. మేకప్, హై హీల్స్ ధరించడం కొత్తగా అనిపించింది. ‘బ్యూటీ’ అనే పదానికి అసలైన అర్థం అప్పుడే తెలిసింది. మేని ఛాయ, ఎత్తు, లావు... ఇవేవీ కాదు. పరిస్థితికి తగినట్లు తనను తాను మార్చుకోగలిగిన నేర్పు, మార్పును స్వీకరించగలిగిన వైనం వంటి అనేక అంశాల ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. సాధికారతను మించిన సౌందర్యం మరొకటి ఉండదు. స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయి పోటీల్లో నాకు ‘మిసెస్ ఏషియా ఇంటర్నేషనల్ వరల్డ్ (2017)’ కిరీటం దక్కింది. కానీ ఆ పోటీలకు ముప్పైకిపైగా దేశాల నుంచి వచ్చిన మహిళల్లో ప్రతి ఒక్కరూ విజేతలే అని చెప్పాలి. ప్రతి ఒక్కరిలో ఒక గొప్పతనం ఉంది. నిజానికి నేను అసలైన ప్రపంచాన్ని చూసింది అప్పటి నుంచే. ప్రతి మహిళకూ జీవితంలో పోరాటం ఉంటుంది. జీవితంతో పోరాడి నిలబడడమే గొప్ప విజయం. అప్పటి వరకు ఫేస్బుక్ అకౌంట్ కూడా లేదు. ఇల్లు, పబ్లికేషన్ వ్యాపారం, పిల్లలు... ఇదే లోకంగా జీవించాను. ఈ పోటీల్లో టాస్కుల్లో భాగంగా నా గురించి రాసి ఎఫ్బీలో పోస్ట్ చేయాల్సి వచ్చింది. నా సోషల్ మీడియా జర్నీ అలా మొదలైంది. మిసెస్ ఏసియా ఇంటర్నేషనల్ వరల్డ్ విజేత మమతా త్రివేది అబ్బాయిలకంటే అమ్మాయిలే ఎక్కువ! బ్యూటీ విత్ హార్ట్... కాన్సెప్ట్తో హైదరాబాద్లోని రోష్నీ స్వచ్ఛంద సంస్థతో కలిసి ఆత్మహత్యల నివారణ కోసం పని చేస్తున్నాను. ‘సేవ (ఎస్ఈడబ్లు్యఏ, సొసైటీ ఫర్ ఎంపవరింగ్ ఉమెన్)’ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి మహిళల సాధికారత కోసం పని చేస్తున్నాను. హైదరాబాద్ సమీపంలోని షాద్నగర్ దగ్గర బాలానగర్ ప్రభుత్వ పాఠశాల, హైదరాబాద్, బర్కత్పురాలోని ప్రభుత్వ పాఠశాలను దత్తత చేసుకున్నాను. ప్రభుత్వ స్కూళ్లలో ఎన్రోల్మెంట్ను ఒకసారి పరిశీలించండి. అమ్మాయిలే ఎక్కువగా ఉంటారు. ఆడపిల్లలను చదివిస్తున్నారని సంబర పడితే అంతకంటే అవివేకం మరొకటి ఉండదు. మగపిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తూ ఆడపిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు పంపిస్తున్నారు. పైగా వాళ్లను టెన్త్ తర్వాత చదివించరు. ఎనిమిదో తరగతి నుంచే డ్రాపవుట్లు మొదలవుతుంటాయి. పెళ్లి చేసేయడం అన్నింటికీ పరిష్కారం అన్నట్లు ఉంటాయి పేరెంట్స్ ఆలోచనలు. ఆ ఆడపిల్లలు ఎంత చురుగ్గా ఉంటారంటే... క్షణాల్లో చక్కగా బొమ్మలు వేసే వాళ్లున్నారు. వాళ్లకు చాక్లెట్ తయారీ, పెయింటింగ్, ప్రింటింగ్ వంటి మాకు తెలిసిన స్కిల్స్ నేర్పిస్తున్నాం. ఎనభై శాతం మార్కులతో పాసైన అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ల కాలేజ్ ఎడ్యుకేషన్ కోసం ఎడ్యుకేషనల్ అడాప్షన్ చేస్తున్నాం. వీవర్స్ కుటుంబం నుంచి కూడా విద్యాదత్తత చేసుకున్నాం. తొలి అడ్డంకి గడప లోపలే ఎవరైనా ఏదో ఒక ప్రత్యేకత సాధించాలంటే కుటుంబం ప్రోత్సాహం తప్పనిసరి. చాలామంది ఆడవాళ్లకు ఇంట్లో సాటి ఆడవాళ్ల నుంచే మద్దతు కరవవుతోంది. తొలి అడ్డంకి ఇంట్లోనే ఎదురవుతోంది. ఈ విషయంలో మహిళలు ఇంట్లో వాళ్లతో పోరాడడానికి సిద్ధమవుతున్నారు. కానీ ఇంట్లో వాళ్లను కన్విన్స్ చేసుకోవడమే కరెక్ట్. ఆ తొలి మెట్టులో విజయం సాధించగలిగితే ఇక ఆమె ప్రస్థానంలో ఎదురీతలు పెద్దగా ఉండవు. అందుకు నేనే ఉదాహరణ’’ అన్నారు మమతా త్రివేది. ఆమె చేస్తున్న సేవలో తొలి ప్రయోజకులుగా మహిళలు కనిపిస్తున్నప్పటికీ ఆ ఫలితం కుటుంబానికి ఉపయోగపడుతుందంటారామె. అందుకే సమాజానికి తాను తిరిగి ఇస్తున్న ప్రయోజనాలకు వారధులుగా మహిళలనే ఎంచుకున్నానన్నారు. తరాల కలనేత పోచంపల్లికి వెళ్లి చేనేతకారుల కుటుంబాలను చూస్తే కన్నీరు వస్తుంది. భార్యాభర్త నెలంతా కష్టపడితే వాళ్లకు వచ్చేది పదిహేను వేల రూపాయలే. వాళ్ల చేతుల్లో రూపుదిద్దుకున్న చీరలు మార్కెట్లో ఏ ధరకు అమ్ముడవుతాయో కూడా వాళ్లకు సరైన అంచనా లేదు. వాళ్లకు తగినంత పని కల్పించడానికి, మంచి రాబడినివ్వడానికి గాను... నేను నిర్వహిస్తున్న బ్యూటీ కాంటెస్ట్లలో తప్పనిసరిగా ట్రెడిషనల్ వేర్ ఉండేటట్లు చూస్తున్నాను. ఇటీవల ర్యాంప్ వాక్ కూడా అక్కడే ఏర్పాటు చేశాను. ఆగస్టు ఏడవ తేదీన చేనేత దినోత్సవం సందర్భంగా మరో కార్యక్రమం నిర్వహించే ప్రయత్నంలో ఉన్నాను. నాకు స్వతహాగా కూడా చేనేత చీరలంటే చాలా ఇష్టం. నేను కట్టుకున్న ఈ చీరను చూడండి. అరవై ఏళ్ల నాటిది. మా అత్తగారి చీర. ఇప్పటికీ అదే మెరుపు. అందుకే ఈ కళను బతికించుకోవాలి. – మమతా త్రివేది, ఫౌండర్, సొసైటీ ఫర్ ఎంపవరింగ్ ఉమెన్ రీజనల్ డైరెక్టర్, మిసెస్ ఇండియా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ – వాకా మంజులారెడ్డి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
చెత్త అంపైరింగ్.. డుప్లెసిస్ది క్లియర్గా నాటౌట్! వీడియో
చెలరేగిన ఆర్సీబీ బ్యాటర్లు.. సీఎస్కే ముందు భారీ టార్గెట్
'సిల్క్ శారీ' సినిమా ట్రైలర్ చూశారా..?
నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
ఉత్తరాంధ్ర... టీడీపీ ఆశలు గల్లంతేనా..?
తనకు ఇష్టమైన 'బుజ్జి'ని పరిచయం చేసిన ప్రభాస్.. ఆసక్తిగా వీడియో
ఓహెచ్ఎమ్ ఈ లాజిస్టిక్స్తో ఫ్రెచ్ కంపెనీ డీల్.. 1000 కార్ల డెలివరీకి రెడీ
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్..!
డబ్బే ఆ పచ్చనేత ధీమా... తలకిందులైన అంచనాలు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement