ఆరోగ్యంగా చంద్రబాబు.. తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు: జైళ్ల శాఖ డీఐజీ | Sakshi
Sakshi News home page

ఆరోగ్యంగా చంద్రబాబు.. తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు: జైళ్ల శాఖ డీఐజీ

Published Fri, Oct 13 2023 6:15 PM

Prisons Department Dig Ravi Kiran About Chandrababu Health - Sakshi

సాక్షి, రాజమండ్రి(తూర్పుగోదావరి): చంద్రబాబు ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆయన భద్రత విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉన్నామని కోస్తా జిల్లాల జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ఆరోగ్యం విషయంలోనూ పర్యవేక్షిస్తున్నామన్నారు.

రోజుకు మూడుసార్లు వైద్యపరీక్షలు..
‘‘రోజుకు మూడుసార్లు వైద్యపరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు 67 కేజీల బరువున్నారు. బయట చెబుతున్నట్టుగా అంత సీరియస్‌ ఏమీ లేదు. చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారు. ఏ మందులు ఇస్తున్నారనేది డాక్టర్‌కు, పేషెంట్‌కు మధ్య ఉండే ప్రైవసీ. లోకేష్‌ చేసిన ట్వీట్‌ పూర్తిగా అవాస్తవం. ఏసీ వసతి జైళ్ల మ్యాన్యువల్‌లో లేదు’’ అని డీఐజీ రవికిరణ్‌ పేర్కొన్నారు.

వాటర్‌ పొల్యూషన్‌ కారణమైతే అందరికీ రావాలి కదా?..
మా దగ్గర చంద్రబాబు ఒక రిమాండ్‌ ఖైదీ మాత్రమే. హైప్రొఫైల్‌ ఖైదీకి ఇచ్చే అన్ని సౌకర్యాలు ఇస్తాం. జైలులో 2 వేల మందికి పైగా ఖైదీలు ఉన్నారు. వాటర్‌ పొల్యూషన్‌ కారణమైతే అందరికీ రావాలి కదా?. చంద్రబాబు ప్రతీ మూమెంట్‌ సీసీటీవీలో రికార్డవుతుంది. చంద్రబాబును ఉంచిన బ్యారెక్‌ చాలా విశాలంగా ఉంది. చంద్రబాబు బరువు తగ్గారన్నది పూర్తిగా అవాస్తవం. ఆయన ఆరోగ్యం బాగాలేదని మేం చెప్పలేదు.. మీరే చెబుతున్నారు. జైలులోకి డ్రోన్‌ వచ్చిందన వార్త పూర్తిగా అవాస్తవం. ఊహించని రీతిలో తప్పుడు వార్తలు రావడంతో స్పష్టతనిస్తున్నాం. ఇకపై ఎవరైనా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే తప్పుడు వార్తలు ప్రచారం చేసినవారిని హెచ్చరిస్తున్నాం’’ అని డీఐజీ తెలిపారు.

మాపై ఎటువంటి ఒత్తిళ్లూ లేవు..
‘‘చంద్రబాబుకు దోమ తెర ఇచ్చాం. నిబంధనల ప్రకారం ఏసీ, కూలర్స్‌ ఇవ్వలేం. కోర్టు నుంచి ఏం ఆర్డర్స్‌ వస్తే వాటి ప్రకారం నడుచుకుంటాం. చంద్రబాబు రూమ్‌లో 8 ఫ్యాన్స్‌ పెట్టాం. మా నిబంధనల ప్రకారం అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం. మాపై ఎటువంటి ఒత్తిళ్లూ లేవు. యనమల ఏం మాట్లాడారో మాకు తెలీదు. చంద్రబాబుకు భద్రతా లోపాలు ఉన్నాయన్న వార్తలు నమ్మొద్దు. చంద్రబాబు దగ్గరకు వేరే ఏ ఖైదీని అనుమతించడం లేదు’’ అని డీఐజీ రవికిరణ్‌ స్పష్టం చేశారు.
చదవండి: చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ డ్రామాలు

Advertisement
Advertisement