మొన్న శాంసంగ్‌.. తాజాగా యాపిల్‌ ప్రొడక్ట్‌లపై కేంద్రం హైరిస్క్‌ అలర్ట్‌.. | Government Issued A Warning About Vulnerabilities In Apple Products - Sakshi
Sakshi News home page

మొన్న శాంసంగ్‌.. తాజాగా యాపిల్‌ ప్రొడక్ట్‌లపై కేంద్రం హైరిస్క్‌ అలర్ట్‌..

Published Sat, Dec 16 2023 1:15 PM

Center Will Deploy High Risk Alert On Apple Products - Sakshi

కేంద్రప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌(సెర్ట్‌-ఇన్‌) ఇటీవల శాంసంగ్‌ కంపెనీ ఉత్పత్తుల్లో అనేక లోపాలు ఉన్నాయని గుర్తించిన సంగతి తెలిసిందే.

ఫలితంగా సైబర్‌ నేరస్థులు శాంసంగ్‌ ఫోన్‌లు వాడుతున్న లక్షల మంది వినియోగదారుల నుంచి తమ వ్యక్తిగత డేటాను దొంగలించే ప్రమాదం ఉందని సెర్ట్‌ పేర్కొంది. తాజాగా యాపిల్‌ ఉత్పత్తులకు కూడా ఇదే తరహాలో ప్రమాదం ఉందని కేంద్రం తెలిపింది.

ఈ కంపెనీకి చెందిన పలు ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపం ఉన్నట్లు గుర్తించామని కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆఫ్‌ ఇండియా (సెర్ట్‌-ఇన్‌) వెల్లడించింది. దీని వల్ల యూజర్ల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగలించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. యూజర్లు వెంటనే తమ ఉత్పత్తులను లేటెస్ట్‌ సెక్యూరిటీ అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. ఐఫోన్‌, యాపిల్‌ వాచ్‌, మ్యాక్‌ బుక్‌, ఐపాడ్‌, యాపిల్‌ టీవీ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లతో పాటు సఫారీ బ్రౌజర్‌లో ఈ భద్రతా పరమైన లోపాలను గుర్తించినట్లు సెర్ట్‌-ఇన్‌ తన అడ్వైజరీలో వివరించింది. 

‘యాపిల్ ఉత్పత్తుల్లో పలు సెక్యూరిటీ లోపాలు బయటపడ్డాయి. దీని వల్ల హ్యాకర్లు యాపిల్‌ ఉత్పత్తుల్లోని భద్రతా పరిమితులను అధిగమించి యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే ప్రమాదం ఉంది’ అని సెర్ట్‌ తెలిపింది. ఈ లోపాలను హ్యాకర్లు గుర్తిస్తే సెక్యూరిటీ పరిమితులను అధిగమించగలరని, ఏకపక్షంగా కోడ్‌ను ఎగ్జిక్యూట్‌ చేసి కీలక సమాచారాన్ని పొందే ప్రమాదం ఉందని తెలిపింది.

ఐఓఎస్‌, ఐప్యాడ్‌ ఓఎస్‌ 17.2 కంటే ముందు వెర్షన్లు, ఐఓఎస్‌, ఐప్యాడ్‌ ఓఎస్‌ 16.7.3 కంటే ముందు వెర్షన్లు, మ్యాక్‌ ఓఎస్‌ సొనోమా 14.2, వెంట్యురా 13.6.3, మానిటరీ 12.7.2, యాపిల్‌ టీవీ ఓఎస్‌ 17.2, యాపిల్‌ వాచ్‌ ఓఎస్‌ 10.2, సఫారీ 17.2 కంటే ముందు వెర్షన్లలో ఈ లోపాలను గుర్తించినట్లు సెర్ట్‌-ఇన్‌ వెల్లడించింది. కాగా.. యాపిల్‌ ఉత్పత్తులకు కేంద్రం గతంలోనూ పలుమార్లు ఇలాంటి అలర్ట్‌లు జారీ చేసింది.

ఇదీ సంగతి: స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు కేంద్రం హై అలర్ట్‌!

ఇటీవలే శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు కూడా కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్‌ 11, 12, 13, 14 ఓఎస్‌తో పనిచేసే శాంసంగ్‌ ఫోన్లలో భద్రతాపరమైన లోపం ఉందని, దీనివల్ల వినియోగదారులకు తెలియకుండానే వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉందని పేర్కొంది. కాబట్టి యూజర్లు లేటెస్ట్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేసుకోవాలని సెర్ట్‌-ఇన్‌ వివరించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement